కూతుళ్లే  బంగారం...తండ్రుల రాజకీయం వర్కవుట్ అవుతోందా? 

దేశంలో వారసత్వ రాజకీయాలు ఇప్పటివి కావు. దాదాపు అర్థ శతాబ్ది క్రితం నుంచే కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వారసత్వాన్ని కొనసాగించినంత మాత్రాన అందరూ పదవుల్లో రాణించలేరు. స్వయం ప్రతిభ ఉంటే తప్ప రాజకీయ చదరంగంలో నిచ్చెనలు ఎక్కలేరు. సుదీర్ఘ కాలం మనలేరు. స్వయం ప్రతిభలేని చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన కొద్ధి కాలానికే తెరమరుగైన ఉదంతాలు ఉన్నాయి. భారత రాజకీయాల్లో ఒకరు ముఖ్యమంత్రి  అయ్యారు.  సీఎం పీఠాలు అధిష్టించిన కొడుకుల సంగతి పక్కన పెడితే.. కుమార్తెలు కూడా తండ్రి వారసత్వాన్ని అందుకొని పార్టీ  అందలం ఎక్కారు. వారసత్వంగా జమ్ము కశ్మిర్ లో     మెహబూబ్ ముఫ్తి  సీఎం అయ్యారు.  తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీళ్లంతా బిఆర్ ఎస్ ముఖ్య నేతలు, వారి కూతుళ్లే కావడం గమనార్హం.మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ, గారాల పట్టీ కల్వకుంట్ల కవిత తెలంగాణ మలిదశ  ఉద్యమ సమయంలో రాజకీయాల్లో వచ్చి, జాగృతి సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి వార్తల్లోకెక్కారు. అంతకుముందు ఆమె  అమెరికాలో సాప్ట్ వేర్  ఉద్యోగిగా పని చేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైనప్పటికీ 2019 లోకసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. దీంతో  తండ్రి కెసీఆర్  ఆమెకు ఎంఎల్సి పదవి ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవిత  ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. తన కూతురు ను అరెస్ట్ కాకుండా గతంలో చక్రం తిప్పిన కెసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత అరెస్ట్ ను అడ్డుకోలేకపోయారు.  బిజెపి ప్రభుత్వాన్ని నిందించడం వంటివి చేయలేదు. కవిత విషయంలోతన అన్న, మాజీ మంత్రి  కెటీఆర్  వెన్నెంటే ఉన్నప్పటికీ కెసీఆర్ నోరు మెదపకపోవడం గమనార్హం.  మరో బిఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటి సీఎం  కడియం కూతురు కడియం కావ్య రాజకీయాల్లో కొత్తగా పరిచయం అయ్యారు. తండ్రి ఇన్ ఫ్లూయెన్స్ తో ఆమెకు ఈ ఎన్నికల్లో వరంగల్ లోకసభ స్థానం టికెట్ ను బిఆర్ఎస్ పార్టీ ఇచ్చింది.  కెసీఆర్ ఫోన్ ట్యాపింగ్ , అవినీతివార్తలు వెలువడటంతో ఇటీవలికాలంలో  బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరికలు ఎక్కువయ్యాయి.  తండ్రితో బాటు  ఆమె కూడ  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడియం కావ్య   ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉస్మానియా మెడికల్ కాలేజి నుంచి పాథాలజీ ఎండీ పూర్తి చేశారు.  అయినప్పటికీ కడియం ఫౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం  కాకతీయ మెడికల్ కాలేజి రెసిడెంట్ డాక్టర్ గా పని చేస్తున్నారు.  కడియం కావ్య తండ్రి వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు బిఆర్ఎస్ లో అనేకమంది వరంగల్ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ కెసీఆర్ కడియం కావ్యకు పెద్ద పీట వేస్తూ వరంగల్ లోకసభ నుంచి కావ్య పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ అయిన కొద్దిగంటలకే ఆమె బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తాను బిఆర్ఎస్ నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించారు. కావ్య తండ్రి కడియం శ్రీహరి వల్లే తాను బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన మరో మాజీ  డిప్యూటిసీఎం తాటికొండ రాజయ్య తన రాజీనామా ఉపసంహరించుకుని తాను వరంగల్ స్థానం ఆశిస్తున్నట్లు ప్రకటించారు.   రెండు సార్లు బిఆర్ఎస్ నుంచి రాజ్య సభ సభ్యులుగా ఉన్న కె. కేశవరావ్ బిఆర్ఎస్ అధ్యక్షుడైన కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మికి మేయర్ అవకాశం ఇచ్చారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన గద్వాల విజయ లక్ష్మి రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కేశవరావ్ కుమారుడు విప్లవ్ కుమార్ పై  మర్డర్ కేసు ఆరోపణలున్నప్పటికీ కెసీఆర్ కెకె ఫ్యామిలీకి పూర్తి సహకారం అందించారు. మొదట్నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కెకె తన మాతృ సంస్థలో చేరడానికే బిఆర్ఎస్ కు  కూతురుతో సహా రాజీనామా చేశారు. కెసీఆర్ ఉంటున్న ఫామ్ హౌజ్ కు వెళ్లి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. తన తండ్రి బిఆర్ఎస్ కు రాజీనామా చేయడం పట్ల కొడుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వయసులో రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడం ఎందుకని ప్రశ్నించారు. కొడుకు వ్యతిరేకిస్తున్నప్పటికీ కేశవరావ్ కూతురుతో సహా  కాంగ్రెస్ వైపు అడుగులు వేశారు. ఒక నాన్నకు కూతుళ్లే బంగారం అని నిరూపించారు ఈ ముగ్గురు రాజకీయ నేతలు. తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు తండ్రి, కూతుళ్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి పుత్రికల కోసం తండ్రులు చేసే ఈ రాజకీయం వర్కవుట్ అవుతోందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

కేసీఆర్ ది బస్సు యాత్రా.. బల ప్రదర్శనా.. రైతులతో అసహనం!

పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కేసీఆర్ ఇప్పుడు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. పార్టీ ఓటమి తరువాత ఆయనకు ఏదీ కలిసిరావడం లేదు. జాతీయ రాజకీయా ఆకాంక్షలతో ఆకాశానికి నిచ్చెన వేసిన ఫలితం వ్రతమూ చెడింది. ఫలమూ దక్కలేదన్నట్లుగా తయారైంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయంతో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో జాతీయ రాజకీయాల ఊసెత్తడానికి కూడా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అసలు లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలలో నిలబెట్టేందుకు అభ్యర్థులే కరవైన పరిస్థితి. పిలిచి టికెట్టిచ్చినా పోటీ నుంచి నేతలు తప్పుకుంటున్న పరిస్థితి.  ఎలాగోలా తంటాలు పడి అభ్యర్థులను నిలబెట్టినా.. రాష్ట్రంలో ఒకటి రెండు లోక్ సభ స్థానాలలో విజయం సాధించడమే గగనమంటూ సర్వేలు చెబుతున్నాయి. ఈ స్థితిలో అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత ఇప్పటి వరకూ పెద్దగా ప్రజల ముందుకు రాని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కరువు కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు అంటూ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించారు. అయితే  ఆయన బస్సు యాత్ర ఆద్యంతమ జనంతో సంబంధం లేకుండానే సాగింది. వంద కార్ల భారీ ర్యాలీతో సాగిన కేసీఆర్ బస్సు యాత్రను రైతులు పెద్దగా పట్టించుకోలేదు. ఎల్ నినో కారణంగా వర్షాలు పడక నీటి వనరులు తగ్గిపోయి, రిజర్వాయర్లు ఎండిపోయి సాగుకు నీరందకుండా పోయింది. వాస్తవమే. అయితే  ఇంతటి కరవుకు కారణం రేవంత్ పాలనే అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను రైతులు పట్టించుకోలేదు. రేవంత్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి పట్టుమని ఆరు నెలలు కూడా కాలేదు. అయినా ప్రభుత్వ పని తీరును అంచనా వేయడానికి కొంత సమయం ఇవ్వాలి కదా? అన్న చర్చ రైతుల్లోనే జరుగుతోంది. అందుకే కేసీఆర్ రేవంత్ సర్కార్ పై సంధించిన విమర్శనాస్త్రాలను రైతులు పట్టించుకోలేదు. కేసీఆర్ ప్రసంగాలకు, విమర్శలకు జనం నుంచి స్పందనే కనిపించలేదు. రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకుని రేవంత్ సర్కార్ ను ఎండగట్టాలన్న కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్లుగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తన  పదేళ్ల పాలనలో నీటి కష్టాలు లేవని, రైతులు సంతోషంగా ఉన్నారనీ, అధికదిగుబడి సాధించారనీ, ఇప్పుడు  రైతులకు అన్ని రకాల సమస్యలు తెచ్చిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ రైతులను రెచ్చగొట్టి తద్వారా  లోక్ సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలన్న కేసీఆర్ వ్యూహం ఫలించినట్లు కనిపించడం లేదు.  ఏసీ, ఫ్రిజ్, సౌకర్యవంతమైన పడకలు, సోఫాలు వంటి అన్ని హంగులూ ఉన్న బస్సులో కూర్చుని వందకు పైగా కార్లు వెనుక కాన్వాయ్ గా వస్తుండగా సాగిన కేసీఆర్ బస్సు యాత్ర ఆయన అహానికి అద్దం పట్టింది కానీ, రైతులను ఆకట్టుకోలేకపోయింది.  అసలు కేసీఆర్ పాలనను జనం వ్యతిరేకించి గద్దె దింపడానికి ప్రధాన కారణాలలో ఒకటి అహంకారపూరితమైన ఆయన తీరు. అధికారంలో ఉండగా ఎన్నడూ ప్రజలతో మమేకం కావడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యంగా స్పందించారు. ప్రజాందోళనలను అణచివేశారు. ఈ కారణాలతోనే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు విపక్ష నేతగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పటి దర్పాన్ని ప్రదర్శించడం, కష్టాలలో ఉన్న రైతల పరామర్శకు కూడా మంది మార్బలంతో రావడంతో జనంలొ  కేసీఆర్ బల ప్రదర్శనకు వచ్చారు తప్ప, తమ కష్టాలను చూసి ఓదార్చి స్వాంతన చేకూర్చేందుకు కాదన్న అభిప్రాయం కలిగేలా చేసింది.    

