ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ వీసీ...
posted on Oct 15, 2019 @ 12:58PM
నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర వ్యవహారంపై విచారణ వేగవంతమైంది, ఏడుగురు సభ్యులతో హైపవర్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద, ఐద్వా, ప్రొఫెసర్లూ, బోధనేతర సిబ్బందితో కమిటీ ఏర్పాటైంది. నన్నయ్య వర్సిటీలో జరగుతున్న చీకటి వ్యవహారాలపైన కమిటీ దృష్టి సారించనుంది. ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర పై నిన్న సస్పెన్షన్ వేటు పడింది, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఎమ్.ఎ ఇంగ్లీష్ విభాగం హెడ్ ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను యూనివర్సిటీ వైస్ చాన్సలర్ సురేష్ వర్మ సస్పెండ్ చేశారు.
లైంగిక ఆరోపణలపై కేసు నమోదైన నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ వీసీ ఉత్తర్వులను జారీ చేశారు. యూనివర్శిటీలో చదివే మహిళా విద్యార్థినిలపై ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్ర మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని బాధిత విద్యార్థినిలు యూనివర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. ఎగ్జామ్స్ లో పాస్ కావాలంటే తాను చెప్పిన చోటుకు రావాలని లైంగికంగా వేధించేవాడని బాధిత విద్యార్థినిలు వీసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసి చాలా రోజులైనా వీసీ ప్రొఫెసర్ పై చర్యలు తీసుకోక పోవటంతో విసిగిపోయిన బాధిత విద్యార్థినిలు ఏకంగా ముఖ్య మంత్రి జగన్ కే లేఖ రాశారు.
బాధిత విద్యార్థినుల లేఖపై స్పందించిన సీఎం జగన్ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ వీసీకి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం ఉత్తర్వుల నేపథ్యంలో వీసీ దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రను సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొఫెసర్ సూర్య రాఘవేంద్రపై విద్యార్ధినులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.