పార్టీని బలోపేతం చేద్దాం

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవల్సిన చర్యలపై కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కె బాలసుబ్రమణ్యంతో చర్చించారు. శుక్రవారం ఢిల్లీలో బాలసుబ్రమణ్యంను మర్యాదపూర్వకంగా కలిసిన సంజయ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వ  వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై చర్చ జరిగింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువ కావడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ భేటీలో ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, బీజేపీ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో దళితులపై పెరిగిన దాడులు, బీజేపీ నేతలు అరెస్టులు, గృహ నిర్భందం మొదలైన అంశాలను సంజయ్ వివరించారు. దేశ వ్యాప్తంగా ఎదురైన కరోనా మహమ్మారి కారణంగా ఎదురైన సవాళ్లు, లాక్ డౌన్ పరిస్థితుల్లో తెలంగాణాలో బీజేపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సేవ కార్యక్రమాల గురించి సంజయ్ వివరించారు. రాబోయే రోజుల్లో కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు పార్టీ తెలంగాణ విభాగం అలుపెరగకుండా కృషి చేయాలని బాలసుబ్రమణ్యం సూచించారు.

భారత్ లో కరోనాకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం.. కేంద్ర ఆరోగ్య శాఖ

భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 16 లక్షలు దాటింది. ప్రతి రోజు రికార్డ్ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్ లాంటి అధిక జనాభా గల దేశంలో హార్డ్ ఇమ్యూనిటీ అసాధ్యం అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. భారతదేశ జనాభా పరిమాణాన్ని బట్టి హార్డ్ ఇమ్మ్యూనిటి ఓ ఆప్షన్ కానే కాదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనాను అరికట్టే వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనా తో పోరాడాల్సి ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓఎస్డీ రాజేష్ భూషణ్ తెలిపారు. భారత్ వంటి దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ అనే ఆప్షన్ పనికి రాదని వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం దాదాపుగా అసాధ్యం అని ఈ సమయంలో దాన్ని అమల్లోకి తేస్తే.. కోట్లాది మంది ప్రజలు అనారోగ్యానికి గురవడమే కాకుండా ప్రాణ నష్టం కూడా అధికంగా ఉంటుందని అయన అన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన తర్వాతనే హార్డ్ ఇమ్యూనిటీ అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు ప్రస్తుత పద్దతిలోనే కరోనాను ఎదుర్కొవాలని రాజేష్ భూషణ్ తెలిపారు. అంతే కాకుండా కరోనా రోగులలో రికవరీ రేటు ఏప్రిల్లో 7.85 శాతం ఉండగా ప్రస్తుతం 64.44 శాతానికి పెరిగింది అన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు భారత్ లోనే తక్కువన్నారు.

