కోడి కత్తి కేసులో జగన్ హాజరు కావాల్సిందే.. ఎన్ఐఏ కోర్టు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (జనవరి 31)  జరిగింది.  విచారణ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది. విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేత జగన్ పై కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.  దీంతో ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు చేస్తోంది.  2019 ఆగస్టు 13న ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.  కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 15న ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు మంగళవారం (జనవరి 31) ఆదేశించింది.   మరోవైపు వ్యక్తిగత కారణాలతో  ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ రాఘవ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను కూడా హాజరు పరచాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో 3వ సాక్షిగా ఉన్న జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గత విచారణలో కూడా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు   ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదని  ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.   బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది. అనంతరం కేసు విచారణను జనవరి 31కు వాయిదా వేసింది. ఇప్పుడు వచ్చే నెల 15న జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందిగా  ఆదేశిస్తూ విచారణను అప్పటికి వాయిదా వేసింది. 

కేసీఆర్ భంగపాటు పర్యవశానమేమిటంటే..?

గవర్నర్‌ వ ర్సెస్‌ గవర్నమెంట్‌ అంశంలో కోర్టుకు వెళ్లి  భంగపడి కేసీఆర్ సాధించినదేమిటన్న చర్చ ఇప్పుడు తెలంగాణలో విస్తృతంగా సాగుతోంది. బడ్జెట్‌ను ఆమోదించాలంటూ తెలంగాణ సర్కారు పంపిన లేఖపై.. గవర్నర్‌ తమిళసై ఎంతకూ స్పందించకపోవడాన్ని  కేసీఆర్‌ సర్కారు  సవాల్ గా తీసుకుంది.  రాజ్‌భవన్‌ నుంచి స్పందన లేకపోవడం అవమానంగా భావించింది.  బడ్జెట్‌ ఆమోదించకపోతే రాగల సమస్యలను దృష్టి ఉంచుకుని  గవర్నర్‌కు వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్లింది. ప్రతిష్టకు పోయి ముందు వెనుకలు ఆలోచించకుండా దూకుడు ప్రదర్శించింది. లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసిన కేసీఆర్‌..  తన వైఖరికి భిన్నంగా   చివరి వరకూ పోరాడకుండా  మధ్యలోనే అస్త్ర సన్యాసం చేశారు. ఇది ప్రజలలో బీఆర్ఎస్ పరువునే కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరువునూ మసకబార్చింది. గవర్నర్ విషయంలో కేసీఆర్ దుందుడు వైఖరి అంతిమంగా గవర్నర్ ను విజేతగా నిలిపింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అడ్డుకట్ట వేసిన ధీరురాలిగా ప్రజలలో ఆమె ఇమేజ్ పెంచింది.  ఇంత వరకూ కనీ వినీ ఎరుగని విధంగా ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గవర్నర్ వ్యవస్థ కారణంగా ఇబ్బందులు పడుతున్న బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలూ, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేసీఆర్ ఈ పోరాటంలో విజయం సాధిస్తే తామూ అదే బాట పట్టాలని భావించారు. కేసీఆర్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఫలితం ఏలా వచ్చినా కేసీఆర్ చివరి వరకూ నిలబడతారని కూడా ఆశించారు. అయితే కేసీఆర్ అనూహ్యంగా మధ్యలోనే అస్త్రసన్యాసం చేసి పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.  అక్కడితో అయిపోలేదు.. ఈ కేసు విషయంలో రాజ్ భవన్ అన్ని విధాలుగా పై చేయి సాధించింది. ఇప్పట్లో గవర్నర్ వ్యవస్థపై ఎవరూ కూడా ధిక్కార ధోరణి ప్రదర్శించాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే పరిస్థితిని కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం కల్పించింది. ప్రభుత్వంలో ఉన్న వారు గవర్నర్‌ను విమర్శిస్తున్నారంటూ, గవర్నర్‌ తరఫు న్యాయవాది కోర్టు కు చెప్పారు. దీంతో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది   ఇకపై గవర్నర్‌ను విమర్శించవద్దని ప్రభుత్వానికి చెబుతానంటూ  సమాధానం ఇచ్చారు. అంటే గవర్నర్ తో న్యాయపోరాటానికి సిద్ధమైన కేసీఆర్ ఎంతగా డిఫెన్స్ లో పడిపోయారో అర్ధమౌతుంది.  గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలను నేను కూడా ఖండిస్తా. అలాంటి మాటలు సరికాదు. ఆమె ఒక మహిళ అని ఆమెను విమర్శించేవారు గుర్తించాలి. మహిళను గౌరవించాలి. నేను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతా’నని.. దవే వినయపూర్వకంగా హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో గవర్నర్ పైనా, గవర్నర్ వ్యవస్థపైనా ఇంత కాలం బీఆర్ఎస్ చేస్తూ వచ్చిన విమర్శలన్నిటికీ కేసీఆర్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసినట్లే అయ్యిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్నవించగా, గవర్నర్‌ తన రాజ్యాంగపరమైన విధులు నిర్వహిస్తారని గవర్నర్‌ న్యాయవాది చెప్పారు. అంతే విచారణను కోర్టు ముగించింది. ఈ మొత్తం వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత సాధించిందేమైనా ఉందంటే.. అది తన అశక్తతను చాటుకోవడం మాత్రమే. వ్యూహ రహితంగా అహంకారంతో  వ్యవహరిస్తే తలదించుకోకతప్పదని చాటడమే.   గవర్నర్ తో న్యాయపోరాటానికి సిద్ధమైన కేసీఆర్ ఆ విషయంలో  న్యాయపరమైన అధ్యయనం లేకుండా వ్యవహరించి తన ప్రతిష్టనూ, ప్రభుత్వ ప్రతిష్టనూ కూడా మసకబార్చుకున్నారు.   గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ ఉపసంహరించుకోకుండా.. న్యాయ పోరాటం కొనసాగించి ఉంటే, కేసీఆర్‌కు జాతీయ స్థాయిలో పేరు వచ్చేదని బీఆర్‌ఎస్‌ వర్గాలు  బావిస్తున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతున్న నేతగా కేసీఆర్,  గవర్నర్‌ చర్యలపై బీఆర్‌ఎస్‌ పోరాటాన్నికొనసాగించి ఉంటే..  ఆయనకు దేశ వ్యాప్తంగా బీజేపీయేతర పార్టీల మద్దతు పెరిగి ఉండేది.  జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కు రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు వచ్చి ఉండేది.  అయితే కేసీఆర్ పిటిషన్‌ ఉపసంహరణతో ఆ అద్భుత అవకాశాన్ని చేజార్చుకున్నారన్న భావన పార్టీ వర్గాలలో వ్యక్తమౌతోంది. జాతీయ రాజకీయాలలో ఎదగాలని భావిస్తున్న బీఆర్ఎస్ కు ఈ పరిణామం ఒక ఎదురు దెబ్బేనని అంటున్నారు. ఇక బీఆర్ఎస్ కు మద్దతు విషయంలో పార్టీలు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయని పరిశీలకులు సైతం అంటున్నారు. 

సివిల్ సర్వెంట్ల కేటాయింపు కేసు విచారణకు రాకపోవడంపై అనుమానాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కేడర్‌కి వెళ్లినా.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. తెలంగాణలోనే కొనసాగుతున్నారు.  డీవోపీటీ ఆదేశాలపై అప్పట్లో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ( క్యాట్‌)కి వెళ్లి స్టేతెచ్చుకొని తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.  సోమేశ్‌ కుమార్ విషయమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం ఆ అధికారుల పరిస్థితి ఏమిటన్న అంశంపై చర్చ మొదలైంది. తెలంగాణలో పని చేస్తున్న 12 మంది ఏపీ క్యాడర్ సివిల్ సర్వెంట్ల కేటాయింపుపై  ఈ నెల 27న హైకోర్టులో వాచారణకు రావాల్సి ఉండగా ఇంత వరకూ రాలేదు.   12 మంది బ్యూరోక్రాట్ ల క్యాడర్ పై వేసిన పిటిషన్ ను  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్  విచారించి ట్రైబ్యునల్ వేర్వేరుగా తీర్పులు వెలువరించిందని   అభిప్రాయడింది. అన్ని పిటిషన్ లను  రెగ్యులర్ బెంచ్ విచారిస్తుందని పేర్కొంది. అయితే వ్యక్తిగత వాదనలు వినిపిస్తామని  అధికారుల తరపు న్యాయవాదులు  కోర్టుకు  తెలుపగా తదుపరి విచారణను 27 కు వాయిదా వేసింది. అయినా ఆ కేసు విచారణకు రాలేదు. ఎందుకు రాలేదన్నదానిపై పలు అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.  ప్రస్తుతం ఇన్‌చార్జ్ డీజీపీ హోదాలో ఉన్న అంజనీ కుమార్​ కూడా ఏపీ క్యాడరే. ఆయనతో పాటు ఐపీఎస్​లు సంతోష్ మెహ్రా, అభిలాష్ భిష్త్, ఏవీ రంగనాధ్ ఉన్నారు. ఐఏఎస్‌లలో టీఎస్​పీఎస్సీ సెక్రటరీగా ఉన్న వాణీ ప్రసాద్, ఎడ్యుకేషన్ సెక్రటరీ వాకాటి కరుణ, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రొనాల్డ్​ రాస్, ప్రభుత్వ అదనపు కార్యదర్శి, ఆయుష్ కమిషనర్ ఎ.ప్రశాంతి, మరో ఐఏఎస్ సేతు మాధవన్, కాటా ఆమ్రపాలి (ప్రస్తుతం సెంట్రల్ డిప్యూటేషన్) ఏపీలో పనిచేయాల్సి ఉండగా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణ క్యాడర్​లో పనిచేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌‌కు వచ్చిన జడ్జిమెంట్ మాదిరే వీళ్లకూ వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  అయితే ఈ కేసు విచారణకు బెంచ్ మీదకు రాకపోవడంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇక సోమేష్ కుమార్ విషయానికి వస్తే ఆయన ఇప్పటికే కోర్టు తీర్పు మేరకు తెలంగాణ నుంచి రిలీవ్ అయి ఏపీకి వెళ్లిపోయారు. అక్కడ ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. వాస్తవానికి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించే అవకాశం ఉన్నా సోమేష్ కుమార్ ఆ పని చేయలేదు. అసలు కోర్టు తీర్పు రాగానే ఆఘమేఘాల మీద సోమేష్ కుమార్ ను రిలీవ్ చేయడానికి కారణం  గత కొంత కాలంగా సీఎస్ సోమేష్ కుమార్ తీరు పట్ల కేసీఆర్ ఒకింత ఆగ్రహంగా ఉండటమే కారణమని అంటున్నారు.   న్యాయవ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కారానికి అవసరమైన ఉత్తర్వులు జారీ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశించినా సోమేష్ కుమార్ పట్టించుకోలేదని,  అలాగే ధరణి పోర్టల్ లో లోపాల సవరణ విషయంలో కూడా ఆయన స్పందన పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతారు. అన్నిటికీ మించి ఒక స్థలం విషయంలో మంత్రి కేటీఆర్, సోమేష్ కుమార్ మధ్య విభేదాలు కూడా సోమేష్ రిలీవ్ విషయంలో ముఖ్యమంత్రి వేగంగా నిర్ణయం తీసుకోవడానికి కారణమని చెబుతున్నారు. అందుకే సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నా సోమేష్  ఆ దిశగా ఆలోచన చేయలేదనీ, ఏపీకి వెళ్లి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ లో పని చేస్తున్న ఏపీ కేడర్‌కి చెందిన అధికారులకు కూడా సోమేష్ అంశాన్ని బూచిగా చూపి వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించకుంటే అదే జరుగుతుందన్న సందేశాన్ని కేసీఆర్ ఇచ్చినట్లైందని అంటున్నారు.

ఉచ్చు బిగుసుకుంటోందా?

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ ఆవినాష్ రెడ్డిని సీబీఐ అధికారుల విచారణ తరువాత  చోటు చేసుకొంటున్న పరిణామాల వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. సీబీఐ అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటల పాటు   అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. ఆ సందర్భంగా అవినాష్ రెడ్డి సీబీఐ ప్రశ్నలకు వా  సమాధానం చెప్పినా..  వివేకా దారుణ హత్య తరువాత  అవినాష్ రెడ్డి పోన్ నుంచి వెళ్లిన కాల్ డేటా మాత్రం..  ఈ విచారణలో అత్యంత కీలకంగా మారిందని అంటున్నారు. ఆ క్రమంలో ఈ కాల్ డేటాపై సీబీఐ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి అయిన అవినాష్ రెడ్డి.. ఎవరెవరికి కాల్ చేసిందీ పూసగుచ్చినట్లు చెప్పేశారని వైసీపీలోని ఒక వర్గం అంటున్నది.  మరీ ముఖ్యంగా రెండు నెంబర్లకు అనినాష్ రెడ్డి ఫోన్‌ నుంచి ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు.. వాటిపై అవినాష్ రెడ్డిని గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. ఆ నెంబర్లు ఎవరివో  ఆయన సీబీఐ అధికారులకు వెల్లడించారని అంటున్నారు. ఆ రెండు నంబర్లలో ఒకటి తాడేపల్లి ప్యాలెస్ లో  అత్యంత కీలక వ్యక్తికి సహాయకుడిగా వ్యవహరిస్తున్న నవీన్‌దని..  ముఖ్యమంత్రి జగన్ సతీమణి భారతితో మాట్లాడాలంటే.. ముందుగా నవీన్‌కు ఫోన్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సీబీఐ అధికారులకు అవినాష్ రెడ్డి చెప్పినట్లు  అధికార పార్టీలోని ఓ వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. దీంతో దీంతో వివేకా హత్య జరిగిన రోజు.. ఆ తర్వాత   అవినాష్ రెడ్డి పలు మార్లు సీఎం సతీమణి భారతితో  మాట్లాడినట్లు సీబీఐ అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారనీ...  అందుకే నవీన్ కు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేశారని చెబుతున్నారు. అంతే కాకుండా   నాటి విపక్ష నేత   జగన్‌తో మాట్లాడాలంటే..  మరో వ్యక్తికి ఫోన్ చేయాల్సి ఉంటుందని... అతడు ప్రస్తుతం ముఖ్యమంత్రి   జగన్ వద్ద కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా సీబీఐ అధికారులకు కడప ఎంపీ   అవినాష్ వివరించినట్లు సదరు వర్గంలో చర్చ సాగుతోంది.     ఈ నేపథ్యంలోనూ నవీన్‌తోపాటు ఆ వ్యక్తికి కూడా సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారని.. అంటున్నారు. అయితే   ఏ రోజు.. ఏ సమయంలో   విచారణకు హాజరుకావాలి.. అనే అంశాలను మాత్రం సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొనలేదంటున్నారు. ఏది ఏమైనా నవీన్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తే..   వివేకా హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందనీ...  ఆ తర్వాత సీఎం సతీమణికి  భారతీకి సైతం నోటీసులు జారీ చేసే అవకాశం లేకపోలేదని వైసీపీలోని ఓ వర్గం భావిస్తోంది.   వివేకా హత్య జరిగిన రోజు.. సాక్ష్యాలు చేరిపేసేందుకు కడప ఎంపీ వైయస్ అవినాష్ ప్రయత్నించారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.. అలాగే వివేకా హత్య కేసులో ప్రస్తుత సీఎం  జగన్ హస్తం ఉందంటూ ఇప్పటికే హు కిల్డ్ బాబాయి అంటూ ప్రతిపక్షాలు.. వివిధ సందర్భాల్లో... పలు వేదికలపై నుంచి బహిరంగంగానే  నిలదీస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వివేకా హత్యకు స్కెచ్ చేసిన సూత్రధారుల పని పట్టేందుకు సీబీఐ అధికారులు లోతైన విచారణ జరపాలని నిర్ణయించారని.. ఆ క్రమంలో సీబీఐ అధికారుల విచారణకు వైసీపీలోని  కీలక వ్యక్తులు తెరపైకి రానున్నారనే ఓ చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది.

