అప్పుడు వినబడలేదా.. సిగ్గనిపించలేదా?

‘చెప్పు చూపిస్తూ.. దారుణమైన బూతులు మాట్లాడే నాయకులు మనకు అవసరమా?’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీఎం జగన్ ప్రశ్నించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో నిషేధిత భూముల జాబితా నుంచి షరతు గల పట్టా భూముల తొలగింపు కార్యక్రమం ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన జగన్ ‘వీధి రౌడీలు కూడా అలా మాట్లాడతారో లేదో నాకు తెలీదు. నాయకులుగా చెప్పకుంటున్న వారు  బహిరంగంగా చెప్పులు చూపిస్తూ.. దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇలాంటి వారు నాయకులా?’ అంటూ జగన్ తెగ బాధపడిపోయారు. ‘దత్తపుత్రుడితో దత్త తండ్రి ఏమేం మాట్లాడిస్తున్నారో అంతా చూస్తున్నాం. మూడు రాజధానులతో అందరికీ మేలు కలుగుతుందని మనం చెబుతుంటే.. మూడు పెళ్లిళ్లతో అభివృద్ధి జరుగుతుంది.. మీరూ చేసుకోండని నాయకులుగా చెప్పుకుంటున్న వారు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడితే మహిళల పరిస్థితి ఏంటి? ఒక్కొక్కరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా? దీనిపై ప్రజలంతా ఆలోచించాలి’ అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడి పేర్లు నేరుగా ప్రస్తావించకుండా జగన్ విమర్శలు గుప్పించారు. వారి తీరు పట్ల ఆవేదన ఒలకబోశారు. ఇలాంటి నాయకుల్ని చూసి విరక్తి కలుగుతోందని నిర్వేదం వ్యక్తం చేశారు. నిజమే.. ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా’ అన్నట్లు.. ఈ బూతుల పంచాంగం ముందుగా మొదలెట్టింది ఎవరు మహాశయా..? అంటూ జనం జగన్ ను నిలదీస్తున్నారు.  జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా పని చేసిన కొడాలి నాని అన్నేసి బూతులు మాట్లాడి.. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నప్పుడు మీకు ఆయన బూతులు వినిపించలేదా  జగన్ రెడ్డీ అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. చెప్పు చూపించినందుకు.. వైసీపీ కొడకల్లారా? అన్నందుకే జగన్ కు అంతటి నొప్పి కలిగితే. . కొడాలి నాని నోటికి ఎంత మాట వస్తే.. అంత మాట అనేసినప్పుడు మీకు చెవులు పనిచేయలేదా? కళ్లు కనిపించలేదా? అప్పుడెందుకు ఇంత నొప్పి, ఆవేదన కలగలేదని నిలదీస్తున్నారు. కొడాలి మాట్లాడితే.. రైటు.. పవన్ నోట వస్తే బూతుగా అయ్యిందా? అంటున్నారు. ఆనాడు.. ఏకంగా నిండు అసెంబ్లీలోనే.. మీ పార్టీ ఎమ్మెల్యే రోజా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ‘కామ సీఎం’ అంటే సభలోనే ఉండి ముసిముసి నవ్వులు నవ్వినప్పుడు బూతుల బాధ మీకు రాలేదేం అని అంటున్నారు. మీ ఎమ్మెల్యే బూతు మాట్లాడితే ఒప్పు.. ఇతరులు అంటే  తప్పు అని ముల్లు గుచ్చుకుందా? అని సూటిగా అడుగుతున్నారు. టీడీపీ బీఫాంపై గెలిచి, మీ పంచన చేరిన వల్లభనేని వంశీ.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడి సతీమణిపై   అసందర్భ ప్రేలాపనలు పేలితే.. కనీసం ఖండించని మీరు ఇప్పుడు కడుపు మండి పవన్ కళ్యాణ్ అన్న మాటల్ని తప్పు పట్టడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు.  ఏం.. తనను ‘ప్యాకేజ్ స్టార్’ అని మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి రోజూ విమర్శలు చేస్తుంటే.. వద్దని వారించకుండా చోద్యం చూసిన మీరు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలతో ఇంతలా బాధపడిపోవడంలో అర్థం ఉందా? అని నిలదీస్తున్నారు. గతంలో విశాఖ శారదాపీఠానికి మీరు వెళ్లినప్పుడు.. తనను లోపలికి పంపించలేదని మీ కేబినెట్ మంత్రి సీదిరి అప్పలరాజు పోలీసులను నోటికొచ్చిన విధంగా  బూతులు తిట్టినప్పుడు మీకు ముల్లు గుచ్చుకోలేదేమని అంటున్నారు. కొడకల్లారా అని పవన్ అంటే ఇంతలా స్పందిస్తున్న మీకు మీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన అధ్యక్షుడ్ని ఉద్దేశిం ‘నిన్నెవరైనా గ్యాంగ్ రేప్ చేశారా?’ అన్నప్పుడు మీ చెవులకు  పని చేయలేదా అని నిలదీస్తున్నారు.  గతంలో మీ కేబినెట్ లో ఉన్నప్పుడు ప్రతిరోజూ మీడియా ముందు చొక్కా మడతపెట్టి, తొడ కొట్టి మరీ ప్రతిపక్ష నేతలపై వీధి రౌడీలా అనుచిత వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్ మాటలు మీకు అనకూడని మాటలు అనిపించలేదా? అంటున్నారు. ఇప్పుడు పవన్ మాటలు వీధి రౌడీలు కూడా మాట్లాడతారో లేదో అనే అనుమానం కలుగుతోందా? జగన్ రెడ్డీ అని నిలదీస్తున్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేత చంద్రబాబు పైన, ఆయన సతీమణిపైన అసెంబ్లీ వేదికగానే మూకుమ్మడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే.. అప్పుడెందుకు మీరు స్పందించలేదని జనం ప్రశ్నిస్తున్నారు. అంతలేసి మాటలు తనను అంటుంటే తీవ్ర మానసిక ఆవేదన చెందిన చంద్రబాబు సభ నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా మీ సభ్యుల మాటలు తప్పు అని ఖండించని మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలపై స్పందించే అర్హత ఎలా ఉంటుంది? అని ప్రశ్నిస్తున్నారు.

జ‌గ‌న్ ఇగో వ‌దులుకో... చంద్ర‌బాబు

అధికారంలో ఉన్న‌వారు ప్ర‌జాస‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోవాలి. ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రిగే విధంగా ప‌థ‌కాలు అమ‌లుచేస్తూ, ప్ర‌జ‌ల ఆద‌రణ‌పొందాలేగాని ప్ర‌జాగ్ర‌హానికి గురికాకూడ‌దు.కానీ చిత్రంగా జ‌గ‌న్‌పాల‌న పూర్తిగా ప్ర‌జావ్య‌తిరేకంగా మారిపోయింది. ఆయ‌న ప్ర‌తీ కార్య‌క్ర‌మాన్ని ప‌థ‌కాన్ని ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. ఆయ‌న పాల‌న ప‌ట్ల విసిగెత్తారు. ఆయ‌నకు ప్ర‌జ‌లు ప్ర‌తీప్రాంతంలోనూ ఎదురుతిరుగుతున్నారు. ఈ ప‌రిస్థితుల‌న్నీ జ‌గ‌న్ స్వ‌యం కృత‌మేన‌నే అభిప్రాయా లే వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌ల మీద ఇగో వీడి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పూనుకోవాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ట్వీట్ కూడా చేశారు.  న‌ర్సీపట్నంలో విద్యార్ధుల పోరాటానికి టీడీపీ అధినేత మద్దతు ప‌లికారు. ముఖ్య‌మంత్రికి ఎలా చెబితే అర్ధ‌మ‌వుతుందో అర్ధంగావ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. చివ‌రికి చిన్న‌పిల్ల‌లు కూడా వంతెన అప్రోచ్ రోడ్డు కోసం నిర‌స‌న బాట‌ప‌ట్టే స్థితికి రాష్ట్రాన్నితీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు. న‌ర్సీప‌ట్నంలో వ‌రాహ న‌దిపై త‌మ ప్ర‌భుత్వం హ‌యాంలోనే వంతెన నిర్మించామ‌ని కానీ జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాత  ఆ అప్రోచ్ రోడ్డు ప‌నులు పూర్తిచేయ‌లేద‌ని అన్నారు. ఈ కార‌ణంగానే మోడ‌ల్ స్కూలు విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు.  విద్యార్ధులు నీళ్ల‌లోకి దిగి మ‌రీ త‌మ క‌ష్టాల‌ను తీర్చాల‌ని వేడుకుంటున్నార‌ని చంద్ర‌బాబు అన్నారు. ఈ ముఖ్య‌మంత్రి త‌న పాల‌న‌లో కొత్త‌గా ఏం క‌ట్ట‌లేర‌ని ్ర‌ప‌తి ఒక్క‌రికీ తెలుసున‌ని క‌నీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాల‌ను పూర్తి చేసినా ప్ర‌జ‌ల‌కు మేలుచేసిన‌వార‌వుతార‌న్నారు.  నీళ్లలో దిగి తమ కష్టం తీర్చాలని వేడుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి తన పాలనలో కొత్తగా ఏం కట్ట లేరని ప్రతి ఒక్కరికి తెలుసు...కనీసం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను పూర్తి చేసినా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’’ అంటూ చంద్రబాబుట్వీట్టర్‌లో పేర్కొన్నారు. 