విమానయాన రంగానికి గడ్డుకాలం

చతికిల పడ్డ ఆకాశయానం పార్కింగ్ కోసం ఫ్లైట్స్ కు తప్పని ఫైట్ కంటికి కనిపించని వైరస్ దాడితో అనేక రంగాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకు పోయాయి. అందులో విమానయాన రంగం ఒకటి.  ఒకప్పుడు ధనికులకే అందుబాటులో ఉండేది ఆకాశయానం. గత కొన్నేండ్లుగా ప్రైవేటు విమాన సంస్థల మధ్య నెలకొన్న పోటీతో మధ్యతరగతి వారికి సైతం అందుబాటులోకి వచ్చింది. పోటీలు పడీ మరీ ధరలను తగ్గించి.. స్పెషల్ ఆఫర్స్ తో దిగువ మధ్యతరగతి వారిని సైతం మేఘాల్లో విహరించేలా చేసింది. అలాంటి విమానయాన రంగం కరోన కారణంగా చతికిలపడింది. ప్రపంచ రవాణావ్యవస్థలో అత్యధిక లాభాలతో దూసుకు పోయిన గత దశాబ్దాన్ని వైమానిక రంగం స్వర్ణయుగంగా ఎంతో మంది అభివర్ణించారు. ఈ పదేళ్లుగా మంచి పురోగతిని సాధిస్తూ ఏటా అంతకంతకు వృద్ధి చెందింది. 2020లో 870 బిలియన్ డాలర్ల పైనా ఆదాయం వస్తుందని అంచనా వేస్తే ఇప్పటికి వచ్చింది కేవలం 419 బిలియన్ డాలర్లు మాత్రమే. దేశీయంగా సైతం చిన్నచిన్న విమానాలతో రవాణా సమయాన్ని ఆదా చేసిన విమానాలు ఇప్పుడు రెక్కలు తెగిన పక్షుల్లా ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభించక ముందు ప్రపంచ రవాణా రంగం ఊపులో ఉండేది. కానీ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ప్రపంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ విధించడం, కొత్తగా తమ తమ దేశాల్లోకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్ అన్న విధంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో కొత్తగా ఎవరూ టికెట్స్ బుక్ చేసుకోకపోవడం..ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేశారు. జనవరి - జులై మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడున్నర లక్షల విమానాలు రద్దు అయ్యాయి. దాంతో విమానయాన సంస్థలు కోలుకో లేని నష్టాలు చవిచూశాయి. విమానాలు అన్నీ ఎయిర్ పోర్ట్ లకే పరిమితం కావడంతో చివరకు ఆ విమానాలను పార్కింగ్ చేసే స్థలం కోసం కూడా తగువులాడే పరిస్థితి వచ్చింది.               పర్యాటకం పైనే ఆధారపడే చాలా విమానయాన సంస్థలు మూతపడే స్థితికి వచ్చాయి. థాయ్ ఎయిర్ వేస్, లుఫ్తాన్సా, లాటన్ వంటి సంస్థలు దాదాపుగా పతనావస్థకు చేరుకున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటి దారి పట్టారు. మరి కొందరి వేతనాల్లో కోతలు విధించారు. విమాన ప్రయాణాల్లో వచ్చిన ఈ విపత్కర పరిస్థితి విమాన తయారీ సంస్థలపై కూడా ప్రభావం చూపింది. ప్రపంచంలోనే  విమానయాన తయారీలో అత్యంత పేరున్న బోయింగ్ సంస్థ దాదాపు 16000 వేల మందిని, ఎయిర్ బస్ 15000 మందిని ఇప్పటికే ఉద్యోగాల నుండి తొలగించాయి. 2001 సెప్టెంబర్ 11 లో విమానాల హైజాక్ తర్వాత ఎయిర్ ఫోర్టుల్లో వైమానిక మార్గదర్శకాలను అనుసరించి స్క్రీనింగ్ చేయడంలో, కాక్ పీటీలోకి ఎవరిని అనుమతించక పోవడం లాంటి నియమాలు పాటిస్తూ నిబంధనలను కఠినతరం చేశారు.  గతంలో ఒక ప్రయాణికుడు తన షూ లో దాచిన ఆయుధంతో  తోటి ప్రయాణికులను భయపెట్టి హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంగ్లాడ్ లో మరో  ప్రయాణికుడు ద్రావణం రూపంలో ఉన్న పేలుడు సామాగ్రిని అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించాడు. ఇలాంటి ఎన్నో రకాల అవాంఛనీయ సంఘటనలను చాకచక్యంతో ఎయిర్ ఫోర్ట్ రక్షణా సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం కంటికి కనిపించని వైరస్ ను ఎదుర్కోవడానికి మరిన్ని జాగ్రత్తలు అవసరం అయ్యాయి.  మాస్కులు, ఫేస్ షిల్డ్స్,  స్క్రినింగ్, ప్రొటెక్టివ్ గేర్స్, , హాండ్ శానీటైజర్ వంటివి తప్పనిసరిగా మారింది. వీటితో పాటు తమ విమానాల్లో ప్రయాణం సురక్షితం అని ప్రయాణికుల్లో నమ్మకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బోయింగ్ లాంటి సంస్థలు HEPA ఫిల్టర్స్ ద్వారా 99 శాతం వైరస్ ను నాశనం చేసే చర్యలు తీసుకుంటామని చెబుతున్నాయి.  ప్రయాణికులు తీసుకునే ఆహారం విషయంలో, టాయిలెట్స్, బాత్ రూమ్స్ వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.                 సోషల్ డిస్టెన్సింగ్ వంటివి కొంత కష్టం అయినప్పటికీ తప్పని పరిస్థితిలో వెస్ట్ జెట్(WestJet), ఎయిర్ కెనడా(Air Canada) వంటి సంస్థలు సోషల్ డిస్టెన్స్ ను అమలు చేస్తున్నాయి. అయితే దీనితో ప్రయాణికులపైనే అదనపు భారం పడుతుంది. కరోనా కన్న ముందు కొన్ని సంస్థలు విహార యాత్ర చేయాలనుకునే  ప్రయాణికులను ఆకట్టుకోవడానికి 40 శాతం వరకు టికెట్ లో రాయితీ  ఇచ్చాయి. దాంతో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండేది. ఉదాహరణకు బార్సిలోనా విషయానికి వస్తే గత సంవత్సరం ఈ నగరం ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఒక దశలో స్థానికులు విసిగిపోయి ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు అని బ్యానర్లు కట్టే పరిస్థితి వచ్చింది. ఎవరెస్టు శిఖరం పైన కూడా టూరిస్టులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదంతా కూడా విమానయాన రంగంలో ఏర్పడిన పోటీతో తక్కువ రేట్ కు టికెట్లు అందుబాటులోకి తీసుకురావడంతోనే ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా విమానయాన సంస్థలు లాభాదాయకంగా ఉన్న మార్గాల ద్వారానే విమానాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాయి.  మన దేశం వందే భారత్  మిషన్ ద్వారా కొన్ని దేశాలకు విమానాలు నడుపుతుంది. బ్రిటిష్ ఎయిర్ వేస్ బోయింగ్ 777ను రద్దు చేసింది.  కెనెడియన్ ఎయిర్ లైన్స్  పరిమిత మార్గాల్లోనే విమానాలు నడపడానికి సిద్ధపడింది. విమానయాన రంగం ఈ కఠిన పరిస్థితుల నుంచి బయటపడి  నిండుగా ఉన్న ప్రయాణికుతో స్వేచ్ఛగా గాలిలోకి ఎగరాలంటే మరి కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదేమో..!!

42 మంది కరోనా రోగులు మిస్సింగ్

ఉత్తరప్రదేశ్‌ లోని ఘజీపూర్‌లో 42 మంది కరోనా రోగులు క‌నిపించ‌కుండా పోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వారంతా కరోనా పరీక్షలు చేయించుకున్న స‌మ‌యంలో త‌మ ఫోన్ నంబర్లు, చిరునామాల‌ను త‌ప్పుగా ఇచ్చిన‌ట్టు అధికారులు తెలిపారు.  దీనిపై ఘాజీపూర్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేకే వర్మ అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ కు శుక్రవారం లేఖ రాశారు. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన దాదాపు 42 మంది కనిపించడం లేదని వెల్లడించారు. పరీక్షల సమయంలో చాలామంది సరైన వివరాలు ఇవ్వడం లేదని, దీంతో పాజిటివ్ అని తేలిన తర్వాత వారిని గుర్తించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. త‌ప్పిపోయిన వారిని గుర్తించేందుకు సాయం చేయాల్సిందిగా డాక్టర్ కేకే వర్మ కోరారు.  త‌ప్పిపోయిన వారి సంఖ్య 40 దాట‌డంతో జిల్లా ఆరోగ్య శాఖ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. మరోవైపు, గత 15 రోజులు నుండి జిల్లాలో చాలామంది కరోనా రోగులు మిస్సైనట్టు తెలుస్తోంది. కాగా, ఘజీపూర్ జిల్లాలో ఇప్పటివరకు 10 మంది కరోనా కార‌ణంగా మరణించగా.. ప్రస్తుతం 505 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అర్ధరాత్రి భయంతో నిర్ణయాలు వద్దు.. జగన్ కి రాఘురామకృష్ణం రాజు సూచన

ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను మళ్లీ నియమించడం ఆలస్యమైనా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎంపీ రాఘురామకృష్ణం రాజు అన్నారు. ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరిచేసుకోవాలని సూచించారు. మన దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలు రాజ్యాంగానికి అనుసంధానమై ఉంటాయని.. ఒక వ్యవస్థ గాడి తప్పినా చాలా సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఎస్ఈసీ విషయంలో జరిగిన తప్పిదాలతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో చూశామని, కోర్టుల కోసం ఎంతో ప్రజాధనం వృథా అయిందని అన్నారు.  అయితే, తెల్లారితే ఈ అంశంతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులకు జైలుశిక్ష పడుతుందనే భయంతో.. అర్ధరాత్రి పూట నిర్ణయాలు తీసుకోవడం కాకుండా.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని జగన్ కు రాఘురామకృష్ణం రాజు సూచించారు. న్యాయ వ్యవస్థను గౌరవించాలని.. భయంతో మనం నిర్ణయాలు తీసుకున్నట్టు ఉండకూడదని, ఇకపై ఇలా జరగకుండా మనం వ్యవహరించాలని అన్నారు.

ప్లాస్మా దాతలకు 5వేల రూపాయలు ప్రోత్సాహకం

కరోనా చికిత్స కోసం గుర్తించిన ఆసుపత్రుల్లో బెడ్ల ఖాళీలు, భర్తీల వివరాలు ఆస్పత్రి హెల్ప్‌ డెస్క్‌లో అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఎవరికైనా బెడ్‌ అందుబాటులో లేకపోతే.. వారిని సమీప ఆస్పత్రికి పంపించి అక్కడ బెడ్‌ అలాట్‌ చేయాలని తెలిపారు.  కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌ కోసం నిర్దేశించిన 138 ఆసుపత్రుల మేనేజ్‌మెంట్‌ పై దృష్టి పెట్టాలని చెప్పారు. బెడ్లు, వైద్యం, ఆహారం, శానిటేషన్‌ పై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.  ప్లాస్మా థెరపీపై కూడా బాగా అవగాహన కల్పించాలి, దీనివల్ల మంచి ఫలితాలుంటే ప్రోత్సహించాలని సూచించారు. ప్లాస్మా ఇచ్చే వారికి 5వేల రూపాయలు ప్రోత్సాహకం ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు. మంచి భోజనం, వారి ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు‌. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లు తెరిచే ప్రయత్నాలు చేస్తున్నాం అన్నారు. విద్యాకానుకతో పాటు పిల్లలకు మాస్కులు కూడా ఇవ్వాలని, దీని కోసం వెంటనే మాస్కులు సిద్ధం చేయండని ఆదేశించారు.

దీర్ఘాయుష్మాన్ జపాన్..

తొమ్మిది పదుల వయసు దాటినవారు 20లక్షలకు పైగా సగటు జీవన ప్రమాణం 85ఏండ్లు ఆహారపు అలవాట్లే దీర్ఘాయుష్ కు కారణం స్వచ్ఛత, శుభ్రత వారి దినచర్యలో భాగం అగ్ర రాజ్యాలను, అభివృద్ధి చెందిన దేశాలను కబళిస్తున్న కరోనా వైరస్ జపాన్ లో పెద్ద ప్రభామేమీ చూపలేదు. వయోధికులపై ఎక్కువగా ప్రభావం చూసే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని చూసి ప్రపంచదేశాలు తమ దేశంలోని వృద్ధులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. అయితే వయోవృద్ధుల జనాభా ఎక్కువ ఉండే జపాన్ ఈ వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో అని ఆందోళన ఏర్పడింది. అయితే జపాన్ మాత్రం చాలా త్వరగానే కోవిద్ 19ను అరికట్టగలగడంతో పాటు తమ దేశ సంపదగా భావించే వృద్ధులను రక్షించుకుంది. అయితే అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ కరోనా విజృంభిస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలను కూడా తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది జపాన్ ప్రజల జీవనవిధానం. మనిషి సగటు జీవన ప్రమాణం అత్యధికంగా ఉన్న దేశాల్లో జపాన్ ది రెండో స్థానం. సగటు జీవన ప్రమాణం 89 ఏండ్లతో మొదటిస్థానం మొనాకో దేశానిది. జనాన్ లో 90ఏండ్లు పై బడిన వారి సంఖ్య 20లక్షలకు పైనే. వారిలో శతాధిక వృద్ధుల సంఖ్య  దాదాపు 69,785. అంటే సగటు జీవన ప్రమాణాల కాలం 84.2 ఏండ్లు. పురుషుల జీవన ప్రమాణ కాలం 81.1 ఏండ్లు కాగా, మహిళల జీవన ప్రమాణ కాలం ఇంకాస్త ఎక్కువగా అంటే 87.1 ఏండ్లుగా ఉంది. జపానీయుల ఆహారపు అలవాట్లు జీవనవిధానం ప్రపంచాన్ని ఎప్పుడు  అబ్బురపరుస్తూనే ఉంది. వారి దీర్ఘాయుష్ పై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. జన్యుపరంగా ఎక్కువ కాలం జీవించడం అక్కడ మాములే అనుకుంటారు. అయితే ఇప్పటివరకు జరిగిన చాలా అధ్యాయాలు వారి జీవనవిధానం, ఆహారం వారిని ఆరోగ్యంగా ఉంచుతున్నాయని స్పష్టం చేశాయి. జపాన్ ప్రజలు ఆహారం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి రోజు తాజా కూరగాయలు,  సీజనల్ గా లభించే పండ్లు తప్పక తింటారు. అంతేకాదు ప్రాసెసింగ్ చేసిన, ప్యాకెట్స్, టిన్స్ లోని ఆహారాన్ని వారు అసలు ఇష్టపడరు. అంతేకాదు జపానీయుల ఆహారంలో రెడ్ మీట్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా సముద్రపు ఆహారమైన చేపలు వంటి వాటిని ఇష్టంగా తీసుకుంటారు. అందుకే చేపల వినియోగంలో ప్రపంచంలో ఆరవ స్థానంలో జపాన్ ఉంది. మాంసంలో కన్నా చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. 36 శాతం గుండె సంబంధిత మరణాలను ఇది తగ్గిస్తుంది. ప్రతి సంవత్సరం దాదాపు లక్ష టన్నుల సముద్రపు నాచు(సీవుడ్)ను ఆహారంగా తీసుకుంటారు. ఒక కప్పు సముద్రపు నాచులో 2 -9 గ్రాముల ప్రోటీన్ తో పాటు సహజ సిద్ధంగా దొరికే అయోడిన్ ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు రావు.  దీనికి తోడు వాళ్ళు ఎక్కువ కాలం బతకడానికి మరో కారణం ఆహారాన్ని మితంగా తీసుకోవడం. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన అక్కడి ప్రజల్లో స్థూలకాయం సమస్య చాలా తక్కువ. ప్రపంచంలోని అధిక బరువు ఉన్నవారిలో జపానీయుల సంఖ్య కేవలం 3.6శాతం మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా ఇదే చాలా తక్కువ.  జపాన్ ప్రజల జీవన ప్రమాణ కాలం ఎక్కువగా ఉండటానికి మరో కారణం ఎక్కువగా చాయ్ తాగటం. సహజంగా కాఫీ కంటే కూడా యాంటీ ఆక్సిడెంట్స్ చాయ్ లోనే ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటూ క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు. జపాన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ విధానం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుంది. మిగతా వాటితో పోల్చితే 70 శాతం ఆరోగ్యంపైనే ఖర్చు చేస్తుంది.  మిగతా దేశాల వాళ్ళతో పోల్చితే జపనీయుల ఎత్తు కాస్త తక్కువే.   శరీర నిర్మాణం కూడా ఒక అడ్వాంటేజ్. దీంతో చురుగ్గా ఉండటం, బరువును అదుపులో ఉంచుకోవడంతో పాటు జీర్ణక్రియ విధానం సక్రమంగా జరుగుతుంది. ఆఫీసుకు వెళ్ళడానికి కూడా నడిచి వెళ్ళడమో లేదా సైకిల్ మీద వెళ్ళటానికే ఇష్టపడతారు. జపాన్ లోని వయోవృద్ధులు సాధ్యమైనంత వరకు శారీరక శ్రమలో భాగస్వాములు అవుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండటానికి మరో కారణం 85 శాతం మంది జపనీయుల రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేస్తారు. నిద్రించే ముందు వేడినీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ఉండే మలీనాలు సులభంగా వెళ్లిపోవడమే కాకుండా మానసిక, శారీరక ఒత్తిడిని కూడా  దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వీటన్నింటికన్నా మరో ముఖ్యమైన విషయం జపనీయులు తమ ఆచారా వ్యవహారాలను తప్పక పాటిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. మన దేశంలో పిల్లలను సంపదగా భావస్తాం. జపాన్ లో పెద్దవారిని సంపదగా భావిస్తారు. వయోవృద్ధుల  నుంచి ఎన్నో నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నారులకు ఊహ తెలిసినప్పటి నుంచే స్వచ్చత, శుభ్రత నేర్పిస్తారు. మితంగా తింటూ అమితంగా పెద్దలను, సంస్కృతిని గౌరవించడమే జపానీయుల ఆరోగ్య రహాస్యమని చెప్పక తప్పదు.

టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమవ్వలేదా?.. రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఆగస్టు 14న రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరగనుంది. దీంతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభానికి తెర పడనుంది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కానసాగుతుందా? లేక కూలిపోతుందా? అనే విషయం తేలనుంది. కాంగ్రెస్ కి మేజిక్ ఫిగర్ కంటే కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఒక్క ఎమ్మెల్యే కూడా మిస్ కాకుండా జాగ్రత్త పడుతుంది. ముందు జాగ్రత్తగా ఎమ్మెల్యేలను జైపూర్ నుంచి జైసల్మేర్ కు తరలిస్తోంది. మరోవైపు బీఎస్పీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ లో విలీనమైన ఆరుగురు ఎమ్మెల్యేల చుట్టూ ఇప్పుడు రాజకీయం తిరుగుతోంది. ఇప్పటికే వారి విలీనాన్ని సవాల్ చేస్తూ బీఎస్పీ హై కోర్ట్ ని ఆశ్రయించింది. బీజీపీ కూడా ఈ విలీనాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ మీద విమర్శలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం అశోక్ గెహ్లాట్.. టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడాన్ని ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో విలీనం కావడాన్ని తప్పుపడుతున్నారని, టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాత్రికి రాత్రి బీజేపీలో విలీనమయ్యారని.. ఈ విలీనాన్ని మాత్రం బీజేపీ సరైందని వాదిస్తుందని విమర్శించారు. రాజస్థాన్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనాన్ని మాత్రం తప్పంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ వల్లే శానిటైజర్ మరణాలు.. ప్రభుత్వం పై మండి పడ్డ చంద్రబాబు 

ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో మద్యానికి బానిసలైన సుమారు 20 మంది శానిటైజర్‌ తాగడంతో వారిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 10 మంది కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు పదేపదే చోటుచేసుకోవడం పట్ల అయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో గత 14నెలలుగా కల్తీ మద్యం దుర్ఘటనలు పెరిగి పోవడం బాధాకరమని.. నాటు సారా తాగి, కల్తీ మద్యం సేవించి, చివరికి శానిటైజర్లు తాగి ప్రజలు చనిపోతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందని అయన మండిపడ్డారు. గత సంవత్సర కాలంలో రాష్ట్రంలో మద్యం ధరలు ఏకంగా 300 శాతానికిపైగా పెంచడమే కాకుండా నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం రవాణా పెరిగిపోయిందని, చివరికి గడ్డివాముల్లో, మొక్కజొన్న తోపుల్లో, లారీల్లో ఎక్కడ చూసినా అక్రమ మద్యం నిల్వలే ఉన్నాయని అయన విమర్శించారు. వైసిపి పార్టీ కార్యకర్తలే మొబైల్ బెల్ట్ షాపులుగా మారిపోయారని కొన్ని వందల ద్విచక్ర వాహనాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా మీడియాలో కథనాలు చూశామని అయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా తయారీ యధేచ్చగా సాగుతోందని, సారా అమ్మే వారిదే రాజ్యంగా మారిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్ ధ్వజమెత్తారని చంద్రబాబు అన్నారు. లిక్కర్ మాఫియా అరాచకాలపై కఠిన చర్యలు చేపట్టాలని... కురిచేడు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మా ఎంపీ సుజనా వ్యాఖ్యలు పార్టీ విధానానికి విరుద్ధం.. స్పష్టం చేసిన ఏపీ బీజేపీ

ఏపీలో రాజధాని రగడ మాములుగా లేదు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు గవర్నర్ కు పంపగా మరో పక్క మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ ఆ బిల్లులను ఆమోదించవద్దని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐతే రెండు రోజుల క్రితం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ రాజధాని పై మా స్టాండ్ అదే అని చెప్పడం జరిగింది. నిన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మీడియ సమావేశం నిర్వహించి అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఐతే తాజాగా ఏపీలో మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ప్రజలకు మరింత స్పష్టంగా చెపుతూ ఇపుడు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో సుజనా వ్యాఖ్యల పై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. "రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్న బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి వ్యాఖ్య పార్టీ అభిప్రాయం కాదు. ఐతే రాజధాని అమరావతి లోనే కొనసాగాలి అనేది మా అభిమతం.. కానీ ఈ విషయం మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోమువీర్రాజు గారు స్పష్టం చేశారు" అని పేర్కొంది.

సీఎం జగన్ కూతురు చదివే చోటా అదే తీరు.. ఇప్పటికైనా ఆయన మారాలి

జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా రాష్ట్రంలో ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే విద్యా బోధన కొనసాగించాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. సీఎం వైఎస్ జగన్‌ ను కోరారు. ప్రాథమిక విద్యను ఆంగ్ల భాషలో నిర్బంధంగా బోధించాలని సీఎం నిర్ణయించడం సమంజసం కాదని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతోనైనా సీఎం తీరు మారాలన్నారు.  ప్రపంచమంతా ఒక దారైతే, నాదో దారి అన్నట్టున్న జగన్‌ వైఖరి మారాలని సూచించారు. ఆంగ్ల భాషలోనే బోధించాలన్న ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ఆయన.. చిన్న రాష్ర్టాలు సైతం మాతృభాషకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయని గుర్తు చేశారు. ''నాకు తెలిసి మన సీఎం వైఎస్ జగన్ లండన్ లో చదువుకున్నట్లున్నారు. ఇప్పుడాయన కూతురు కూడా అక్కడే చదువుతున్నట్లుంది. లండన్ కు 200 కిలోమీటర్ల దూరంలో వేల్స్ అనే ప్రాంతముంది. గ్రేట్ బ్రిటన్ అధికారిక భాష ఇంగ్లీషే అయినప్పటికీ, వేల్స్ ప్రాంతంలో మాతృభాష అయిన 'వేల్ష్' అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం 20 శాతంగా ఉన్న మాతృభాష బోధనను 50 శాతానికి పెంచే ప్రణాళికలు చేశారు. అంత చిన్న కమ్యూనిటీకే సొంత భాషపై అంతగా ప్రేముంటే, గొప్పగా చెప్పుకునే తెలుగు కోసం మనము ఇంకెన్ని ప్రయత్నాలు చేయాలి? అయినా, యునెస్కో దగ్గర్నుంచి దేశాదేశాలన్నీ మాతృభాషకు ప్రాధాన్యం ఇస్తుంటే, మన సీఎం మాత్రం 151 సీట్లు వచ్చాయి కదాని ఇష్టమొచ్చినట్లు వెళతానంటే కుదురుతుందా?'' అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష చైనీయులు మాట్లాడే మాండరిన్ అని, రెండో స్థానంలో స్పానిషన్ ఉందని, ఆ తర్వాతి స్థానంలో ఇంగ్లీష్, హిందీ వస్తాయని, కేవలం ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధనతోనే అన్నీ లభిస్తాయని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని ఎంపీ అన్నారు. మన భాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. మాతృభాష గురించి మాట్లాడేవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదువుతున్నారని, సీఎం జగన్ ఎదురు ప్రశ్నలు వేయడం మానుకోవాలని సూచించారు. ఎల్లాప్రగడ సుబ్బారావు, సీవీ రామన్ సహా గొప్ప గొప్ప వాళ్లంతా మాతృభాషలోనే చదువుకున్నారని, ఏపీ కంటే అభివృద్ధిలో ఎంతో మందున్న జపాన్, చైనా, కొరియాలోనూ మాతృభాషలోనే బోధన సాగుతుందని, ఇవన్నీ తెలిసి కూడా జగన్ తప్పుడు విధానాలను అనుసరించడం, ఏకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుండం శోచనీయమని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి బహిష్కరించే దిశగా తనకు జారీ చేసిన నోటీసులు, తనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇచ్చిన ఫిర్యాదులోనూ భాషకు సంబంధించిన అంశమే ప్రధానంగా ఉందని ఎంపీ గుర్తుచేశారు. ఏపీ సర్కారు తలపెట్టిన ఇంగ్లీషు మీడియంపై వ్యతిరేకంగా మాట్లాడినందుకే నోటీసులు ఇచ్చారని అన్నారు. మాతృభాషను విస్మరించడం రాజ్యాంగ విరుద్ధమన్న తన వాదన ఎంత సరైందో.. నూతన విద్యావిధానం ఆమోదంతోనే అర్థమవుతున్నదని, ఆ లెక్కన పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసులు కూడా రాజ్యాంగ విరుద్ధమైనవిగానే భావించాలని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

రాఫెల్ రఫ్పాడిస్తే

రాఫెల్, జె 20, ఎఫ్ 16 దేని సామర్ధ్యం ఎంత 28 జూలై 1914 మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన రోజు. సరిగ్గా అదే రోజు మరో యుద్ధానికి సిద్ధం అంటూ రాఫెల్ ఫైటర్ జెట్స్ గగనతలంలో భారత్ దిశగా దూసుకువచ్చాయి. యుద్దం అంటేనే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం. ఈ సారి యుద్ధం అంటూ వస్తే అది మూడో ప్రపంచయుద్దమే అవుతుందని అంతర్జాతీయ వ్యవహారాల పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు భారత్ అమ్ములపొదిలో చేరిన రాఫెల్ తో చైనాను గెలవడం సాధ్యమా అంటూ విమర్శిస్తున్నారు. అయితే తన సైన్యాన్ని సరిహద్దుల వెంట మోహరించడంతోపాటు పాకిస్తాన్ ను కూడా ఉసికొల్పుతోంది డ్రాగన్ కంట్రి. ఈ రెండు దేశాల వెన్నులో రాఫెల్ వణుకు పుట్టించిన సంగతి వాస్తవమే అయినా అది ఒప్పుకోవడానికి, ఆ దేశాలకు, వాటికి వత్తాసు పలికే మరికొందరికీ సాధ్యం కావడం లేదు. మరి యుద్ధం అంటూ వస్తే మన వైమానిక దళంలో చేరిన రాఫెల్ జెట్ ను ధీటుగా ఎదుర్కోగల యుద్ధ విమానాలు చైనాతో, పాక్ తో ఉన్నాయా వారి వద్ద ఉన్న అత్యంత ఆధునిక యుద్ధ విమానాల గురించి తెలుసుకుంటూ రాఫెల్ తో వాటిని పోల్చిచూస్తే మన సత్తా ఎంటో స్పష్టమవుతుంది. రాఫెల్ వచ్చిన తరువాత, భారత వైమానిక దళం బలం అమాంతం పెరుగుతుందని, పాకిస్తాన్ ఎఫ్ -16 , చైనా జె -11 కన్నా రాఫెల్ మరింత శక్తి వంతమైనదని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా, పాకిస్తాన్ కలిసి యుద్ధానికి వచ్చినా మన రాఫెల్ ను ఎదిరించే సత్తా వారికి లేదని నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసిన రాఫల్ ఒకేసారి 8 శత్రు స్థావరాలపై నిఘా ఉంచగలదు. అంతేకాదు శత్రు స్థావరాలను కనిపెట్టి  వాటిపై దాడి చేసి నామరూపాలు లేకుండా చేస్తుంది. అమెరికా నుంచి పాకిస్తాన్‌ గతంలో కొనుగోలు చేసిన ఎఫ్ 16 యుద్ధ విమానాలు రెండు ఒక రాఫెల్ కు సమానమని ఒక అంచనా. ఈ మూడు యుద్ధ విమానాల గురించి తెలుసుకుంటే యుద్ధంమంటూ వస్తే  ఎవరిది పై చేయి అవుతుందో స్పష్టంగా తెలుస్తుంది. రాఫెల్ ఫ్రాన్స్ తయారు చేసిన యుద్ద విమానం. ట్విన్ ఇంజన్, 4.5 జనరేషన్, స్పీడ్ 2130, సర్వీస్ సీలింగ్ 15,235 మీటర్లు, అత్యంత ఆధునిక రాడార్ వ్యవస్థ ఇందులో ఏర్పాటు చేశారు. శత్రు కదలికలను ట్రాక్ చేస్తూ, వాటిని ట్రేస్ చేయడంతో పాటు నాశనం చేయడంలో అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. రాఫెల్ నిర్మాణ ఖర్చులో 30శాతం రాడార్ వ్యవస్థ, కమ్యూనికేషన్ వ్యవస్థ కోసమే ఖర్చు చేశారు. ఈ ఫైటర్ జెట్ లో సాంకేతిక వ్యవస్థ అత్యంత ఆధునికం. 360 యాంగిల్స్ లో శత్రు కదలికలపై కన్నేసి ఉంచుతుంది. రెండు మిస్సైల్స్ ను 150,200 మీటర్ల లక్ష్యంతో ప్రయోగించగలదు. 33ఎంఎం కానోన్ తో 125రౌండ్స్ ఆయుధాలను ప్రయోగిస్తుంది. మిస్సైల్స్ ను  4220రేంజ్ లక్ష్యాన్నిఛేదిస్తుంది. అన్నింటికి మించి ఇది మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్.   ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్, ఎయిర్ టూ సర్పెస్ పైకి ఆయుధాలను ప్రయోగిస్తుంది. ఆత్మరక్షణ వ్యవస్థతో పనిచేసే సెన్సార్ టెక్నాలజీ ఇందులో ఏర్పాటుచేశారు.  చెంగ్డూ జె-20 చైనాతయారు చేసిన యుద్ధ విమానం. అధికారికంగా చైనా ప్రకటించకపోయినా ఈ విమానం అమెరికా ఎఫ్ 22 నుంచి ఇన్ స్పైర్ అయి తయారు చేసినట్లు అంచనా. 5జెనరేషన్ అని చైనా చెబుతోంది. సింగిల్ ఇంజన్, స్పీడ్ 2,223,  సర్నీస్ సీలింగ్ 20వేల మీటర్లు, చాలా శక్తివంతమైన రాడార్ వ్యవస్థ ఇందులో ఉందని చైనా చెపుతున్నా అందుకు ఎలాంటి ఆధారాలు మాత్రం లేవు. అయితే చైనా శాటిలైట్స్ ద్వారా వచ్చే సిగ్నల్స్  ఆధారంగా పైలెట్ ముందుకు వెళ్తారట.   ఎఫ్ 16 అమెరికా నుంచి గతంలోనే పాకిస్తాన్ ఈ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసింది. సింగిల్ ఇంజన్, స్పీడ్ 1500, సర్వీస్ సీలింగ్ 15,240 మీటర్లు, 20 ఎంఎం కానున్,  మిస్సైల్ 3700రేంజ్ లో మాత్రమే స్ట్రైక్ గా ప్రయోగించగలుగుతాయి.  చైనా తయారు చేసిన చెంగ్డూ జె 20 యుద్ధ విమానం ఫిత్త్  జెనరేషన్ అని చెప్తున్నా అందుకు సంబంధించిన వాస్తవాలు బయటకు రాలేదు. అయితే ఇటీవల లాసా వద్ద జె 20ని సుఖాయ్ 30 ట్రాక్ చేసిందని సమాచారం. ఒకవేళ చైనా అమెరికా తయారు చేసిన ఫిత్త్ జెనరేషన్ ఎఫ్ 22 ఇన్సిరేషన్ గా తీసుకుని తయారు చేసింది వాస్తవమే అయితే రాఫెల్ చేతికి చిక్కాల్సిందే. గతంలో ఎఫ్ 22ను రాఫెల్ జెట్ ఫ్లైట్ పిక్ చేయగలిగిందని పరిశోధకులు చెబుతారు. ఇక ఎఫ్ 16 విషయానికి వస్తే పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో బాలాకోట్ వద్ద జరిగిన సంఘటనలో ఎఫ్ 16ను భారత వైమానిక దళం లోని మిగ్ 21 కూల్చివేసిందని అనధికార సమాచారం. అరవై ఏండ్ల కిందట తయారైన మిగ్ 21 దాడిలో నేలకొరిగిన ఎఫ్ 16 రాఫెల్ రఫ్పాడిస్తే తట్టుకుంటుందా.. అన్నింటి కన్నా మరో ముఖ్యమైన విషయం గతంలో జరిగిన ఎన్నో యుద్ధాల్లో రాఫెల్ తన సత్తా నిరూపించుకుంది. ఘనమైన పోరాట చరిత్ర రాఫెల్ సొంతం. గత దశాబ్దకాలంలో ప్రపంచవ్యాప్తంగా రాఫెల్ కు తిరుగులేదు. భారత్ చైనా, పాక్ సరిహద్దుల్లో యుద్ధం అంటూ వస్తే శత్రు దేశాలకు కఠినమైన గుణపాఠం చెప్పాలన్న భారత్ ఆశ రాఫెల్ ద్వారా తీరుతుందని ఆశిద్దాం.

మూడు రాజధానుల విషయంలో మేము కలగచేసుకోము: సోము వీర్రాజు

రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు సుజనా వాదనతో విభేదించారు. గతంలో ఏపీ రాజధాని అమరావతి విషయంలో అప్పటి సీఎం చంద్రబాబు హామీలపై కేంద్రం జోక్యం చేసుకోలేదని, అలాగే ఇప్పుడు మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అదే సమయంలో, రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతినే రాజధానిగా కోరుకుంటోందన్నారు. ఏపీ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన సోము వీర్రాజును బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్, ఎంపీ జీవీఎల్ నరసింహారావు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ లాగా తమది కుటుంబ పార్టీ కాదని, బీజేపీ సకల జనుల పార్టీ అని అన్నారు. అంతే కాకుండా వైసీపీ, టీడీపీ రెండూ బీజేపీ తమకు చాలా దగ్గరేనని ప్రచారం చేసుకుంటున్నాయని అయితే ఆ రెండు పార్టీలను తాము సమానంగానే చూస్తామని తెలిపారు. తమ పార్టీ జనసేనతో కలిసి అధికారం దిశగా ముందుకు సాగుతుందన్నారు. ఇళ్ల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని అయన ఆరోపించారు. మొత్తానికి ఒక పక్క సుజనా వచ్చి రాజధాని కేంద్రం పరిధిలోని అంశం అంటే మరో పక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు అబ్బే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అంటున్నారు. దీంతో ఈ అంశం పై బీజేపీ స్టాండ్ ఏంటో తెలియక రాష్ట్ర ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది.

దిగి వచ్చిన జగన్ సర్కార్... ఏపీ ఎన్నికల కమిషనర్ గా మళ్ళీ నిమ్మగడ్డ

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా డాక్టర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తిరిగి నియమించింది. గత అర్ధరాత్రి ఈ మేరకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ప్రకటన జారీ అయింది. నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, అయన నియామకం సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ మొన్న మార్చ్ లో కరోనా మహమ్మారి కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్ నిమ్మగడ్డ పదవీ కాలాన్ని కుదించి అయన స్థానం లో జస్టిస్ కనగరాజ్ ను నియమించిన విషయం తెలిసిందే. ఐతే దీనికి వ్యతిరేకంగా నిమ్మగడ్డ హైకోర్టుకు వెళ్లగా ఆయనను తిరిగి నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు పై జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్టే ఇవ్వడానికి మూడు సార్లు నిరాకరించింది. ఈ లోగా హైకోర్టులో నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయగా గవర్నర్ ను కలిసి తమ ఆదేశాల గురించి వివరించాలని నిమ్మగడ్డను ఆదేశించి కేసును ఈ రోజు అంటే 31 వ తేదీ శుక్రవారానికి వాయిదా వేసింది. అదే సమయంలో ఈ కేసు పూర్తి వివరాలు తమకు తెలుసని అసలు గవర్నర్ జోక్యం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదా అని సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. దీంతో బహుశా అన్ని దారులు మూసుకు పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు.

అనిల్ అంబానీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న యస్ బ్యాంక్

ఒక పక్క ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల లిస్ట్ లో స్థానం సంపాదించగా మరో పక్క అతని సోదరుడైన అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకు పోయాడు. తాజాగా తనకు బాకీ ఉన్న అప్పును తిరిగి చెల్లించక పోవడంతో యస్ బ్యాంక్ ముంబైలోని అనిల్ అంబానీ ఆఫీసును స్వాధీనం చేసుకుంది. దీంతో పాటు ముంబైలోని మరో రెండు ఫ్లాట్ లను కూడా స్వాధీనం చేసుకుంటున్నట్లు గా యస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రిలయన్స్ ఇన్ఫ్రా సంస్థ తమ కు బాకీ ఉన్న 2,893 కోట్ల బకాయిని చెల్లించాలని మొన్న మేలో నోటీసు ఇచ్చి తాజాగా అనిల్ అంబానీకి చెందిన ఈ మూడు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. మరో ముఖ్య విషయం ఏంటంటే యస్ బ్యాంక్ దివాలా తీయడానికి  ఇటువంటి లోన్ లే కారణమని తెలుస్తోంది.

ఏపీలో వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. వరుసగా రెండో రోజు పది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిల్స్ ను పరీక్షించగా.. 10,167 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. తూర్పు గోదావరి, కర్నూలు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,557 కి చేరగా, మరణాల సంఖ్య 1,281 కి చేరింది. ఇప్పటివరకు 60,024 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 69,252 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,90,077 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.