చెన్నై ఓడింది కానీ ధోనీ గెలిచాడు!

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు, ఎంఎస్ ధోనీకి ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలియంది కాదు. 16 సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా జట్టును ముందుండి నడిపించిన ధోనీ.. ఈ సారి మాత్రం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. జట్టు భవిష్యత్ అవసరాల కోసం ధోనీ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగి అందరి మనసులనూ గెలుచుకున్నాడు. కొత్త సారథి గైక్వాడ్ జట్టును ధోనీ సలహాలూ సూచనలతో విజయ పథంలో నడిపిస్తూ మన్ననలు అందుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్ కూడా తన జట్టు కేప్టెన్ ను మార్చింది. కొత్త సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్ధిక్ పాండ్యా మాత్రం తన ఆటిట్యూడ్ తో జట్టు సహచరులు, అభిమానుల ఆదరణకు దూరమయ్యాడు.  జట్టు అభిమానులు కూడా ఓటమిని కోరుకుంటున్నారంటే సారథిగా పాండ్యా వైఫల్యం ఏమిటో ఇట్టే అవగతమౌతుంది.  సరే విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో తొలి పరాజయాన్ని ఆదివారం (మార్చి 31) ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అందుకుంది. అయితే ధోనీ మాత్రం ప్రేక్షకుల మనస్సులను గెలుచుకున్నాడు. నాలుగు పదులు పైబడిన వయస్సులో కూడా తనలోని బ్యాటింగ్ పటిమ ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్నాడు.   వైజాగ్  వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో  చెన్నై సూప‌ర్ కింగ్స్ పై  ఢిల్లీ క్యాపిట‌ల్స్ 20 ప‌రుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.  బ్యాటింగ్ లో పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్, మిచెల్ మార్ష్ రాణించారు.  దీంతో ఢిల్లీ క్యాపిటల్ నర్ణీత 20 ఓవర్లలో  191 పరుగుల భారీ స్కోరు సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 171 పరుగులు మాత్రమే చేసి ఈ సీజన్ లో తొలి ఓటమిని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో పరాజయం పాలైన ధోనీ ఫామ్ లోకి రావడంపై చెన్నై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సీజన్ లో తొలి సారిగా బ్యాటింగ్ చేసే అవకాశం దక్కిన ధోనీ తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించాడు. ఆడినంత సేపూ పాత ధోనీని తలపించాడు. ధోనీ హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ మొత్తం అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన తొలి రోజుల నాటి ధోనీని తలపింపచేశాయి. ఈ మ్యాచ్ లో ధోనీ తాను ఎదుర్కొన్న 16 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 37 పరుగులు సాధించి అజేయంగా  నిలిచాడు.   

ఖ‌మ్మం బ‌రిలో నంద‌మూరి సుహాసిని..? నామాకు బిగ్‌షాక్ ?!

తెలంగాణ‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు వేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ గూటికి చేరేందుకు పోటీలు పడుతున్నారు.  ఇప్ప‌టికే ప‌లువురు సిట్టింగ్ ఎంపీలు  బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు.  తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి, ఆయ‌న కుమార్తె క‌డియం కావ్య‌, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీలు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత ద‌గ్గ‌రి వ్య‌క్తిగా పేరున్న కె.కేశ‌వ‌రావుసైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు  రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది.  రెండు రోజుల క్రితం నంద‌మూరి సుహాసిని సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షీల‌తో భేటీ అయ్యారు. కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ అని చెబుతున్న‌ప్ప‌టికీ.. ఆమె త్వ‌ర‌లో కాంగ్రెస్ గూటికి చేర‌నున్నారనీ,  ఖ‌మ్మం లోక్ సభ  నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. సార్వత్రిక ఎన్నిక‌ల్లో భాగంగా మే13న తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్ స‌భ స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే అధికార కాంగ్రెస్‌, విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంకా.. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ తోపాటు మరి కొన్ని పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి ఆశావ‌హుల సంఖ్య భారీగా ఉంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి త‌మ్ముడు పొంగులేటి ప్ర‌సాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క స‌తీమ‌ణి నందినితో పాటు మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కుమారుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు కూడా ఖ‌మ్మం పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీచేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నంద‌మూరి సుహాసిని పేరు తెర‌పైకి రావ‌డం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నంద‌మూరి సుహాసిని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా  తెలుగుదేశం అభ్యర్థిగా   కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేసి  ఓట‌మి పాల‌య్యారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవ‌ల ఆమె సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీని క‌లిశారు.   ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ రాష్ట్రంలోని లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జిల‌ను ఆదివారం నియ‌మించారు. ఖ‌మ్మం పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జిగా మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డిని నియ‌మించారు. దీంతో పొంగులేటి త‌మ్ముడు ప్ర‌సాద్ రెడ్డి పార్ల‌మెంట్ స్థానం నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. అయితే, నంద‌మూరి సుహాసినీ పేరుకూడా అధిష్టానం ప‌రిశీల‌నలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఖ‌మ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఉమ్మ‌డి ఖ‌మ్మం  జిల్లాలో ప‌ది స్థానాల‌కు తొమ్మిది స్థానాల్లో విజ‌యం సాధించ‌డానికి తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల మద్దతే  ఓ కార‌ణమ‌ని అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌లోనే కాుండా, ప్ర‌స్తుత  పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌లో కూడా  తెలంగాణ‌లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది.  ఒక అంచనా ప్రకారం ఖ‌మ్మంలో కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థుల‌ మ‌ధ్య‌నే పోరు ఉండే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే బీఆర్ఎస్   సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుకే మ‌రోసారి టికెట్ కేటాయించింది. నామా నాగేశ్వ‌ర‌రావు  తెలుగుదేశం నుంచి వ‌చ్చిన వ్య‌క్తే కావ‌డంతో ఆయ‌నకు తెలుగుదేశం క్యాడ‌ర్ తో ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ క్యాడ‌ర్ తో పాటు, తెలుగుదేశం క్యాడ‌ర్ కూడా నామాకు మ‌ద్ద‌తుగా నిలిచే అవ‌కాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో కేసీఆర్ నామాకే టికెుట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ వ్యూహం మార్చి తెలుగుదేశం క్యాడర్ నామా వెంట వెళ్ల‌కుండా ఉండేందుకు నందమూరి  సుహాసినీని ఖ‌మ్మం బ‌రిలో నిలపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.  నందమూరి సుహాసినీని ఖ‌మ్మం బ‌రిలో నిలిపితే కాంగ్రెస్ క్యాడ‌ర్ తో పాటు టీడీపీ బ‌లం కూడా తోడ‌వుతుంద‌ని, త‌ద్వారా కాంగ్రెస్ విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌క అవుతుంద‌ని పార్టీ అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే, ఇప్ప‌టికే ఖ‌మ్మం పార్ల‌మెంట్ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ నేత‌లే పోటీప‌డుతున్నారు. వీరంద‌రినీ కాద‌ని సుహాసినీని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇస్తే.. పార్టీలో ఉన్న నేత‌ల స‌హ‌కారం ఎంత‌మేర‌కు ఆమెకు ఉంటుంద‌నేది కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అయితే, నంద‌మూరి సుహాసిని తెలుగుదేశం పార్టీని వీడే అవ‌కాశాలు లేవ‌ని, కేవ‌లం  రేవంత్ రెడ్డితో నంద‌మూరి కుటుంబానికి ఉన్న సత్సంబంధాల కార‌ణంగానే మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఆమె సీఎంను క‌లిశార‌ని తెలుగుదేశం వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఖ‌మ్మం ఎంపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేంత వ‌ర‌కు ఇలాంటి ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తూనే ఉంటాయ‌ని ప‌లువురు పార్టీ సీనియ‌ర్ నేత‌లు పేర్కొంటున్నారు.

లోకేష్ కు జడ్ భద్రత.. వైసీపీకి ఉలుకెందుకు?

కింద పడ్డా పై చేయి మాదేనని వాదిస్తారు కొందరు. తమ తప్పిదాలన్నిటినీ ఇతరుల మీద నెట్టేసి పబ్బం గడిపేయాలని ప్రయత్నిస్తుంటారు ఇంకొందరు. ఇప్పుడు వైసీపీ సరిగ్గా అదే చేస్తోంది. అధికారంలో ఇన్న ఈ ఐదేళ్ల కాలంలో విపక్ష నేతల భద్రతను కుదించి, వారిపై దాడులకు దారులు తెరిచేసింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపైనే పలు మార్పు దాడులు జరిగాయి. ఆయన తరచుగా వెళ్లే  తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైనే వైసీపీ దాడికి పాల్పడింది. కర్రలు, రాడ్లతో బీభత్సం సృష్టించింది. అలాగే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా జరిగిన దాడియత్నాల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి  అనంతరం కేంద్ర హోం శాఖ, చంద్రబాబు భద్రత చూసే ఎస్పీజీ రాష్ట్రంలో పర్యటించి ఆయన భద్రతపై సమీక్ష జరిపి అదనపు భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పడు లోకేష్ కు కూడా జడ్ కేటగరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.  రాష్ట్రంలో విపక్ష నేతలకు భద్రత లేని పరిస్థితి ఉందని కేంద్ర హోం శాఖ భావిస్తున్నదంటే అర్ధం ఏమిటి? ఏపీలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్నట్లే కదా? అయితే వైసీపీ మాత్రం అలా చెప్పదు. ఆ పార్టీ అధినేత నుంచి నేతల వరకూ అందరిదీ ఒకే బాణి తమ తప్పులన్నీ ఎదుటి వారికి ఆపాదించేసి తాము సుద్దపూసలమన్నట్లు చెబుతారు. వైఎస్ వివేకా హత్య నుంచి మొదలు పెడితే.. ఈ ఐదేళ్ల కాలంలో వైసీపీ తాను చేసిన అరాచకాలు, అఘాయిత్యాలూ, అక్రమాలు అన్నిటినీ తెలుగుదేశం పార్టీకి ఆపాదించి, తన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడమే. తాజాగా లోకేష్ కు జడ్ కేటగరి భద్రతను కేంద్ర హోంశాఖ కల్పించడంపై కూడా ఘనత వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ అదే చేశారు. వైసీపీకి ఉన్న జనాదరణ చూసి తెలుగుదేశం వణికిపోతోందన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రంలో మరో సారి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమనీ, అది జరిగితే తమకు ముప్పు అన్న భయంతోనే కేంద్రంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించి చంద్రబాబు తనయుడికి జడ్ కేటగరి భద్రత కల్పించుకున్నారని బొత్స అంటున్నారు. అదే సమయంలో మంత్రిగా ఉన్న తనకే ఆ స్థాయి భద్రత లేదని చెప్పుకున్నారు. ఆయన మాటలను బట్టే రాష్ట్రంలో వైసీపీ వారి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదనీ, ఉన్న ముప్పల్లా విపక్ష నేతలకేననీ ఎవరికైనా సులువుగా అర్ధం అయిపోతుంది. కానీ వైసీపీకీ మాత్రం అన్నీ రివర్స్ లోనే అవగతమౌతాయి. బొత్స మాటల తీరు కూడా అలాగే ఉంది.   

జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ

అక్రమాస్తుల కేసులో జగన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం (ఏప్రిల్ 1) విచారించనుంది. అలాగే జగన్ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయనే దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. రెండు పిటిషన్లనూ కలిసి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం (ఏప్రిల్ 1) సోమవారం విచారించనుంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  గత పదేళ్లుగా బెయిలు మీదే ఉన్నారనీ, ఆయన  బెయిలు రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేయాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం గత జనవరిలోనే తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో  రఘురామకృష్ణం రాజుపై అనర్హత పిటిషన్ వేసినందునే ఆయన జగన్ బెయిలు రద్దు చేయాలన్న పటిషన్ వేశారంటూ ముకుల్ రోహత్గి చేసిన వాదనను తోసిపుచ్చిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసు విషయంలో తాము రాజకీయాల జోలికి పోవడం లేదనీ, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ఆ సందర్భంగా జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యంపై సీబీఐని నిలదీసింది. విచారణ జాప్యానికి బాధ్యులెవరని ప్రశ్నించింది. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది విచారణలో జాప్యం, వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు. దాంతో  సీరియస్ అయిన సుప్రీం అయితే ఎవరికి సంబంధం ఉంటుందని సూటిగా ప్రశ్నించింది. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రఘురామకృష్ణం రాజు తరఫు న్యాయవాది సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసు విచారణను జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం  వ్యాఖ్యానించింది. కాగా ఏపీ సీఎం జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామరాజు సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు పిటిషన్లను  సుప్రీం ధర్మాసనం జనవరి 19 విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్లపై సీబీఐకి గతంలోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసిన సంగతి విదితమే.  జగన్ బెయిలు రద్దు, ట్రాన్స్ ఫర్ పిటిషన్ల  విచారణను ఏప్రిల్ కు 1కు వాయిదా వేసింది. దీంతో ఆ పిటిషన్ ఇప్పుడు విచారణకు వచ్చింది. 

పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం.. ఎన్నికల సంఘం అదేశాలతో వైసీపీ ఆటకట్టేనా?

జగన్ చేత జగన్ కొరను జగనే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ సేవలు ఇప్పుడు జగన్ కు అందకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన ఇన్ని రోజులకు  ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలన్న ఆదేశాలివ్వడమే కాకుండా వారి ఫోన్లలో ఉన్న సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.  పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై   వైసీపీ నేతలు తెలుగుదేశంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లపై ఫిర్యాదు చేసి సామాజిక పింఛన్ల పంపిణీని తెలుగుదేశం అడ్డుకుంటోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  వాలంటీర్లకు పింఛన్ల పంపిణీ బాధ్యతలు వద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందే కానీ పింఛన్ల పంపిణీని ఆపమని కాదు. కానీ అ నెపం పెట్టుకుని పింఛన్లను ఆపేయడానికి జగన్ సర్కార్ కుట్రపన్నుతున్నట్లుగా వారి మాటలను బట్టి అవగతమౌతోంది.   ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పించన్లు ఇకపై వాలంటీర్ల ద్వారా కాకుండా, ఉద్యోగులే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీకి కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే  వారు నానా యాగీ చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకూ వాలంటీర్లే పించనర్లకు డబ్బులు నేరుగా ఇచ్చేవారు.  ఎన్నికల కోడ్ లేదు కాబట్టి  అది సాగింది. కానీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత  నిబంధనల ప్రకారమే జరగాలి. అలా జరిగేలా చూసే బాధ్యత  ఎన్నికల సంఘానిది.  రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపథ్యంలో కేందా్ర ఎన్నికల సంఘం  ఢిల్లీ నుంచి ముగ్గురు పరిశీలకులను కూడా రాష్ట్రానికి పంపింది. సరే అదలా ఉంచితే.. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.  ఈ విషయాన్ని  హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనికి తోడు  వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని పలు సందర్బాలలో మంత్రులే చెప్పారి. వారి సేవలను ఎన్నికలలో వాడుకుంటామని ప్రకటనలు కూడా చేశారు. అంతెందుకు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు.  వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకున్న ఎన్నికల సంఘం వలంటీర్లనూ ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. అంతే కాకుండా వారి ఫోన్ల నుంచి సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకోమని చెప్పింది. వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పించన్లు పంపిణీ చేయాలని విస్పష్టంగా ఆదేశించింది.  ఇప్పుడు ఆ పని ప్రభుత్వోద్యోగులకు అప్పగించమని నిర్దేశించింది.  దీనిపై వైసీపీ ఇంతగా గగ్గోలు పెట్టడం ఎందుకో అర్ధం కావడం లేదు. సామాజిక పింఛన్లు అందకుండా తెలుగుదేశం కుట్రలు చేస్తోందన్న వైసీపీ విమర్శలు చూస్తుంటే.. పించన్లు పంపిణీ చేయకుండా, అందుకు కారణం తెలుగుదేశం అని ప్రచారం చేయడానికి వైసీపీ రెడీ అయిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వోద్యోగుల ద్వారా పించన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సీఎస్ జవహర్ రెడ్డిదే. ఇప్పుడు ఆయన ఆపద్ధమర్మ ముఖ్యమంత్రి జగన్  ఆదేశాలకు తలొగ్గాల్సిన అవసరం లేదు.   ఎలాగూ పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బు ఖజానాలో  రెడీగా ఉంటే పంపిణీకి అడ్డేముంటుంది. అయితే వైసీపీ యాగీ వెనుక, గగ్గోలు వెనుక పింఛన్ల సొమ్ము ఖజానాలో లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్లు  ఆ సొమ్ములను వైసీపీ అనుకూల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల పంపిణీకి వాడేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని.. అధికార పార్టీ  చేస్తున్న విమర్శలు ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి.   సీఈసీ పెన్షనర్లకు డబ్బులు ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలని ఆదేశించిందే తప్ప, అసలు పెన్షన్లు ఇవ్వవద్దని అనలేదు. ఎన్నికల కోడ్ కాబట్టి వాలంటీర్ల బదులు, ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందచేయాలని చెప్పిందే తప్ప, సంక్షేమపథకాలు ఆపమనలేదు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికల సంఘం  పింఛన్లు నిలిపివేయాలనీ, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఆదేశించిందన్నట్లుగా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. వైసీపీ బాధంతా   ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పెన్షన్లు ఇస్తున్నందుకా? లేక వాలంటీర్ల ద్వారా ఇవ్వనందుకా?  ఎవరిస్తే ఏమిటి?  సొమ్ము లబ్థిదారులకు అందడమేగా కావాల్సింది?   ఇప్పుడు వైసీపీ ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే..  వాలంటీర్లద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే.. ఆ డబ్బులు ఇస్తున్నది జగనే అని వారు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ప్రభుత్వోద్యోగులైతే.. ఆ సొమ్ము పంపిణీకి జగన్ కు ఎటువంటి సంబంధం లేదని అందరికీ అర్ధమైపోతుంది. ఇదీ వైసీపీ బాధ.   తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ  అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలూ సంక్షేమ పథకాలను అమలు చేశాయి.  అయితే జగన్ సర్కార్ వచ్చే వరకూ సంక్షేమ పథకాల అమలు  ప్రభుత్వ సిబ్బంది ద్వారానే అమలయ్యాయి.  వైసీపీ సర్కార్ వచ్చిన తరువాత మాత్రమే వాలంటీర్ల చేతికి సొమ్ములిచ్చి పంపిణీ చేసింది. ఇప్పుడు అది కూడదనే సరికి.. పెన్షనర్లకు సొమ్ములెలా అందుతాయంటూ గగ్గోలు పెట్టేస్తోంది.  ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం స్పందించడం సహజం. గత ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదులపైనే పై అప్పటి  డీజీపీ, సీఎస్, ఏడీజీని ఈసీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఎల్వీని ఈసీనే నేరుగా సీఎస్‌గా నియమించింది. అప్పుడు ఒప్పైన ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు వైసీపీకి ఎందుకు తప్పు అవుతోందన్నది ఆ పార్టీయే చెప్పాలి.  

ఏపీలో కూటమి సునామీ ఖాయం.. తేల్చేసిన వైబ్రెంట్ సర్వే

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం,  జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించడం ఖాయమని ఇప్పటికే పలు  సర్వేలు స్పష్టం చేశాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరుపొందిన పలు  సంస్థల  సర్వేల్లో ఏపీలో కూటమి విజయం ఖాయమని తేలింది.   వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు, కక్షపూరిత రాజకీయాలు వైసీపీ ఓటమిలో కీలక భూమిక పోషించబోతున్నాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తాజాగా మరో ప్రముఖ సంస్థ  వైబ్రెంట్ ఇండియా సర్వేలో కూటమి అలాంటిలాంటి విజయం కాదు.. భారీ విజయం ఖాయమని పేర్కొంది. స్పష్టంగా చెప్పాలంటే ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించబోతున్నదని వైబ్రెంట్ ఇండియా పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా గతంలో 14 సార్లు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాలు 12 సార్లు నిజమయ్యాయి. దీంతో వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలంటే చాలా రాజకీయ పార్టీలు  ఆవే తుది ఫలితాలుగా  భావిస్తుంటాయి. వైబ్రెంట్ ఇండియా సర్వే  వెలుగులోకి రాగానే వైసీపీ నేతల్లో ఆందోళన మరింత పెరిగిందని  రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సొంత నియోజకవర్గాలను వదిలి వైసీపీ అధిష్టానం సూచన మేరకు కొత్త నియోజకవర్గాల్లో పోటీచేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులు తమ ఓటమి ఖాయమన్న భావనకు వచ్చినట్లు చెబుతున్నారు, అనవసరంగా నియోజకవర్గం మారామని తమకు దగ్గర వ్యక్తుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. వైబ్రెంట్ ఇండియా ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 50,236 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఫోన్ కాల్స్ ద్వారా  మరో 50వేల మంది అభిప్రాయాలు సేకరించింది. వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాల ప్రకారం.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు 79 నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. మరో 20 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎడ్జ్ లో ఉన్నారు.  అంటే దాదాపు 99 సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం పక్కా అని వైబ్రెంట్ సర్వే తేల్చేసింది. అధికార వైసీపీకి ఓటమి ఖాయమని, ఆ పార్టీ 29 సీట్లకే పరిమితమవుతుందని, ప్రజల్లో పోలింగ్ సమయం నాటికి ఏమైనా సానుభూతి, ఇతర అంశాలను ప్రభావితం చేస్తే మరో 18 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని వైబ్రెంట్ సర్వే పేర్కొంది.  మరో 29 నియోజకవర్గాల్లో కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని,   వైబ్రెంట్ ఇండియా సర్వే  పేర్కొంది. పూర్తి ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం కూటమి 115 - 120 స్థానాలు,  వైసీపీ 55 - 60 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. పార్టీల వారిగా ఓటింగ్ శాశం పరిశీలిస్తే.. తెలుగుదేశం కూటమికి 42.26శాతం, వైసీపీకి 38.11శాతం ఓటింగ్ నమోదవుతుంది. 13.47శాతం ఓటింగ్ మాత్రం కూటమి, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరికైనా పడే అవకాశం ఉందని, ఇతరులకు 6.16శాతం ఓటింగ్ నమోదవుతుందని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా గతంలో నిర్వహించిన కొన్ని సర్వే ఫలితాలను పరిశీలిస్తే..  తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీకి 72-78 స్థానాలు వస్తాయని తేలింది. ఎన్నికల ఫలితాల్లో 88 సీట్లలో  టీఆర్ఎస్ విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చింది.  2023  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 67 - 75 స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  కర్ణాటకలో 2023  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 118-130  స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాల్లో డీఎంకే 167 - 178 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. ఆ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే 159 నియోజకవర్గాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  2019లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైబ్రెంట్ ఇండియా  సర్వేలో వైసీపీకి 129 -139 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఫలితాల్లో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయి. వైబ్రెంట్ ఇండియా  తాజా సర్వే ప్రకారం.. రాయలసీమలోని చిత్తూరు, కడప, ఉమ్మడి విజయనగరం  జిల్లాల్లో వైసీపీకి మెజార్టీ స్థానాలు వస్తాయని, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తుర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూల్    జిల్లాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది.  వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలు గతంలో 90శాతం నిజం కావటం, ఆ సర్వే ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేయడంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

కేసీఆర్‌, జ‌గ‌న్ కుట్ర‌ల‌కు చెక్ పెట్టిన చంద్రబాబు విజన్!

చంద్ర‌బాబు నాయుడు పేరు చెబితే తెలుగు ప్ర‌జ‌లు గ‌ర్వంతో ఉప్పొంగిపోతారు.. ఆయ‌న ముందు చూపుతో యువ‌త భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన పునాది పడింది. రాబోయే ప‌దేళ్ల‌లో ప్ర‌పంచం ఏ రంగంవైపు ప‌రుగులు తీస్తుందో ముందుగానే ప‌సిగ‌ట్ట‌గ‌లినే విజనరీ పొలిటీషియన్ చంద్ర‌బాబు అన‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ లో  ఆయ‌న  ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో సైబ‌ర్ ట‌వ‌ర్స్ నిర్మించి, ప్ర‌పంచంలోనే అగ్ర‌గామిగా పేరున్న కంపెనీల‌ను హైద‌రాబాద్ న‌డిబొడ్డుకు తీసుకొచ్చారు. దీంతో హైద‌రాబాద్ ను ప్ర‌పంచ ప‌టంలో నిల‌వడంతో పాటు తెలుగు యువ‌త భ‌విష్య‌త్తుకు భరోసా ఏర్పడింది. ఇదంతా చంద్ర‌బాబు ముందు చూపు, కృషితో నే జరిగింది. తెలుగు యువ‌త నేడు ఐటీ రంగంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న‌త స్థానాల్లో స్థిర‌ప‌డ్డారంటే అందుకు చంద్రబాబు విజన్ కారణమనడంలో సందేహం లేదు. చంద్ర‌బాబు చేసిన కృషి కార‌ణంగా ఆ త‌రువాత కాలంలో ముఖ్య‌మంత్రులు ఎవ‌రు మారినా, రాష్ట్రం విడిపోయినా హైద‌రాబాద్ అభివృద్ధి ఆగ‌లేదు.  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విడిపోయిన త‌రువాత కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్ర‌బాబు ఎన‌లేని కృషి చేశారు. అలాగే చంద్ర‌బాబు తన ముందుచూపుతో  పొరుగురాష్ట్రం తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్, ఏపీలోని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష‌  వైసీపీ అధినేత జగన్ కుట్ర‌ల‌ను తిప్పికొట్టారు. ఫ‌లితంగా నేడు ఏపీలోని డెల్టా ప్రాంతానికి, నాలుగైదు జిల్లాల‌కు తాగు,సాగునీటికి ఎటువంటి ఇంబ్బందీ లేకుండా పోయింది.  అదంతా చంద్రబాబు విజన్ చలవే. రాష్ట్రం విడిపోయిన త‌రువాత ఏపీకి తొలి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ చంద్ర‌బాబు నాయుడు త‌న ముందుచూపుతో ఏపీకి అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగేలా చేశారు. 1956లో కృష్ణా న‌దిపై ఆధార‌ప‌డిన సాగు ఆయ‌క‌ట్టు ఎంతో తేల్చి, దానికి అనుగుణంగా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య నీటి పంపిణీకి, వివాదాల ప‌రిష్కారానికి నాటి దేశ ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ కృష్ణా వాట‌ర్ డిస్బ్యూట్స్ ట్రిబ్యున‌ల్ ఏర్పాటు చేశారు. నాటి సుప్రీంకోర్టు జ‌స్టిస్ ర‌ణ‌ధీర్ సింగ్ బ‌చావ‌త్ ను ట్రిబ్యున‌ల్ చైర్మ‌న్ గా నియ‌మించారు. దాని ప్ర‌కారం ఏపీలో 7,278 చ‌ద‌ర‌పు కిలో మీట‌ర్ల స్థిర ఆయ‌క‌ట్టును నిర్ధారించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎగువ‌న ఉన్న తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర ఎన్నికథలు పడ్డా ఏపీ ఆయ‌క‌ట్టుకు నాటి చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా జ‌లాల‌ను ఇవ్వాల్సిందే. 58ఏళ్ల త‌రువాత ఏపీ విడిపోవ‌టంతో.. తెలంగాణ ప్ర‌భుత్వం, ఆంధ్రాలోని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ కుట్ర‌ల వ‌ల్ల ఆంధ్ర డెల్టా ఆయ‌క‌ట్టుకు పొంచిఉన్న పెను ప్ర‌మాదాన్ని చంద్ర‌బాబు నాయుడు ముందుగానే ప‌సిగ‌ట్టారు. ముందుగా పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తికావాలంటే ప్రాజెక్టు ప‌రిధిలోని ముంపు మండ‌లాల‌ను ఆంధ్రా భూభాగంలో క‌లిపితేనే సీఎంగా బాధ్య‌త‌ల‌ను చేప‌డ‌తాన‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి చంద్ర‌బాబు తెగేసి చెప్పారు. ఫ‌లితంగా పోల‌వ‌రం నిర్మాణానికి ఎలాంటి అడ్డంకి లేకుండా చూశారు. ఆ త‌రువాత చంద్ర‌బాబు పోల‌వ‌రాన్ని ప‌రుగులు పెట్టించారు. ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వారంగా మార్చేశారు. కానీ,  జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం నిర్మాణం ఎలా మ‌రుగున ప‌డిపోయిందో ఏపీ ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.   పోల‌వ‌రం ప్రాజెక్టు ఆల‌స్య‌మైతే.. కృష్ణా న‌ది నీళ్లు నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ ద్వారా, లేదా సాగ‌ర్ డ్యామ్ గేట్లు ఎత్త‌డం ద్వారా మాత్ర‌మే విజ‌య‌వాడ ప్ర‌కాశం బ్యారేజ్ కు చేరుకుంటాయి. విజ‌య‌వాడ నుంచి కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి, గుంటూరు, ప్ర‌కాశంలో కొంత భూభాగానికి తాగు, సాగునీరు అందుతుంది. అయితే, చంద్ర‌బాబు నాయుడు ఊహించిన‌ట్లే జ‌రిగింది. హ‌క్కుగా మ‌న‌కు రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కింద‌కు రాకుండా అప్ప‌టి తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర చేశారు. దీన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన చంద్రాబు నాయుడు.. పోల‌వ‌రం పూర్త‌య్యే నాటికి స‌మ‌యం ప‌డుతుంద‌ని భావించి.. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేప‌ట్టారు. గోదావరి నదిని, కృష్ణా నదిని కలుపుతూ నదులను అనుసంధానించే ప్రాజెక్టే ప‌ట్టిసీమ‌.  దీనిని చంద్ర‌బాబు ఏడాదిలో పూర్తి చేశారు. పోలవరం కుడి కాలువను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తవ్వారు. గోదావరి నది నుండి ప‌ట్టిసీమ‌ద్వారా  కాలువలోకి పంప్ చేయబడిన నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. సీఎంగా చంద్రబాబు తీసుకున్న సాహసోపేత నిర్ణ‌యం వ‌ల్ల జూన్ నుండి ఆగస్టు మధ్య కాలంలో నీటి కొరతను ఎదుర్కొంటున్న డెల్టాలో 1.3 మిలియన్ ఎకరాలు సాగుచేసే వేలాది మంది రైతులకు సహాయపడింది. తాగునీటికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింది. చంద్ర‌బాబు ముందుచూపు ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టిసీమ నీటి ద్వారా జ‌రిగిన సంప‌ద సృష్టి రూ. 25వేల కోట్ల‌పైమాటే.  చంద్ర‌బాబు కృషితో ఏడాదిలో రూ. 1,660 కోట్ల ఖ‌ర్చుతో ప‌ట్టిసీమ ప్రాజెక్టును పూర్తిచేశారు. అయితే, ఇందులో అవినీతి జ‌రిగింద‌ని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ తీవ్ర‌స్థాయి ఆరోప‌ణ‌లు చేసింది. ప‌ట్టిసీమ వ‌ద్దంటూ సుప్రీం కోర్టుకు వెళ్లిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి నేటి వ‌ర‌కు ప‌ట్టిసీమ మోట‌ర్ బ‌ట‌న్ నొక్క‌క‌పోతే కృష్ణా ఆయ‌క‌ట్టు లేదు.. నాలుగు జిల్లాల‌కు తాగునీరు లేదు. చంద్ర‌బాబు ఏ ప‌ని చేసినా ముందు చూపుతో చేస్తారు.. ప్ర‌జ‌ల బాగుకోసం చేస్తార‌ని ప‌ట్టిసీమ ద్వారా మ‌రోసారి నిరూపిత‌మైంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప‌ట్టిసీమ అవ‌స‌రం లేదు, అదో దండ‌గ ప్రాజెక్టు అంటూ రంకెలేసిన జ‌గ‌న్ అండ్ కో..  అధికారంలోకి వ‌చ్చిన తవాత  డెల్డా ప్రాంతానికి నీళ్లివ్వాలంటే వారికి ప‌ట్టిసీమే దిక్కైంది. ఇలా భవిష్యత్ అవసరాలను, ప్రత్యర్థుల కుట్రలను ముందుగానే పసిగట్టి  అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజలకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడటంలో  చంద్రబాబు ఎప్పుడూ నంబర్ వన్ గా ఉంటారు. అందుకే ప్రజలు తాము ఇబ్బందుల్లో ఉన్న ప్రతి సారీ చంద్రబాబు వైపే చూస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. 

నరసాపురం బరిలో ఆర్ఆర్ఆర్? .. ఫ్రెండ్లీ కంటెస్ట్ కే బీజేపీ అభ్యర్థి పరిమితం?

ఎన్నికలు అనగానే అసమ్మతులు, అసంతృప్తులు సహజం. అదీ రెండు మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని కూటమిగా బరిలోకి దిగుతున్నప్పుడు సహజంగానే అసమ్మతి గళాల సంఖ్య ఒకింత ఎక్కువ ఉంటుంది. అయతే  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఒకింత సజావుగానే సాగిపోయింది. పొత్తులో భాగంగా బలాన్ని మించి స్థానాలు కోరిన బీజేపీని సంతృప్తి పరుస్తూనే.. బీజేపీ ఎవరిని అభ్యర్థులుగా నిలపకూడదో తెలుగుదేశం, జనసేనలు ముందుగానే ఆ పార్టీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్న బీజేపీ మిత్రపక్షాల డిమాండ్ ను మన్నించింది. ఆ మేరకు ఆ పార్టీ జీవీఎల్, సోము వీర్రాజు, మాధవ్ వంటి వారిని పోటీ నుంచి దూరంగా పెట్టింది. దీంతో పెద్దగా అలకలూ, అసంతృులూ, అసమ్మతులూ లేకుండానే పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు జరిగిపోయింది. సీట్ల సర్దుబాటు తరువాత సహజంగానే పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన వారిలో అసంతృప్తి ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆ అసమ్మతి, అసంతృప్తి పార్టీల విజయావకాశాలను దెబ్బతీసేంత తీవ్రంగా లేకపోవడం పొత్తుకు జనం మద్దతు ఉండటమే కారణమన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. అయితే ఒకటి రెండు స్థానాలలో మాత్రం బీజేపీ అభ్యర్థుల ఎంపిక పట్ల తెలుగుదేశం, జనసేనలలో తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. దానికి బీజేపీ శ్రేణుల మద్దతు కూడా లభిస్తోంది. వాటిల్లో ముఖ్యంగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం. ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణం రాజు పోటీలో ఉంటారని అంతా భావించారు. అయితే సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీ కోటాలోకి వెళ్లిన ఈ స్థానం నుంచి ఆ పార్టీ రఘురామకృష్ణం రాజును కాకుండా ప్రజలలో అంతగా గుర్తింపులేని బలహీన అభ్యర్థిని బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది.  దీంతో కూటమి పార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  మొత్తంగా ఏపీలో తెలుగుదేశం పోటీ చేసే నియోజకవర్గాలలో అభ్యర్థుల ప్రకటన పూర్తైపోయింది.  బీజేపీ  బీజేపీ  తమ పార్టీ  తరఫున ఎన్నికల బరిలో నిలిచే అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించేయగా, జనసేన మాత్రం రెండు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. అక్కడక్కడా అలకలు తప్ప మొత్తంగా కూటమి మధ్య సీట్ల సర్దుబాటు బైఆండ్ లార్జ్ సజావుగానే సాగిపోయింది. అయితే నరసాపురం లోక్ సభ నియోజకవర్గం మాత్రం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నరసాపురం సీటు విషయంలో  బీజేపీ ప్రకటించిన అభ్యర్థిపై అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. ఇక్కడ రఘురామకృష్ణం రాజును కాదని ప్రజలకు పెద్దగా పరిచయం లేని భూపతి రాజు శ్రీనివాసవర్మ ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడంపట్ల సామాన్య జనంలో కూడా అసంతృప్తి వ్యక్తం  అవుతున్నది. సర్వత్రా రఘురామకృష్ణం రాజు పట్ల సానుభూతి వ్యక్తం అవుతున్నది. ఇక నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు కూడా రఘురామకృష్ణం రాజును లోక్ సభ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడం సరి కాదన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు బీజేపీ టికెట్ నిరాకరించిన ప్రభావం నరసాపురం లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నిటిపైనా  పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నరసాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులు రహస్యంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు రఘురామకృష్ణం రాజునే కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానంలో నిలబెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విజ్ణప్తి చేయాలని తీర్మానించారు. ఇలా వారి రహస్య భేటీకి ముందు బీజేపీ అభ్యర్థి  భూపతి రాజు శ్రీనివాసవర్మ నిర్వహించిన ఒక ర్యాలీలో తెలుగుదేశం, జనసేన శ్రేణులు పాల్గొనలేదు. ఆ ర్యాలీలో కొద్ది మంది బీజేపీ కార్యకర్తలు మాత్రమే పాల్గొనడం స్థానికంగా గుర్తింపు ఉన్న కమలం నేతలు కూడా దూరంగానే ఉండటం గమనార్హం. ఆ ర్యాలీలో ఎక్కడా తెలుగుదేశం, జనసేన జెండాలు కనిపించకలేదు. దీంతో నరసాపురం ఎంపీ అభ్యర్థిని మార్చకుంటే కూటమి ఐక్యత ప్రశ్నార్ధకంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే  ఆ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల రహస్య భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరి భేటీకి ముందే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు కూడా నరసాపురం ఎంపీ అభ్యర్థిగా   అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాసవర్మ ను నిలబెట్లాలన్న నిర్ణయంపై పునరాలోచించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానాన్ని కోరినట్లు తెలుస్తున్నది.  మొత్తం మీద కూటమిలోని ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, జనసేనలు నరసాపురం విషయంలో బీజేపీ తన నిర్ణయాన్నిమార్చుకోవాలని బలంగా కోరుతున్నాయి. విస్తృత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ కంటే బలంగా ఉన్న తాము కొన్ని త్యాగాలు చేశామనీ, మిత్ర ధర్మం ప్రకారం తాము ఒకింత తగ్గి బీజేపీ కోరిన మేరకు ఆ పార్టీకి టికెట్లు కేటాయించామనీ అయితే ఒక్క రఘురామకృష్ణం రాజు విషయంలో బీజేపీ ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో అర్ధం కావడం లేదనీ తెలుగుదేశం, జనసేనలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే  నరసాపురం నియోజకవర్గం విషయంలో కూటమి శ్రేణుల ఐక్యత దెబ్బతినకుండా ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు మధ్యే మార్గంగా ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తున్నది.  ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించేసినందున.. రఘురామకృష్ణం రాజు చేత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించి కూటమి ఆయనకు మద్దతుగా నిలవాలన్నదే ఆ ప్రతిపాదన. బీజేపీ అధికారిక అభ్యర్థి నామమాత్రంగానే రంగంలో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయనది ఫ్రెండ్లీ కంటెస్ట్ గా ఉంటుందన్నమాట. అలా జరిగితే మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి అభ్యర్థిని మార్చిందన్న విమర్శ నుంచి బీజేపీ బయటపడుతుంది. అలాగే కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు సజావుగా సాగేందుకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఈ ప్రతిపాదనపైనే కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీరియస్ గా చర్చ జరుగిందని, ఈ ప్రతిపాదనకు బీజేపీ హైకమాండ్ కూడా ఓకే చెప్పిందని తెలియవస్తోంది. మొత్తం మీద నరసాపురం లోక్ సభ నియోజకవర్గంలో రఘురామకృష్ణం రాజు పోటీ చేస్తారనీ, ఆయనకు కూటమి మద్దతు గట్టిగా ఉంటుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.   

ఎపిలో 9 గ్యారెంటీలను అనౌన్స్ చేసిన షర్మిల 

తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఎన్నికల వాగ్దానంలో పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది  గ్యారెంటీలను అమలుచేస్తామని వాగ్దానం చేస్తుంది. ఇవాళ విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ  పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు 1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు 2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500 3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ 4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర 5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత 6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య  7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ 8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు 9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను... ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను

డబ్బులు పంచినా రాని జనం.. జగన్ బస్సుయాత్ర తుస్సు!

ముఖ్యమంత్రి సభలకు కూడా జనం మొహం చాటేస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఆరంభంలోనే హంసపాదు అన్నట్లుగా తయారైంది. జగన్ ఆర్భాటంగా ఆరంభించిన బస్సు యాత్ర తుస్సు మంటోదన్న భావన వైసీపీ క్యాడర్ లోనే వ్యక్తం అవుతోంది. బస్సు యాత్ర కు జన స్పందన అమోంగా ఉందన్న బిల్డప్ ఇవ్వడానికి వైసీపీ సోషల్ మీడియా వింగ్ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి. మరో వైపు ఆ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి ప్రసంగం వినడానికి కూడా జనం ఇష్టపడటం లేదనడానికి  నిలువెత్తు నిదర్శనంగా  నెల్లూరు జిల్లా సీతారామపురంలో  జరిగిన సంఘటన నిలుస్తోంది. ఉదయగిరి లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం (మార్చి 28) సీతారాంపురంలో పర్యటించారు. తన ప్రచార రథంపై పర్యటించిన ఆయన జనాలను ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించారో  లేదో జనం లేచి వెళ్లిపోవడం మొదలెట్టారు. దీంతో నేతలు మైకుల్లోనే నాయకుడి ప్రసంగం వినండి, సభ అయిపోయిన తరువాత భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి వెళ్లిపోకండి అని వేడుకోవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయింది.  దీనిపై అధినేత సభలే జనం లేక వెలవెలబోతుంటే ఇంక ఆ పార్టీ నేతల సభల సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవడమెందుకు అంటూ పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఇక విషయానికి వస్తే... తొలి రెండు రోజులూ బస్సు యాత్ర తుస్సు మనడంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. సీఎం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయడానికి వారు డబ్బు పంపిణీపై ఆధారపడ్డారు. ఎమ్మిగనూరు సభకు వచ్చిన మహిళలకు వైసీపీ నాయకులు డబ్బులు పంచుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి.  సీఎం సభ కోసం వచ్చిన మహిళలను వైసీపీ నాయకులు ఓ చోటుకి చేర్చారు. డబ్బులు ఉంచిన కవర్‌లను మహిళలకు పంచారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి ముందు బెదరించ బెల్లించో, సొమ్ములు పంచో, మందు సరఫరా చేసో జనాలను తరలించిన వైసీపీ నేతలకు కోడ్ అమలులోకి వచ్చిన తరువాత అది అంత  ఈజీ టాస్క్ గా కనిపించడం లేదు. కోడ్ అమలుకు ముందు సభకు రాకపోతే పథకాలు ఇవ్వరనో, అక్రమ కేసులు బనాయిస్తారనో, దాడులకు పాల్పడతారనో భయంతో ఇష్టం లేకపోయినా బలవంతపు బ్రాహ్మణార్ధం అన్నట్లు జనం సభలకు వచ్చే వారు. ఎప్పుడైతే కోడ్ అమలులోకి వచ్చిందో జగన్ సభ అంటే చాలా జనమే కాదు, వైసీపీ క్యాడర్ కూడా లైట్ తీసుకుంటోంది.  దీంతో  సీఎం ఎమ్మిగనూరు సభకు ఎలాగైనా సరే జనాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో   బహిరంగంగానే  డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు వీడియోకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. ఈ దృశ్యాలు  వైరల్ గా మారాయి. ఇక ఆ పంపిణీ కూడా సరిగ్గా జరగలేదంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగడంతో వైసీపీ పరువు గంగలో కలిసింది. వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పి.. కొందరికి మాత్రమే వెయ్యి ఇచ్చి మిగిలిన వారికి తక్కువ డబ్బులు ఇచ్చారంటూ మహిళలు ఆందోళనకు దిగారు. దీంతో వైసీపీ నేతలు ఎలాగోలా వారికి సర్ది చెప్పి సముదాయించారు.   బస్సులు పెట్టినా, డబ్బులు పంచినామద్యం పారించినా జగన్ సభలకు జనం అంతంత మాత్రంగానే వస్తున్నారు. ఆ వచ్చిన జనం కూడా జగన్ ప్రసంగం వినడానికి ఇష్టపడటం లేదు. డబ్బులు పుచ్చుకున్నాం కనుక వచ్చాం, హాజరు వేయించుకున్నాం ఇక చాలు అన్నట్లు మధ్యలోనే లేచి వెళ్లిపోతున్నారు.   మరో వైపు పరదాలు లేకుండా జగన్ చేస్తున్న రోడ్ షోలో ఆయన ప్రజా నిరసనను ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. సీఎం ముఖ్యమంత్రి జగన్​కు కర్నూలు జిల్లాలో నిరసన సెగ తగిలింది. కోడుమూరు మండలం రామచంద్రాపురం వాసులు బిందెలతో నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు బహిరంగ సభకు వెళుతుండగా మార్గమధ్యంలో  ప్రజలు ఖాళీ బిందెలతో నిరసనకు దిగా ఆయన బస్సును అడ్డుకున్నారు.  అలాగే వామపక్షాలు కూడా బస్సు యాత్ర సందర్భంగా నిరసనకు దిగి తాగునీటి సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేశాయి. కాగా నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు.    కాగా ఒక వైపు జగన్ సభకు జనం రావడం లేదు. అదే సమయంలో నిరసనలకు కూడా దిగుతుంటే మరో వైపు విపక్ష నేత చంద్రబాబు సభలకు జనం స్వచ్ఛందంగా లక్షల సంఖ్యలో తరలిరావడం చూస్తుంటే.. మే 13న జరిగే ఎన్నికలలో జనం   ఓటు ఎవరికో ఇప్పటికే నిర్ణయించేసుకున్నారని తేటతెల్లమౌతోంది. జగన్ ఓటమికి ఆయన బస్సుయాత్ర తుస్సుమనడమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరో వైపు చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వెల్లువెత్తడం చూస్తుంటూ వచ్చే ఎన్నికలలో విజయం ఎవరిని వరించబోతోందన్నది అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కడియం  శ్రీహరిపై అనర్హత వేటు? 

తమ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్న కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయించే దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కూతురు కడియం కావ్యకు టిక్కెట్ కూడా ఇప్పించుకున్నారు. కానీ కొన్ని రోజులకే వారు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చారు. బిఆర్ఎస్  పార్టీ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ శనివారం అసెంబ్లీకి వచ్చారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పడంతో అసెంబ్లీ కార్యదర్శికి పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆయన కూడా లేరని చెప్పడంతో ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెనుదిరిగారు. కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని వారు కోరనున్నారు. స్పీకర్ అపాయింటుమెంట్ తీసుకొని అనర్హత వేటు వేయాలని పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కడియం శ్రీహరి చాలా కాలం పాటు టీడీపీలో ఉండి ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి వంటి సీనియర్ పదవుల్లో పనిచేశారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి 2014లో వరంగల్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఏడాదిన్నర తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి శాసనమండలికి ఎన్నికయ్యేలా చేసి ఉప ముఖ్యమంత్రిని చేశారు అప్పటి టిఆర్ఎస్ అధినేత కేసీఆర్. శ్రీహరి నిష్క్రమణ, అతని కుమార్తె కావ్య పోటీ నుండి వైదొలగడం నిజంగా బిఆర్ఎస్ కు షాక్‌ అనే చెప్పాలి.

కేటీఆర్ పై మరో కేసు

లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకోలేక సతమతమౌతున్న పార్టీకి  ఒకదాని వెంట ఒకటిగా కష్టాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు,  సీనియర్లే పార్టీ నుంచి జంప్ కొట్టేయడం. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకకపోవడం, అభ్యర్థిగా ప్రకటించిన తరువాత పోటీ నుంచి వైదొగడంతో పార్టీ ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ఈ తరుణంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై వరుసగా కేసులు నమోదు కావడం బీఆర్ఎస్ ను మరిన్ని కష్టాల్లోకి నెట్టివేసినట్లైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసిస్తూ హన్మకొండయ పీఎస్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా శనివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ పై ఐ పీసీ 504,505(2) కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పలువురు కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద సుమారు రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపించారంటూ  కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఈ కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్   నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

షర్మిల ఎక్కడ? కాంగ్రెస్ లో అయోమయం.. అనుమానం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికే నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచినా ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారిన దాఖలాలు కనిపించడం లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. తెలంగాణలో బలంగా పుంజుకుంది. అధికారపగ్గాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని తన పోరాటం ద్వారా సాధించానని చెప్పుకుంటూ తెలంగాణ పితగా తనకు తానే కితాబులిచ్చేసుకున్న కేసీఆర్ పార్టీని ఆ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్షానికి పరిమితం చేసేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అయితే ఇది జరగడానికి పదేళ్లు పట్టింది. అయితే ఏపీలో మాత్రం అడ్డగోలు విభజన ఆగ్రహం ప్రజలలో ఇంకా చల్లారినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే దక్షిణాదిలో కర్నాటక, తెలంగాణలలో అధకారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏపీపై దృష్టి సారించింది. ఏపీలో పుంజుకోవాలంటే వైఎస్ బ్రాండ్ ను జగన్ నుంచి తమ పార్టీకి బదలాయించుకోవడమొక్కటే మార్గమని భావించింది. అందుకే వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు పార్టీ  ఏపీ పగ్గాలు అప్పగించింది. షర్మిల అన్న జగన్ తో విభేదించి తెలంగాణలో తన తండ్రి పేరు మీద వైఎస్సార్టీపీ పార్టీని ఏర్పాటు చేసుకుని తన స్థాయిలో తాను రాజకీయం చేసుకున్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా ఆమె కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికలలో తన పార్టీని పోటీ నుంచి పక్కన పెట్టేశారు.  ఆ తరువాత ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ పార్టీ ఏపీ పగ్గాలు అందుకున్నారు. ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న షర్మిల అలా తన అన్నపై విమర్శల బాణాలు సంధించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మైలేజీ పెరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషించారు. సూటిగా జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తూ, తన తండ్రి వైఎస్ ఆశయాల సాధన కోసమే తాను కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు పట్టుకున్నానని కూడా గట్టిగా చెప్పారు. అంతేనా సొంత బాబాయ్ వివేకా హత్య కేసు ఛేదనలోలో కూడా జగన్ దర్యాప్తు సంస్థలకు అడుగడుగునా అడ్డుపడింది కూడా జగనేనని ఆమె విస్పష్టంగా ప్రకటించేశారు. వివేకా 5వ వర్ధంతి సభలో వివేకా కుమార్తె సునీతతో కలిసి వేదిక పంచుకుని, ఆ వేదిక సాక్షిగా తన అన్నకు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. తాను కడప లోక్ సభ, లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తాననీ ప్రకటించారు. ఇందు కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కడప నేతలతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అంతే ఆ తరువాత నుంచీ ఆమె అనూహ్యంగా మౌనముద్ర వహించారు. అంతే కాదు బహిరంగంగా ఎక్కడా సభలు సమావేశాలలో కనిపించడం లేదు. ఒక పక్క ఎన్నికల షెడ్యూల్ విడుదలై అన్ని పార్టీలూ ప్రచారంలో పరుగులు పెడుతుంటే.. ఏపీ కాంగ్రెస్ లో  మాత్రం ఎన్నికల హడావుడి ఏమీ కనిపించడం లేదు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కనిపించడం లేదు. వినిపించడం లేదు. దీంతో రాజకీయవర్గాలలోనే కాకుండా కాంగ్రెస్ శ్రేణులలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల కాడె వదిలేశారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  సరిగ్గా ఈ సమయంలోనే ఇంత కాలం కుమారుడు జగన్ కు  దూరంగా కుమార్తె షర్మిలతో ఉన్న వైఎస్ సతీమణి విజయమ్మ ఇడుపుల పాయలో జగన్ పక్కన ప్రత్యక్షమయ్యారు. జగన్ తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఇడుపులపాయ నుంచి బస్సుయాత్ర ద్వారా ప్రారంభించారు.  ఆ సందర్భంగా ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన సమావేశంలో విజయమ్మ పాల్గొన్నారు. కొడుకును బైబిల్ సాక్షిగా దీవించారు. దీంతో షర్మిల కూడా తన స్టాండ్ మార్చుకున్నారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీలో ఉత్సాహం కలిగించేలా వరుస సభలూ సమావేశాలతో దూసుకుపోవాల్సిన తరుణంలో షర్మిల సైలెంట్ కావడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక వంటి కార్యక్రమాలకు ఇంకా శ్రీకారం చుట్టకపోవడంతో తెరవెనుక ఏదైనా జరిగిందా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.  తల్లి విజయలక్ష్మిని తనకు అనుకూలంగా చేసుకున్న జగన్  చెల్లి షర్మిలను తన వైపు తిప్పుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటినీ నివృత్తి చేయాల్సిన షర్మిల ఇకనైనా మౌనం వీడాల్సిన అవసరం ఉందని పరిశీలకులు అంటున్నారు? 

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం 

త్వరలో జరిగే లోక్‌సభ, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆంక్షలు విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు 2024లో ప్రారంభ దశ ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి ఏడవ దశ పోలింగ్ జరగాల్సిన జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది. లోక్‌సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ, ఉపఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం పోలింగ్ సమయంలో ఒపీనియన్ పోల్, పోల్ సర్వే ఫలితాలను ప్రచురించడం నిషిద్ధమని హెచ్చరించింది.  కాగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా వేర్వేరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 12 రాష్ట్రాల్లోని 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.  

వలస నేతలపై విసుర్లు.. నవ్వుల పాలౌతున్న కేసీఆర్

బీఆర్ఎస్ రాజకీయం అలాగే ఉంటుంది. అధికారంలో ఉన్నంత కాలం తాము చేసిందే రైట్ అన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు విపక్షంలో ఉండి తాము నాడు చేసిన పనులలో తప్పిదాలను అంగీకరిస్తూనే వాటి వల్ల కొంపలేం మునిగిపోయాయని మమ్మల్ని ఓడించారంటూ ప్రజలను దబాయించడానికి ప్రయత్ని స్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేటీఆర్ కుమారుడు  కల్వకుంట్ల తారకరామారావు మాటలు, చేతలూ సొంత పార్టీ నేతలూ కేడర్ నే విస్మయానికి గురి చేస్తున్నాయి. ఓటమిని దిగమింగుకోలేక అసలే సతమతమౌతుంటే.. పార్టీ నుంచి జోరందుకున్న వలసలు ఆయనను మరింత అసహనానికి గురి చేస్తున్నట్లున్నాయి. అధికారంలో ఉండగా కార్యనిర్వాహక అధ్యక్ష పదవి ఒక హోదా, ఒక అధికారం, కాబోయే సీఎంను అన్న ధీమా ఇచ్చిన పదవి. ఇప్పుడు విపక్షంలో ఉండగా అదే  పదవి కేటీఆర్ కు ముళ్ల కిరీటంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో లోక్ సభ ఎన్నికలకు పార్టిని సమాయత్త పరచాల్సిన బాధ్యత కేటీఆర్ పైనే పడింది. ఆయన కూడా ఆ సమన్వయ కార్యక్రమాలను ఏదో మమ అన్నట్లుగానే నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది.  తప్పని సరి అన్నట్లుగానే కేటీఆర్  పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అలా నిర్వహిస్తున్న సమావేశాల్లో సమీక్షకు అవకాశమే లేదన్నట్లుగా కేటీఆర్ తీరు ఉంది. ప్రతి సమావేశంలో ఆయన మాట్లాడుతున్న తీరు పార్టీ శ్రేణులలో కూడా అసహనానికి కారణమౌతోంది.  రెండు పిల్లర్లు కుంగితే  బ్రహ్మాండం బద్దలైపోతుందా? ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరగితే జరిగుండొచ్చు..? దానికి ఇంత యాగీ చేయాలా? అంటూ ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రజలలో పార్టీ ప్రతిష్టను, పలుకుబడిని మరింత దిగజారుస్తున్నాయని పార్టీ క్యాడరే అంటోంది.   ఇక పార్టీని వీడి వెడుతున్న వారిపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న శాపనార్ధాలూ పార్టీని ఇన్ టాక్ట్ గా ఉంచడంతో తన ఫెయిల్యూర్ ను ఎత్తి చేపుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీని కష్టకాలంలో వీడి వెడుతున్న వారికి పార్టీ తలుపులు ఎప్పటికీ మూసుకుపోయినట్లేనని ఆయన అనడంపై పార్టీ శ్రేణులే నవ్వుకుంటున్నాయి. అధికారంలో ఉండగా పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకున్న పాపమే ఇప్పుడు పార్టీకి శాపంగా మారిందని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను వదిలి వచ్చిన వారంతా  ఆయా పార్టీలు కష్టకాలంలో ఉండగా వదిలేసి వచ్చిన వారే కదా.. ఇప్పుడు పార్టీని వదిలి వెడుతున్న వారిలో అత్యధికులు అటువంటి వారే కదా అని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ప్రత్యర్థి పార్టీలను నామరూపాల్లేకుండా చేయాలన్న ఉద్దేశంతో నాడు చేసిన సర్పయాగమే ఇప్పుడు బీఆర్ఎస్ ను ఖాళీ చేసేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ కు అండగా నిలిచిన ఉద్యమ కారులందరినీ పక్కన పెట్టేసి ఇక బీఆర్ఎస్ ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించి మరీ  పక్క పార్టీల నుంచి  వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక  అలా వచ్చిన వారంతా వలసబాట పడుతుంటే వారిని తప్పపట్టడం వింతగా ఉందని అంటున్నారు. అయినా అధికారం శాశ్వతం అన్న భ్రమల్లో ఊరేగిన వారికి ఆ అధికారం కోల్పోయిన తర్వాత అసహనం సహజమేనని సెటైర్లు వేస్తున్నారు.   

ఐపీఎల్ -17..బెంగళూరుకు మరో ఓటమి.. కోల్ కతా చేతిలో చిత్తు

ఐపీఎల్ సీజన్ - 17లో భాగంగా  బెంగళూరు వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన  మ్యాచ్ లో కోల్ కత నైట్  రైడర్స్ విజయం సాధించింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి 182  పరుగులు చేసింది. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లకు కోల్ కతా లక్ష్యాన్ని ఛేదించింది.   తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నైట్ రైడర్స్ కు శుభారంభం దక్కలేదు. మాంఛి ఫాంలో ఉన్న డుప్లెసిస్ హర్షిత్ రాణా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మిచెల్ స్టార్క్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే కింగ్ కోహ్లీ మాత్రం పట్టుదలగా బ్యాటింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించాడు.  డుప్లెసిస్ ఔటవ్వడంతో క్రీజ్ లోకి వచ్చిన గ్రీన్ తో కలిసి ఇన్నింగ్స్ కొనసాగించిన కోహ్లీ దూకుడు పెంచాడు. వీరిద్దరూ కోల్ కతా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి బెంగళూరు వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది.  ఇన్నింగ్స్ సజావుగా సాగుతోందనుకుంటున్న తరుణంలో  రస్సెల్ బౌలింగ్ లో గ్రీస్ ఔటయ్యాడు. గ్రీస్ 21 బంతుల్లో నాలుగు ఫోర్లు 2 సిక్సర్లతో 33 పరుగులు చేశారు. గ్రీస్ ఔట్ అవ్వడంతో మ్యాక్స్ వెల్ క్రీజ్ లోకి వచ్చాడు. అయితే మ్యాక్స్ వెల్ ఆరంభం నుంచీ కూడా తడబడుతూనే ఆడాడు. తనదైన శైలిలో స్ట్రోక్ ప్లే చేయడంలో విఫలమయ్యాడు. రెండు లైఫ్ లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరో వైపు కోహ్లీ సాధికారికంగా ఆడుతూ 36  బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.  మాక్స్ వెల్ మాత్రం 19 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్సర్ తో 28 పరుగులు చేసి నరైన్ బౌలింగ్ లో రింకూ సింగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తరువాత బెంగళూరు వరుసగా పటేదార్, అనూజ్ రావత్ లు వెంటవెంటనే ఔటయ్యారు.  కోహ్లీ అద్భుత బ్యాటింగ్ కారణంగా  బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కోహ్లీ 59 బంతుల్లో   4 ఫోర్లు, 4 సిక్సర్లతో  83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.    183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా మొదటి ఓవర్ నుంచే పరుగుల వేట మొదలెట్టేసింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లోనే ఏకంగా 15 పరుగులు సాధించింది.  యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్ లో 14 పరుగులు రాబట్టింది. మొత్తం మీద కొల్ కతా దూకుడుకు మయాంక్ బ్రేక్ వేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో దూకుడు మీద ఉన్న నరేన్ ను క్లీన్ బౌల్డ్ చేశారు. నరేన్ 22 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు.  ఆ తరువాత 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 30 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్ గ్రీన్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరిగాడు. అయితే ఆ తరువాత వచ్చిన వెంకటేశ్ అయ్యరే చెలరేగి ఆడటంతో కోల్ కతా  పరుగుల వరద పారించగలిగింది. ఈ క్రమంలో 29 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అయ్యర్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  అయితే  శ్రేయస్ అయ్యర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి బెంగళూరును చిత్తు చేసింది.