మూడు రాజధానుల‌పై మోదీ మ‌న‌స్సులో మాట‌!

ఏపీ మూడు రాజధానుల అంశం గురించి టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందించారు. మూడు రాజధానుల అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన సమాధానం ఇచ్చారు. కాగా టీడీపీ ఎంపీ రాసిన ఈ లేఖకు మోదీ ప్రత్యేకంగా సమాధానం ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.   కాగా వికేంద్రీకరణ పేరుతో ఏపీకి మూడు రాజధానులను ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతించగా.. మరికొందరు వ్యతిరేకించారు. రాజకీయంగానూ పలువురు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అమరావతి ప్రాంత వాసులు గత 90 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఈ ప్రతిపాదనపై టీడీపీ ఎంపీ కనకమేడల రాసిన లేఖకు స్పందించిన మోదీ పరిశీలిస్తున్నామంటూ చెప్పడం విశేషం.   అయితే మోదీ స‌మాధానాన్ని అధికార ప్ర‌తిప‌క్షలు ఎవ‌రికి వారు త‌మ‌కు అనుకూలంగా స్పందించార‌ని భావిస్తున్నారు. అస‌లు ప‌రిశీలిస్తున్నామంటే ఏమిటి? పి.ఎం. మోదీ మ‌న‌స్సులో ఏముంది. అది ఎప్ప‌ట్టికి బ‌య‌టికి వ‌స్తుందంటూ అమ‌రావ‌తిలో పోరాటం చేస్తున్న‌ రైతులు అర్థం కాక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

మళ్లీ తెరపైకి వచ్చిన ఓటుకు నోటు కేసు

దేశరాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగ‌ళ‌వారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని కోర్టుకు హాజరుపరచాల్సి ఉంది. అయితే ఈ ఓటుకు నోటు కేసులో ఏ1గా ఉన్న రేవంత్ రెడ్డి.. డ్రోన్ కేసులో భాగంగా అరెస్ట్ అయ్యాక జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. అయితే ఇవాళ ఓటుకు నోటు కేసులో భాగంగా.. ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డిని.. ఇవాళ ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.     ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించింది. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో నిందితుల పాత్ర, అసలు సూత్రధారులకు సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్టును కూడా కోర్టుకు అందజేశారు. 2015లో స్టీఫెన్‌సన్‌కు ఎమ్మెల్సీ ఓటు విషయంలో రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది ప్రస్తుతం కీలకం కానుంది. అయితే అంతకుముందే స్టీఫెన్‌సన్.. ఏసీబీకి సమాచారం ఇవ్వడంతో.. రేవంత్ రెడ్డిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు.     2015 సంవత్సరంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేయగా.. ఆయన చాన్నాళ్ళు జైలు జీవితం గడిపారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యండెడ్ గా ఏసీబీకి దొరికిన రేవంత్ రెడ్డిపై పలు అభియోగాలతో ఛార్జీ షీటు దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్నారు.  

రజాకార్ల అజెండా అమలు చేస్తున్న సి.ఎం. కేసీఆర్‌

రజాకార్ల అజెండా అమలు చేస్తున్న సి.ఎం. కేసీఆర్ దేశ ద్రోహి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం దేశ ద్రోహమేనని, అందుకు వెంటనే కేసీఆర్‌పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.     ప్రజా సమస్యలను చర్చించి పరిష్కరించాల్సిందిపోయి, అసెంబ్లీని రజాకార్ల అజెండా అమలుకు ఉపయోగిస్తారా? అంటూ మండిపడ్డారు. పౌరసత్వ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిందని, దాన్ని అసెంబ్లీ తీర్మానం చేసినా చెల్లదని, తీర్మానం చిత్తు కాగితంతో సమానం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ అల్లర్లపై మాట్లాడే సీఎంకు భైంసాలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో హిందువుల ఆస్తులు ధ్వంసం చేస్తే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. నిజమాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కూడా ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై స్వ‌రం పెంచారు. సీఎం కేసీఆర్ తనకు బర్త్ సర్టిఫికెట్ లేదని అంటున్నారని, అలాంటప్పుడు తాను పుట్టిన చోట ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాంటూ కేసీఆర్ గ‌తాన్ని గుర్తు చేశారు.

రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం!

ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య అధికార పరిధిపై వివాదం మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల్ని నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని.. వెంటనే వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి కూడా ఎస్‌ఈసీకి లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను పిలిచి గవర్నర్ వివరణ తీసుకున్నారు. పంచాయతీ, మున్సిపల్, జిల్లా- మండల పరిషత్ పాలకవర్గాలకు 2018లోనే గడువు ముగిసింది. గత కొన్ని నెలలుగా ఎన్నికల నిర్వహణ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా 2020 జనవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసి రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారు.     రాజ్యాంగం ప్రకారం 50 శాతానికి లోబడి ఉండాల్సిన రిజర్వేషన్లు 59.85 శాతంగా నిర్ణయించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం రిజర్వేషన్లను సవరించాలని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. ఫలితంగా మార్చి 3వ తేదీన కోర్టు తీర్పు వచ్చిన తర్వాత హడావిడిగా రిజర్వేషన్లను సవరిస్తూ మార్చి 7న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కూడా ముగింపు దశకు రావడంతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుందనే సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు బదులుగా మొత్తం ఎన్నికల ప్రక్రియను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించారు. ఈ ప్రకటనపై ఏపీలో అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది.   ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కూడా గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం, అసెంబ్లీ చట్టాలకు లోబడి పనిచేసే ఎస్ఈసీ నిర్ణయం పట్ల గవర్నర్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను కోర్టు ఆదేశాల ప్రకారమే నిర్వహిస్తున్నారని రాజకీయ పరిశీల‌కులు చెబుతున్నారు. "పిల్ 02/2020 ప్రకారం రిజర్వేషన్లలో మార్పులు చేసిన తర్వాతే ఎన్నికల నిర్వహణ సాగుతోంది. మార్చి 3 నాటికే ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు తెలిపారు. వాస్తవానికి 2018లో ఎన్నికలు జరగాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక ఎన్నికలు సకాలంలో నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది." "ఆర్టికల్ 243K ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విధుల గురించి పేర్కొనలేదు. హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా ఆ విషయం ప్రస్తావించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాజ్యాంగబద్ధమైన పదవే అయినప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు పంచాయతీరాజ్ కమిషనర్‌ను సంప్రదించి ఉండాల్సింది. దానికి భిన్నంగా జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీద చేసిన వ్యాఖ్యలు సరికాదంటున్నారు లీగ‌ల్ ఎక్స్‌ప‌ర్ట్స్‌. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది.

కలవరం పుటిస్తున్న కరోనా

కరోనా కి నిర్దిష్ట లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. జ్వరం దగ్గు గొంతు లో మంట జలుబు ఒళ్లు నొప్పులు వంటివి ఉంటాయి. కొందరిలో కడుపునొప్పి డయేరియా వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. కరోనా వైరస్ కు మందు లేదు నివారణ ఒక్కటే మార్గమని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా చెబుతున్నారు. పరిశుభ్రంగా ఉండడం వల్ల కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చని ఆయ‌న అన్నారు.     మాంసాహారం గుడ్లు తినడం వల్ల కరోనా వైరస్ సోకుతుందన్న వార్తల్లో నిజం లేదని గులేరియా తేల్చి చెప్పారు. వేడి వాతావరణం లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గి ఆ తర్వాత క‌నుమరుగవుతుందన్న వార్తలను కూడా గులేరియా కొట్టిపడేశారు. వేడి చల్లని వాతావరణాలు ఉన్న సింగపూర్ యూరోపియన్ దేశాల్లోనూ ఈ వైరస్ విజృంభిస్తోందన్న విషయాన్ని అయన గుర్తుచేశారు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోని ఆహారం సమపాళ్లల్లో తీసుకుంటే కరోనా వైరస్ వ్యాపించదంటున్నారు గులేరియా. కరోనా వైరస్ ముందు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే వస్తుంది. మన రోగ నిరోధక శక్తి (ఇమ్యునిటీ)ని పెంచుకోవడం చాలా అవసరం. కరోనా రాకుండా ఇదే అడ్డుకుంటుంది.   ఈ రోగ నిరోధక వ్యవస్థను పెంచుకునేందుకు కొన్ని పదార్థాలు తీసుకోవాలి. పులుపులో రోగ నిరోధక శక్తి పెంచుతుంది. అందులో భాగంగా రోజు ఉసిరి రసం తీసుకుంటే ఎంతో మేలు. దీనిలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. విటమిన్ సీ అధికంగా ఉండే నారింజ, జామ, బొప్పాయి వంటివి కూడా తీసుకోవచ్చు. ఆకుల్లో తులసి ఎంతో ముఖ్యమైనది. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ తులసీ ఆకులను రోజూ ఉదయాన్నే ఏమీ తినకుండా వీటిని తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి. పాలలో పసుపును కలిపి తాగాలి. ఇది ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. దీంతోపాటు పాలలో మిరియాలను కూడా కలుపుకొని తాగవచ్చు. అల్లం వెల్లుల్లి ని ఉదయం తీసుకోవాలి. పొద్దు తిరుగుడు గింజలు - పెరుగు - గ్రీన్ టీ వంటివి కూడా ఎక్కువగా తీసుకోవాలి.

కోడ్‌ అమల్లో ఉంటే సీఎస్‌, సీఎం ఆదేశాల్ని ఎలా పాటిస్తారు?

స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందించిన తీరు వివాదాస్ప‌దం అయింది. ఎన్నికలు కేవలం వాయిదా పడ్డాయి. రద్దు కాలేదు. కాబట్టి అవి పూర్తయ్యేవరకు కోడ్‌ అమల్లోనే ఉంటుంది. ఒక్కసారి రాష్ట్రంలో కోడ్‌ అమల్లోకి వస్తే సీఎస్‌ సహా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ పరిధిలో పనిచేస్తున్న సీఎస్ ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని శిరసావహించకుండా, సూచనలు, సలహాలు, విజ్ఞప్తులు చేయడం ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ధిక్కరణ కిందకే వస్తుంద‌ట‌. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘానికి దేశవ్యాప్తంగా ఎలాంటి అధికారాలైతే ఉన్నాయో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాష్ట్రంలో అలాంటి అధికారాలే ఉంటాయి.     పార్టీలు, ప్రభుత్వాలు పక్కనపెడితే ఒక రాష్ట్ర సీఎస్‌ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశాలు ధిక్కరించడాన్ని డీవోపీటీ సీరియస్‌గా తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల సంఘాలున్నాయి. ప్రభుత్వాలు, అందుకనుగుణంగా పనిచేసే సీ ఎస్‌లు ఉంటారు. కాబట్టి, ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన విషయాన్ని తేలిగ్గా వదిలేస్తే అన్ని రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు సీఎస్‌ను అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘం హక్కులను కాలరాసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.     ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకపోగా ఆ నిర్ణయం మార్చుకోవాలంటూ తిరిగి సూచనలు, సలహాలు, విజ్ఞప్తులు చేయడం అసాధారణమేనని రాష్ట్రంలో ఐఏఎస్‌ వర్గాలు చెబుతున్నాయి.

కరోనా బాధితులకు హెచ్ఐవీ డ్రగ్‌

కరోనాకు మందు లేకపోవడంతో ప్రభుత్వాలు నియంత్రణ చర్యలను చేపట్టాయి. ఆస్ట్రేలియాలోని యూనివర్శిటి ఆఫ్ క్వీన్స్‌ల్యాండ్ సెంటర్ ఫర్ క్లినికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు మందు ఉందంటున్నారు. క్లోరోక్విన్, లోపినవిర్ అనే రెండు డ్రగ్స్ కరోనాను నయం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు డ్రగ్స్‌ను సహజంగా మలేరియా, హెచెఐవీ బాధితులకు ఉపయోగిస్తారు. అయితే కరోనాను నయం చేసేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.     ఈ డ్రగ్స్ టెస్ట్ ట్యూబ్‌లలో వైరస్‌ను తొలగించాయని రీసెర్చ్‌ను లీడ్ చేస్తున్న డేవిడ్ పీటర్‌సన్ తెలిపారు. ఈ చికిత్స చాలా ఉపయోగకరమైనదని, చికిత్సానంతరం బాధితులలో ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించవని ఆయన అన్నారు. ముందుగా 50 ఆసుపత్రులను ఎంచుకుని ఈ రెండు డ్రగ్స్‌ను విడివిడిగా ఉపయోగిస్తే ఎటువంటి ఫలితం వస్తోంది.. కలిపి ప్రయోగిస్తే ఎలాంటి ఫలితం వస్తుందన్న దానిపై పనిచేయాల్సి ఉందన్నారు.     చైనాలో ఇప్పటికే అనేక మంది కరోనా బాధితులకు హెచ్ఐవీ డ్రగ్‌ను ఇవ్వగా.. మంచి ఫలితాలు ఇస్తుంద‌ట‌.

ప్రపంచం వణికినా..మేం బెదరం..అంటున్న సీఎంలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవర పెడుతున్నా మన పాలకులకు పెద్దగా పట్టించుకోనవసరం లేని విషయంగానే కనిపిస్తోంది.  పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని ఒక ముఖ్యమంత్రి అంటే, మరో ముఖ్యమంత్రి దీనికి వంత పాడుతున్నారు. ఇది నిజం అనుకొని చాలా మంది పారాసిటమాల్ ఇవ్వమని అడుగుతున్నారని ఓ మెడికల్ షాపు మిత్రుడు వాపోయాడు. వీళ్ళ మాటలవల్ల పారాసిటమాల్ కొరత ఏర్పడి అది నిజంగా అవసరమైన బాధితులు ఇబ్బందిపడే దుస్థితి ఏర్పడ్డా ఆశ్చర్యం లేదు. కరోనాకు ఇప్పటి వరకూ వాక్సిన్, మందులు అందుబాటులోకి రాలేదు.. ఈ విషయం సంబంధిత అధికారులు ఈ ఇద్దరూ సీఎంలకు అర్థమయ్యేలా చెబితే బాగుంటుంది.  ఒక ముఖ్యమంత్రి ఆందోళన అవసరం లేదు అంటూనే విద్యాసంస్థలు, థియేటర్ల, బార్లు, పబ్లు మూసివేతకు ఆ దేశాలు ఇచ్చేసి, రూ.500 కోట్లు కేటాయించారు. సంతోషం కానీ అవి క్షేత్ర స్థాయిలో ఎలా వినియోగిస్తున్నారు అనే అవగాహన ఎవరికీ లేదు. మరో ముఖ్యమంత్రికి కరోనా కన్నా మున్సిఫల్ ఎన్నికలే ముద్దు.. కరోనాపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల ప్రధానాధికారి తీసుకున్న నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలం అయిపోయారు.. కరోనా వ్యాప్తి భయంతో ప్రజలు మాస్కులు కొందామని మెడికల్ షాపులకు వెళ్లితే అక్కడ అవి దొరకడం లేదు. ఉన్నా రెండు మూడింతల రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు. సానిటైజర్ లిక్విడ్ ధర కూడా అందనంత దూరంలో ఉంది. మాస్కులు, సానిటైజర్ల ఉత్పత్తిని పెంచి, ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఇంగితం మన నాయకుల్లో లోపించింది. మన దగ్గర ఉష్ణోగ్రత అధికమని, కరోనా మనకు అంత ప్రమాదం కాదనే భ్రమలు వద్దు.. ఇలాంటి ఊహాగానాలతో పొద్దు పుచ్చడానికి ఇది సరైన సమయం కూడా కాదు. తక్షణం ప్రజలకు కనీస జాగ్రత్తలకు అవసరమైన ఉపకరణాలను అందుబాటులోకి తేవడం పాలకుల విధి..

'స్థానిక' ఎన్నికలపై హైకోర్టు లో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్.. 19 కి విచారణ వాయిదా

  ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హై కోర్టు ధర్మాసనం సోమవారం విచారించింది. ప్రభుత్వం తో  సంప్రదింపులు జరపకుండా ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందన్న పిటిషనర్ తరపు న్యాయవాది. రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు అవలేదని, దేశ వ్యాప్తంగా 100 కేసులు మాత్రమే నమోద య్యాయని చెప్పిన పిటిషనర్ తరపు న్యాయవాది. గవర్నర్ ను కలిసి వాయిదా కారణాలు వివరించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.ఇదే విషయానికి సంబంధించిన పిటిషన్ సుప్రీంకోర్టు లో రేపు విచారణకు ఉన్న కారణంగా విచారణ వాయిదా. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసిన హైకోర్టు. ఇదిలా ఉండగా, స్థానిక ఎన్నికల వాయిదా అంశంపై అటు సచివాలయం లోనూ, ఇటు రాజకీయ పార్టీల్లోనూ  ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే విషయమై చర్చింటానికి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి  కార్యాలయం చేరుకున్న మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి .కాసేపట్లో ఆయన  సీఎం జగన్ తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించిన ప్రభుత్వం, వైసీపీ నేతలు, ఈ  రెండు రోజులూ చాలా కీలకమని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రం లో  రాజ్యాంగ సంస్ధలతో సై అంటే సై అంటున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడో పదం విపరీతంగా చికాకు తెప్పిస్తోంది. అదే విచక్షణ. గతంలో ఏపీపీఎస్సీఛైర్మన్, మండలి ఛైర్మన్ విచక్షణాధికారాన్ని వాడి జగన్ సర్కార్ కు  చుక్కలు చూపిస్తే,  తాజాగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సైతం విచక్షణ అధికారంతో ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.  దీంతో జగన్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకున్న అధికారాలను నిబంధనల మేరకు వినియోగించుకోలేని పరిస్ధితుల్లో ఉన్నప్పుడు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు విచక్షణ అనే పదాన్ని వాడుతుంటారు. ఇదే కోవలో ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత ఏపీపీఎస్సీలో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్షల నేపథ్యంలో తొలిసారి విచక్షణ అనే పదం తెరపైకి వచ్చింది. అప్పట్లో గ్రామ సచివాలయ ఉద్యోగుల పరీక్ష పేపర్ లీకేజీ అయిందని ఆరోపణలు వచ్చినా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ తన విచక్షణ మేరకు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తేల్చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం అభాసుపాలైంది. ఆ తర్వాత ఆయన్ను తొలగించేందుకు ప్రయత్నించినా రాజ్యాంగ పదవి కాబట్టి అది సాధ్యంకాలేదు. ఏపీ శాసనసభ ఆమోదించిన మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో ఎలా అడ్డుకోవాలో విపక్ష టీడీపీకి తట్టలేదు. దీంతో తొలుత రూల్ 71 ప్రకారం అసాధారణంగా చర్చను కోరిన టీడీపీ, అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో ఛైర్మన్ గా ఉన్న తమ పార్టీ ఎమ్మెల్సీ షరీఫ్ కు విచక్షణాధికారాన్ని వాడాల్సిందిగా సలహా ఇచ్చింది. దీంతో ఆయన కీలకమైన రెండు బిల్లులను ఆమోదించకుండా, అటు తిరస్కరించకుండా విచక్షణాధికారం మేరకు సెలక్ట్ కమిటీకి పంపాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెండోసారి విచక్షణాధికారంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికల పోరును ఆరువారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తన విచక్షణ అధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో విచక్షణ అనే పదం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం వ్యవహరించలేని సందర్భాల్లో ఈ విచక్షణ అనే పదాన్ని ఆయా సంస్ధల అధిపతులుగా ఉన్నవారు తెరపైకి తీసుకొస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ విధులు నిర్వర్తించేందుకు బిజినెస్ రూల్స్ ఉన్నప్పుడు ఈ విచక్షణాధికారం ఎందుకు వాడాల్సి వస్తోందన్న చర్చ ఇప్పుడు సాగుతోంది. ఏ మూడు అంశాల మీద, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పూర్వ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తో జరిగే భేటీ లో విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

చెప్తే వినడు.. గిల్లితే ఏడుస్తాడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అనుభవ, అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు చేసే విమర్శ..నిన్నటివరకూ జనాలు ఆ విమర్శలను రాజకీయ విమర్శలు గానే చూసారు. కానీ నిన్న జగన్ ఒకే ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అవి విమర్శలు కాదు..నిజాలు అని నిరూపించారని కొందరు వైసీపీ నాయకులే అనుకుంటున్నారు.. ఎన్నికల అధికారులు నిర్వర్తించే విధులు ఏమిటి? వారికి ఉండే అధికారాలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుని మసలుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్ కి నేటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు. 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఇక ఎందుకు అని ప్రశ్నించడం ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తోంది. 70 స్థానాలలో 67 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడి లెఫ్టెనెంట్ గవర్నర్ ను కాదని ఏం చేయలేకపోయారు. లెఫ్టెనెంట్ గవర్నర్ కేంద్రం నియమించిన వ్యక్తి, నేను 67 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రిని అని మొత్తుకున్నా ఎవరూ వినలేదు. వినరు కూడా. విన్నా ఫలితం లేదు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కులను ఎవరూ ఏమీ చేయలేరు. 151 స్థానాలు వచ్చినంత మాత్రాన ఎన్నికల కమిషనర్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ నేరుగా నిర్వహించలేరు కదా? స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో ఉండే అంశం కాదు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఎన్నికల విధుల్లో ఉండే అధికారులు అందరూ పాటించాల్సిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు 151 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రి అయినా 175కు 175 స్థానాలు వచ్చిన ముఖ్యమంత్రి అయినా పరిపాలనాయంత్రాంగంపై అజమాయిషీ చేయలేడు. ఎన్నికల కమిషనర్ ను నియమించేదే రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఇలా ఎన్నికల కమిషనర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించడమే తగదని, ఇలా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి నిష్పక్ష పాతంగా ఉండడని అందువల్ల ఎన్నికల కమిషనర్లను నేరుగా కేంద్ర ప్రభుత్వం నియమించాలని లేదా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు అయిన విధంగా రాష్ట్రంలో ఎన్నికల యంత్రాంగం ఉండాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. 73,74 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. అది వేరే విషయం. ఎన్నికల కమిషనర్ ను చంద్రబాబు పెట్టాడు అనడం అత్యంత దారుణం. చంద్రబాబు పెట్టినా సూరిబాబు పెట్టినా అప్పటి ముఖ్యమంత్రి హోదాలో నియామకం జరిగింది కాబట్టి అతనికి చట్ట ప్రకారం ఉన్న అధికారాలన్నీ దఖలు పడతాయి.ఇది బేసిక్ రూల్. ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన కొత్తలో అసెంబ్లీ స్పీకర్ గా జీ నారాయణ రావు ఉండేవారు. ఆయన చెప్పినట్లు ఎన్టీరామారావు సభలో నడుచుకోవాల్సి వచ్చేది. ఇది ఆయనకు చాలా ఇబ్బందిగా ఉండేది. నా పార్టీ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తిని నేను స్పీకర్ గా చేస్తే ఆయన చెప్పింది నేను వినాలా నేను చెప్పింది ఆయన వినాలా అని ఎన్టీరామారావు ప్రశ్నించారు. స్పీకర్ గా ఎంపిక చేసే వరకే మీ నిర్ణయం ఆ తర్వాత ఆయన చెప్పినట్లే అసెంబ్లీ నడుస్తుంది అని అధికారులు వివరించి చెప్పారు. అలానా అంటూ ఎన్టీరామారావు ఆ నాటి నుంచి అసెంబ్లీ లో స్పీకర్ చెప్పినట్లే నడుచుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తప్పదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా టీ ఎన్ శేషన్ ఉండేవారు. ఆయన ఎన్నికల నిర్వహణలో ఎన్నోసంస్కరణలు తీసుకువచ్చారు. చట్టంలో ఉన్న అన్ని లొసుగులను సవరించారు. చట్టంలో ఉన్న అన్ని ప్రొవిజన్స్ ను వాడుకున్నారు. ఎన్నికలను క్రమబద్ధీకరించారు. ఆయన ధాటిని అప్పటికే అధికార పార్టీలు తట్టుకోలేకపోయేవి. తిరుగులేని అధికారాలు ఉండే శేషన్ ను ఎలా వదిలించుకోవాలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే పెద్ద పెద్ద వారికి కూడా అర్ధం కాలేదు. అప్పటిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ పెద్దలు తీవ్రంగా ఆలోచించారు. చివరకు పరిష్కారం కనుగొన్నారు. దాన్ని ప్రజాస్వామ్యయుతంగా అమలు చేశారు. శేషన్ ‘‘నిరంకుశత్వం’’ తగ్గించారు. ఎలాగంటే.. చట్ట సవరణ చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ముగ్గుర్ని నియమించారు. అందులో ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఉంటారు. అయితే నిర్ణయాలు మాత్రం మెజారిటీ ప్రకారం తీసుకోవాలి. దాంతో మిగిలిన ఇద్దరూ శేషన్ దూకుడుకు అడ్డుగా నిలిచారు. ప్రజాస్వామ్య యుతంగా  కాంగ్రెస్ ఆడిన గేమ్ పారింది. లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చి సలహాదారులను పెట్టుకోవడం కాదు. తలఊపే అధికారులను చుట్టూ ఉంచుకోవడం కాదు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏం చేయాలో తెలుసుకోవాలి. తెలియకపోతే తెలివితేటలు ఉన్న సలహాదారులను పెట్టుకోవాలి. వారు చెప్పింది వినాలి. లేకపోతే కులాలను తిట్టుకుంటూ, వ్యవస్థలను అస్థిర పరచుకుంటూ మనశ్శాంతి కోల్పోవాల్సి వస్తుంది. తొమ్మిది నెలల ముందే జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇంత ఆక్రోశానికి లోను కావాల్సిన అవసరం ఉండేది కాదు. దాన్నే పరిపాలనా అనుభవం అంటారు.

సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత కాఫీడే రూ.2వేల కోట్లు మిస్!

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ మృతిపై అనుమానాలు రావడంతో కాఫీడే బోర్డు దర్యాఫ్తు చేపట్టి సంచ‌ల‌న విష‌యాల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చింది. కేఫ్ కాఫీ డేకు చెందిన బ్యాంకు ఖాతాల నుండి దాదాపు రూ.2వేల కోట్లు అదృశ్యమైనట్లు కాఫీడే బోర్డు దర్యాఫ్తు వెల్లడైంది. ఈ నివేదికను త్వరలో బహిర్గతం చేయనునుంది. వీజీ సిద్ధార్థ ఆత్మహత్య తర్వాత ఆయన రాసినట్లుగా ఓ లేఖ కూడా వెలుగుచూసింది. తాను నిర్వహించిన ట్రాన్సాక్షన్స్ గురించి బోర్డు, ఆడిటర్లు, సీనియర్ మేనేజ్‌మెంట్‌కు తెలియదని కూడా అందులో పేర్కొన్నారు. ఈ లేఖ వివాదాస్పదంగా మార‌డంతో బోర్డు దర్యాఫ్తు చేపట్టింది. సిద్ధార్థకు చెందిన ఇతర ప్రయివేటు కంపెనీలతో కాఫీ డే జరిపిన ట్రాన్సాక్షన్స్‌ను దాదాపు నెల పాటు పరిశీలించి 100కు పైగా పేజీలతో నివేదిక తయారు చేసింది. ఈ ట్రాన్సాక్షన్స్‌లలో రూ.2వేల కోట్ల మేర లెక్కలు తేలలేదు. అయితే అదృశ్యమైన మొత్తం రూ.2500 కోట్లకు పైగా ఉంటుందనే అనుమానాలు రావ‌డంతో ఆదిశ‌గా ద‌ర్యాఫ్తు చేస్తున్నారు. నెలల పాటు దర్యాఫ్తు అనంతరం పెద్ద మొత్తంలో లెక్కలు తేలలేదని గుర్తించారు. డజన్ల కొద్ది కంపెనీలపై విచారణ జరిపారు. కేఫ్ కాఫీ డేకు, వీజీ సిద్ధార్థకు చెందిన పర్సనల్ బిజినెస్ కంపెనీలకు మధ్య వందల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు. డ్రాఫ్ట్‌ను ఫైనలైజ్ చేస్తున్నారు.

అన్న- చెల్లెల్ని నెటిజనులు ఆడేసుకుంటున్నారు!!

ఒక వ్యక్తి గురించి తెలిసి చైనా, అమెరికా వైద్య శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇక మిగతా దేశాల శాస్త్రవేత్తలైతే.. అసలు మేము శాస్త్రవేత్తలమేనా? అని వారిని వారు ప్రశ్నించుకుంటూ షాక్ లో ఉండిపోయారు. ఇంత గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచ దేశాలకి ఎన్నో నేర్పాల్సిన వ్యక్తి.. భారత్ లోని ఓ రాష్ట్రానికి సీఎంగా మిగిలిపోవడం.. ఎందరో మేధావులకు బాధ కలిగిస్తోంది. ప్రపంచంలోనే గొప్ప శాస్త్రవేత్త కావాల్సిన వ్యక్తి.. ప్రజల కోసం కేవలం ఓ రాష్ట్రానికి సీఎంగా మిగిలిపోయాడు అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ, ఆయన ఎవరో కాదు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఓ దుర్ముహుర్తాన చైనాలో అడుగు పెట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్ని వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఆరు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దీంతో ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. పలు అంతర్జాతీయ కార్యక్రమాలు, స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడ్డాయి. కరోనా దెబ్బకి మన దేశంలో కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్యాసంస్థలకు, షాపింగ్ మాల్స్ కు తలుపులు వేశాయి. ఈ కరోనా ప్రభావం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల మీద కూడా పడింది. కరోనా విజృంభిస్తుండటంతో.. కేంద్రం సూచన మేరకు.. ఏపీలో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల వాయిదా న్యూస్ వచ్చిందో లేదో.. సీఎం జగన్ ఆవేశంగా ప్రెస్ మీట్ పెట్టారు. కరోనా పేరు చెప్పి కావాలనే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. అసలు కరోనా ప్రమాదం కాదు పాడు కాదు. చిన్న పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుంది అని చెప్పుకొచ్చారు. అంతేనా, బ్లీచింగ్ పౌడర్ తో కరోనాని చంపేయొచ్చు అని సెలవిచ్చారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్.. ఈ రెండు పదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ పై తెగ ట్రోల్ల్స్ వస్తున్నాయి. కరోనాకి మెడిసిన్ పారాసిటమాల్ అని తెలియక ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. మన యువ శాస్త్రవేత్త జగన్ ని ఫాలో అయితే చాలు.. కరోనా ఖతం అవుతుంది అని నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. కొందరైతే చైనా, అమెరికా వంటి దేశాల శాత్రవేత్తలు.. జగన్ ని కలవాలని, జగన్ ఆటోగ్రాఫ్ కావాలని అడుగుతున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇంకా కొందరైతే మెడికల్ షాపుల్లో బ్లీచింగ్ పౌడర్ దొరకట్లేదు.. ఏం చేయమంటారు సీఎం గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కూడా సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. టీవీలలో బిఫోర్- ఆఫ్టర్ యాడ్స్ వస్తుంటాయి కదా. ఆరు నెలల్లో సన్నబడ్డారు, ఆరు నెలల్లో బట్టతలపై జుట్టు వచ్చింది అని.. అలాగే రోజా కూడా బిఫోర్-ఆఫ్టర్ లాంటి ఓ రియల్ కామెడీ స్కిట్ చేసారు. అయితే ఆమె యాడ్స్ లో మాదిరి ఆరునెలలు సమయం తీసుకోలేదు. కేవలం అరగంటలోనే బిఫోర్-ఆఫ్టర్ చూపించారు. ఎన్నికల వాయిదా అని న్యూస్ రాగానే రోజా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ప్రభావం ఎంత ఉందో మన అందరికి తెలుసు.. కరోనా బారినపడకుండా కాపాడేందుకే ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేశారు అని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగానే ఎన్నికల వాయిదా పడ్డాయని టీడీపీ వాళ్ళు తెలుసుకుంటే మంచిదంటూ.. ఓ జబర్దస్త్ సెటైర్ కూడా వేశారు. కట్ చేస్తే.. సీఎం జగనేమో.. కరోనా లేదు, గిరోనా లేదు.. ఓ హడావుడి చేస్తున్నారు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మండిపడ్డారు. అది చూసిన రోజా.. అయ్యో జగనన్న ఎంత పని జరిగింది అనుకుంటూ.. కంగారుగా మళ్లీ మీడియా ముందుకి వచ్చి.. బిఫోర్-ఆఫ్టర్ యాడ్ చూపించారు. ఎన్నికల వాయిదా అంతా ఓ పెద్ద డ్రామా, దీని వెనుక చంద్రబాబు ఉన్నాడు అంటూ విరుచుకుపడ్డారు. ఇది చూసిన నెటిజనులు.. అరగంటలో ఎంత మార్పు!!.. పెనం మీద దోస తిప్పినట్టుగా, భలే మాట మార్చారుగా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

సీఏఏ నిబంధనల ప్రకారం ఎవరూ ఈ దేశ పౌరులు కారంటున్న‌ కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ మోదీ స‌ర్కార్‌కు గట్టి షాక్ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి సంచలన కామెంట్స్ చేశారు. సీఏఏ నిబంధనల ప్రకారం చూస్తే ఎవ‌రూ ఈ దేశ పౌరులు కారని కేసీఆర్ దుయ్యబట్టారు. దేశంలో చాలా మందికి బర్త్ సర్టిఫికెట్ లేదని.. తనకు కూడా బర్త్ సర్టిఫికెట్ లేదని. ఇప్పుడు దాన్ని తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురావాలని సీఏఏ తీరును అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ కడిగిపారేశాడు. ముఖ్య‌మంత్రి అయిన నా పరిస్థితియే ఇలా ఉంటే కూలీలు - పేదలు - మహిళల పరిస్థితి ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. హిందూ - ముస్లింల సమస్య సీఏఏ కాదన్నారు. విచిత్రమైన పద్ధతి, నిబంధ‌న‌లు సీఏఏలో పెట్టారని కేసీఆర్ ఎండగట్టారు. ఓటర్ ఐడీ కార్డు కూడా పనిచేయకపోతే బర్త్ సర్టిఫికెట్లు లేని వారు దేశంలో కోట్ల మంది ఉన్నారని.. వారి పరిస్థితేంటని నిలదీశారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారంతా దేశ ద్రోహులు అవుతారని అని బీజేపీ ప్రచారంపై కేసీఆర్ మండిపడ్డారు. సీఏఏపై దేశంలో సమీక్ష జరగాలని ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల భావోద్వేగాలను బీజేపీ రెచ్చగొట్టడం సరైందని కాదని స్పష్టం చేశారు. సీఏఏపై పునసమీక్షించాలని కేసీఆర్ కోరారు. సీఏఏ వల్ల ఢిల్లీలో 50మంది చనిపోయారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్లమెంట్ లో ఈ బిల్లును వ్య‌తిరేకించిన టీఆర్ ఎస్, సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్ ఫిబ్రవరి 16న తీర్మానం కూడా చేసింది. ఇప్పటికే కేరళ - బెంగాల్ - పంజాబ్ - రాజస్థాన్ - చత్తీస్ ఘడ్ - ఢిల్లీలు కూడా అసెంబ్లీలో సీఏఏను వ్యతిరేకించి తీర్మానం చేశాయి.

ప్రకాశంలో టీడీపీకి 'వలస' నాయకులూ గుడ్ బై...

జగన్ పార్టీ లోకి గాదె, సిద్ధా ఫ్యామిలీలు  వ్యాధికి మందుకానీ విధికి మందా?..ఇది వినటానికి చాలా పాత సామెతే కానీ, తెలుగు దేశం పార్టీ కి మాత్రం రోజూ గుర్తుకొస్తోంది ఇప్పుడు. రోజులు బాగున్నప్పుడు తమ వైపు చేరిన నేతలందరూ, ఇప్పుడు ఒక్కరొక్కరే చల్లగా పార్టీ నుంచి జారుకుంటుంటే, సీనియర్ టీ డీ పి నాయకులు, ఆ సామెత ను మాత్రం మంత్రం పఠించినట్టు పఠిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీలో రాజకీయ రగడ జరుగుతున్న వేళ ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి తన కొడుకు తెలుగు యువత నాయకుడు గాదె మధుసూదర్ రెడ్డితో సహా వైసీపీలో చేరుతున్నారు. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయింది. వీరిద్దరు‎ ఆదివారం సాయంత్రం టీడీపీకి రాజీనామా చేశారు. 1991లో గాదె వెంకటరెడ్డి పర్చూరు నుంచే ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 2004 ఎన్నికల సమయంలో డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వైఎస్‌ గాదెను గుంటూరు జిల్లాలోని బాపట్ల నుంచి పోటీ చేయించారు. అక్కడ ఆయన 2004, 09 ఎన్నికల్లో గెలిచారు. వైఎస్‌ చనిపోయాక కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన గాదె వెంకటరెడ్డి 2014 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నుంచి టికెట్‌ కోసం ప్రయత్నించి విఫలం చెందారు. ఆ తర్వాత 2016లో గాదె వెంకటరెడ్డి చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకుని తన కొడుకుతో సహా టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఏపీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రకాశం జిల్లా టీడీపీనేతలంతా వైసీపీలో చేరుతుండడంతో గాదె కూడా వారి బాటలో నడుస్తున్నారు. గాదె ఫ్యామిలీ చేరికలో జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర వహించారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా నుంచి టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరిబాబురావు, చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, ఆయన తనయుడు కరణం వెంకటేష్, చీరాల మాజీ ఎమ్మెల్యే పాలేరు రామారావు తదితరులు వైసీపీలో చేరారు. ఇప్పుడు గాదె ఆయన కుమారుడు మధుసూదన్ కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారు. ముఖ్యంగా బాపట్ల, పర్చూరు నియోజకవర్గాల్లో గాదె వెంకటరెడ్డికి మంచి పట్టు ఉంది. అయితే బాపట్లలో వైసీపీ ఎమ్మెల్యే ఉండడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గాదె మధుసూదర్ రెడ్డికి పర్చూరు నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో టీడీపీ మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా  తన కుమారుడితో సహా వైసీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వరుసగా కొనసాగుతున్నవలసలు చూస్తుంటే ప్రకాశం జిల్లాలో టీడీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. గాదె ఫ్యామిలీ ఎగ్జిట్ తో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో టీ డీ ఫై కి కాస్తో కూస్తో మిగిలి ఉన్న వలసనాయకులు కూడా లేనట్టే!

ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు రేటు తగ్గించిన కంపెనీలు

పీపీసీ బస్తా రూ.225కే, ఓపీసీ బస్తా రూ.235కే గడచిన ఐదేళ్లతో పోలిస్తే అతితక్కువ రేటుకు సిమెంటు ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు సిమెంటు కంపెనీల నిర్ణయం సిమెంటు కంపెనీ యజమానులు, ప్రతినిధులతో సీఎం జగన్  సమావేశం పేదలకు ఇళ్ల నిర్మాణం సహా ప్రభుత్వం చేపట్టే పనులు, పోలవరం ప్రాజెక్టు పనులకు రేట్లను తగ్గిస్తున్నట్టుగా సిమెంటు కంపెనీలు ప్రకటించాయి. ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. పొజొలానా పోర్టబుల్‌ సిమెంట్‌ (పీపీసీ) బస్తా ధరను రూ.225లుగా, ఆర్డినరీ పోర్ట్‌ సిమెంట్‌ ధరను రూ.235లుగా నిర్ణయించాయి. 2015–16 నుంచి 2019–2020 మధ్యకాలంలో ఏ సంవత్సరంతో పోల్చినా ఈ ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో సిమెంటు ధరలు రూ. 380 వరకూ ఉన్నాయి.  తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ తో  వివిధ కంపెనీల యజమానులు, ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు చేపడుతున్న పనులకోసం ఈ ఏడాది అవసరమైన సిమెంటు వివరాలను కంపెనీ ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గృహ నిర్మాణ శాఖకు 40 లక్షల మెట్రిక్‌ టన్నులు, పంచాయతీరాజ్‌ శాఖ 25లక్షల మెట్రిక్‌ టన్నులు, జలవనరుల శాఖ 16.57 లక్షల మెట్రిక్‌ టన్నులు, మున్సిపల్‌శాఖ 14.93 మెట్రిక్‌ టన్నులు... తదితర శాఖలు కలిపి మొత్తంగా 1,19,43,237 మెట్రిక్‌ టన్నుల అవసరాలు ఉంటాయని వివరాలు తెలిపారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు అని, అలాగే పేదలందరికీ ఇళ్లనిర్మాణం రూపేణా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు. సిమెంటు ఉత్పత్తి, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.  పేదలకు 26.6 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని, ఈ పట్టాలు తీసుకున్నవారితోపాటు సొంతంగా స్థలాలు, పట్టాలు ఉన్న పేదలకు పెద్ద మొత్తంలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని ముఖ్యమంత్రి సిమెంట్ కంపెనీ ప్రతినిధులకు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. తక్కువ ధరలతో ఇచ్చే సిమెంటు బ్యాగు ప్రత్యేకంగా వేరొక రంగులో ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను సంబంధిత జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తాయని, కలెక్టర్‌ ద్వారా ఈ సిమెంటు పంపిణీ అవుతుందని సీఎం స్పష్టంచేశారు. నాణ్యతా నిర్ధారణ అయ్యాకే చెల్లింపులు జరుగుతాయని సీఎం కంపెనీలకు తెలిపారు.  పేదలకు ఇళ్ల నిర్మాణం సహా, వివిధ ప్రభుత్వ పనులు, పోలవరం ప్రాజెక్టులకు సిమెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని సిమెంటు కంపెనీ ప్రతినిధులు స్పష్టంచేశారు. అవసరాలమేరకు పంపిణీ అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి కంపెనీల తరఫునుంచి ఇద్దరు ముగ్గురితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని సిమెంటు కంపెనీల ప్రతినిధులు తెలిపారు.  సమావేశంలో జువారి సిమెంట్, భవ్య, సాగర్, కేసీపీ, రైన్, భారతి, అల్ట్రాటెక్, జేఎస్‌డబ్ల్యూ, శ్రీ చక్ర, ఇండియా, మై హోం, రాంకో, పెన్నా, దాల్మియా, ఆదిత్యా బిర్లా, చెట్టినాడ్, పాణ్యం, పరాశక్తి, ఎన్‌సీఎల్‌ తదితర కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు.

సుప్రీం కోర్టు లో రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్

అనుకున్నట్టే జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా వేయడంపై జస్టిస్ లలిత్ ధర్మాసనం వద్ద మెన్షన్ చేసిన ఏపీ ప్రభుత్వం. రేపటి లిస్ట్ లో పెట్టాలని రిజిస్ట్రార్ ను ఆదేశించిన జస్టిస్ లలిత్ బెంచ్. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం. రేపు విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల అంశాన్ని జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ప్రస్తావించిన  ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు. రేపటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించిన జస్టిస్ లలిత్.  రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా రాష్ట్ర ఎన్నికల అధికారి వేయడం పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం. ఇదిలా ఉండగా, ఈ రోజు ఉదయం దాదాపు గంటకు పైగా గవర్నర్ తో సమావేశమైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ , కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందనే విషయాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు వివరించారు.  బందర్ రోడ్డులోని  తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. గవర్నర్ తో చర్చించిన అంశాలను అధికారులతో వివరించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరికాసేపట్లో పత్రికా ప్రకటన విడుదల చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్గ. గ వర్నర్ తో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై  పత్రికా ప్రకటనలో వివరించే అవకాశం .  రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నానే విషయాన్ని ప్రకటనలో తెలియజేయనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.

4ల‌క్ష‌ల 76వేల 692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద శుభవార్త చెప్పింది. త్వరలో 4,76,692 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో 4,75,000 పైగా పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు. 2019-20 సంవత్సరంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB మొత్తం 1,34,785 పోస్టుల్ని భర్తీ చేయాలని సిఫార్సు చేసినట్టు జితేంద్ర సింగ్ రాతపూర్వకంగా వివరించారు. యూపీఎస్‌సీ ద్వారా 4,399 ఖాళీలు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 13,995 ఖాళీలు, ఆర్ఆర్‌బీ ద్వారా 1,16,391 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. యూపీఎస్‌సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ మాత్రమే కాదు... రక్షణశాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా అదనంగా మరో 3,41,907 పోస్టుల్ని భర్తీ చేస్తామని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఖాళీల వివరాలను యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ లాంటి రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు తెలపాలని కోరినట్టు వివరించారు. కేంద్ర సహాయ మంత్రి రాజ్యసభకు వివరించిన దాన్నిబట్టి కేంద్ర ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తున్నట్టు అర్థమవుతోంది. కాబట్టి నిరుద్యోగులు ఎప్పటికప్పుడు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు జారీ చేసి జాబ్ నోటిఫికేషన్లపై దృష్టి పెట్టడం మంచిది. 10వ త‌ర‌గ‌తి, ఇంటర్, పాస్ అయ్యి ఉద్యోగ అర్హత తక్కువ‌ ఉందని అనుకునే వారికి కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉద్యోగాలని భర్తీ చేయనుంది. కేంద్ర మంత్రిత్వశాఖలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ బీ, సి పోస్టుల భర్తీ కి చర్యలు చేపట్టింది.

దేశంలో 110కి చేరిన కరోనా కేసులు

మ‌న దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 110కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన విడుద‌ల చేసింది. వారిలో 17 మంది విదేశీయులు ఉన్నారని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనాతో ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధారణ అయింది. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన వ్యక్తి కాగా, మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారు. దేశంలో అత్యధిక కరోనా బాధితులు మహారాష్ట్రలోనే ఉన్నారు. అనంతరం కేరళలో అత్యధికంగా 22 మంది ఉన్నారు. హర్యానాలో 14, ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ పయనం చాలా ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్ మొదటి రెండు వారాలు ఒకరిద్దరూ పదుల సంఖ్యకే పరిమితమైంది. ఆ తర్వాత వేల మందికి సోకింది. మూడో వారం నుంచి దీని ఉధృతి పెరిగి నాలుగో వారానికి వేలమందికి సోకుతుందని అధ్యయనంలో తేలింది. ఇండియాలోనూ అదే పరిణామం చోటుచేసుకోవడం దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. భారత దేశంలో మొదటి వారం - 3 కేసులు నమోదయ్యాయి. రెండోవారం ఆ సంఖ్య 24కు పెరిగింది. 3వ వారం ఏకంగా105 మంది రోగులుకు పెరిగారు. ఇప్పుడు 4వ 5వ వారాలు దేశంలో అత్యంత కీలకం. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్నింటికి సెలవులు ఇచ్చేశాయి. కరోనా వ్యాప్తి చెందకుండా మీటింగ్ జనసమూహాలు జనసమ్మర్థ ప్రాంతాలను ఖాళీ చేశాయి. నిషేధాజ్ఞలు విధించాయి. ఈ రెండు వారాలు ఎవరూ ఇల్లు దాటి బయట అడుగుపెట్టకుంటే కరోనా మనం నియంత్రించవచ్చు. తొందరపడి బయటకు పోతే మాత్రం కరోనా కల్లోలం దేశంలో విస్తరించడం ఖాయం అని శాస్త్రవేత్తలు ఈ లెక్కల ఆధారంగా చెబుతున్నారు. వచ్చే ఈ రెండు వారాలు భారతదేశానికి కీలకమైనవి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరుతోంది. వృద్ధులు పిల్లలను ఎంత వీలైతే అంత దూరంగా ఇంట్లోనే ఉంచితే బెటర్ అని సూచిస్తున్నారు. వారికి సోకితే ప్రాణాలు పోవడం ఖాయమంటున్నారు. ఇప్పుడు కరోనా స్టేజ్ 3 వ దశలో ఉన్నాం. మెడికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం వచ్చే 30 రోజులు చాలా కీలకం. ఆ సమ‌యంలో జాగ్రత్తగా ఉంటే దేశంలోంచి కరోనాను మనం తరిమికొట్టవచ్చు.

దేశంలో ఇక కాంగ్రెస్ పార్టీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మే?

కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే లావుంది. రాహుల్ గాంధీ బాధ్యతా రాహిత్యం, సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీలున్నంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే తాను విశ్రాంతి తీసుకుంటానని ఆమె పలుమార్ల పార్టీ సీనియర్ నాయకులతో చెబుతున్నారు. కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక అంశంపై పార్టీ రెండుగా చీలిపోవటంతోపాటు ఇరు పక్షాల మధ్య అంతర్యుద్ధం కొనసాతోంది. గాంధీ కుటుంబ సభ్యులు మాత్రమే పార్టీ అధ్యక్షులుగా కొనసాగాలని ఒక వర్గం వాదిస్తోంటే రెండో వర్గం సీనియర్ నాయకులలో ఒకరిని అధ్యక్షుడుగా ఎన్నుకుని ముందుకు సాగాలని వాదిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య ఇంత కాలం తెర వెనక కొనసాగిన యుద్ధం ఇప్పుడు బహిరంగ వేదికలెక్కింది. కాంగ్రెస్ చుక్కాని లేని నావ మాదిరిగా కొట్టుకుపోతోందంటూ శశిథరూర్ బహిరంగంగా తన ఆవేదనను వెళ్లగక్కారు. రాహుల్ గాంధీ చుట్టూ చేరిన కోటరీ మూలంగా గులాం నబీ ఆజాద్, అహమద్ పటేల్ లాంటి సీనియర్ నాయకులు పార్టీకి దూరమవుతున్నారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగేందుకు ఇష్టపడటం లేదు, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఎవ్వరు ఆమోదించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బయటి వారిని అధ్యక్షుడుగా ఎన్నుకోకుండా ఈ రాద్ధాంతం ఏమిటని శశిథరూర్, జయరాం రమేష్, అభిషేక్ సింఘ్వి లాంటి నాయకులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి రావటం లేదు. రాహుల్ గాంధీనే మరోసారి పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవటం మంచిదని పార్టీలోని ఒక వర్గం పట్టుపడుతోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇందుకు ససేమిరా అంగీకరించటం లేదు. రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అంగీకరించటం లేదు కానీ అనునిత్యం ఏదోఒక ప్రకటన, ట్వీట్ చేయటం ద్వారా పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అధిష్టానవర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌లు పని చేయటం మానివేసి చాలా కాలమైంది. కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పి.సి.సి. అధ్యక్షులు తమ ఇష్టానుసారం రాజకీయం నడిపించుకుంటున్నారు తప్ప అధినాయకత్వం ఆదేశాల మేరకు పనులను నడిపించటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది. ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 62 మంది అభ్యర్థులు ధరావతును కోల్పోయారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పలుకుబడి ఏ పాటిదనేది ఈ ఎన్నికలు మరోసారి స్పష్టం చేశాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ఓటర్లందరు ఆం ఆద్మీ పార్టీకి వెళ్లిపోయారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ తరువాతి స్థానం బి.జె.పి.ది. కాంగ్రెస్, వామపక్షాలు ఇప్పుడు మూడు, నాలుగో స్థానానికి నెట్టివేయబడ్డాయి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌కు కార్యకర్తలు కరువవుతున్నారు. ఉత్తర ప్రదేశ్ సంగతి అందరికి తెలిసిందే. యు.పి. రాజకీయాలలో బి.జె.పి. తరువాత స్థానం సమాజ్‌వాదీ, బహుజన సమాజ్ వాదీ పార్టీలది. కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయింది. బిహార్‌లో జె.డి.యు., బి.జె.పి., ఆర్.జె.డి. తరువాత కాంగ్రెస్ ఉంటోంది. అదికూడా ఆర్.జె.డి. భుజాలెక్కి కూర్చోవటం వల్లనే కాంగ్రెస్ పరువు కొంతైనా దక్కుతోంది. కర్నాటకలో బి.జె.పి. తరువాత దేవేగౌడ నాయకత్వంలోని జె.డి., ఆ తరువాతనే కాంగ్రెస్ అంటే మూడో స్థానం కాంగ్రెస్‌ది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ భూ స్థాపితమైపోయింది. తెలంగాణాలో భూస్థాపితమయ్యే పరిస్థితులను కాంగ్రెస్ నాయకులే సృష్టించుకుంటున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ అస్తిత్వం ఏ పాటిదనేది అందరికి తెలిసిందే. డి.ఎం.కె. మద్దతు లేకపోతే కాంగ్రెస్ మనుగడే ఉండదు. కేరళలో కాంగ్రెస్ పరిస్థితి కొంతే మెరుగే. రాష్ట్ర ప్రజలు ఒకసారి కాంగ్రెస్‌కు మరోసారి వామపక్షాలకు అధికారం అప్పగిస్తున్నారు. మహారాష్టల్రో మొదటి స్థానం బి.జె.పి.దైతే రెండో స్థానం శివసేనది. మూడో స్థానంలో ఎన్.సి.పి. ఉంటే నాలుగో స్థానంలో కాంగ్రెస్ ఉన్నది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గడ్‌లో అధికారంలోకి వచ్చినా అక్క‌డ పార్టీకి ఆశించిన స్థాయిలో సీన్ లేదు. జార్కండ్‌లో ప్రాంతీయ పార్టీ జె.ఎం.ఎం. తోకపట్టుకుని ముందుకు సాగుతోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి క్యాప్టెన్ అమరీందర్ సింగ్. రాహుల్ గాంధీ రాజకీయం అమరీందర్ సింగ్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే ఆయన నేరుగా సోనియా గాంధీతో మాట్లాడుకుంటాడు. ఒకప్పుడు రాజ్యమేలిన ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ దాదాపుగా కనుమరుగైపోయింది. ఉత్తరాధిలోని పలు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.