ఏపీ బీజేపీలో సోము కర్రపెత్తనం.. సీనియర్ల ఆగ్రహం

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కమలదళంలో ఉన్న అసంతృప్తి బయటపడుతోంది. ముఖ్యంగా పార్టీ సీనియర్లు ఆయన కర్రపెత్తనం ఏమిటని భగ్గుమంటున్నాయి.  రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒంటెత్తు పోకడపై.. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు  ఆ పార్టీలోని అసంతృప్తిని బహిర్గతం చేశాయి. కన్నా బయటకు చెప్పారు కానీ, చాలామంది సీనియర్లు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారనడానికి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటమే నిదర్శనమని బీజేపీ శ్రేణులే అంటున్నాయి. కన్నా గళం విప్పడంతో ఇంత కాలం   కోర్‌ కమిటీలో సీనియర్ల నోటికి తాళాలు, ప్రెస్‌మీట్ల అంశంలో అధ్యక్షుడు వీర్రాజు గీసిన లక్ష్మణరేఖ వంటి అంశాలు ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశాలుగా మారాయి. కన్నా వ్యాఖ్యలు ఇప్పటి వరకూ ఏపీ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృత్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమనేలా చేశాయి. జనసేనాని పవన్‌తో సఖ్యత-సమన్వయంలో తమ రాష్ట్ర నాయకత్వం విఫలమయిందంటూ కన్నా  వ్యాఖ్యలతో బీజేపీలో ఒక్కసారిగా సంచలనం సృష్టించాయి.  బీజేపీ-జనసేన పొత్తు కొనసాగాలని కోరుకునే బీజేపీ శ్రేణులు, కన్నా వ్యాఖ్యలకు బహిరంగంగానే మద్దతివ్వడం విశేషం. దీంతో ఏపీ బీజేపీ పరిస్థితులపై అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.  చాలా కాలం నుంచే జనసేనతో సమన్వయం విషయంలో సోము నేతృత్వంలోని ఏపీ బీజేపీ విఫలం అవుతూ వస్తున్నదన్న భావన బీజేపీ క్యాడర్ లో నివురుగప్పిన నిప్పులా ఉన్నది. ఇప్పుడు కన్నా వ్యాఖ్యలతో ఆ నివురు తొలగిపోయినట్లు అయ్యింది.  సోము వైఖరితో విసిగిపోయిన పవన్ ఒక సందర్భంగా   తాను రాష్ట్ర బీజేపీ నేతలతో మాట్లాడనని, ఏమైనా ఉంటే ఢిల్లీ నేతలతోనే మాట్లాడుకుంటానని విస్పష్టంగా చెప్పిన సంగతిని బీజేపీ క్యాడరే ఇప్పుడు గుర్తు చేస్తోంది.  ఏపీ బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు అధికార వైసీపీతో రహస్య స్నేహం కొనసాగిస్తున్నారన్న అనుమానాలు బీజేపీ క్యాడర్ లోనే వ్యక్తమౌతున్నాయి.  

ద‌త్త తండ్రి ద‌త్త‌పుత్రుడితో మాట్లాడిస్తున్నారు...జ‌గ‌న్‌

జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీధిరౌడీలా బూతులు తిడుతూ చెప్పు చూపించ‌డం ఎక్క‌డి సంస్కా రమ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. మూడు రాజ‌ధానులు ప్ర‌జాసంక్షేమాన్ని ఆశించే ప్ర‌తి పాదిం చాన‌ని కానీ ప‌వ‌న్ మూడు పెళ్ళిళ్లు చేసుకోవాల‌ని అన‌డం రాష్ట్రంలో మ‌హిళ‌లు సిగ్గుప‌డుతున్నా ని, ఇటువంటి వ్య‌క్తి రాష్ట్రానికి ఏర‌కంగా ద‌శ దిశా చేస్తార‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.  ఇటీవ‌ల ప‌వ‌న్ వైసీపీపై విరుచుకుప‌డ‌టం, మాట‌ల‌తూటాల‌తో రెచ్చిపోవ‌డం తెలిసిందే. అందుకు స్పందిస్తూ, త‌న‌ను కొట్ట‌డానికి చంద్ర‌బాబు, మీడియా ఏక‌మ‌య్యాయ‌ర‌ని, త‌న‌కు దేవుడు, ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు అండ‌గా ఉన్నార‌న్నారు. ద‌త్త‌పుత్రుడితో ద‌త్త తండ్రి ఏమి మాట్లాడిస్తున్నారో అంద‌రం చూస్తున్నామ‌ని జ‌గ‌న్ అన్నారు.  వెన్నుపోటు దారులంతా కలిసి కూటములు కట్టి  యుద్దం చేస్తామంటున్నారని జ‌గ‌న్ అన్నారు. ఒక్క జగన్ను కొట్టటానికి ఇంత మంది ఏకం అవుతున్నార‌న్నారు. ఇది మంచికి , మోసానికి జరుగుతున్న యుద్దమ‌ని, పేదవాడికి , పచ్చ చొక్కాల పెత్తందారుకు మధ్య యుద్దంగా అభివర్ణించారు. మంచి జరిగిన ప్రతీ ఇంటి నుంచి ప్రతీ ఒక్కరూ తనకు తోడుగా నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. వాళ్లలాగా కుట్రలు,  కుతంత్రాలను నమ్ముకోలేదని సీఎం జ‌గ‌న్ పేర్కొన్నారు.

వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ అఫిడవిట్ లో ఆ ఎంపీ పాత్ర?

మూడేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తులో దూకుడు ప్రదర్శిస్తున్న సీబీఐ అధికారులను నిందితులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని సీబీఐ స్వయంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు డీ. శివశంకర్ రెడ్డిని 2021 నవంబర్ 18న పులివెందులలోని కోర్టులో హాజరుపరిచినప్పుడు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తన అనుచరులతో పాటు కోర్టు గదిలోకి ప్రవేశించి, రిమాండ్ లాంఛనాలు పూర్తిచేస్తున్న సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నార’ని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలపడంతో  వివేకా కేసులో మరో సంచలన విషయం బయటపడినట్లైంది. ఈ హత్య కేసులోని నిందితులు శక్తిమంతులని, సాక్షులను బెదిరిస్తూ విచారణను జాప్యం చేసేందుకు యత్నిస్తున్నారని, అందువల్ల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి,  భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటిషన్ కు స్పందనగా సీబీఐ వేసిన అఫిడవిట్ లో ఈ విషయం స్పష్టం చేసింది. సీబీఐ విచారణ అధికారులను ఎంపీ అవినాశ్ రెడ్డి అడ్డుకున్న వైనాన్ని పూసగుచ్చినట్లుఆ అఫిడవిట్ లో వెల్లడించింది. వివేకా హత్య కేసులోని సాక్షులు, సీబీఐ అధికారులకు ఏపీలో ఎదురవుతున్న బెదిరింపుల దృష్ట్యా అక్కడ విచారణ, దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందనిపించడంలేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది.  అందుకే వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలే చేసేందుకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎం ఎం సుందరేశ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఆ రోజున అవినాశ్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులను వెంటేసుకుని కోర్టు ప్రాంగణంలోకి వచ్చారు. వివేకా హత్య కేసులో ఏ5 శివశంకర్ రెడ్డికి మద్దతు పలికారు. శివశంకర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశావంటూ సీబీఐ దర్యాప్తు అధికారిని ప్రశ్నించారు. అక్కడే శివశంకర్ రెడ్డితో కూడా మాట్లాడారు. సీబీఐ బృందం కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో అవినాశ్ రెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో స్పష్టం చేయడం గమనార్హం. ‘శివశంకర్ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీలో ఉండగా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే అతనిని కడప సెంట్రల్ జైలు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాని గురించి 2021 నవంబర్ 25న పులివెందుల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తీవ్రంగా స్పందించారు.  జైలు అధికారుల తీరును తప్పుపట్టారు’ అని సీబీఐ తన అఫిడవిట్ లో వెల్లడించింది. ‘వివేకా హత్య కేసులో సాక్షి శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోగా.. మరో సాక్షి గంగాధరరెడ్డి కూడా చనిపోయాడు. గంగాధరరెడ్డి మరణాన్ని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు’ అని కూడా సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించిన 278 పేజీల అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం. సుప్రీంకోర్టుకు సీబీఐ ఇచ్చిన అఫిడవిట్ లో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ దర్యాప్తు అధికారిని అడ్డుకున్నారని స్పష్టంగా పేర్కొనడంతో వివేకా హత్య కేసు వెనుక కీలకమైన వ్యక్తుల ప్రమేయం ఉందంటూ వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి తన తండ్రి మరణం వెనక ఉన్న కీలక సూత్రధారులను బయటపెట్టాలంటూ తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు ఒక సమాధానం లభించినట్లయిందని అంటున్నారు. తన తండ్రిని దారుణంగా చంపిన, చంపించిన వారిని వదిలిపెట్టేది లేదంటూ సునీతారెడ్డి ఒక విధంగా యుద్ధమే చేస్తున్నారంటున్నారు. మాజీ  సీఎం వైఎస్సార్ కు స్వయంగా తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా బాబాయ్ అయిన వివేకానందరెడ్డిని దారుణంగా హతమార్చడం వెనుక మరిన్ని పెద్ద తలలే ఉన్నాయనే అనుమానాలకు సీబీఐ సుప్రీంలో ఇచ్చిన అఫిడవిట్ మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు. వివేకా హత్య  వెనుక బలమైన అదృశ్య శక్తులు కీలకంగా ఉన్నందువల్లే సంఘటన జరిగి మూడేళ్లయినా దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారంటున్నారు. వివేకా హత్య కేసు విచారణ నిష్పాక్షికంగా జరుగుతున్నట్లు అనిపించడం లేదని.. ధర్మాసనం సభ్యుడు జస్టిస్ ఎంఆర్ షా వ్యాఖ్యానించడం కూడా కేసు వెనుక ఎంతటి బలమైన శక్తులు పనిచేస్తున్నాయో అర్థం అవుతోందంటున్నారు. నిష్పాక్షికంగా విచారణ జరగాలంటే ఏపీలో కాకుండా ఢిల్లీ, తెలంగాణలలో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలని నిందితుల తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు.

వ‌చ్చే ఆసియాక‌ప్ మేం నిర్వ‌హిస్తే ఓకేనా?..ఐస్‌లాండ్‌

ప్ర‌పంచ‌క్రికెట్‌లో ఆసీస్‌, ఇంగ్లండ్ పోటీల త‌ర్వాత అంత ప్రాచుర్యం పొందిన‌వి, క్రికెట్ వీరాభిమానులు వేలం వెర్రిగా చూసేవి, అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగేవి భార‌త్‌, పాకిస్తాన్‌ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌లే. అవి టెస్ట్‌ల‌యినా, వ‌న్డేల‌యినా టీ.20ల‌యినా సరే. అయితే చాలాకాలం నుంచి ఇరు దేశాల మ‌ధ్య రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల మ్యాచ్‌లో అటు పాక్‌లో, ఇటు భార‌త్‌లోనూ ఇరు జ‌ట్ల‌మ‌ధ్య జ‌ర‌గ‌డం లేదు. ఏ టోర్నీలోనయినా స‌రే వేరే వేదిక‌ల మీద‌నే ఈ రెండు జ‌ట్లు త‌ల‌ప‌డుతూన్నాయి. కాగా ఇటీవ‌ల బీసీసీఐ ప్ర‌ధాన కార్య ద‌ర్శి జై షా ఒక ప్ర‌క‌ట‌న చేశారు. 2023 ఆసియా క‌ప్ పాకి స్తాన్‌లో జ‌రిగితే భార‌త్ జ‌ట్టు పాల్గొన ద‌ని, వేరే వేదిక లో జ‌రిగితేనే ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయ‌ని ప్ర‌క‌టించారు. ఇందుకు ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేష‌న్  స‌మా ధానం ఇచ్చింది. తాము ఆ టోర్నీని నిర్వ‌హిస్తే ఇరు జ‌ట్ల‌కు ఇబ్బంది ఉండదు క‌దా! అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు వైర‌ల్ అయింది.  ఇది ఐసిసి అధికారుల‌న కొంత ఆశ్చ‌ర్య‌ప‌రిచి ఉండ‌వ‌చ్చుగాని భార‌త్‌, పాక్ అభిమానుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టు కోలేదు. కార‌ణం ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చాలా స‌హ‌జం. ప్లేయ‌ర్ల మ‌ధ్య మాత్రం ఎంతో స్నేహ‌ పూర్వ‌క వాతా వ‌ర‌ణ‌మే ఉంది, ఉంటుం ద‌ని ఇరు జ‌ట్ల యాజ‌మాన్యాలు చెబుతూంటాయి. కానీ రాజ‌కీయ ప‌రిస్థితుల కార‌ణంగా కానీ ఇరు దేశాల్లో ఏ టోర్నీలోనూ ఇవి ఎదురుకావ‌డం మాత్రం అధి కారులు ఇష్ట‌ప‌డ‌టం లేదు.  గ‌త మాసంలో కూడా పాక్‌, భార‌త్ మ‌ధ్య టెస్ట్ సిరీస్ ను తాము నిర్వ‌హిస్తామ‌ని చేసిన ఆఫ‌ర్‌ను ఎవ‌రూ అంత‌గా పట్టించుకోలేద‌ని ఐస్‌లాండ్ క్రికెట్ అధికారులు అన్నారు. కానీ వ‌చ్చే ఆసియా క‌ప్‌ను తాము నిర్వ హించ‌గ‌ల‌మ‌ని, పాక్‌లో నిర్వ‌హించ‌డానికి భార‌త్ అంగీక‌రించనపుడు త‌మ ఆఫ‌ర్ గురించీ ఆలోచిం చాల‌ని  ఐస్‌లాండ్ క్రికెట్ అధికారులు  కోరుతున్నారు.

పిలిచార‌ని వెళ్లారు...ఆయాసం తెచ్చుకున్నారు!

తెల్లార‌గ‌ట్టే ఫోన్ వ‌చ్చింది..తెనాలి ప‌రుగున వెళ్లింది..తిరిగివ‌చ్చిన అక్క‌ని చిన్న‌కోడ‌లు అడిగితే,  మా వొదిన మధుర చీర కొంగు చూప‌డానికి పిలిచింద‌న్న‌ది ఓ యింటి పెద్ద కోడ‌లు. రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఇంటిప‌నిలో ప‌డింది. అదిగో అలా ఉంది తెలంగాణా సీ ఎస్ సోమేశ్ కుమార్ ఢిల్లీ ప‌య‌నం.  అత్యంత ముఖ్యమైన సమీక్ష ఉందని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే ఢిల్లీకి రావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించడం, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆగమేఘాలపై దేశ రాజధానికి వెళ్లడం, రెండు రోజుల  తరువాత తిరిగి రావడంపై ఐఏఎస్‌ అధికారులు సెటైర్లు వేసుకుంటున్నారు. ఏదో సామెత చెప్పినట్లుగా, వెళ్లారు.. వచ్చారు అని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎస్‌ ఢిల్లీ పర్యటన వల్ల అనవసర ఆపసోపాలు తప్ప.. ఒరిగిందేమీ లేదని అంటున్నారు.  ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపు రాగానే శ‌ర‌వేగంతో ప్ర‌త్యేక విమానంలో రాష్ట్ర‌ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్  ఢిల్లీ వెళ్లారు. తీరా అక్క‌డికి వెళ్లాక స‌మీక్షించాల్సిన అంశంలో పెద్ద త‌ల‌బాదుకోవాల్సిన అంశ మేమీలేద‌న్న‌ది అర్ధ‌మ‌యింది. అస‌లే రాష్ట్ర ప్ర‌భుత్వం ఆర్దిక ఇబ్బందుల్లో ఉంద‌ని, క‌ష్టాల్లో కూరుకు పోయింద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న కాలంలోనే ఆయ‌న విమానాల్లో ప్ర‌యాణాలు ఆగ‌మేఘాల‌మీద వెళ్ల డాలు అవ‌స‌ర‌మా అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఈ నెల 11న సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యా దవ్‌ అంత్యక్రియలకు హాజరు కావడానికి సీఎం కేసీఆర్‌ ఉత్తరప్రదేశ్‌కు వెళ్లడం, అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లడం తెలిసిందే.  కాగా, సీఎం ఢిల్లీలోనే ఉండి.. సమీక్షల కోసమంటూ సీఎస్‌తోపాటు మరో ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికా రులను ఢిల్లీకి పిలిపించారు. దీంతో వారు హైదరాబాద్‌లో స్పెషల్‌ ఫ్లైట్‌ను బుక్‌ చేసుకుని మరీ వెళ్లారు. రెండు రోజులపాటు అక్కడే ఉండి మంగళవారం తిరిగొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చిన్నపాటి సమీక్ష నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి తప్ప,  ఇతర సీరియస్‌ రివ్యూలేవీ జరగలేదని అంటు న్నారు.   ఎలాంటి ఎమర్జెన్సీ లేని సందర్భంలో ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ లను పిలిపించుకుని, అనవసరపు వ్యయాలు పెట్టడమేమిటంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమీక్షల కోసం ఢిల్లీకి పిలి పించుకుని, అధికారుల విలువైన సమయాన్ని వృథా చేయడమే అవుతుందన్న చర్చ సాగుతోంది. ఇలాంటి దుర్భర వ్యయాల సొమ్మును ఇతరత్రా ప్రయోజనకర  పనులకు వినియోగించవచ్చు కదా! అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

రాష్ట్రానికి వైసిపి వైరస్, టిడిపినే వ్యాక్సిన్..చంద్ర‌బాబు

ఒక వంక వ‌ర్షాలు, మ‌రో వంక ప‌ల్నాడు మ‌హానాడు అయినా తెలుగు దేశం అధినేత ప‌ల్నాడు గుర‌ జాల‌లో పంట‌ల న‌ష్టాలతో దిగులుప‌డుతున్న రైతాంగాన్ని ప‌ల‌క‌రించ‌డానికి వ‌చ్చారు. బుధ‌వారం రాత్రి ఎంతో స‌మ‌య‌మ‌యినా ప్ర‌జ‌లు ఆయ‌నను విన‌డానికి స‌భ‌కు విచ్చేశారు. వేలాదిమంది ఎంతో ఉత్సా హంగా పాల్గొన్న‌స‌భ‌లో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు మాట్లాడుతూ రాష్ట్రానికి వైసీపీ వైర‌స్‌లా ప‌ట్టు కుంద‌ని తెలుగుదేశ‌మే దాన్ని వ‌దిలించే వాక్సిన్ అంటూ అభివ‌ర్ణించారు. ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా వైసీపీ భూస్థాపితం ఖాయ‌మ‌ని నిన‌దిస్తూ, చంద్రబాబు  పార్టీ అభిమానుల‌ను, ప్ర‌జ‌ల‌ను  ఉత్సాహ‌ ప‌రిచారు. రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వంతో విసిగెత్తిన ప్ర‌జ‌లు టీడీపీ అధికారంలోకి రావాల‌ని ఎంతో ఉత్స‌హం ప్ర‌ద ర్శిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు రావాల‌ని గ‌ట్టిగా ఆశిస్తున్నారు. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను ఎంతో హృద‌య‌పూర్వ‌కంగా ఆహ్వానిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న‌కు ప్ర‌జ‌లు ఘ‌న స్వాగతం ప‌లుకు తున్నారు. ప‌ల్నాడు గుర‌జాల స‌భ‌లో మాట్లాడుతూ, వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు, ముఖ్యంగా రైతాంగం ఎంతో న‌ష్ట పోతోంద‌ని, వారిని క‌నీసం ప‌ల‌క‌రించ‌డానికి కూడా అధికారుల‌కు, మంత్రుల‌కు తీరిక‌లేదా అని ప్ర‌శ్నిం చారు.  మిరప, పత్తి పంటలకు వర్షాల కారణంగా గరిష్టంగా లక్ష రూపాయల నష్టం వచ్చింది. సిఎం తాడే పల్లి ప్యాలెస్ లో కూర్చుంటే బాధలు తెలియవని, ఇక్కడికి వచ్చి రైతులతో మాట్లాడాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎద్దేవా చేశారు.  హుద్‌హుద్ తుపాను స‌మ‌యంలో కూడా ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోలేద‌ని, ప్ర‌జ‌ల‌ను ఆ స‌మ‌యంలో ఎలా ఉన్నార‌ని ముందుగా వెళ్లి ప‌ల‌క‌రించి వారి స‌మ‌స్య‌లు, క‌ష్టాలు తామే తెలుసు కున్నామ‌ని చంద్ర‌బాబు అన్నారు. అస‌లా మాట‌కు వ‌స్తే ఏ విప‌త్తు స‌మ‌యంలోనూ ముఖ్య‌మంత్రి స్పందించిన దాఖలాలు లేవ‌న్నారు.  పల్నాడు ప్రాంతంలో 157 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు,  దేశంలో రైతు ఆత్మహత్యల్లో ఎపి మూడవ స్థానంలో ఉందని, జగన్ మోసాలు చెయ్యడంలో దిట్ట, కడుపు అబద్దాల పుట్ట అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతు వ్య‌తిరేక ప్ర‌భుత్వ‌మే ఉంద‌ని, వారికి వ‌చ్చే స‌బ్జిడీలు నిలువ‌రించ‌డ‌మే అందు కు గొప్ప ఉదాహ‌ర‌ణ అనీ  బాబు అన్నారు. అంతేకాదు, స్కూళ్ల‌లో నాడు నేడు అనే కార్య‌క్ర‌మంతో వ‌చ్చి న గొప్ప ఫ‌లితాలేమీ లేవ‌ని అన్నారు.  వై.ఎస్‌. వివేకా హత్యలో ఆయన కుమార్తె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. వివేకా హత్యపై నారాసుర రక్త చరిత్ర అని నాడు రాశారు. అప్పుడు సిబిఐ విచారణ కావాలి అన్నాడు...ఇప్పుడు అవసరం లేదని అంటున్నార‌ని, జగన్  ఈ వైఖరిప‌ట్ల  బాధతో సునీత పట్టుదలతో పోరాడుతున్న‌ద‌ని బాబు అన్నారు. ఒక  సిఐకి ప్రమోషన్ ఇచ్చి...వివేకా కేసులో సాక్ష్యం చెప్పకుండా చేయ‌డం దారుణ‌మ‌న్నారు.  జ‌న‌సేన అధినేత  పవన్ కళ్యాన్ పై తీవ్రంగా దాడి చేశారు..పవన్ చెప్పు చూపించాడు అంటే ఎంత వేదన చెందాడో ఆలోచించాలని చంద్ర‌బాబు అన్నారు. త‌న కుటుంబంపై దాడిచేసిన‌పుడు గెలిచిన త‌ర్వాత‌నే స‌భ‌కు వ‌స్తాన‌ని చెప్పాన‌ని, అధికారం ఉంద‌ని విర్ర‌వీగడం, పెంపుడు కుక్క‌ల‌ను త‌మ‌పై దాడి చేయిం చ‌డం ఇక స‌హించేది లేద‌ని చంద్ర‌బాబు వైసీపీని హెచ్చ‌రించారు.  నాడు హైదరాబాద్ ను అభివృద్ది చేస్తే తరువాత వచ్చిన వైఎస్ ఆర్ అడ్డుపడలేదు...నాశనం చెయ్య లేదు, రాజశేఖర్ రెడ్డి నాడు అడ్డుపడి ఉంటే హైదరాబాద్ అభివృద్ది ఏమయ్యేది రాష్ట్రానికి ఎవరూ చేయ ని అన్యాయం జగన్ చేశాడని టీడీపీ అధినేత మండిప‌డ్డారు. 

కళ్ల ముందే కలలు ఆవిరైపోతున్నాయా? అందుకేనా మంత్రులు ఎమ్మెల్యేలపై ఈ మండిపాటు?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మూడ్ లోకి వెళ్లి పోయారా? ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టారా? అంటే, అవుననే అంటున్నారు, వైసీపీ ముఖ్య నేతలు. నిజానికి, ఎన్నికలకు సంవత్సరంన్నరకు పైగానే సమయముంది. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అలోచన వుందా,అంటే అదీ లేనట్లే అంటున్నారు, మరి అలాంటప్పుడు ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి ఎన్నికల మూడ్’లోకి ఎందుకు వెళ్ళినట్లు? అంటే, ముఖ్యమంత్రి మూడేళ్ళుగా కంటున్న కలలు,ఒకటొకటిగా కరిగి పోవడమే, ఈ హడావిడికి అసలు కారణం అంటున్నారు. అందుకే ఆయన ముందుగానే ఎన్నికల మూడ్’లోకి వెళ్లి పోయారని అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి మొదటి నుంచీ కూడా సంక్షేమ పథకాల పేరిట సాగిస్తున్న పందారాలనే నమ్ము కున్నారు. ఇటు నుంచి మీట నొక్కి అటు వైపుకు నోట్లు పంపితే, అటు నుంచి ఓట్లు వచ్చిపడతాయని, పంచరంగుల్లో పగటి కలలు కన్నారు. అయితే, గంపెడు ఆశలతో మొదలు పెట్టిన గడప గడపకు కార్యక్రమం సంక్షేమ పథకాల అసలు రంగును బయట పెట్టింది. సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందిన ప్రజలు బ్రహ్మరథం పడతారని జగన్ రెడ్డి ఆశిస్తే, ఫలితాలు అందుకు పూర్తి విరుద్ధంగా వచ్చాయి. సంక్షేమం ఒక్కటి సరిపోదని, అభివృద్ధి ఎక్కడని జనం నిలదీయడంతో, జగన్ రెడ్డికి తత్త్వం బోధ పడిందని, అందుకే ఆయన, మంత్రులు, ఎమ్మెల్యేల పై  మండిపడుతున్నారని,అంటున్నారు.  ఈ నేపద్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నియోజక వర్గాల వారీగా సమావేశాలు మొదలు పెట్టారని అంటున్నారు. అందులో భాగంగా నిన్న (గురువారం) కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ముఖ్యమంత్రి మరో ఏడాదిన్నరలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని, ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్దం కావాలని ముఖ్యమంత్రి పిలుపు నిచ్చారు. అయితే, సమావేశంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తఃలు ముఖ్యమంత్రి మాటా తీరులో మార్పు వచ్చిందని ఇదొక విధంగా, అయన తోగిచుస్తున్న భయానికి సంకేతంగా ఉందని అంటున్నారు.’ మూడు సంవత్సరాల కాలంలో మనం చేసిన మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాలని సూచించారు.బానే వుంది.అయితే, మూడేళ్ళలో చేసిన మంచి కంటే చేయని మంచే, ఎక్కువగా ఉందని, ముఖ్యంగా ప్రజలు అడుగుతున్న మౌలిక సదుపాయాల కలప్నలో, ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కార్యకర్తలు నాయకులు గుర్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి మాత్రం, పాత పాటనే పడుతున్నారని, అంటున్నారు.  ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఈ మూడు సంవత్సరాల్లో రూ.1050 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని అలాగే,ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలను ముందుగా ప్రాధాన్యం ఉన్న పనుల కోసం కేటాయిస్తున్నట్లు చెప్పారని,అయితే ఇదే మాట చాలాకాలంగా చెపుతున్నా, జరుగుతున్నది ఏమీ లేదని అంటున్నారు.నిజనికి మూడేళ్ళుగా చిన్న పని అయినా చేయకుండా, ఇప్పడు  సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తే ఏ మూలకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు.  మరోవంక ఎమ్మెల్యేలతో, మంత్రులతో కూడా తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న జగన్ ఆయా సమావేశాల్లో వారి నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించుకొని నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు.అయితే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ముఖ్యమంత్రి, ముడున్నరేళ్ల తర్వాత ఏది చేయాలనుకుంటే అది అయ్యే పని కాదని, పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు.

కన్నా రూటెటు?.. ప్రభావం ఏమిటి?

కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నా లక్ష్మీ నారాయణ మంత్రిగా కూడా సమర్థంగా పని చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయనకు కాంగ్రెస్ లో ఎనలేని  ప్రధాన్యత ఉండేది. అయితే రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోవడంతో ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ మృగ్యమని భావించి కమలం గూటికి చేరారు. ఇలా చేరారో లేదో అలా బీజేపీ ఏపీ అధ్యక్ష బాధ్యతలను అందుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో బీజేపీ జోరు పెరిగిందని రాష్ట్ర కమలం శ్రేణులు ఇప్పటికీ చెబుతాయి. అయితే అమరావతి విషయంలో ఆయన స్పీడు కారణంగా బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి హైకమాండ్ కన్నాను తప్పించింది. అప్పటి నుంచీ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఆ అసంతృప్తి ఉన్నప్పటికీ కన్నా బీజేపీలోనే కొనసాగారు. తాజాగా బీజేపీపై పవన్ వ్యాఖ్యలతో కన్నా బరస్టయ్యారు. సోము వీర్రాజు కారణంగానే ఏపీలో బీజేపీ పరిస్థితి దిగజారిందనీ, ఆయన ఒంటెత్తు పోకడలతో పార్టీని రాష్ట్రంలో భ్రష్టు పట్టించారనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా  ముఖ్య అనుచరులతో బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోనే కన్నా బీజేపీని వీడటం ఖాయమైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ముఖ్య అనుచరులతో సమావేశం అవ్వడంతో ఆయన నేడో రేపో కమలం గూటి నుంచి బయటకు రావడం ఖాయమంటున్నారు. కమలం పార్టీకి గుడ్ బై చెప్పి ఆయన ఏ పార్టీలో చేరనున్నారన్న విషయంపై ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. సామాజిక వర్గ సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే.. ఆయన జనసేన గూటికి చేరే అవకాశాలున్నాయని కొందరు చెబుతుంటే... అమరావతి విషయంలో ఆయన స్టాండ్ ను బట్టి చూస్తే ఆయన సైకిలెక్కడం ఖాయమని మరి కొందరు అంటున్నారు. మొత్తం మీద ఆయన బీజేపీని వీడటం ఖాయమన్న విషయంలో మాత్రం ఎక్కడా భిన్నాభిప్రాయం వినిపించడం లేదు. అయితే ఆయన ‘సైకిల్’ ఎక్కుతారా, ‘గ్లాస్‘పట్టుకుంటారా?  అన్న విషయంపై మాత్రం హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.అయితే ఆయన ఏ గూటికి చేరినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలను ప్రభావితం చేస్తారన్న విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడూ, ఆ తరువాత బీజేపీ అధ్యక్షుడిగానూ కూడా కన్నా తెలుగుదేశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఆ తరువాత అమరావతి పోరాటంలో తెలుగుదేశంతో కలిసి నడిచారు. దీంతో ఆయన జనసేన వైపు కంటే తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకూ పెదకూరు పాడు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చినా.. ఇటీవలి కాలంలో ఆయన ఎక్కువగా గుంటూరు 2 అసెంబ్లీ నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. అంతే కాకుండా నరసరావు పేట పార్లమెంటు నియోజకవర్గంపై కూడా ఆయన దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ మారడమంటూ జరిగితే ఆయన నరసరావు పేట లోక్ సభ స్థానం, అలాగే గుంటూరు2 లేదా సత్తెన పల్లి అసెంబ్లీ స్థానాలపై పట్టుబట్టే అవకాశం ఉందని కన్నా సన్నిహితులు చెబుతున్నారు. తాను, తన కుటుంబం నుంచి మరొకరికి అవకాశంఇవ్వాలని ఆయన కోరే అవకాశం ఉంది.  ఒక వేళ తెలుగుదేశం పార్టీ వైపే ఆయన మొగ్గు చూపితే గుంటూరు2 నియోజకవర్గం విషయంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదని అంటున్నారు. ఎందుకంటే..తెలుగుదేశం కూడా గుంటూరు 2 నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి కోసం అన్వేషణలో ఉందని తెలుగుదేశం వర్గాలే చెబుతున్నాయి. మొత్తం మీద కన్నా బీజేపీపై వ్యక్తం చేసిన ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆయన పార్టీ మారడం అంటూ జరిగితే.. ఆ ప్రభావం బీజేపీ, వైసీపీలపై తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

టాటా కంపెనీ  వెళ్ల‌డం లెఫ్ట్ ప్ర‌భుత్వం నిర్వాక‌మే.. మ‌మ‌త‌

సింగూర్ నుంచి టాటా మోటార్స్ ను బ‌య‌టికి పంపింది సీపీఎం త‌ప్ప తాను కాద‌ని ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. సిలిగురిలో దుర్గాపూజ అనంత‌రం జరిగిన విజ‌య స‌మ్మిళ‌న్ కార్య‌క్ర‌మంలో ఆమె మాట్లాడుతూ, హుగ్లీ జిల్లాలో టాటా మోటార్స్ నానో ఫ్యాక్ట‌రీ కోసం ఇక్క‌డి పేద రైతుల నుంచీ గ‌త వామ‌ప‌క్ష ప్ర‌భుత్వం లాక్కున్న భూముల‌ను తాను రైతుల‌కు వ‌చ్చేలా చేశాన‌ని అన్నారు. కానీ తానే టాటా కంపెనీని బ‌య‌టికి వెళ్లేట్టు చేశాన‌ని భారీ ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని అందులో వాస్త‌వం లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. రైతుల నుంచి భూమి లాక్క‌నే అవ‌స‌రం త‌మ‌కు లేదని త‌మ వ‌ద్ద కావ‌ల‌సినంత భూమి ఉంద‌ని, ఆ ప‌ని చేసింది గ‌త ప్ర‌భుత్వాలేన‌ని ఆమె అన్నారు.  సిపిఎం చేస్తున్న ప్ర‌చారం అబద్ధ మ‌ని అందులో వాస్త‌వం లేద‌న్నారు. ఫ్యాక్ట‌రీ వెలుప‌ల హైవే వ‌ద్ద భారీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు ధ‌ర్నాలు చేయ‌డంతోనే ఫ్యాక్ట‌రీ రాష్ట్రం నుంచి వెళిపోయింద‌ని, ఫ‌లితంగా వేలాది మంది రోడ్డున ప‌డ్డార‌ని సిపీఎం చేస్తున్న ప్ర‌చారంలో నిజం లేద‌న్నారు. 2008 అక్టోబ‌ర్‌లో ప్రాజెక్టును తీసే యాల‌ని జ‌రిగిన ఆందోళ‌న‌, ధ‌ర్నాలు జ‌రిగిన స‌మ‌యంలో టాటా యాజ‌మాన్యం త‌మ ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్లింద‌ని మ‌మ‌త అన్నారు.  మ‌మ‌త బెన‌ర్జీ సారధ్యంలో జ‌రిగిన ఉద్య‌మంతో 34 సంవ‌త్స‌రాలు నిరాఘాటంగా సాగిన వామ‌ప‌క్ష ప్ర‌భు త్వం 2011 లో ఊహించ‌ని విధంగా అధికారం కోల్పోయింది. మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌భుత్వం చేప‌ట్ట‌గానే టాటా కంపెనీకి వామ ప‌క్ష ప్ర‌భుత్వం ఇచ్చిన భూముల‌ను రైతాంగానికి తిరిగి ఇచ్చేసింది. అదానీ గ్రూప్ తేజ్ పూర్ ప్రాజెక్టు గురించి ప్ర‌స్తావిస్తూ, త‌మ రాష్ట్రంలో ఎలాంటి వివ‌క్ష‌తా, అంత‌రాలు లేవ‌ని ప్ర‌తి ఒక్క‌రూ వాణిజ్య వేత్త‌గా ఎదిగేందుకు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నామ‌ని మ‌మ‌తా బెన‌ర్జీ అన్నారు. విద్యావంతుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో త‌మ ప్ర‌భుత్వం ముందుంటుంద‌ని, వాణిజ్య, వ్యాపార‌వేత్త‌లకు స‌హ‌క‌రిస్తు న్నామ‌ని, రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఉద్యోగులు అవుతున్నార‌న‌డంల ఎలాంటి సందేహం లేద‌న్నారు.  ఇదిలా ఉండ‌గా , సిపీఎం సెంట్ర‌ల్ క‌మిటీ నాయ‌కుడు సుజ‌న్ చ‌క్ర‌వ‌ర్తి మాత్రం మ‌మ‌త‌కు అబ‌ద్దాలా డ‌టంలో డాక్ట‌రేట్ ఇవ్వాల‌ని ఎద్దేవా చేశారు. అస‌లు సింగూర్‌లో ధ‌ర్నాలో మ‌మ‌తా పాల్గొన‌లేద‌ని అపుడు బుద్ధదేవ్‌ భ‌ట్టాచార్య‌నే ధ‌ర్నాలో పాల్గొన్నార‌న్నారు. మ‌మ‌తా ప్ర‌భుత్వం ఏమాత్రం ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించడం లేద‌ని అందువ‌ల్ల‌నే విద్యావంతులు రాష్ట్రాన్ని విడిచివెళుతున్నార‌ని అన్నారు. మ‌మ‌తా ఆవేశ పూరితంగా నిర్వ‌హించిన ఆందోళ‌న కార‌ణంగానే టాటా మోటార్స్ రాష్ట్రం దాటి వెళ్లింద‌ని, ఫ‌లి తంగా ల‌క్ష లాది మంది నిరుద్యోగులుగా మారార‌ని బీజేపీ కూడా మ‌మ‌తా బెన‌ర్జీపై మండిప‌డుతోంది. రాష్ట్రంలో మంచి నిపుణులు, మంచి విద్యావంతులు లేర‌ని హుగ్లీ బిజేపీ ఎంపి లాకెట్ ఛ‌ట‌ర్జీ అన్నారు.  

బీజేపీతో టచ్ లోనే నితీష్ కుమార్.. పీకే సంచలన వ్యాఖ్యలు

నితీష్ కుమార్ మళ్లీ కమలం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఆయన పదవీ దాహంతీర్చుకోవడానికి మరోసారి కమలానికి స్నేహహస్తం చాస్తారా? అంటే ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఔననే అంటున్నారు. పీకే గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు)లో కీలక పాత్ర పోషించారు.  నితీష్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇదంతా 2020కి ముందు.. పీకే జనతాదళ్( యు) నుంచి ఉద్వాసనకు గురికావడానికి ముందు. ఇప్పుడు కాదు. అటువంటి పీకే తాజాగా నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, కాషాయ శిబిరంతో మరోసారి పొత్తుకు ప్రయత్నిస్తున్నారనీ, ఎన్డీయే గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారనీ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడితో కలిసి మహాఘట్‌బంధన్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ ఏడాది ప్రారం భంలో జేడీయూ బిజెపితో సంబంధాలను తెంచుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి విదితమే. అయితే  బీహార్‌లో పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్  పిటిఐతో మాట్లాడుతూ, నితీష్ కుమార్ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూట మిని చురుకుగా నిర్మిస్తున్నారని భావిస్తున్న ప్రజలు ఆయన బీజేపీతో మరోసారి పొత్తుకు తలుపులు తెరిచే ఉంచారని తెలిస్తే ఆశ్చర్య పోతారని, అయితే అది వాస్తవమని పేర్కొన్నారు.  నితీష్ కుమార్ జేడీయూ  పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ జీ ద్వారా బీజేపీతో నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జేడీయు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ,   రాజ్యసభ పదవికి   హరివంశ్‌ ఇంత వరకూ రాజీనామా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆర్జేడీతో ఇబ్బందులు వస్తే మళ్లీ కమలంతో చేతులు కలిపి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నితీష్ ఒక్క నిముషం కూడా ఆలోచించరనీ, రాజకీయాలలో విలువల కంటే అధికారమే ముఖ్యమని నితీష్ భావిస్తారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాగా రాజ్యసభ పదవికి తాను రాజీనామా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు హరివంశ్ నిరాకరించారు. కాగా నితీష్ వ్యాఖ్యలను జేడీయూ నిర్ద్వంద్వంగా ఖండించింది. నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపే ప్రశక్తి లేదని జేడీయూ స్పష్టం చేసింది. పీకే వ్యాఖ్యలపై స్పందించిన జేడీయూ అధికార ప్రతినిథి కేసీ త్యాగి  బీహార్ సీఎం నితీష్ కుమార్ తన జీవితంలో  బీజేపీతో చేతు కలిపే ప్రశక్తే లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. ఆయన మాటలను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ గత ఆరు నెలలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారనీ, ఆయనకు ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో  గందరగోళాన్ని వ్యాప్తి చేసి లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని త్యాగి విమర్శించారు. 

ఈ ఏడాదీ శ‌బ్దం విన‌ప‌డ‌కూడ‌దు.. ఢిల్లీలో  దీపావ‌ళి ఆంక్ష‌లు

పండ‌గ అంటే స‌ర‌దా. దీపావ‌ళి అంటే మ‌రీ సంద‌డీ, స‌ర‌దా. ట‌పాసులు కొన‌డం, వాటిని దీపావళిరోజుకి సిద్ధం చేసుకోవ‌డంలో పిల్ల‌లు నానా హ‌డావుడీ చేస్తుంటారు. దీపావ‌ళి అంట‌నే పిల్ల‌ల రోజు. వాళ్ల‌ని మ‌రీ ట‌పాసుల‌తో ఆట‌లాడ‌కుండా, ఎవ‌రూ కాళ్లూ, చేతులు కాల్చుకోకుండా పెద్ద‌వాళ్లు వెన‌క ఉండి నానా కంగారు ప‌డుతూ వేన‌వేల జాగ్ర‌త్త‌లు చెబుతూంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో అంద‌రి ఇళ్ల‌ల్లో మామూలే. కానీ దేశ రాజ‌ధాని ఢిల్లీ వారికి మాత్రం ఇది దాదాపు అయిదారేళ్లుగా స‌ర‌దా లేకుండానే జ‌రిగిపోతోంది. స‌ర‌దాలేకుండా పండ‌గేమిటి? అనుకోవ‌ద్దు.. ఢిల్లీ దేశ రాజ‌ధానే. కానీ కాలుష్యం విష‌యంలో అంత‌టి దారుణ సిటీ మ‌రోటి ఉండ‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు అంటున్నారు. ఇపుడు అస‌లు సిటీలో ప‌టాసుల గోలే ఉండ‌కూడ‌ద‌ని ఈసారి త‌ప్ప‌కుండా అంద‌రూ ఈ ఆంక్ష‌లు పాటించి తీరాల‌ని ఏకంగా  ఢిల్లీ  స‌ర్కార్ హెచ్చరిక‌వంటి ప్ర‌క‌ట‌న చేసింది.  అంటే ఈ ఏడాది నిబంధ‌న‌లు చాలా సీరియ‌స్‌గా అమ‌లు చేయ‌ డానికి ప్ర‌భుత్వం సిద్ధప‌డింద‌నే అనాలి. మ‌రి పిల్ల‌ల ఆనందానికి అడ్డుక‌ట్ట‌వేసిన‌ట్టేనా? మ‌రో మార్గం లేదా అనే ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌కు ఢిల్లీ స‌ర్కార్ జ‌వాబు ఇవ్వాలి.  ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సంద ర్భంగా బాణాసంచా కాల్చకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. బాణాసంచా తయారు చేసినా, నిల్వ చేసినా, అమ్మినా, కాల్చినా  జరిమా నా విధిస్తామంది. అంతేకాదు మూడేళ్లు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. మ‌రి పండ‌గ స‌ర‌దా ఏమికావాలి? ఈ సంవ‌త్స‌రం అటువంటి ఉత్సాహం ప్ర‌ద‌ర్శించ‌ కుండ వీల‌యినంత జాగ్ర‌త్త పాటించాల్సిందే.  ప్ర‌తీసంవ‌త్స‌రం అలాంటి హెచ్చ‌రిక‌లు ప్ర‌భుత్వం నుంచి వ‌స్తున్నా, కోర్టు ద్వారా ఏదో కొంత స‌వ‌ర‌ణ ల‌భించి ప్ర‌జ‌లు రెండు గంగ‌ల‌యినా ట‌పాసులు కాల్చేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి అవ‌కా శం ఇచ్చే ప‌రిస్థితుల్లేవ‌ని అంటున్నారు. అస‌లు ట‌పాసుల అమ్మ‌కాల విష యంలో కూడా చాలా నియ మాలు పాటిస్తున్నారు.. పొగ‌, శ‌బ్ధ నివార‌ణ‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అంటే భారీ పేలుడు శ‌బ్దం ఉండ‌కూడ‌దు, ప్రాంత‌మంతా పొగ‌చూరిన‌ట్టు కాకూడ‌ద‌ని గ‌ట్టి నిబంధ‌న అమ‌లు చేశారు. అస‌లు దీపావళి అంటేనే  ల‌క్ష్మీబాంబులు, తారాజువ్వ‌ల హ‌డావుడి ఎక్కువ‌. అవి కాదంటే ఇక పిన్న‌లు, పెద్ద‌లు చిచ్చు బుడ్లు, మ‌తాబులు, విష్ణు చ‌క్రాలు, భూచ‌క్రాల‌తో ఆనందించాల్సిందే మ‌రి.  దీపావళి రోజున పటాకులు కాలిస్తే 6 నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావ రణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ హెచ్చరించారు. ఇక పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.

ఖర్గే చెంతకు సోనియా.. కాంగ్రెస్ లో ఇది కొత్త సంప్రదాయం!

మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక‌యిన వెంట‌నే చేసిన మొదటి  పని ఏమిటంటే, సోనియా గాంధీతో అపాయింట్‌మెంట్ కోరడం. అంతకు ముందే తన విజయం అమ్మదయే అని ప్రకటించారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు అడగ్గానే సోనియా అప్పాయింట్ మెంట్ ఇచ్చేయాలి. మామూలుగానే ఖర్గే వంటి విధేయులకు అడిగినప్పుడల్లా సోనియమ్మ అప్పాయింట్ మెంట్ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు తన ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే  కోరినా సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు ఏమిటిది అంటూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. ఆ ఆశ్చర్యం నుంచి వారు తేరుకోకముందే.. వారు దిగ్భ్రమాశ్చర్యాలకు లోనయ్యే మరో సంఘటన జరిగింది. అదేమిటంటే సోనియాగాంధీ స్వయంగా నంబర్ 10, రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసానికి చేరుకున్నారు. సాధారణంగా సోనియాగాంధీ ఎవరి నివాసానికీ వెళ్లరు.. ఎవరైనా సరే ఆమె నివాసానికి వచ్చి కలవాల్సిందే.   ఆ సంప్రదాయం మేరకే అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే ఆయన సోనియా ఆశీస్సులను అందుకోవడానికి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే  సోనియా ఆయనకు అప్పాయింట్ మెంట్ నిరాకరించి.. స్వయంగా ఆమే ఖర్గే నివాసానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు.  పార్టీ మాజీ అధ్యక్షురాలిగా, తాత్కాలిక అధ్యక్షురాలిగా కొత్త అధ్యక్షుడిని స్వయంగా వచ్చి అభినందించడం ద్వారా పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ లో మార్పుపై విస్పష్టమైన సందేశం ఇవ్వాలని సోనియా భావించారు. పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సోనియా స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి.. శ్రేణులకు ఇక ఆయన మార్గదర్శనంలో పని చేయాలన్న స్పష్టమైన సందేశాన్నిచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అద్యక్షుడెవరైనా రిమోట్ సోనియా చేతిలోనే అన్న భావన ఇకపై ఉండకూడదన్న సందేశాన్ని ఈ చర్య ద్వారా సోనియా ఇచ్చారని అంటున్నారు. సోనియాగాంధీ ఇకపై పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా మల్లిఖార్జున్ ఖర్గే స్థానంలో ఎవరిని నియమించాలన్నది సోనియా గాంధీ త్వరలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా సోనియా స్వయంగా ఖర్గే నివాసానికి వచ్చి మరీ అభినందనలు తెలియజేయడంపై పార్టీ సీనియర్ నాయకుడు, అధ్యక్ష ఎన్నికలో ఖర్గే ప్రత్యర్థి అయిన శశిథరూర్ స్పందించారు. కాంగ్రెస్ లో స్పష్టమైన మార్పునకు ఇది సంకేతమని అభివర్ణించారు.

న‌ర్స‌రీలో పొర‌పాటు.. త‌ప్పిన కంటిప్ర‌మాదం!

పిల్ల‌ల్ని న‌ర్స‌రీల్లో చేర్చ‌డం ఈరోజుల్లో ప‌రిపాటి. త‌ల్లి ఉద్యోగ‌రీత్యానో, ప‌నుల ఒత్తిడివ‌ల్ల‌నో స‌మ‌యానికి పిల్ల‌ల్లి చూసుకోలేని ప‌రిస్థితుల్లోనూ న‌ర్స‌రీలో చేరుస్తున్నారు. వారికి చిన్న‌పాటి ఆట‌పాట‌ల‌తో స‌ర‌దాగా అక్క‌డివారు జాగ్ర‌తగానూ చూసుకుంటుంటారు. అలాగ‌ని వ‌దిలేసి ధైర్యంగా త‌ల్లులు ఉండ‌లేరు. ఏదో ఒక భ‌యం వెన్నాడుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న‌ట్టు, ఇంట్లోవారు క‌నిపెట్టుకున్న‌ట్టు అక్క‌డ కుద‌రదు గ‌దా. చాలామంది పిల్ల‌ల్లో మ‌న పిల్ల‌వాడు! కొట్టుకుంటారు, గిచ్చుకుంటారు, ఏడుస్తారు, నానా ర‌భ‌సా ఉంటుంద‌క్క‌డ‌. న‌ర్స‌రీ క్లాసులు చూసుకునే టీచ‌ర్ చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. చిన్న‌పాటి పొర‌ పాటు కూడా పిల్ల‌ల‌కు ప్ర‌మాద‌క‌రంగా మార‌వ‌చ్చు. ఇదుగో యార్క్‌షైర్‌లో అలాంటి చిన్న‌ప్ర‌మాద‌మే జ‌రిగింది. ఏడిది పిల్లాడు జాక్‌. అత‌న్ని త‌న త‌ల్లి ద‌గ్గ‌ర్లోని ఒక న‌ర్స‌రీలో చేర్చింది. వారు నిజానికి బాగానే చూసు కుంటూండేవారు. మొన్న‌నీ ఒక న‌ర్సు చేసిన త‌ప్పిదంతో పిల్లాడికి దాదాపు క‌న్నుపోయే ప్ర‌మాదం వ‌చ్చిప‌డింది. అంద‌రూ ఆస్ప‌త్రికి ప‌రిగెత్తారు. అదృష్ట‌వ‌శాత్తూ  కంటికి ఏమీ కాలేదు. ఫ‌స్ట్‌స్టెప్స్ అనే న‌ర్స‌రీలో పిల్లలంతా ఆడుతున్నారు. అక్క‌డ వాళ్ల సంర‌క్ష‌కురాలు చ‌క్క‌గా గోళ్ల అందం చూసుకుం టోంది. ఈమ‌ధ్య న‌కిలీ గోళ్లు కూడా వ‌చ్చాయి. వాటిని పెట్టుకుంటోంది. అంత‌లో ఎటునించి వెళ్లాడో జాక్ ఆమె ద‌గ్గ‌రికి వెళ్లాడు. ఆమె త‌యారుచేసుకున్న జిగురులాంటి ప‌దార్ధం గిన్నెలో అమాంతం చేయి పెట్టాడు. అది చూసి ఆ న‌ర్సు వాడి చెయ్యి ప‌ట్టుకునేలోగానే వాడు లాగేస‌రికి అది క‌ళ్ల‌కి త‌గిలి కుడిక‌న్ను వెంట‌నే ఎర్ర‌గా అయి వాచింది. ఈమె భ‌యంతో ఒణికింది. ఓర్నాయ‌నో ఏదో అయ్యిందిరా అని. ఒక్క పొలికేక పెట్టింది. వెంట‌నే పిల్లాడిని ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి తీసికెళితే ప‌రీక్ష‌చేసిన డాక్ట‌ర్లు మ‌రేం ఫ‌ర‌వాలేదు కంటికేమీ కాలేద‌ని  చెప్పారు. రెండు రోజులు జాగ్ర‌త్త‌గా చూసుకోమ‌ని జాక్ త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. ఆ న‌ర్స‌రీ స్కూలు యాజ‌మాన్యం ఆ న‌ర్సుని తిట్టి బ‌య‌ట‌కి పంపేసింది. అంచేత‌.. పిల్ల‌ల్ని న‌ర్స‌రీకి పంపామ‌ని మ‌రీ ధైర్యం గా ఉండ‌కండి.. అక్క‌డి ప‌రిస్థితులు వాక‌బు చేస్తుండండి.

ఇక కేసీఆర్ ఫోకస్ మొత్తం మునుగోడుపైనే!

దాదాపు తొమ్మిది పది రోజుల పాటు తెలంగాణను పట్టించుకోకుండా, మునుగోడు ఎన్నికల ఊసే ఎత్తకుండా హస్తినలో బసచేసి కాలం గడిపేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వెంటనే మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ప్రకటన తరువాత తొలి సారిగా హస్తిన వెళ్లిన కేసీఆర్ ఆక్కడ ఏం చేశారో? అన్ని రోజుల పాటు ఎందుకు మకాం వేశారో.. తెరస శ్రేణులకే కాదు ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. అసలు ముందుగా షెడ్యూల్ లో లేని హస్తిన పర్యటన ఎందుకు తెరమీదకు వచ్చిందో కూడా గోప్యంగానే ఉంచారు. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ అంత్యక్రియల కోసం అని యూపీ వెళ్లిన కేసీఆర్ అటు నుంచి అటే హస్తిన బాట పట్టారు. జాతీయ రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేసేందుకు అక్కడ భేటీలు జరుపుతారనీ, జాతీయ మీడియాకు బీఆర్ఎస్ లక్ష్యలు, అజెండా వివరిస్తారనీ అంతా భావించారు. కానీ కేసీఆర్ ఆసలు హస్తినకు ఎందుకు వెళ్లారు.. వెళ్లారు సరే.. అక్కడ అన్ని రోజులు ఎందుకు ఉన్నారు... ఉన్నారు సరే ఏం చేశారు.. అన్న ప్రశ్నలు వేటికీ సమాధానం లేదు. సరే హఠాత్తుగా పర్యటన ముగించుకుని వచ్చేశారు. వచ్చిన తరువాత అంతా చెప్పే మాట కేసీఆర్ హస్తిన వెళ్లారు.. వచ్చారు అనే.. కేసీఆర్ ఎంత హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారో.. అంతే సడెన్‌గా హైదరాబాద్ తిరిగి వచ్చారు.   వచ్చీ రావడంతోనే అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు, అధికారులతో సమావేశమై మునుగోడు  ఉప ఎన్నికపై చర్చించారు.  కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం పట్టంచుకోలేదు.  ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మంజూరు అయిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినా  ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది.   ఈసీ తీరుపై న్యాయపోరాటం చేయాలా లేక ప్రజల్లోకి వెళ్లాలా అన్నదానిపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించారు.  ఇక అన్ని విషయాలూ పక్కన పెట్టి మునుగోడుపైనే పూర్తిగా దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఫోకస్ మొత్తం మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపైనే ఉండాలని ఆదేశించారు. తానూ స్వయంగా ప్రచార రంగంలోనికి దిగుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మూడు రోజుల పాటు మునుగోడులో కేసీఆర్ విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళిక రూపిందించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో కేసీఆర్ మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షోలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే 30వ తేదీన చుండూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇక గురువారం నుంచి మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ పూర్తిగా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో నిమగ్నం కానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. అలాగే ఈ నెల 25 నుంచి తెరాస కీలక నేతలు మునుగోడులోనే మకాం వేయనున్నారు. ఈ మొత్తం ప్రచార పర్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తారు. అంతే కాకుండా మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా ఒక గ్రామానికి ఇన్ చార్జి అన్న విషయం తెలిసిందే. 

ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం?

 వైఈసార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్త పరిచారు. పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే,ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది. అలాగే, ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె రియల్  టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు వీకరించినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్నారు.అంతే కాదు, రాష్ట్రంలో కాలు పెట్టింది మొదలు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్,కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్’ ఇలా రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే, షర్మిల తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెదతామని అంటున్నారు. కానీ షర్మిల తెరాస ప్రభుత్వం, బట్టలు రోజు విప్పుతూనే ఉన్నారు.  అదలా ఉంటే, మహా ప్రస్థానం  పాద యత్ర నుంచి ఆమె ఓ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళారు. రహస్యంగా ఎవరిని కలిశారో ఏమో కానీ, ప్రత్యక్షంగా మాత్రం, సీబీఐ డైరెక్టర్’ ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలపైనే కాకుండా, ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ మేఘా కృష్ణా రెడ్డినిపైన అవినీతి పైనా ఆరోపణలు చేశారు .ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఒక లక్ష 20 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని సిబిఐకి ఫిర్యాదు చేశారు. అలాగే, మిషన్ భగీరథ సహా తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులు అన్నిట్లోనూ అవినీతి ప్రవహించిందని, ఆన్నిటి పైనా, సిబిఐ విచారణ కోరినట్లు చెప్పారు.  నిజానికి, ఆమె ఇప్పడు ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి కొత్తగా చెప్పిన విషయమంటూ ఏదీ లేదు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాళేశ్వరం అవినీతి గిరించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఇదరినీ మించి మాజీ మంత్రి నాగం జనార్ధన రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి, ఎకంగా ఒక బృహత్ గ్రంధానికి సరిపడినంత సమాచారాన్ని మీడియా ముందుంచారు.అసలు  ఎవరి దాకానో ఎందుకు, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అంతటివాడు, కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించారు. అయినా ఇంతవరకు ఏమీ జరగలేదనుకోండి, అది వేరే విషయం. అలాంటప్పుడు షర్మిల ఇంత హటాత్తుగా సాగుతున్న పాదయాత్రకు బ్రేక్ చెప్పి మరీ ఢిల్లీ ఎందుకెళ్ళారు? సిబిఐకి ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ, ఆమె టార్గెట్ చేసింది ఎవరిని? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  షర్మిల సిబిఐకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం పైనే అయినా, ఆమె టార్గెట్ మాత్రం, బ్రదర్ జగన్ రెడ్డి అనే అనుమానాలు ఇటు తెలంగాణ, అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్’లో కొంచెం గట్టిగానే వినవస్తున్నాయి. అందుకే, జగన్ రెడ్డికి అత్యంత అప్తుడిగా భావించే మేఘా కృష్ణా రెడ్డిని షర్మిల టార్గెట్ చేశారని అంటున్నారు. అలాగే, సమయ సందర్భాలను బట్టి చూస్తే, బీజేపీ పెద్దలు కేసీఆర్’ను ఇరకాటంలోకి నెట్టేందుకు షర్మిలను రంగంలోకి  దించారని అంటున్నారు. అయితే గతంలో, కేఎ పాల్’కూడా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రిని కలిసిన తర్వాతనే కాళేశ్వరం సహా తెరాస ప్రభుత్వ అవినీతికి సంబంధించి, సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు షర్మిల అమిత్ షా ను ప్రత్యక్ష్యంగా కలవక పోయినా, ఆయన, ఇతర బీజేపీ పెద్దల సూచనల మేరకే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్’గా ఇద్దరి అవినీతికి కేంద్ర బిందువుగా ఉన్న మేఘా కృష్ణా రెడ్డిపై ఆరోపణలు చేశారని అంటున్నారు. అందుకే ఇప్పుడు షర్మిల ఎవరు వదిలిన బాణం? షర్మిల టార్గెట్ ఎవరు? అనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకక ముందే ఈమె మరో సారి ఈ నెల 21న అంటే శుక్రవారం మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ సారి ఆమె సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదునే ఈడీకి కూడా అందజేస్తారని చెబుతున్నారు. 

ఫిర్యాదులపై తగ్గేదేలే.. మళ్లీ హస్తినకు షర్మిల..ఈ సారి ఈడీకి కంప్లైంట్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మరోసారి హస్తినకు పయనం అవుతున్నారు.  ఈ నెల 21న ఆమె ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే ఒక సారి హస్తినలో పర్యటించి వచ్చిన షర్మిల అప్పుడు హస్తినలో తెరాస అవినీతిపై సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కాశేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ నేరుగా సీబీఐకి ఫిర్యాదు చేసి వచ్చిన షర్మిల ఇప్పుడు మరో సారి హస్తినకు వెళ్లనున్నారు. ఆమె హస్తిన పర్యటనకు కారణమేమిటన్న దానిపై వైఎస్సార్ టీపీ నుంచి కానీ, స్వయంగా ఆమె నుంచి కానీ  ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.. కానీ ఈ సారి ఆమె హస్తిన పర్యటన అజెండా కాళేశ్వరం అవినీతిపై ఈడీకి ఫిర్యాదు చేయడమేనని అంటున్నారు. అయితే రాజకీయ వర్గాలలో మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ షర్మిల బీజేపీపైన కానీ కేంద్ర ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలూ చేయలేదు. దీంతో ఆమె ఈ సారి తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలతో కూడా భేటీ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని పరిశీలకులు అంటున్నారు.   తెలుగు రాష్ట్రాల్లో ఎప్పకప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో..   షర్మిల ఢిల్లీ పర్యటన  ప్రాధాన్యత సంతరించుకుంది.   టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు   విషయంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ టీఆర్ఎస్ పై బీజేపీ సహా అన్ని పార్టీలూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. ఒక్క షర్మిల  మాత్రమే విమర్శలకు పరిమితం కాకుండా  నేరుగా ఢిల్లీకి వెళ్లి సీబీఐకి ఫిర్యాదు చేశారు. భారతదేశంలో జరిగిన అతి పెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిని పేర్కొన్నారు. సీబీఐ ఫిర్యాదుతో ఆగకుండా ఇప్పుడు మరోసారి హస్తిన వెళ్లి ఈడీకి ఇదే విషయంపై ఫిర్యాదు చేయాలని షర్మిల భావిస్తున్నారని వైఎస్సార్ టీవీ వర్గలు చెబుతున్నాయి. ఈడీతో పాటు కేంద్ర జలశక్తి మంత్రికి కూడా కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.   తెలంగాణలో పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ హస్తిన ముఖం చూడని షర్మిల ఇప్పుడు వరుసగా ఢిల్లీ పర్యటనతో జోరు పెంచడం వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చ సర్వత్రా జోరుగా సాగుతోంది. తొలి సారి ఢిల్లీ వెళ్లినప్పుడు షర్మిల నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి   తెలంగాణ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందంటూ    ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా మేఘా కంపెనీతో కలిసి కేసీఆర్ సర్కార్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తెలంగాణ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా  దాదాపు ఇరే ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఇప్పుడు అవే ఆరోపణలతో షర్మిల ఏకంగా సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇంత కాలం కేవలం ఆరోపణలే, కానీ ఇప్పుడు నేరుగా ఫిర్యాదు అందడంతో సీబీఐ ఏం చేయబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా ఎక్కువ అవుతోంది.  అయితే సీబీఐకి ఫిర్యాదు చేసి ఊరుకోకుండా షర్మల ఇప్పుడు మరో సారి హస్తిన పర్యటన పెట్టుకుని ఈడీకి నేరుగా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ,ఈడీ, ఐటీ దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెరాస అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత, సమీప బంధువు, ఎమ్మెల్సీ సంతోష్ రెడ్డి పేర్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల  కాళేశ్వరం అవినీతిపై  ఫిర్యాదుల పరంపర కొనసాగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  

బీజేపీకి గుడ్ బై..తెలుగుదేశం గూటికి కన్నా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే బుధవారం వేగంగా సంభవించిన వరుస సంఘటనలను బట్టి చూస్తే ఔననే అనాల్సి వస్తోంది. అసలుఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.   మంగళ వారం తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను   కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సమస్య అంతా సోము వీర్రాజుతోనే అంటూ   సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నీ తానే అ న్నట్లు సోము వీర్రాజు వ్యవహరించడం వల్లే   ఈ పరిస్ధితి దాపరించిందని..  పార్టీలో ఏం జరుగుతుందో తమకు కూడా తెలియడం లేదని కన్నా వ్యాఖ్యానించారు. జేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు. అసలు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతోందో తమకెవరికీ తెలియడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ అంటే తానొక్కడినే అన్న భావంతో సోము వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు సమస్య అంతా సోము వీర్రాజు వల్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజు వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా తన ముఖ్య అనుచరులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. కన్నా వ్యాఖ్యలు బీజేపీలో కలకలం సృష్టించాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సోము వీర్రాజు కన్నా వ్యాఖ్యలను పట్టించుకోవద్దంటూ క్యాడర్ కు చెప్పారు. కన్నా వ్యవహారాన్ని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇలా ఉండగా కన్నా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హై కమాండ్ ఆయన ప చర్యలకు సిద్ధమైందని అంటున్నారు.   కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడాలని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతనే అసమ్మతి గళం విప్పారని అంటున్నారు.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో గట్టి పట్టు ఉన్న నాయకుడు, మాజీ మంత్రి అయిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తరువాత మారిన రాజకీయ పరిస్థితులలో కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. అయితే ఆయన ఆ పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన తరువాత నుంచి పార్టీలో కన్నాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. కాగా తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే అంటే తీర్మానం చేసిన సంగతి ఆయన గుర్తు చేస్తున్నారు. తన ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర శాఖ రాజధానిగా అమరావతికి మద్దతుగా తీర్మానం చేయడం వల్లే తనను అప్పట్లో అధ్యక్ష పదవి నుంచి తొలగించారని కన్నా తన సన్నిహితుల వద్ద అప్పట్లోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.    ఈ విషయంపై అనుచరులతో భేటీలో చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ అధినేత జగన్, ఆయన విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే కన్నా అధికార వైసీపీ గూటికి చేరే అవకాశం లేదు. అలాగే సొంత సామాజిక వర్గానికి చెందిన  పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన గూటికి చేరుతారా అన్న కోణంలో కూడా రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే.  అమరావతి విషయంలో తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో  మద్దతుగా నిలుస్తున్న కన్నా తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. తనకు, తన కుటుంబంలో ఒకరికి పోటీకి అవకాశం దక్కుతుందని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలలో ఒక చర్చ అయితే నడుస్తోంది. తనకు, తన కుటుంబంలోని ఒకరికి వచ్చే ఎన్నికలలో టికెట్ ఆశిసతున్న కన్నా,, నరసరావు పేట లోక్ సభ స్థానం సత్తెనపల్లి లేదా గుంటూరు వెస్ట్ నుంచి పోటీకి అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా కన్నా లక్ష్మీ నారాయణ అసమ్మతి గళం విప్పడం బీజేపీలోనే కాదు రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది.