శ్రీవారికి పోస్కో 10 కోట్లు.. దేవుడిపై భక్తా?ఆంధ్రులకు బిస్కెట్టా?

పోస్కో. సౌత్ కొరియన్ కంపెనీ. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో పోస్కో పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పోస్కో పేరు వినిపిస్తేనే మండిపడుతున్నారు జనాలు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కును కొల్లగొట్టే కంపెనీగా పోస్కోపై ఆగ్రహం పెంచుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ తో పాటు పోస్కోకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు.  కొరియన్ కంపెనీకి సడెన్ గా మన తిరుమల వెంకన్న మీద భక్తి పుట్టుకొచ్చింది. శ్రీవారికి భారీ విరాళం ఇచ్చింది. శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు పోస్కో 10 కోట్లు విరాళం అందజేసింది. పోస్కో సంస్థ సీఈవో సంజయ్ పాసి డొనేషన్ కు సంబంధించిన డీడీలను టీటీడీకి అందజేశారు.  పోస్కో కంపెనీ టీటీడీకి భారీ విరాళం ఇవ్వడంపై జనాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. దేవుడికి ఇచ్చిన దానాన్ని ఎవరూ తప్పు బట్టక పోయినా.. సమయం, సందర్భం చర్చకు కారణమవుతోంది. గతంలో ఎన్నడూ లేనిది సడెన్ గా ఇప్పుడే పోస్కో ఈ పని చేయడం ఆసక్తికరంగా మారింది. ఓవైపు పోస్కోకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతున్న సమయంలో పోస్కో సంస్థ శ్రీవారికి 10 కోట్ల భూరీ విరాళం ఇవ్వడం వెనుక కేవలం భక్తి భావమే ఉందా? మరి, ఇంకేదైనా యుక్తి దాగుందా? అంటూ భక్తులు చర్చించుకుంటున్నారు. 

విశాఖ ఉక్కుకు మావోయిస్టుల మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృమవుతోంది. కేంద్ర సర్కార్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఉక్కు కర్మాగారం కార్మికులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ఏపీలోని ప్రధాన పార్టీలన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రోడ్డెక్కాయి. వామపక్షాలు కార్మికులతో నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. తాజాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఉద్యమానికి మావోయిస్టులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ మేరకు మావోయిస్ట్  ఏవోబీ జోనల్ కమిటీ కార్యదర్శి కైలాసం పేరుతో లేఖ విడుదలైంది. ఉక్కు పరిశ్రమని అందరం ఐక్యంగా ఉద్యమించి కాపాడుకుంటేనే 32మంది త్యాగానికి నివాళి తెలిపారు. బీజేపీ, వైసీపీ వేరైనప్పటికి.. వారు అమలు చేసే విధానాలు మాత్రం ఒక్కటే అంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు.  ఉక్కు కర్మాగారానికి విశాఖలో 22వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూముల్లో సగం మేర కర్మాగార నిర్మాణం ఉంది. మిగతా సగం ఖాళీ భూముల్లో విశాఖ ఉక్కు కంపెనీకి పోటీగా మరో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు దక్షిణ కొరియాకు  చెందిన పోస్కో కంపెనీ ముందుకొచ్చింది. అందుకు  కేంద్రం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విడ్డూరం. 2019 అక్టోబర్ లో పోస్కో- రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. 2019 మే 30న జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 21న సీఎం జగన్మోహన్ రెడ్డిని పోస్కో ప్రతినిధులు కలిసినట్టువార్తలొచ్చాయి. దీంతో సీఎం జగన్ డైరెక్షన్ లోనే ఢిల్లీ స్థాయిలో పావులు కదిలాయని అంటున్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ ను వదిలించుకోవాలని ఎప్పటి నుంచో చూస్తోంది కేంద్రం. కుక్కను చంపాలంటే ముందుగా దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలంటారు. అప్పుడిక పని మరింత సులువవుతుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలోనూ అదే జరుగుతోంది. 2019 నాటికి 95 కోట్ల లాభంతో నడుస్తోంది RINL. కరోనా దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా ఉక్కుకు డిమాండ్ తగ్గింది. ఆ ప్రభావం విశాఖ స్టీల్ మీదా పడింది. అన్ని కంపెనీల మాదిరే దీనికీ నష్టాలు తప్పలేదు. ఇది సాకుగా చూపించి మొత్తానికి మొత్తం గంప గుత్తగా అమ్మేయాలని.. రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్ లో కేంద్రం వంద శాతం ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందని అంటున్నారు.   

క్లాస్ రూమ్‌లో టీచర్ల ఫైటింగ్

విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ నేర్పి మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన లెక్చరర్లు విచక్షణ కోల్పోయి తరగతి గదిలోనే ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సమీపములోని కొత్తూరులో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ ఇంగ్లిషు మీడియం గురుకుల జూనియర్‌ కాలేజీలో ఎనిమిది సంవత్సరాలుగా వెంకటేశ్వరరావు పార్ట్‌టైమ్‌ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు అక్కడ పనిచేసే మరి కొంతమంది పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు టెట్‌ పరీక్షలకు హాజరుకాలేదని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ‌ శ్రీనివాసరావు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరో అధ్యాపకుడిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్ వెంకటేశ్వరావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ‌శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కళాశాలలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు శ్రీనివాసరావును వివరణ కోరారు. ఈ నేపథ్యంలో గురువారం ఇద్దరు తరగతి గదిలోనే విద్యార్థుల ముందే ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో గాయాలపాలైన వీరిద్దరిని సహచర లెక్చరర్లు, విద్యార్థులు విడదీసి అనపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చారు. కళాశాలలో విద్య నేర్పాల్సిన గురువులు ఇలా తరగతి గదిలో విద్యార్థుల ముందే కొట్టుకోవడం తో ఇక వీరు క్రమశిక్షణ ఏమి నేర్పుతారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

సొంత అన్నను చంపిన.. ఆస్తి వివాదం..

మంచితనం ఓడింది. అత్యాశే గెలిచింది. ఒకే రక్తం పంచుకుని పుట్టారు. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య వివాదం నడిచింది. తమ్ముడి మూర్ఖత్వం  సొంత అన్న చావుకు బలికోరింది. వారసత్వంగా రావాల్సిన ఆస్తి ని తమ్ముడు ఒక్కడే అనుభవిస్తున్నాడు. పలుమార్లు తనకు వారసత్వంగా రావాలిన భూమి తనకు ఇవ్వమని  అన్న తమ్ముడ్ని అడిగాడు. తమ్ముడి వినలేదు. చివరికి ఆ ఆస్తి వివాదమే అన్న చావుకు కారణమైంది. మృతుడు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేట వాస్తవ్యుడు కృష్ణారెడ్డి. బతుకుదెరువు కోసం అతను ఏపీలోని గుంటూరు జిల్లా చేవెళ్లపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తమ్ముడు కొండల్‌రెడ్డి ఊర్లోనే ఉంటున్నాడు. తండ్రి నర్సింహారెడ్డి తాను కొన్న 10 ఎకరాల్లో రెండెకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. నర్సింహారెడ్డి మృతిచెందిన తర్వాత కొండల్‌రెడ్డి ఒక్కడే ఆ 8 ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకోవడంతో వివాదం మొదలైంది. తనకు రావాల్సిన వాటా 4 ఎకరాలను తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని కొండల్ రెడ్డిని అన్న కృష్ణారెడ్డి కోరాడు. గ్రామపెద్దల ముందు అన్నకు రావాల్సిన వాటా ఇస్తానని ఒప్పుకున్న కొండల్ రెడ్డి ఊరి పెద్దల మాటలను లెక్కచేయకుండా, అన్నదమ్ముల బంధాన్ని మరిచి రాక్షసుడిలా ప్రవర్థించాడు. తన వాటా ఇవ్వాలని అన్న పదేపదే కోరినా  తమ్ముడు మొహం చాటేస్తుండటంతో కృష్ణారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోదరుడి నుంచి ఇక భూమి రాదేమోనన్న ఆందోళనతో చివరికి ఆన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణారెడ్డి చావుకు తమ్ముడు కొండల్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ బంధువులు కొండల్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేశారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో కృష్ణారెడ్డి ఇద్దరు కొడుకులు అనాథలుగా మారారని, ఇప్పటికైనా ఆస్తిని పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

కారులో భారీగా పేలుడు పదార్థాలు! అంబానీ ఇంటి ముందు కలకలం

భారత వ్యాపార దిగ్గజం. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ముంబైలోని ముకేశ్ నివాసం ‘ఆంటీలియా’ ఎదుట స్కార్పియో కారులో.. 20 జిలెటెన్ స్టిక్స్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం పెడ్డర్ రోడ్డులో నిలిపిన కారును గుర్తించిన అంబానీ సెక్యూరిటీ సిబ్బంది.. అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును పరిశీలించిన పోలీసులు బాంబ్ స్క్వాడ్​ను పిలిపించారు. కారులో జిలిటెన్ స్టిక్స్ గుర్తించి డాగ్ స్క్వాడ్​ను కూడా రప్పించారు. కారులో ఎక్క్​ప్లోజివ్ డివైస్ ఏదీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. కారు లోపల కొన్ని నంబర్ ప్లేట్లు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అవి ముకేశ్ అంబానీ సెక్యూరిటీ సిబ్బంది ఉపయోగించే కార్ల నంబర్లతో మ్యాచ్ అయ్యాయని, ఓ లెటర్​ కూడా స్వాధీనం చేసుకున్నామతీ ముంబై పోలీసులు తెలిపారు. కారు ఓనర్ ఎవరనేది ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. గురువారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో రెండు కార్లలో కొందరు వచ్చినట్లు కనిపించింది. స్కార్పియో కారును అక్కడే ఉంచి, ఇన్నోవా కారులో వెళ్లిపోయినట్లు తెలిసింది.ఈ ఘటన ముంబైలో కలకలం రేపింది. 

బెజవాడలో కేశినేనిదే విజయం 

39వ డివిజన్.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. ఇక్కడ అభ్యర్థి విషయం తెలుగు దేశం పార్టీలో కాక రేపింది. ఎంపీ కేశినేని నాని ఒకవైపు. బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలు మరొకవైపు. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాలు చెరో వైపునకు చేరి పార్టీ ప్రతిష్టతో చెడుగుడు ఆడుకుంటున్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో వివాదం సమసిపోయింది. 39వ డివిజన్ అభ్యర్థి ఎంపికలో ఎంపీ కేశినేని నానినే పంతం నెగ్గించుకున్నారు. ఎంపీ బలపరుస్తున్న అభ్యర్థే పోటీలో ఉంటారని టీడీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. విజయవాడ  39వ డివిజన్‌ టీడీపీ అభ్యర్థిగా శివశర్మ పేరును టీడీపీ ఖరారు చేసింది.  ఇదే 39వ డివిజన్‌ నుంచి మాజీ కార్పొరేటర్‌ గుండారపు హరిబాబు కుమార్తె గుండారపు పూజిత కూడా టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.ఈ నేపథ్యంలో ఎంపీ నాని, ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి కార్పొరేటర్‌ టికెట్‌ ఇవ్వడమే కాకుండా, కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం వెంకన్న వర్గీయుల్లో ఆగ్రహానికి కారణమయింది. దీంతో ఎంపీ నానీని గుండారపు హరిబాబు, ఆయన కుమార్తె పూజిత తదితరులు అడ్డుకుని నిలదీశారు. బీసీలమైన తమకు అన్యాయం చేయడం ఎంత వరకు సబబమని ప్రశ్నించారు. పార్టీనే నమ్ముకుని ఎంతో కాలంగా పనిచేస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని కోరారు. నిరసనల నడుమే నాని ప్రారంభోత్సవాన్ని ముగించుకుని వెనుదిరిగారు.  అప్పట్నుంచి 39వ డివిజన్ అభ్యర్థిత్వంపై టీడీపీ వివాదం నెలకొంది. శివశర్మ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేసిందని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాకు  అచ్చెన్నాయుడు చెప్పారు. ఈ డివిజన్‌ అభ్యర్థిపై ఎంపీ కేశినేని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఈ పంచాయతి టీడీపీ అధినేత చంద్రబాబు దాకా వెళ్లింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మాజీమంత్రి అచ్చెనాయుడును  దూతగా పంపారు. ఆ తర్వాత బుద్దా వెంకన్న, నాగుల్ మీరాను చంద్రబాబుతో అచ్చెన్నాయుడు మాట్లాడించారు. వాళ్లు అంగీకరించడంతో ఎంపీ కేశినేని సూచించిన శివశర్మే పోటీలో ఉంటారని టీడీపీ ప్రకటించింది.

వామనరావు కేసులో మరో ట్విస్ట్! 

దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హైకోర్డు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మెన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను... పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడని తెలుస్తోంది. బిట్టు శ్రీనుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నాయి.  హైకోర్టు న్యాయవాది వామనరావు హత్యకు నాలుగు నెలల క్రితమే బిట్టు శీను ప్లాన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావ్ బతికుంటే తమకు ఎప్పుడైనా సమస్యనే అని బిట్టు శీను, మరో నిందితుడు కుంట శీను భావించినట్లు చెబుతున్నారు. బిట్టు శీను చైర్మన్‌గా ఉన్న పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టుపై వామనరావు అనేక కేసులు వేశారు. నాలుగు నెలల క్రితం గుంజపడుగులోనే పాత స్కూల్ బిల్డింగ్ నుంచి శీను గ్యాంగ్ రెక్కీ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.అయితే అప్పుడు వామనరావు వెంట చాలా మంది ఉండటంతో హత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.  అదను కోసం ఎదురు చూస్తున్న నిందితులకు.. ఈనెల 17న వామనరావు ఒంటరిగా దొరకడంతో వామనరావు హత్యకు బిట్టు శీను, కుంట శీను ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వామనరావు హత్య తర్వాత బిట్టు శీనుకు కుంట శీను ఫోన్ చేసినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. వామనరావు దంపతులు చనిపోయారని బిట్టు శీనుకు కుంట శీను సమాచారం అందించాడు. హత్య తర్వాత కుంట శీను అండ్ గ్యాంగ్‌ను మహారాష్ట్రకు వెళ్లిపోమని బిట్టు శ్రీను సలహా ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 

రేవంత్ కి జానా రెడ్డి వార్నింగ్! ఇక జంపింగేనా? 

తెలంగాణ కాంగ్రెస్ లో కోల్డ్ వార్ ముదిరిందా? రేవంత్ రెడ్డిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత , సీఎల్పీ మాజీ నేత జానా రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి. ఎప్పుడు కూల్ గా మాట్లాడే జానా రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో..  పైర్ బ్రాండ్ లీడర్ రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కు ఆయన వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.  సోషల్ మీడియాలో  కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు.. సీనియర్లంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని జానా కామెంట్ చేశారు. కాంగ్రెస్ సంస్కృతికి భిన్నంగా కొందరు వ్యక్తి పూజలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.అటువంటి వాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోవాలని కోరారు జానా రెడ్డి. వ్యక్తుల కోసం కాంగ్రెస్ పార్టీ లేదని.. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకుంటే మంచిదని మంచిదన్నారు. సీనియర్ల మీద సోషల్ మీడియాలో  తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై పీసీసీ చర్యలు తీసుకోకపోతే తాను అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని కూడా  జానా రెడ్డి హెచ్చరించారు.    జానా రెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో  యాక్టివ్గా ఉండేది రేవంత్ రెడ్డి అభిమానులే.  ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేతలను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. సీనియర్ నేతలు తప్పుకొని వెంటనే రేవంత్కు పగ్గాలు అప్పజెప్పాలని.. లేదంటే కాంగ్రెస్ పతనం కావడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. దీంతో జానారెడ్డి స్పందించినట్టు సమాచారం. ఆయన రేవంత్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ పరోక్షంగా ఆయనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.దీంతో జానారెడ్డి వాళ్లకే వార్నింగ్ ఇచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  

ఇది కుప్పం.. ఖబడ్దార్ 

భయపెడితే భయపడడానికి ఇది పుంగనూరు, కడప కాదు. ఇది కుప్పం ఖబడ్దార్. అంటూ సినిమా డైలాగ్ ను మరిపించేలా మాట్లాడారు.  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు. పర్యటనలో భాగంగా  వైసీపీ నేతలను హెచ్చరించారు. నేను ఇలాగే ఆనాడు ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా అంటూ ఏదేవా చేశారు. వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానని కుప్పం పర్యటనలో చంద్రబాబు వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ కుప్పం టీడీపీ నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారు.   చంద్ర బాబు కుప్పంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లాలోని పర్యటిస్తూ గుడుపల్లి మండలం కొడతనపల్లి పంచాయితీలో సర్పంచ్‌గా గెలిచిన వెంకటేష్‌ను అభినందించారు. వైసీపీ నేతల దౌర్జన్యాలకు ఎదురొడ్డి విజయం సాధించడం అభినందనీయమన్నారు. పంచాయితీ ఎన్నికలు దౌర్జన్యాలతో జరిపించారని మండిపడ్డారు. కుప్పంపై కక్ష కట్టి తాము బలపరిచిన అభ్యర్థులను బెదిరింపులు, దాడులు, కేసులు పెట్టి అన్ని విధాలా భయపెట్టారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కుప్పంలో ఏదో సాధించామని విర్రవీగుతున్నారని మండిపడ్డారు. అన్ని గుర్తుపెట్టుకుంటున్నానని, వడ్డీతో కాదు చక్రవడ్డీతో సహా తిరిగిస్తానన్నారు. ఎవరిని వదిలిపెట్టనని చంద్ర బాబు హెచ్చరించారు. నేను ఇలాగే ఆనాడు ఉండి ఉంటే ఈ పుంగనూరు నేత అసలు ఉండేవారా? నేను కక్ష సాధింపు చర్యలు ఎప్పుడు చేయలేదు. ఇంక ఒక్కటిన్నర సంవత్సరమే ఈ ప్రభుత్వం.. తరువాత అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి.. అప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తా.. మీ ఆటలు ఇక్కడ కాదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు అధైర్య పడవద్దని, అండగా ఉంటానని.. తరచు కుప్పం వచ్చి సమస్యలు తెలుసుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు.    

కులం 'సాక్షి'గా.. వార్తల వక్రీకరణే జర్నలిజమా? 

ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన కనుసన్నల్లోని సొంత మీడియా. రెండూ కలిసి రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని కులాల వారీగా విభజించి.. కుతంత్రాలు అమలు చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కే 'కమ్మ' కులం ఆపాదించి విమర్శించిన ఘనత ముఖ్యమంత్రిది. ఆ సమయంలో సీఎం జగన్ మాట్లాడిన తీరును అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకున్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తిపై కులం ముద్ర వేసి అవమానించడమేంటని మండిపడ్డారు. కట్ చేస్తే.. ఆనాడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించినట్టే ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఇంత దానికి కులం పేరుతో అంత పెద్ద అభాండం వేసి అబాసుపాలవడం జగన్ రెడ్డికే చెల్లింది అంటున్నారు. సీఎం తీరుకు తగుదునమ్మా అంటూ సాక్షి మీడియా మరింత ఓవరాక్షన్ చేస్తుంటుందని చెబుతున్నారు. వరుస ఘటనలపై సాక్షిలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. జర్నలిజం విలువలను సాక్షి మీడియా మంట గలుపుతోందని అనిపిస్తోంది.  ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. డిగ్రీ విద్యార్థి అనూషను ప్రేమించిన విష్ణువర్ధన్ రెడ్డి.. ఆమెపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి చంపేశాడు. ఈ హత్య ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. కలకలం రేపిన ఈ వార్తను అన్ని మీడియా హౌజ్ లూ ప్రముఖంగా ప్రస్తావించాయి. సాక్షి పేపర్ లోనూ ఆ న్యూస్ వచ్చింది. కానీ, నిందితుడి పేరులో 'రెడ్డి' ఎగిరిపోయింది. అనూషను చంపింది విష్ణువర్ధన్ అని ఫోటోతో సహా వేశారు. అతను రెడ్డి అనే విషయాన్ని కావాలనే మరుగున పరిచారు. వార్త మొత్తంలో ఎక్కడా రెడ్డి అనే పదం రాకుండా.. అతి జాగ్రత్తగా న్యూస్ రాసుకొచ్చారు.  సాక్షి మీడియా కులం విషయంలో సంయమనం పాటించింది అనుకోడానికి లేదు. ఎందుకంటే.. ఒక 'రెడ్డి' విషయంలోనే ఇలా చేస్తోంది అనేది ఆరోపణ. అదే 'కమ్మ' కులానికి వచ్చే సరికి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టి వార్తలు రాస్తోందని.. ఆ వర్గానికి చెందిన వారు మండిపడుతున్నారు. 'చౌదరి'  పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఆ కులం పేరును బజారుకు ఈడ్చే ప్రయత్నం పని గట్టుకు మరీ చేస్తోందని అంటున్నారు.  రమేశ్ హాస్పిటల్స్. విజయవాడలో చాలా మంచి పేరున్న ప్రముఖ హాస్పిటల్. ఎంతో మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి. కరోనా సమయంలో జరిగిన అగ్రిప్రమాదం ఆ హాస్పిటల్ చరిత్రకు మాయని మచ్చ. ఆ సమయంలో సాక్షి మీడియా రమేశ్ హాస్పిటల్స్ ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతకంటే ఎక్కువే పరువు తీసింది. డాక్టర్ రమేశ్ పేరులో లేని 'చౌదరి'ని బలవంతంగా చేర్చింది. రమేశ్ చౌదరి అంటూ పదే పదే వార్తలు రాస్తూ అగ్నిప్రమాదం ఘటనను కూడా కమ్మ కులానికి ముడిపెట్టే ప్రయత్నం గట్టిగా చేసిందని అంటున్నారు. శవాలతో కుల రాజకీయం చేయడమంటే ఇదేనంటూ అప్పట్లోనే 'సాక్షి'పై విమర్శలు వెల్లువెత్తాయి.  నెగటివ్ వార్తల్లో 'రెడ్డి' ఉంటే ఆ పేరును కట్ చేయడం.. 'కమ్మ' ఉంటే కావాలని మరింతగా ప్రచారం చేయడం 'సాక్షి'కి అలవాటుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదేం దిక్కుమాలిన జర్నలిజం అంటూ అసలైన జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. కులాల పేరుతో విభజించు-పాలించు సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న జగన్ సర్కారు, జగన్ మీడియాపై మండిపడుతున్నారు. 'సాక్షి' పేరెత్తితేనే అసహ్యించుకునే పరిస్థితి వస్తోందని అంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే. రెడ్డి చేస్తే తక్కువ తప్పు. కమ్మ చేస్తే పెద్ద తప్పు అవదు. కులాన్ని బట్టి జడ్జిమెంట్ మారదు. మారకూడదు. ఆంతేగానీ నిందితుడి కులాన్ని బట్టి ఆ నేరాన్ని ఆ మొత్తం కులంపై నెట్టివేసే దరిద్రపుగొట్టు ప్రయత్నం ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. కులం పేరుతో వార్తల ప్రాధాన్యత నిర్ణయించడం సరైంది కాదని.. అది పత్రికా విలువలకు పెను ముప్పు అవుతుందంటున్నారు. ఈ విషయం జగన్ మీడియా గుర్తుంచుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇకనైనా కులం ప్రస్తావనతో వార్తల ప్రయారిటీ మార్చడం మానుకోవాలని నిజమైన జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.  

దుర్గ గుడి ఈఓపై వేటు..

మన కాలుని మనం నరుకుంటాం. దానివల్ల మనకు ప్రాబ్లెమ్ అవుతుందంటే . ఇప్పుడు ఏపీ దేవాదాయ శాఖా మంత్రి మంత్రి వెల్లంపల్లి సీన్ కూడా అలాగే ఉంది. దుర్గ గుడి ఏసీబీ అధికారుల సోదాలో స్వయనా మంత్రి  అనుచరుడి పైన వేటు పడింది. గత కొన్ని రోజులుగా ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దుర్గగుడిలో చేసి అక్రమాలపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ప్రాథమిక నివేదిక ఆధారంగా 15 మంది ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో చర్యలకు దిగింది. గత రెండేళ్లుగా జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలు మోపుతూ మరో నివేదికను ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి పంపారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యల్లో భాగంగా  మంత్రి వెల్లంపల్లి అనుచరుడే ఈవో సురేష్ బాబు పై సస్పెన్షన్ వేటు పడే అవకాశముంది. ఈవో సురేష్ బాబు మంత్రి వెల్లంపల్లి అనుచరుడే.  మంత్రి వెల్లంపల్లి హయాంలోనే ఇంద్రకీలాద్రి గుడిలో అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. 

మర్రికి మరోసారి మోసం! వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు 

ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఏపీలో ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుండగా.. సీఎం జగన్ ఖరారు చేసిన పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఇటీవల మృతిచెందిన తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు ‌కల్యాణచక్రవర్తి, చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు భగీరథరెడ్డిలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ దువ్వాడ శ్రీనివాస్‌, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, హిందూపురం వైసీపీ నేత మహ్మద్‌ ఇక్బాల్‌, విజయవాడకు చెందిన కరీమున్నీసాను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీఎం ఎంపిక చేశారు. ఆరుగురిలో ఇద్దరు ముస్లింలకు అవకాశం కల్పించి అశ్చరపరిచారు జగన్.  ఇటీవల జరిగిన  పంచాయతీ ఎన్నికల సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ వార్తల్లోకి వచ్చారు. ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెనాయుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు సొంతూరు నిమ్మాడలో దువ్వాడ హంగామా చేశారు. నిమ్మాడలో దశాబ్దాలుగా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అవుతుండగా.. ఈ సారి మాత్రం అక్కడ వైసీపీ అభ్యర్థిని పోటీలో పెట్టారు. అది కూడా అచ్చెనాయుడు సమీప బంధువునే బరిలోకి దింపడం సంచలనంగా మారింది. నామినేషన్ సందర్భంగా గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థిని పోటీ చేయవద్దని బెదిరించారంటూ అచ్చెనాయుడుపై కేసు పెట్టి జైలుకు కూడా పంపించారు. నిమ్మాడ ఘటనలో దువ్వాడ శ్రీనివాస్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో నిమ్మాడతో పాటు దాని చుట్ట పక్కల ప్రాంతాల్లోనూ టీడీపీ మంచి విజయాలు సాధించింది. దువ్వాడ ఓవరాక్షన్ వల్లే వైసీపీకి నష్టం జరిగిందనే చర్చ జరిగింది. అయినా దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.  సీ రామచంద్రయ్య గతంలో టీడీపీలో కీలక పదవులు అనుభవించారు. రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అయితే వైసీపీలో చేరిన తర్వాత చంద్రబాబును చాలాసార్లు టార్గెట్ చేశారు రామచంద్రయ్య. అందుకే ఆయనను ఎమ్మెల్సీగా ఖరారు చేశారని తెలుస్తోంది. హిందూపురం వైసీపీ నేత మహ్మద్ ఇక్బాల్ కు మరోసారి అవకాశం కల్పించారు జగన్. గతంలో ఆయనకు పూర్థి కాలం పదవి రాకపోవడంతో మళ్లీ అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు. విజయవాడకు చెందిన కరీమున్నీసాకు ఎమ్మెల్సీ ఇచ్చి అశ్చర్య పరిచారు జగన్. గత సారి కూడా కర్నూల్ కు చెందిన ముస్లిం మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. త్వరలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరగనుంది. విజయవాడలో ముస్లిం ఓటర్లు ఎక్కువ కాబట్టి.. వాళ్ల ఓట్ల కోసమే కరీమున్నీసాను ఎంపిక చేశారని భావిస్తున్నారు.    వైసీపీ ఎమ్మెల్సీ ఎంపికలో మరోసారి కొందరు నేతలకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇస్తానని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించారుజగన్. ఎమ్మెల్సీనే కాదు మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. కాని ఇంతవరకు ఆయనను పట్టించుకోలేదు. ఈసారైనా పదవి వస్తుందని ఆశించిన మర్రి రాజశేఖర్ కు మరోసారి హ్యాండిచ్చారు జగన్ రెడ్డి. మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం గుంటూరు జిల్లాలో చర్చగా మారింది. గుంటూరుకే చెందిన లేళ్ల అప్పిరెడ్డి కూడా ఈసారి తనకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని భావించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు మద్దతుగా ఉన్నారు అప్పిరెడ్డి. గోదావరి జిల్లాకు చెందిన కొయ్య మోషన్ రాజు పేరు వినిపించినా.. ఆయనకు కూడా మరోసారి నిరాశే ఎదురైంది. 

గ్రీన్ కార్డు కి గ్రీన్ సిగ్నల్..

గ్రీన్ కార్డు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.  మాజీ  అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా దేశంలో నిరుద్యోగం ఎక్కువైందని చెబుతూ ఆయన గతేడాది ఈ నిషేధాన్ని అమల్లోకి తీసుకువచ్చానని ట్రంప్ చెప్పారు. ట్రంప్ వాదనను జో బైడెన్ తిరస్కరిస్తూ తాజాగా ఈ నిషేధాన్ని రద్దు చేస్తూ గ్రీన్ కార్డు దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో అనేక కుటుంబాలు తిరిగి కలవలేకపోయాయని బైడెన్ చెప్పారు. అంతేకాకుండా ఈ నిషేధ ప్రభావం దేశంలోని వ్యాపారాలపై కూడా పడిందని బైడెన్ అన్నారు.  

విద్యార్థులకు గుడ్ న్యూస్.. పది పరీక్షలు లేవ్..

మార్చ్ అంటేనే  విద్యార్థుల్లో తెలియని భయం. ఎగ్జామ్స్ రాయాలి పాస్ అవ్వాలని. మార్చ్ లో అందరూ విద్యార్థులు నానా హైరానా పడుతుంటారు. అసలు ఎగ్జామ్ లేకపోతే.. పరీక్షా రాయకుండానే పాస్ అయిపోతే, హాయిగా  ఆనందంగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు కదా. అందుకే స్కూల్ విద్యార్థులకు తమిళనాడు సర్కార్ తీపి కబురు అందించింది. 9,10,11 తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణత చెందినట్టు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎలాంటి పరీక్షలు లేకుండా విద్యార్థులను పాస్‌ చేస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ఎన్నికల వేళ... ప్రభుత్వ ఉద్యోగులకు వరం ప్రకటించారు. పదవీకాలం 60 ఏళ్లు పొడిగిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపారు.

అమ్మాయిలుగా మారిన అబ్బాయిలు..

వారిద్దరూ అబ్బాయిలుగా పుట్టారు. అబ్బాయిలు గానే పెరిగారు. కానీ వాళ్ళు ఏ రోజు అబ్బాయిలమని అనుకోలేదు. అందుకే అమ్మాయిలుగా మారిపోదామనుకున్నారు. తాత డబ్బు సాయం. అమ్మ మాట సహాయం చేస్తూ ప్రోత్సహించడంతో అబ్బాయిల్లా పుట్టిన ఆ ఇద్దరు కవలలు అమ్మాయిల్లా మారిపోయారు. ఈ ఘటన బ్రెజిల్ లోని మైనాస్ జెరాయిస్ అనే రాష్ట్రంలో ఉన్న తపీరాలో జరిగింది. ఆ ఇద్దరి పేర్లు మేలా రిజండా, సోఫియా అల్బుకర్క్. మేలా అర్జెంటీనాలో డాక్టర్ చదువుతుంటే.. సోఫియా సావో పాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ మధ్యే బ్లూమినాలోని ట్రాన్స్ జెండర్ సెంటర్ బ్రెజిల్ అనే ఆస్పత్రిలో వారు ఆపరేషన్ చేయించుకుని ఆడవారిగా మారారు. అయితే, ఇప్పటిదాకా కవలలు ఇలా ఒకేసారి లింగ మార్పిడి  చేయించుకోవడం ఎక్కడా చూడలేదని, ఇదే మొదటిసారి అని వారికి ఆపరేషన్ చేసిన డాక్టర్ జోస్ కార్లోస్ మార్టిన్స్ తెలిపారు. కాగా, ఆపరేషన్ కు 20 వేల డాలర్లు ఖర్చు కాగా.. వారి తాత ఆ మొత్తం చెల్లించాడు. ఆడవాళ్లలా మారిన తన బిడ్డలను చూసుకుని మారా లూసియా డ సిల్వ ఆనందం వ్యక్తం చేశారు.

సొమ్ము మనది.. సోకు ఫాస్ట్ ట్యాగ్ దా? 2వేల కోట్ల దందా..!

ఫాస్ట్ ట్యాగ్. ఫిబ్రవరి 15 నుంచి దేశవ్యాప్తంగా ఇది కంపల్సరీ. టోల్ గేట్ల దగ్గర రద్దీ నివారించడం, వాహనాలు వేచి ఉండు సమయం తగ్గించడం, తద్వారా ఇంధన పొదుపు, ఆన్ లైన్ మనీ ట్రాన్జాక్షన్స్  పెంచడం ఫాస్ట్ ట్యాగ్ ముఖ్య ఉద్దేశం. పైపైన చూస్తే.. ఇది అద్భుతమైన విధానం. అయితే.. ఇందులో కనిపించని ఆసక్తికర కోణముంది. ఫాస్ట్ ట్యాగ్ తో వేల కోట్ల నగదు గారడీ నడుస్తోంది.  టోల్ గేట్ దాటాలంటే ఫాస్ట్ ట్యాగ్ ఉండాల్సిందే. ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ (NHAI ప్రీపెయిడ్ వాలెట్) కానీ, ఫాస్ట్ ట్యాగ్ కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్లో గానీ ఎప్పుడూ బ్యాలెన్స్ మెయిన్ టెన్ చేయాల్సిందే. ఇక్కడే ఉంది పైకి కనిపించని తిరకాసు.  దేశవ్యాప్తంగా 720కి పైగా టోల్ గేట్లలో ఫాస్ట్ ట్యాగ్ విధానం అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకూ 2 కోట్లకు పైగా ఫాస్ట్ ట్యాగ్ లు కొనుగోలు చేశారు వాహనదారులు. కేంద్రం మాటల్లో ఫాస్ట్ ట్యాగ్ ఫ్రీ అయినా.. రియాల్టీలో ఒక్కో ఫాస్ట్ ట్యాగ్ కు 100 నుంచి 200 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఇప్పటి వరకూ అమ్ముడైన 2 కోట్ల పై చిలుకు ఫాస్ట్ ట్యాగులతో 200 నుంచి 400 కోట్ల వరకూ ఆదాయం సమకూరింది. ఇదంతా బ్యాంకులకు, అటునుంచి ప్రభుత్వానికి చేరినట్టేగా. టోల్ దాటాలంటే.. నిర్ణీత రుసుము చెల్లించాల్సిందే. 20 రూపాయల నుంచి 200 వరకూ వసూలు ఛార్జి చేసే టోల్ లు దేశంలో ఎన్నో. టోల్ గేట్ కు వెహికిల్ చేరుకోగానే ఫాస్ట్ ట్యాగ్ నుంచి ఆటోమెటిక్ గా అమౌంట్ కట్ అవుతుంది. అంటే, ఫాస్ట్ ట్యాగ్ లో ఎప్పుడూ నియమిత మొత్తం ఉండాల్సిందే. కొందరు ఫాస్ట్ ట్యాగ్ వాలెట్ లో డబ్బులు వేస్తుంటే.. మరికొందరు బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేస్తున్నారు. ఏ విధానం ఫాలో అయినా.. టోల్ ఫీజు కోసం ఎల్లప్పుడూ ఫాస్ట్ ట్యాగ్ కు నగదు అందుబాటులో ఉంచాల్సిందే. కొత్త టోల్ గేట్లలో సుమారు 100 రూపాయలు ఫీజు ఉంటోంది. రిటర్న్ జర్నీ కూడా ఉంటే మినిమం 200 కట్టాలి. అందుకే, ఫాస్ట్ ట్యాగ్ రీచార్జ్ చేసుకునే వారంతా అకౌంట్లో సుమారు వెయ్యి రూపాయలు ఎప్పుడూ ఉంచుతున్నారు. టోల్ గేట్ నుంచి వెళ్లినా, వెళ్లకుండా ఆ వెయ్యి అలానే ఉంటోంది. ఈ లెక్కన దేశంలో 2 కోట్ల మంది ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులు ఉంటే.. అందులో ఒక్కో అకౌంట్లో సుమారు వెయ్యి రూపాయలు ఉన్నాయని అనుకుంటే.. ఆ మొత్తం ఏకంగా రెండు వేల కోట్లు అవుతోంది. అంటే, ఏకకాలంలో దేశంలో ఫాస్ట్ ట్యాగ్ ల కోసమే రెండు వేల కోట్లు జమ చేయబడి రెడీగా ఉంటున్నాయన్నమాట. అందులో కొంత మొత్తం నేరుగా ఫ్యాస్ట్ ట్యాగ్ వాలెట్ లో ఉంటే.. మిగతా సొమ్ము ఫాస్ట్ ట్యాగ్ కు లింక్ చేయబడిన బ్యాంక్ అకౌంట్లో ఉంటోంది. ముందస్తు నగదు నిల్వతో.. ఇటు కేంద్రం, అటు బ్యాంకులు 2వేల కోట్లను ఎంజాయ్ చేస్తున్నట్టేగా? ఫాస్ట్ ట్యాగ్ పేరుతో ఉత్తి పుణ్యానికే దేశంలో వేల కోట్ల నగదు కేంద్రానికి, బ్యాంకులకు అందుబాటులోకి వచ్చినట్టేగా? అంటే, సొమ్ము మనది.. సోకు ఫాస్ట్ ట్యాగ్ దా?

ఖమ్మం నుంచి షర్మిల పోటీ! 

తెలంగాణలో జగనన్న బాణం దూసుకుపోతోంది. కొత్త పార్టీ ఏర్పాట్లతో రాజకీయ కాక రాజేసింది. కొన్ని రోజులుగా లోటస్ పాండ్ లో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు షర్మిల. పార్టీ విదివిధానాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలు సాగిస్తున్నారు. త్వరలోనే షర్మిల జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆమె చర్చలు జరిపారు. మార్చిలో ఖమ్మం వెళ్లనున్న షర్మిల.. అక్కడ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  కొత్త పార్టీ ఏర్పాట్లు జరుగుతుండగానే షర్మిలపై కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం నుంచే షర్మిల బరిలోకి దిగుతారని చెబుతున్నారు. అందుకే ఆమె అక్కడే తొలి సభకు ప్లాన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనీల్ కుమార్ ఖమ్మం జిల్లాకు చెందిన వారు. దీంతో  ఖమ్మం కోడలిగా తెలంగాణలో రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాంతాన్ని షర్మిల ఎంచుకున్నట్లు సమాచారం.తనపై , తన పార్టీపై వస్తున్న విమర్శలకు ఇటీవల కౌంటరిచ్చిన షర్మిల.. తాను తెలంగాణ కోడలినని, తనకు ఇక్కడ పార్టీ పెట్టే హక్కు ఉందని స్పష్టం చేశారు. దీంకో తన భర్త జిల్లా అయిన ఖమ్మం నుంచి ఆమె పోటీ చేయడం ఖాయమంటున్నారు.  ఖమ్మం జిల్లానే షర్మిల ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ హవా సాగినా..  ఉమ్మడి జిల్లాలో మాత్రం ఖమ్మం ఎంపీ స్థానంతో పాటు వైరా, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మిగతా నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపించగలిగింది. ఇప్పుడు కూడా ఆ అభిమానమే తనను నడిపిస్తోందని షర్మిల విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆంధ్రా ప్రాంత ప్రజలు కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉంటారు.ఇది కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్న షర్మిల.. ఖమ్మం నుంచి పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయించుకున్నారని చెబుతున్నారు.  ఉమ్మడి ఖమ్మం నేతలతో షర్మిల ఇప్పటికే చాలా సార్లు మాట్లాడిందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం  ఖమ్మంలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసే ఆలోచన ఉండడంతో ఆ నేతలతో షర్మిల సమావేశం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం నుంచే జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆమెను కలిసిన వారు చెబుతున్నారు. ఈ సభతో ప్రజాబలాన్ని చూపించేందుకు సన్నిహితులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఖమ్మం నుంచే షర్మిల కార్యాచరణ ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత కొండా రాఘవ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఖమ్మం కోడలంటూ చెప్పారు

జీతాలకు డబ్బుల్లేవ్.. ఏకగ్రీవాలకు 100 కోట్లా?

మూలిగే నక్కపై తాటి పండు పడింది అంటే ఇదే. ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మరో భారం పడింది. జగన్ సర్కార్ నిర్ణయం ఫలితంగా రాష్ట్రం మరిన్ని ఆర్ఠిక కష్టాల్లో పడనుంది. ఇటీవలజరిగిన పంచాయతీ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న అధికార పార్టీ.. ప్రజల ఓట్లతో కంటే అడ్డదారుల్లో గెలవాలని ప్లాన్ చేసింది. ఇందు కోసం ఏకగ్రీవాలకు అస్త్రంగా మార్చుకుంది. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు భారీగా నజరానాలు ప్రకటించింది. ఏకగ్రీవాలకు ప్రకటించిన డబ్బులను ముందు పెట్టి.. తమకు అనుకూలంగా పంచాయతీలను కైవసం చేసుకుంది. గతంలోనూ ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా ఉన్నా.. జగన్ సర్కార్ మాత్రం దాన్ని భారీగా పెంచేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్న సంగతి తెలిసీ కూడా.. రాజకీయ ప్రయోజనాల కోసం గతంలో ఉన్నదాని కంటే ఎక్కువగా ప్రకటించింది.  రెండు వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.5 లక్షలు.. 5 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు, 10 వేల లోపు జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.20 లక్షలు ఇస్తామని సర్కార్ ప్రకటించింది.  రాష్ట్రవ్యాప్తంగా 2,197 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈ లెక్కన ఏకగ్రీవమైన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.100 కోట్లకు పైగానే నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా పంచాయతీల జనాభా బట్టి ఏటా సగటున ఒక్కో జిల్లాకు రూ.10 కోట్లకు పైగానే అందుతాయని అంచనా. కడప జిల్లాలో అత్యధికంగా 258 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.20.65 కోట్లు నజరానాగా ఇవ్వాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలో 206 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటికి రూ.12.30 కోట్లు.. కర్నూలు జిల్లాలో 161 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. రూ.11.25 కోట్లు బహుమతిగా అందాల్సి ఉంది.  ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఉద్యోగాల వేతనాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటీకే ఏపీ తన పరిధిని మించి రుణాలు తీసుకుందని కేంద్ర ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. పరిస్థితి ఇంతటి దారుణంగా ఉన్నా.. ఏకగ్రీవ పంచాయతీల పేరుతో మరిన్నిఆర్థిక కష్టాలు తెచ్చుకోవడం ఎందుకనే చర్చ జనాల్లో జరుగుతోంది. జగన్ సర్కార్ తీసుకుంటున్న అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్ర్రం అప్పులమయం అయిందనే ఆరోపణలు ఉన్నాయి.  మరోవైపు పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2020-21కి సంబంధించి ఇప్పటికే మొదటి విడత విడుదల కాగా.. తాజాగా రెండో విడత మౌలిక గ్రాంట్‌ కింద ఆంధ్రప్రదేశ్ కు రూ.656 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది.