సోకిన వారికే మళ్లీ! కరోనా కొత్త రూపంతో డేంజర్
posted on Dec 22, 2020 @ 11:48AM
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కొత్త రూపంలో మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారిని ఎదుర్కొనేందుకు టీకాలు వచ్చాయని సంతోషించేలోగానే కొత్త రూపంలో కరోనా దాడి చేయడం కలకలం సృష్టిస్తోంది. దక్షిణ లండన్లో గత అక్టోబర్లో బయటపడిన ఈ కొత్త కరోనా వైరస్.. డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తోంది. యూరప్లోని పలు దేశాలతో పాటు దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి.
బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు సంఖ్య కేవలం రెండు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిపోయాయి. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా, 21వ తేదీన 33,364 కేసులు నమోదయ్యాయి. గత రూపాల కన్నా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాపించగలదని అంచనా. అయితే వేరియంట్ వైరస్ కలిగించే వ్యాధి తీవ్రతలో పెద్దగా మార్పులేదని నిపుణులు చెబుతున్నారు.కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జనాభాలో 60 శాతం పైగా వ్యాక్సిన్ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు.
దక్షిణ లండన్లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికీ ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా హెచ్చరించారు. అమెరికా తర్వాత అత్యధిక సంఖ్యలో కేసులున్న భారత్లోనూ ఈ కొత్త వైరస్ వల్ల కేసులు గణనీయంగా పెరిగే అవకాశముందని ప్పారు. గుండెజబ్బులతో పాటు మధుమేహం వంటి సమస్యలు ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుందని రాకేష్ మిశ్రా. కొత్త వైరస్ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆ వివరాల ఆధారంగానే భారత్లో చర్యలపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు వైరస్లోని పలు భాగాలపై ఏక కాలంలో దాడి చేస్తాయని, అందువల్ల వైరస్లో జన్యుమార్పులు జరిగినా టీకా సామర్థ్యంలో తేడా ఉండదని వివరించారు.