విశాఖే రాజధాని.. జగన్ ప్రకటన కోర్టు ధిక్కరణేనా?

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  మంగళవారం (జనవరి 31) విచారణకు రానుంది. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన ఏపీ రాజధాని విశాఖపట్నమే అంటూ చేసిన ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో మంగళవారం (జనవరి 30) జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని ఇప్పటికే హైకోర్టు తేల్చి చెప్పింది.   దీనిపై జగన్ సర్కార్ సుప్రీం కోర్టుకు సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు. అంటే ప్రస్తుతం రాజధాని అమరావతి. అమరావతిని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు.  అయితే జగన్ తాను   విశాఖ వెళ్లబోతున్నానని.. అదే రాజధాని అని ప్రకటించారు. ఇది  కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. న్యాయ నిపుణులు కూడా జగన్ వ్యాఖ్యలు కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అంటున్నారు. దీనిపై ప్రముఖ న్యాయవాది శ్రవణ్  ఇప్పటి వరకూ మూడు రాజధానుల పేరుతో జగన్ ప్రజల్ని మోసం చేసిన జగన్ ఇప్పుడు.  విశాఖ ఏకైక రాజధాని అని ప్రకటించడం ద్వారా ఇన్వెస్టర్ లను కూడా మోసం చేయడానికి సిద్ధమయ్యారని అన్నారు. ఏది ఏమైనా జగన్ ప్రకటన కచ్చితంగా సబ్ జ్యుడిస్ అవుతుందని, ఈ విషయాన్ని పిటిషనర్లు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకుళ్లాలని ఆయన అన్నారు. రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరగనున్న నేపథ్యంలో జగన్ ప్రకటన సంచలనంగా మారింది.  ఢిల్లీ సమావేశంలో జగన్ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలూ కల్పిస్తుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ గత మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉందన్నారు. కానీ అవేవీ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. అసలు ఎవరూ పట్టించుకోవడం లేదు. విశాఖపట్నమే రాజధాని అంటూ అయన చెప్పిన మాటలపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

అందరి చూపు నిర్మలమ్మ బడ్జెట్ వైపు

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి. పార్లమెంట్‌ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేశారు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ ద్రౌపదీ ముర్ము, పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన తొలి ప్రసంగం  రాజ్యాంగ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని, ముఖ్యంగా మహిళకు ఏంతో గర్వ కారణంగా నిలిచి పోతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు  మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన   మోడీ  ఈరోజు వెలువడిన ఐఎంఎఫ్ తాజా నివేదికను పరోక్షంగా ప్రస్తావిస్తూ  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందే విశ్వనీయ వర్గాల నుంచి  భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల సందేశాలు అందాయని సంతోషం వ్యక్తపరిచారు. అలాగే, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అందరూ మెచ్చే, అందరి ఆకాంక్షలను నెరవేర్చే బడ్జెట్ రూపొందించారని భావిస్తున్నానని, సిటిజెన్ ఫస్ట్  విధానాన్ని ముందుకు తీసుకుపోతామని అన్నారు.   కాగా బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ,పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తోలి రోజు   మంగళవారం(జనవరి 31) లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్‌సభను బుధవారం (ఫిబ్రవరి 1) కి వాయిదా వేశారు. అంతకుముందు పార్లమెంట్‌లో దివంగత ఎంపీలు, మాజీ సభ్యులకు నివాళులర్పించారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్‌ ఉభయసభల ముందు ప్రవేశపెట్టడం ఆనవాయితీ.  ప్రధాన ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందించింది. గతేడాది పలు రంగాల ఆర్థిక స్థితిగతులను ఇందులో వివరించారు. దీంతో పాటు ఆర్థిక వృద్ధికి చేపట్టాల్సిన సంస్కరణలను పేర్కొన్నారు. కాగా, 2023-24 కేంద్ర బడ్జెట్‌ ను నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం  బుధవారం(జనవరి 31 ) 2023-24 వార్షిక బడ్జెట్‌  ప్రవేశపెట్టనున్న తరుణంలో  అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)  భారత వృద్ధిరేటుకు సంబంధించి కీలక అంచనాలను వెల్లడించింది. ఈ ఆర్థిక ఏడాది దేశ జీడీపీ (జీడీపీ) వృద్ధిరేటు 6.8 శాతంగా నమోదవుతుందని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అది 6.1 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేసింది. ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌కు సంబంధించిన జనవరి అప్‌డేట్‌ను ఐఎంఎఫ్‌  విడుదల చేసింది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఏడాది 3.4 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. వచ్చే సంవత్సరానికి అది 2.9 శాతానికి చేరుతుందని తెలిపింది.ఈ ఏడాది భారత వృద్ధి నెమ్మదించడానికి బాహ్య పరిణామాలే కారణమని ఐఎంఎఫ్‌ పేర్కొంది. ఆసియాలోని వర్ధమాన దేశాల వృద్ధిరేటు 5.3 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. చైనా ఆర్థిక వ్యవస్థలో కుదుపుల వల్ల 2022లో అది 4.3 శాతానికే పరిమితమైనట్లు గుర్తు చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ది ప్రకాశవంతమైన స్థానమని ఐఎంఎఫ్‌ తెలిపింది. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం వాటా భారత్‌, చైనాలదేనని వెల్లడించింది. అదే అమెరికా, యూరోప్  కలిసి కేవలం 10 శాతం మాత్రమే ప్రపంచ ఆర్థిక వృద్ధికి దోహదం చేయనున్నట్లు పేర్కొంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మందగమనం మరింత తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఈ దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు 1.2 శాతానికే పరిమితమవుతుందని అంచనా వేసింది. అన్నిటికీ మించి  ఐఎంఎఫ్ తీపి  భారత్‌లో ద్రవ్యోల్బణం వచ్చే మార్చితో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి తగ్గుతుందని తీపి కబురు చెప్పింది. వచ్చే ఏడాది అది మరింత తగ్గి 4 శాతంగా నమోదవుతుందని తెలిపింది. మరోవైపు ప్రపంచ ద్రవ్యోల్బణం ఈ ఏడాది 6.6 శాతంగా, వచ్చే ఏడాది 4.3 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. ఇక ఇప్పుడు   ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్ ప్రవేశ పెట్టానున్న, 2023 – 2024 వార్షిక బడ్జెట్ వైపు అందరి చూపూ కేద్రీక్రుతమైంది. ప్రధాని మోడీ సంకేత మాత్రంగా చెప్పిన విధంగా, నిర్మలమ్మ అందరి అందరి ఆకాంక్షలను నెరవేరుస్తారా లేదా .. చూడవలసి వుంది.

రిషీకేశ్ లో విరుష్క దంపతులు

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ దంపతులు ఏమాత్రం తీరికి దొరికినా వీరు ఇలాఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు వెళుతుంటారు.  ఇటీవలే వీరు బృందావనంలో దర్శనానికి వెళ్లి వచ్చిన సంగతి విదితమే.  తాజాగా వీరు రిషికేశ్ లోని ఆశ్రమంలో పూజలు చేసి, ప్రసాదాలు  పంచారు. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు ముందు విరాట్ ఇలా తన సతీమణితో కలిసి ఆధ్మాత్మిక యాత్రకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రిషికేశ్ లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో ఈ దంపతులు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలకమైన ఆస్ట్రేలియా టూర్ కు ముందు విరాట్ కోహ్లీ తన సతీమణితో కలిసి ఆధ్మాత్మిక యాత్రకు వెళ్లడం, ఆందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడం విశేషాలు. రిషీకేశ్ లో విరుష్క జంట యాత్రకు సంబంధించి ఫొటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.

వివేకా హత్య కేసులో తాడేపల్లి డొంక కదులుతోందా? అవినాష్ విచారణలో ఏం చెప్పారు?

వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందులలో సీబీఐ తీగ లాగితే తాడేపల్లి ప్యాలస్ లో డొంక కదులుతోందా? ఈ కేసులో వైఎస్ అవినాష్ ను సీబీఐ అధికారులు విచారిస్తే.. ప్రకంపనలు తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత శనివారం (జనవరి 28) సీబీఐ అధికారుల నోటీసుల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. విచారణలో అవినాష్ అనివార్యంగా కొన్ని విషయాలు వెల్లడించాల్సి వచ్చిందని అంటున్నారు. అన్ని విధాలుగా ప్రిపేర్ అయ్యి వచ్చినా, సీబీఐ అధికారుల ప్రశ్నలకు ముక్తసరిగా, కాదు, తెలియదు అంటూ సమాధానాలు చెప్పాలని నిర్ణయించుకుని వచ్చినా అవినాష్ కు విచారణ సందర్భంగా ఆ అవకాశం లేకపోయిందని చెబుతున్నారు. అవినాష్ రెడ్డి విచారణ అనంతరం సీబీఐ దూకుడు చూస్తుంటే కీలక బ్రేక్ సాధించిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్ర ధారులు ఎవరన్న నిగ్గు తేలే సమయం ఆసన్నమైందన్న చర్చ కూడా సాగుతోంది.   అవినాష్ రెడ్డి విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా సీబీఐ జగన్ సర్కార్ లో అత్యంత ముఖ్యులుగా ఉన్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసిందని అంటున్నారు.  వారి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అన్నిటికీ మించి సీబీఐ విచారణకుహాజరయ్యేందుకు హైదరాబాద్  చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.. సీబీఐ కార్యాలయానికి వెళ్లడానికి ముందు  ఏపీ సీఎం జగన్ తల్లి విజయమ్మతో   లోటస్ పాండ్ కు వెళ్లి మరీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకుని, ఆమెతో కొద్ది సేపు మంతనాలు జరిపిన తరువాతనే ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా ఆయన కోరిక మేరకు న్యాయవాదిని సీబీఐ అధికారులు అనుమతించలేదు. లాయర్ ను బయటే నిలిపివేసి అవినాష్ రెడ్డిని మాత్రమే లోనికి అనుమతించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి విలేకరులతో గంభీరంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పినా, తనను అనవసరంగా వేధిస్తున్నారంటూ ఆరోపణలు చేసినా ఆయన ముఖంలో, మాటల్లో గాభరా స్పష్టంగా గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ దాదాపుగా దూరం పెట్టిన విజయమ్మతో భేటీ అవ్వడానికి కారణమేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.   ఇక విషయానికి వస్తే సీబీఐ అవినాష్ రెడ్డి విచారణ తరువాత మరో ఇద్దరు ముఖ్యులకు నోటీసులు జారీ చేసింది. ఆ ఇద్దరు ముఖ్యుల విచారణ మొత్తం కాల్ డేటాపైనే సాగనుందని అంటున్నారు.  ఆ విచారణలో సంచలన సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చే  అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పోస్టర్ల కలకలం.. కాంగ్రెస్ ఐక్యతకు భగ్నం!?

తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మార్పు తరువాత కూడా పార్టీలో పరిస్థితులు కుదుటపడిన దాఖలాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరిగినప్పటి నుంచీ పార్టీ లో అసమ్మతి పెచ్చరిల్లింది. సీనియర్, జూనియర్ అంటూ పార్టీ రెండుగా చీలిపోయిన దాఖలాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన అధిష్ఠానం నష్ట నివారణ చర్యలలో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాకూర్ ను మార్చి ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్యం ఠాకూర్ ను నియమించింది. ఆయన పార్టీలో విభేదాల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే ఉప్పు నిప్పుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు గాంధీ భవన్ వేదికగా కలుసుకుని ముచ్చటించుకున్నారు. దీంతో తాత్కాలికంగానైనా పార్టీలో విభేదాలు చల్లారాయని అంతా భావించారు. అయితే కోమటిరెడ్డి సొంత జిల్లాలో ఆయనకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు కాంగ్రెస్ లో అసమ్మతి అగ్ని చల్లారలేదని అంటున్నారు. కోవర్ట్ వెంకటరెడ్డి అంటూ వెలసిన ఆ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్నది తెలియకపోయినా.. నిఖార్సైన కాంగ్రెస్ వాదుల పేరిట ఈ పోస్టర్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కోమటిరెడ్డి సొంత జిల్లా అయిన నల్లొండ జిల్లాలో వెలిసాయి. చందంపల్లి వద్ద వెలసిన ఈ పోస్టర్లలో కోమటిరెడ్డికి ‘నిఖార్సైన కాంగ్రెస్ వాదులు’ పలు ప్రశ్నలు సంధించారు. అసలు కోమటిరెడ్డికి కాంగ్రెస్ సభ్యత్వం ఉందా అంటు ప్రశ్నించారు.   సొంత సోదరుడిని నార్కట్ పల్లిలో జెడ్పీటీసీగా ఎందుకు గెలిపించుకోలేని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా పార్టీ స్టార్ క్యాంపెయినర్ అవుతారని నిలదీశారు. ఇప్పుడిప్పుడే పార్టీలో పరిస్థితులు కుదుటపడుతున్నాయని భావిస్తున్న తరుణంలో వెలసిన ఈ పోస్టర్లు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ పోస్టర్ల నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్ లో విభేదాల భగ్గుమనడం ఖాయమని సీనియర్లు అంటున్నారు.  ఈ పోస్టర్ల వెనుక ఉన్నదెవరైనా, ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మాణిక్ ఠాక్రే దౌత్యంతో సంతృప్తి చెందని వారే ఈ చర్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. రాహుల్ జోడో యాత్ర పూర్తయి.. ఇక రాష్ట్ర కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు ఉపక్రమించనున్న తరుణంలో వెలసిన ఈ పోస్టర్లు కలకలం రేపాయి.

కేంద్రంలో సుస్థిర, నిర్మాణాత్మక ప్రభుత్వం.. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి.  ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.  స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి అంటే 2047 నాటికి భారత్  పూర్వ వైభవం, ఆధునిక కాలపు    సువర్ణాధ్యాయాల సమ్మేళనంతో వెలుగోందాలని ఆకాంక్షించారు.  భారతదేశంమానవతా బాధ్యతలను నిర్వర్తింగల సామర్థ్యం కలిగి స్వయం సమృద్ధ దేశంగా నిలవాలని, వందేళ్ల స్వాతంత్ర్య భారత దేశం పేరరికం లేని సుసంపన్న దేశంగా నిలవాలని ద్రౌపది ముర్ము అన్నారు. . అది పేదరికం లేని భారతదేశం కావాలని, ఇందులో మధ్య తరగతి కూడా సంపన్నంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. నేడు భారత్ ఆత్మవిశ్వాసంలో అత్యున్నత స్థాయికి చేరుకుందనీ, ప్రపంచ దేశాలు మన దేశాన్ని చూసే దృక్కోణం మారిందన్నారు. ప్రపంచంలోని అన్ని సమస్యలకూ భారత్ సమాధానం చెప్పగలదనీ, పరిష్కారమార్గాలు సూచించగలదన్న ఆశతో ప్రపంచ దేశాలు ఉన్నాయన్నారు.  ఇందుకు దేశంలో స్థిరమైన, నిర్భయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన ప్రభుత్వం దేశంలో అధికారంలో ఉండటమే కారణమని ద్రౌపది ముర్ము అన్నారు.  జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడం నుంచి ట్రిపుల్ తలాక్ రద్దు వరకు భారత  ప్రభుత్వం కీలకమైన  నిర్ణయాలు తీసుకుందని, అలాగే అవినీతి అంతానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందని చెప్పారు.ప్రజాస్వామ్యానికి , సామాజిక న్యాయానికి  అతి పెద్ద శత్రువు అవనీతేనని పేర్కొన్నారు.  అవినీతికి వ్యతిరేకంగా నిరంతర పోరాటం కొనసాగుతోందన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మూడేళ్లలో సుమారు 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీటిని అందిచినట్లు పేర్కొన్నారు.   గతంలో పన్ను రిటర్న్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చేదని, ఇవాళ ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసిన రోజుల వ్యవధిలోనే వాపసు లభిస్తోందన్నారు.  వివక్ష లేకుండా సమాజంలోని ప్రతి వర్గానికి పని చేసిందన్నారు.  పూర్తి పారదర్శకతతో కోట్లాది మందికి  .27 లక్షల కోట్లకు పైగా విలువైన పథకాలు అందాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతుల ఆకాంక్షల్ని పూర్తి చేసిందన్నారు. ఇప్పుడు వారికి ప్రాథమిక సౌకర్యాలు లభిస్తున్నాయని, ఈ ప్రజలు కొత్త కలలను చూడగలుగుతున్నారన్నారు. దేశంలోని 500 బ్లాకుల్లో వైబ్రెంట్ జిల్లాల కార్యక్రమం అమలవుతోందని రాష్ట్రపతి తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలను అభివృద్ధి చేయడానికి 'వైబ్రెంట్ గ్రామాలు' కార్యక్రమం కూడా ప్రవేశపెట్టామన్నారు. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా పేదలకు జీవించడం ఎలా కష్టతరంగా మారిందో చూశామని, కానీ భారత్ లో మాత్రం పేదల జీవితాలను రక్షించడంతోపాటు దేశంలోని పేదలు ఎవరూ ఖాళీ కడుపుతో నిద్రపోకుండా చూసేందుకు కేంద్రం ప్రయత్నించిందన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పొడిగించాలని నిర్ణయించినందుకు సంతోషంగా ఉందని రాష్ట్రపతి తెలిపారు.   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలలో మహిళా సాధికారత ప్రధానమైందని రాష్ట్రపతి తెలిపారు. ఈ రోజు మనం 'బేటీ బచావో, బేటీ పఢావో' విజయాన్ని చూస్తున్నామని, దేశంలో మొట్టమొదటిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువైందని, మహిళల ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగుపడిందని తెలిపారు.

ఉండవల్లి.. ఊసరవెల్లి

ఉండవల్లి అరుణ్ కుమార్.. తెలుగు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరు. రాష్ట్ర విభజన తరువాత నుంచీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా.. ఉండుండి ఒక్కసారి తన విలక్షణ, సంచలన,  విశ్లేషణలతో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి ఉండవల్లి గత ఏడాది జూన్ నెలలో  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. అప్పట్లో ఆ భేటీ పెను సంచలనం అయ్యింది. ఉండవల్లిని కేసీఆర్ ఎందుకు పిలిపించుకున్నారు? కేసీఆర్ పిలిచారు సరే ఉండవల్లి ఎందుకు వెళ్లారు? అన్న చర్చ ఉభయ తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. ఇద్దరు కలిశారంటే అంత చర్చ జరగాల్సిన అవసరం లేదు. కానీ ఉండవల్లి, కేసీఆర్ భేటీపై మాత్రం సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది.   ఎందుకంటే రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో మొదటి వరుసలో ఉన్న ఉండవల్లి. . రాష్ట్ర విభజన జరిగిన ఎనిమిదేళ్ల తరువాత గత జూన్ లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ తో భేటీ కావడం,  అలాగే విభజనను పూర్తిగా వ్యతిరేకించి, సమైక్యాంధ్ర బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తింపు పొందిన ఉండవల్లిని కేసీఆర్ ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ చర్చించడం నిజంగానే అప్పట్లో  సంచలనం సృష్టించింది. అన్నిటికీ మించి  ఆ భేటీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే కూడా ఉండటం మరిన్ని అనుమానాలకు కారణభూతమైంది. అనూహ్య నిర్ణయాలు, వ్యూహాలకు పెట్టింది పేరైన పీకే సమక్షంలో భిన్న ధృవాల్లాంటి కేసీఆర్, ఉండవల్లిల భేటీ అప్పట్లో ఒక సంచలనం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ   ఎన్నికల హీట్ పీక్స్ లో ఉన్న సమయంలో జరిగిన ఈ భేటీపై పలు విశ్లేషణలు వచ్చాయి.  ఎందుకంటే.. అప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు   తెరాస (అప్పటికి), వైసీపీ కూడా తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి.  ఇప్పటికీ అదే పరిస్థితి ఉందనుకోండి అది వేరే సంగతి. ఇరు రాష్ట్రాలలోనూ అధికారంలో పార్టీలకు వ్యూహకర్త పీకేనే. ఇప్పుడు ఆయన రాజకీయ నేత అవతారమెత్తి, వ్యూహకర్తగా రిటైర్ అయిపోయినా.. ఆయన శిష్యగణం ఆయన మార్గదర్శకత్వంలో ఆ బాధ్యతలు నెరవేరుస్తోంది. అంటే  ఇరు రాష్ట్రాలలోనూ అధికార పార్టీలు మరో సారి అధికారం చేపట్టడానికి వ్యూహరచన అప్పటికీ, ఇప్పటికీ పీకేనే.  ఆయన సమక్షంలో ఉండవల్లి, కేసీఆర్ ల భేటీ వెనుక వ్యూహం ఏమిటన్నది అప్పుడు కాదు ఇప్పుడు బయట పడింది. అదీ తన వాచాలతతో ఉండవల్లి స్వయంగా ఏర్పాటు చేసి.. తన రాజకీయ గురువు వైఎస్ తనయుడు, ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ కు కొన్ని సలహాలు (బయటకు మందలింపుగా కనిపిస్తాయి) కాదు కాదు హితబోధ చేయడం ద్వారా బయటపెట్టారు. బీఆర్ఎస్ ఏపీలో అడుగులు వేయడం, అందుకు జగన్ రెడ్డి స్వాగతించడం వీటన్నిటి వెనుకా.. తెరాస, వైసీపీల మైత్రీ వ్యూహం ఉన్నదన్నది పరిశీలకుల విశ్లేషణ. ఇక్కడే ఉండవల్లి తన మార్క్ రాజకీయం చూపారు. ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  తెలుగుదేశం, జనసేన పొత్తపై చేసిన వ్యాఖ్యలు పైకి చెప్పేదొకటి.. ఆ మాటల అంతరార్ధం మరొకటి అన్న విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. సమైక్యాంధ్ర కోసం అంటూ రాజకీయ సన్యాసం ప్రకటించిన ఉండవల్లి ఈ ఎనిమిదిన్నరేళ్లలోనూ ప్రత్యక్షంగా ఏ పార్టీలోనూ చేరలేదు కానీ.. తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కష్టం వచ్చిందంటే మాత్రం.. సందర్బం ఉన్నా.. లేకున్నా.. విభజననాటి ఉద్వేగాలను రెచ్చగొట్టి జగన్ కు ఏదో ఒక మేరకు సానుకూల వాతావరణం క్రియేట్ చేయడానికి నానా ప్రయత్నాలూ చేస్తూ వస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఒక్కో సారి జగన్ తప్పులు ఎత్తి చూపుతారు. మందలిస్తారు. ఏం చేసినా జగన్ కోసమే. తాజాగా ఆయన తెలుగుదేశం, జనసేన పొత్తు ఉండాలి కానీ, ఎలా ఉండాలంటే అంటూ తనదైన భాష్యం చెప్పారు. ఆ భాష్యం అంతరార్ధం మరో మారు జనగ్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నదే. తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుంటే కనుక చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని పనవ్ కల్యాణ్ కోసం త్యాగం చేయాలట. అలాగే పవన్ కల్యాణ్ కూడా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధం కాకూడదట. ఇదీ జనసేన, తెలుగుదేశం పొత్తు కు ఎవరూ అడగకుండానే తగుదునమ్మా అంటూ ఉండవల్లి పెట్టిన కండీషన్. అక్కడితో ఆగలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుంటే పవన్ పొత్తుకు అంగీకరించవద్దని సలహా ఇచ్చారు. అలా అంగీకరించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమీ లేదని ఉండవల్లి చెబుతున్నారు. ఎందుకంటే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.. అలాగని జనసేనా రాదు.. కానీ తెలుగుదేశం అధికారానికి దూరమైతే ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా జనసేనే ఉంటుందన్నది ఉండవల్లి భాష్యం. ఆయన పైకి ఏ డిక్షన్ తో మాట్లాడినా, ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినా.. ఆయన మాటల సారాంశం మాత్రం జగన్ కు మరో చాన్స్ అన్నదే. తన మాటల గారడీతో జగన్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించడానికి ఆయన ఎన్ని ముసుగులు వేసుకునైనా వస్తారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో మద్యం ధరల నుంచి పోలవరం వరకూ ప్రతి విషయంలోనూ నోటికి మైకు కట్టుకుని మరీ విమర్శలు గుప్పించిన ఉండవల్లి జగన్ హయాంలో మద్యం బ్రాండ్లు, రేట్లపై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు.   అసలు రాష్ట్రంలో సమస్యలన్నవే లేవన్నట్లుగా ఆయన ఎన్నికల పొత్తుల విషయంలో జగన్ కు ఏది మేలో అన్యాపదేశంగా ఉపదేశిస్తున్నట్లు కనిపిస్తున్నది. జనసేన పార్టీకి రాష్ట్రంలోని 175 స్థానాలలోనూ సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునే అవకాశం లేదన్నది ఉండవల్లి అంచనాగా కనిపిస్తున్నది.. అదే సమయంలో ఒంటరి పోరులో విజయం సాధించే సత్తా తెలుగుదేశం పార్టీకి లేదన్నది ఆయన సొంత విశ్లేషణ. ఈ రెంటినీ ముడిపెట్టి వారి పొత్తు పొసగకుండా చేస్తే.. అధికారం జగన్ దే అన్నది ఆయన ఆశ.  ఈ ఒక్క విశ్లేషణతో కేసీఆర్ తో ఉండవల్లి ఎందుకు భేటీ అయ్యారు, బీఆర్ఎస్ ఏపీ శాఖ బాధ్యతలకు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఎందుకు తెలంగాణ సీఎం కట్టబెట్టారు. దానిని ముఖ్య సలహాదారు సజ్జల ఎందుకు స్వాగతించారు.. ఆ వెంటనే పొత్తుల విషయంలో అడగకుండానే ఉండవల్లి సలహాలు ఎందుకు ఉచితంగా ఇచ్చేస్తున్నారన్నదానిపై రాజకీయ వర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది. తనకు తానే రాజకీయ మేధావిగా ప్రకటించుకుని.. పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రసంగాలు, మీడియా సమావేశాలలో సలహాలు ఇచ్చుకుంటూ పబ్బం గడుపుకుంటున్నానని చెప్పుకుంటున్న ఉండవల్లి.. ఏపీ రాజకీయాలలో పొత్తు పొడుపులను పుటుక్కు మనిపించాలన్న వ్యూహంతో రంగులు మారుస్తున్నారు.  అయితే.. ఆయన మాటలకు గానీ, సూచనలక కానీ విపక్షాల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడమే.. రాజకీయ పార్టీలు ఆయనకు ఇస్తున్న విలువకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. 

మరి కొద్ది సేపటిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం (జనవరి 31) నుంచి ప్రారంభం అవుతాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   ప్రసంగంతో  బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉభయ సభల్లో ఆర్థిక సర్వేను   ప్రవేశపెడతారు. బుధవారం (ఫిబ్రవరి 1) వార్షిక బడ్జెట్‌ను కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సభ ముందుంచనున్నారు. బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 14 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాల కోసం ఉభయ సభలు మార్చి 12న భేటీ కానున్నాయి. మొత్తంగా ఏప్రిల్ 6 వరకు సమావేశాలు జరుగుతాయి.   ఈ సెషన్​లో 36 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. చైనా దురాక్రమణ, అదానీ గ్రూపుపై హిండెన్​బర్గ్ నివేదిక, బీబీసీ డాక్యుమెంటరీ, ధరల పెరుగుదలపై కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్ష పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. ఆయా అంశాలపై చర్చించాలని.. అఖిలపక్ష భేటీలో విపక్షాలు డిమాండ్ చేశాయి. నియమనిబంధనలకు లోబడి సభాపతి అనుమతించే ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం పేర్కొంది. దీంతో బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలున్నాయి.

తెలంగాణ బడ్జెట్ 3న కాదు 6న

గవర్నర్ తో విభేదాల విషయంలో పూర్తిగా వెనక్కు తగ్గిన కేసీఆర్ సర్కార్ ఇప్పుడు ఆమెను ప్రసన్నం చేసుకుని బడ్జెట్ సమావేశాలు ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేందుకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు. కోర్టులో కేసు ఉపసంహరించుకున్న తరువాత ప్రగతి భవన్ వేదికగా తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం గవర్నర్ తమిళి సైను మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఉన్నతాధికారులు కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం తరఫున గవర్నర్ ను కోరారు. బడ్జె్ట్ సమావేశాల్లో ప్రసంగించేందుకు రావాల్సిందిగా గవర్నర్‌‌ తమిళి  సై ను ఆహ్వానించారు. ఉభయ సభల ప్రోరోగ్, తిరిగి సమావేశమయ్యేందుకు నోటిఫికేషన్, గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిఫారసు అంశాలపై గవర్నర్ తో చర్చించారు. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం ప్రతిని మంత్రి ప్రశాంత్ రెడ్డి గవర్నర్ కు అందించారు.    గతంలో  అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని భావించినా చివరికి ఆ నిర్ణయాన్ని మార్చుకుంది ప్రభుత్వం. బడ్జెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ ప్రసంగం ఉంటుందని తెలిపింది. ఈ మేరకు గవర్నర్ ను బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. దీంతో  ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు.  ఫిబ్రవరి 6న  రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది.  ముందుగా నిర్ణయించిన మేరకు అసెంబ్లీలో ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండగా, మారిన పరిస్థితుల కారణంగా అది 6వ తేదీకి వాయిదా పడింది.   

జగన్ ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం.. మరో విమానంలో పయనం

గత నాలుగు రోజుల నుంచి ఎలాగైనా ఢిల్లీ వెళ్లాలని పట్టదలగా ఉన్న సీఎం జగన్, ఎట్టకేలకు   షెడ్యూల్ ఖరారు చేసుకుని విమానం ఎక్కారు..  అయితే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన జగన్ ప్రత్యేక విమానం కాసేపటికే సాంకేతిక లోపం కారణంగా నిముషాల వ్యవధిలోనే సాంకేతిక లోపం కారణంగా వెనుదిరిగి  గన్నవరం విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తర్వాత జగన్ వెంటనే తాడేపల్లికి వెళ్లిపోయారు. రాత్రి 9 గంటలకు మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపంపై విచారణ జరుగుతోంది.  కాగా మంగళవారం (జనవరి 31) ఉదయం నుంచి ఆయన   ఢిల్లీ.. లీలా ప్యాలెస్ హోటల్‌లో దౌత్యవేత్తలతో జరిగే ఆంధప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశం  లో పాల్గొంటారు. ఈఅనంతరం సాయంత్రం 6.05 గంటలకు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఆయన మోడీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్ వంటి వారి అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని, అయితే అప్పాయింట్ మెంట్ లభించలేదని అంటున్నారు. వాస్తవానికి ఆయన షెడ్యూల్ ప్రకారం జనవరి 30నే హస్తినకు బయలు దేరాల్సి ఉన్నా.. మూడు రోజుల నుంచీ ఆయన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఏ క్షణంలోనైనా హస్తిన బయలుదేరడానికి రెడీ అయ్యారు. అయితే కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ కోసం వేచి చూశారు. అది లభించకపోవడంతో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే హస్తిన వెళ్లి అక్కడ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్ ర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో పాల్గొని వెంటనే తిరిగి వస్తున్నారు. సాధారణంగా జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఆయనకు ప్రధాని సహా కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ లు వెంటనే లభించేస్తూ ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం నాలుగు రోజుల పాటు ఎదురు చూసినా అది లభించలేదు.  

మెరుగుపడిన తారకరత్న ఆరోగ్యం

తారకరత్నఆరోగ్యం మెరుగుపడింది. ఆయన అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయి. సిటీ స్కాన్ చేశారు. ఆ రిపోర్టులు రావాల్సి ఉంది.  ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్  పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నగుండెపోటుకు గురైన సంగతి విదితమే. ఆయన్ని కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు.  అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాలుగు రోజుల చికిత్స తరువాత  నందమూరి తారకరత్న ఆరోగ్యం ఒకింత మెరుగుపడింది. ఈ విషయాన్ని నందమూరి రామకృష్ణ మీడియాకు తెలిపారు. తారకరత్న ఎక్మో పై చికిత్స అందిస్తున్నారన్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. శరీర అవయవాలన్నీ సక్రమంగా పని చేస్తున్నాయనీ, ఆయన త్వరలో పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని రామకృష్ణ చెప్పారు. ఆ తరువాత కొద్ది సేపటికే హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందనీ, అయితే నిలకడగా ఉందనీ ఆ బులిటిన్ లో పేర్కొన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారనీ, మరికొన్న పరీక్షలు నిర్వహించాల్సి ఉందని వివరించారు. ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వివరించారు.   

తెలంగాణ సర్కార్ దిగొచ్చింది.. గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ సర్కార్ కు తత్వంబోధపడి బొమ్మ కనిపించింది. రాజ్ భవన్ తో విభేదాల నేపథ్యంలో  గవర్నర్ ను విస్మరించి కార్యాలు చక్కబెట్టేయాలన్న ఉద్దేశంతో దూకుడుగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వం.. చివరకు నాలుక కరుచుకుని అడుగు వెనక్కు వేయక తప్పలేదు. గవర్నర్ పై హై కోర్టు కు వెళ్లిన తెలంగాణ సర్కార్ తరువాత పిటిషన్ ను ఉపసంహరించుకుని వెనక్కు తగ్గి పరువుదక్కించుకుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో గవర్నర్ పై చేయి సాధించినట్లైంది.   దీంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విషయంలో ఉత్కంఠకు తెరపడింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమౌతాయని తెలంగాణ సర్కార్ కోర్టుకు తెలియజేసింది. అలాగే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతిస్తారని రాజ్ భవన్ పేర్కొంది. దీంతో ప్రతిష్ఠంభనకు తెరపడింది.  గత కొన్నేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య అగాధం ఏర్పడిన సంగతి తెలిసిందే. గవర్నర్ తనకు ప్రొటోకాల్ ఇవ్వలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే.. గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారంటూ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. పరస్పర విమర్శల విషయంలో  ఇరు పక్షాలూ కూడా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరించాయి. ఇప్పటి వరకూ గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాల విషయంలో తెలంగాణ సర్కార్ పై చేయి సాధించినట్లు కనిపించినా చివరకు గవర్నర్ దే పై చేయి అయ్యిందని పించేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకు బడ్జెట్ సమావేశాలు కారణమయ్యాయి. సంప్రదాయం ప్రకారం బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉండగా, తెలంగాణ సర్కార్ గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన కూడా చేసింది. గత సెషన్ ప్రోరోగ్ కానందున.. దానికి కొనసాగింపుగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉంటాయనీ, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండదనీ పేర్కొంది. అందుకు అనుగుణంగానే సమావేశాల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. అయితే సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టాలంటే అందుకు గవర్నర్ అనుమతి తప్పని సరైన నేపథ్యంలో  తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 21న గవర్నర్ కు  బడ్జెట్ ఫైల్ ను   పంపింది.  అయితే అందుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు.. వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్ కు ఎట్లా ఆమోదం తెలపాలని   ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశ్న సంధించారు.  తక్షణమే గవర్నర్ ప్రసంగం డ్రాఫ్ట్ పంపాలని కోరారు. అయితే అందుకు ప్రభుత్వం నుంచి సమాధానం రాకపోవడంతో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ప్రతిష్ఠంభన ఏర్పడింది. బడ్జెట్ సమావేశాల ప్రారంభ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం అనివార్యంగా హైకోర్టును ఆశ్రయించింది. సోమవారం లంచ్ మోషన్ పటిషన్ దాఖలు చేసింది.  అయితే హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది, రాజ్  భవన్ తరఫు న్యాయవాదులు చర్చించుకుని ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వచ్చారు.    అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతే కాకుండా గవర్నర్ పై విమర్శలు వద్దన్న సంగతిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాననీ విన్నవించారు.  అలాగే బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి ఇస్తారని రాజ్ బవన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో ఇరు పక్షాల న్యాయవాదుల అంగీకారంతో కోర్టు విచారణను ముగించింది. దీంతో బడ్జెట్ సమవేశాల విషయంలో ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరపడింది. అయితే బడ్జెట్ సమావేశాల ఫెడ్యూల్ మారే అవకాశాలు మాత్రం ఉన్నాయి.  

ఏపీ డీజీపీగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్?

డాక్టర్  సునీల్ కుమార్ ఐపీఎస్. ఏపీలో ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నిన్న మొన్నటి వరకూ ఏపీ సీఐడీ చీఫ్ గా బాధ్యతలను నిర్వర్తించిన ఈయన తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆ వివాదాస్పద వైఖరి కారణంగానే   సునీల్ కుమార్ ఐపీఎస్ రాష్ట్రంలో పరిచయం అక్కర్లేని పేరుగా మారింది.  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టు, మ్యాన్ హ్యాండలింగ్,  ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ నివాసంపై సీఐడీ పోలీసుల దాడి వంటి ఘటనలన్నీ ఈయన హయాంలోనే జరిగాయి. జర్నలిస్టు అంకబాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం కూడా సీఐడీ చీఫ్ గా సునీల్ కుమార్ ఉన్న సమయంలోనే జరిగింది. దాదాపు ఏపీ సీఐడీ చీఫ్ గా సునీల్ ఉన్న కాలంలో ఆ దర్యాప్తు సంస్థ డీల్ చేసిన కేసులన్నీ వివాదాస్పదమైనవే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం ఎత్తే వారిని టార్గెట్ చేసి ఉద్దేశ పూర్వకంగా కేసులు బనాయించేవారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఏపీ సీఐడీ జగన్ సర్కార్ కు అనుకూలంగా పని చేస్తున్నదన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే సునీల్ కుమార్ ను జగన్ సర్కార్ హఠాత్తుగా బదిలీ చేసింది. అలా బదిలీ చేయడానికి రోజుల  ముందు ఆయనకు పదోన్నతి కల్పించింది.   దాంతో ఆయనను ఏపీ డీజీపీగా నియమించే అవకాశాలున్నాయని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా ఆయనను ఏపీ డీజీపీగా నియమించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం డీజీపీగా ఉన్న  రాజేంద్రనాథ్ రెడ్డి సెలవుపై వెళ్లనున్నారని, దీంతో ఆయన స్థానంలో సునీల్ కుమార్ ను నియమించనున్నారని, ఏ క్షణంలోనైనా ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయనీ అంటున్నారు.  సీఐడీ చీఫ్ గా ఉన్న కాలంలో సునీల్ కుమార్ ను ప్రభుత్వం తన రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వినియోగించుకుందనీ విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి.  ఆయనను బదలీ చేసిన సమయంలోనే సునీల్ కుమార్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అప్పట్లోనే రాజకీయ వర్గాలు అంచనా వేశాయి. ఇప్పుడు ఆ అంచనాలే వాస్తవమని తేలిందని అంటున్నారు.   

సర్వత్రా వ్యతిరేకతే.. గుర్తించిన జగన్ ఏం చేస్తున్నారంటే..?

తన పాలనపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకుందన్న సంగతి జగన్ కు అర్ధమైంది. అలాగే కార్యకర్తలూ పార్టీకి దూరం జరిగారనీ గుర్తించారు. దీంతో జగన్ అనివార్యంగా ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడం, కార్యకర్తలను మళ్లీ పార్టీతరఫున పని చేసేలా చేయడం కోసం చర్చలు చేపట్టడం మొదలు పెట్టారు.   పార్టీకి దూరమైన క్యాడర్ ను దగ్గరకు చేర్చుకోవడానికి, వారినే ప్రజల వద్దకు పంపి ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించే విధంగా వ్యూహ రచన చేశారు.  అధికారంలోకి రాకముందు ఐదేళ్ల పాటు కష్టనష్టాలకు ఓర్చి, సొంత జేబులు ఖాళీ చేసుకని వైసీపీ కోసం.. కాదు కాదు జగన్ ను సీఎంను చేయడం కోసం కష్టపడిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం పట్టించుకోని ఫలితం ఇప్పుడు జగన్ కు అడుగడుగునా కనిపిస్తోంది. వైసీపీ సభలకు ఎంత ప్రయత్నించినా జనాలను తరలించడం గగనమైపోతుండటంతో కార్యకర్తలు పార్టీకి సహకరించి పని చేసేందుకు సిద్ధంగా లేరన్న విషయం అర్ధమైంది. అందుకే ఈ మూడున్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా   గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు, అదే సమయంలో పార్టీ నిర్మాణం బలోపేతంపై దృష్టి పెట్టారు జగన్.  అలా చేయడం వల్ల కార్యకర్తల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని కొంత మేరైనా తగ్గించవచ్చన్నది ఆయన వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జగన్ ఇటీవలి కాలంలో చేపట్టిన నష్టనివారణ యత్నాలు ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్న విషయంపై వైసీసీ శ్రేణుల్లోనే పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.    గృహ సారథులు, గ్రామ, వార్డు సచివాలయ కన్వీనర్లుగా కార్యకర్తలను నియమించడం ద్వారా ఇటు కార్యకర్తలను పట్టించుకోలేదనే దానికి చెక్​ పెట్టడంతో పాటు వారు ప్రజలను నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించ వచ్చనేది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. కానీ మూడున్నరేళ్లుగా తిన్నారా లేదా అన్న మాట కూడా ఎత్తని జగన్ ఇప్పుడు ఎన్నికల వేడి మొదలయ్యే సరికి కార్యకర్తలను గృహసారథులుగా నియమించేసి,వారిని ప్రజల దగ్గరకు పంపితే నమ్మేస్తారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తమౌతున్నాయి.  అయినా గృహ సారథులు మేం అధికార పార్టీ నుంచి మేమొచ్చాం. మీ సమస్యలు చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం!' అంటూ గృహ సారథులు వెళ్తే..  గడప గడపకూ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకూ ఎదురైన ‘మర్యాదే’ వారికీ ఎదురౌతుందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్త మౌతోంది. అందుకే  ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ కార్యకర్తలను ఇన్ టాక్ట్ గా ఉంచుకోవడం కోసం సొంత ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల కుటుంబాలకు ఉచిత వైద్యం అని ప్రకటించారు. ఇక బాలినేని అయితే తన నియోజకవర్గంలో తానే సొంతంగా పెన్షన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.  ప్రభుత్వ  పింఛన్ వివిధ కారణాలతో ఆగిపోయిన వారికీ, అలాగే అర్హత ఉండీ పింఛన్ మంజూరు కాని వారికీ తానే స్వయంగా తన సొంత ఖర్చుతో పింఛన్ అంద జేస్తున్నారు.  అలా సొంత ప్రయత్నాలు చేసుకుంటున్న వారంతా జగన్ విధానాలతో విభేదించి, తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేసిన వారే కావడం గమనార్హం. పార్టీ అవసరాలో, మరో కారణమో బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినా వారిని పిలిచి బుజ్జగించిన జగన్.. ముందు ముందు వారికి అవసరమైన ప్రాధాన్యత ఇస్తారా, అసలు వారికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కుతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.  

నేడో రేపో తెలంగాణకు కొత్త గవర్నర్ ?

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి   మూడున్నరేళ్లు పూర్తయ్యాయి. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నుంచి  బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే,  తెలంగాణకు కొత్త గవర్నర్ అన్న చర్చ గత కొంత కాలంగా సాగుతూనే ఉంది.   ఆ చర్చ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో మరింత జోరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్  బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళి సైకు  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్  బాధ్యతలు పూర్తి స్థాయిలో  అప్పగించి, తెలంగాణకు కొత్త   గవర్నర్ ని నియమించే అవకాశాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.  రాజ్ భవన్ , ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి నివాసం )కు మధ్య అగాధం ఇక పూడ్చలేనంతగా పెరిగిపోవడం, ఆ కారణంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంలోని మోడీ సర్కార్ పై ప్రతి కూల ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో.. గవర్నర్ ను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించడమే మేలని కేంద్రం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.   బడ్జెట్ కు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కేంద్రంలోని మోడీ సర్కార్ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందన్న భావన కేంద్ర ప్రభుత్వ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఇప్పటికే కేంద్రం ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఈ నెల 21న గవర్నర్ కు  బడ్జెట్ ఫైల్ ను ప్రభుత్వం పంపింది.  కానీ గవర్నర్ ఇంత వరకూ ఆమోదించలేదు సరి కదా, వరుసగా రెండో సారి తన ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తే బడ్జెట్ కు ఎట్లా ఆమోదం తెలపాలని ప్రశ్నిస్తూ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ప్రశ్నిస్తున్నారు.  అసెంబ్లీ, కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఎందుకు నిర్వహించడం లేదని నిలదీస్తున్నారు. దీంతో ప్రభుత్వం  హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది.  అయితే సమస్య తీవ్రతను ప్రజలకు తెలియజేయడానికే తప్ప కోర్టుకు వెళ్లడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఒనగూడే ప్రయోజనం ఏమీ ఉండదు. కానీ.. కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ మాత్రం దారుణంగా దెబ్బతింటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే తమిళనాడులో ఉభయ సభలను ఉద్దేశించి ఆ రాష్ట్ర గవర్నర్ ప్రసంగం విషయంలో తలెత్తిన వివాదం కేంద్రం పరువును నిండా ముంచింది. ఎవరు ఒప్పుకున్నా లేకున్నా.. గవర్నర్ కేంద్రం ప్రతినిథిగా రాష్ట్రాలలో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారన్న భావన బలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంవత్సరంలో ఇటువంటి వివాదం మరింతగా ముదిరితే.. ఒక్క తెలంగాణలోనే కాక మొత్తం దక్షిణాది రాష్ట్రాలలోనే తమకునష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయని బీజేపీ భావిస్తోంది. దీంతో పరిస్థితి మరింత ముదరక ముందే తెలంగాణ గవర్నర్ ను మార్చే అవకాశలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.