dangerous these injuries can be to children if they are neglected

పిల్లలకు ఈ ప్రదేశాలలో తగిలే గాయాలను నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమూ తెలుసా?

  పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వాళ్లకు కాస్త నడక వచ్చిందంటే చాలు.. ఉరుకులు, పరుగులు పెడుతుంటారు. తమ తల్లిదండ్రులను, పెద్దలను కూడా పరుగులు పెట్టిస్తారు. అయితే కాళ్లు, చేతుల ప్రాంతాలలో కలిగే గాయాలు, దెబ్బలు మందు రాస్తే లేదా కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతాయి. కానీ పిల్లల హడావిడి ఆటల్లో వారికి  చాలా సార్లు తలకు దెబ్బలు తగులుతూ ఉంటాయి.  నిజానికి ఇలా తలకు దెబ్బలు తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  పిల్లలు నొప్పికి ఏడిస్తే బుజ్జగించడం,  దెబ్బ తగిలిన ప్రాంతంలో  రుద్దడం వంచివి చేయడం వల్ల నొప్పి  తగ్గేలా చేస్తారు.  గాయాలు అయ్యి చర్మం  దెబ్బ తిన్నప్పుడు లేదా రక్తం కారడం వంటివి జరిగినప్పుడు తప్ప వైద్యులను సంప్రదించడం జరగడం లేదు.  అయితే  పిల్లలకు పదే పదే తలకు దెబ్బ తగలడం అంత తేలికగా తీసుకోవాల్సి విషయం కాదని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలకు ఏదైనా గాయాలు తగిలినప్పుడు  చాలా వరకు ఇంటి చిట్కాలతో నయం చెయ్యాలని చూస్తారు. పిల్లలకు కోతలు,  కాలిన గాయాలు జరిగితే వాటిని అస్సలు తేలికగా తీసుకోకూడదు. చాలామంది పేస్ట్ రాయడం,  కొబ్బరినూనె రాయడం, బర్నల్ వంటి ఆయింట్మెంట్లు రాయడం,  పసుపు పెట్టడం వంటివి చేస్తారు. కానీ చిన్న పిల్లల విషయంలో ఇవి చేయకూడదు. వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. పిల్లలకు తగిలే గాయాలు, వారికి అయ్యే కోతలు వంటివి కొన్నిసార్లు పైపైన కాకుండా లోతుగా జరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో డాక్టర్లు ఇచ్చే వైద్యమే సరైనది. తల గాయాలు.. పిల్లల గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరే.. పదే పదే దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. చాలా వరకు తలకు దెబ్బలు తగులుతాయి కానీ ఎలాంటి నష్టం బయటకు కనిపించదు.  కానీ ఇలాంటి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటే మెదడుకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.   ముఖ్యంగా ఇన్పెక్షన్  సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలకు గాయాలు, దెబ్బలు తగిలితే మొదట గాయాలు క్లీన్ చేయడానికి శుభ్రమైన నీరు, డెట్టాల్ లేదా మెడికేషన్ వైప్ వంటివాటితో శుభ్రం చేయాలి. వైద్యులు సూచించిన మందులను ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా వాడాలి.  తరువాత వైద్యుడిని సంప్రదించాలి.  తగిలిన ప్రాంతం నల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే లోపలి ప్రాంతంలో రక్తం గడ్డ  కట్టిందని అర్థం.  వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పిల్లలకు తగిలే దెబ్బల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.                                      *రూపశ్రీ.  

 Reasons Why You are Always Thirsty

ఎన్ని నీళ్లు తాగినా మళ్లీ మళ్లీ దాహం వేస్తోందా?   కారణం ఇదే కావచ్చు..!

  దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం చాలా సాధారణం.  అయితే కొందరికి ఎప్పుడూ దాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు, ఎన్ని నీళ్లు తాగినా సరే.. దాహం తీరదు. ఈ పరిస్థితి ఏంటో అర్థం కాక చాలామంది గందరగోళానికి గురవుతూ ఉంటారు. శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం వల్ల ఇలా జరుగుతుందని సమాధానం చెప్పుకుని కొందరు ఈ సమస్యను లైట్ తీసుకుంటారు.  కానీ విపరీతమైన దాహం అనేది కొన్ని వ్యాధులకు సూచన అని,   ఈ సమస్య వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.   ఇంతకీ ఎప్పుడూ దాహంగా అనిపించడం సమస్య అవుతుందా? దీని వెనుక కారణాలు ఏంటి? ఇవి ఏ జబ్బులు కలిగిస్తాయి? తెలుసుకుంటే.. వేసవికాలంలో దాహం వేయడం సహజం.  అయితే దాహం వేసినప్పుడు నీరు తాగితే దాహం తీరుతుంది. కానీ కాలంతో సంబంధం లేకుండా కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది. ఇలా తరచుగా దాహం వేయడం అనేది శరీరం ఎక్కువగా డీహైడ్రేట్ అవుతూందనడానికి సూచన. మధుమేహం.. కొందరికి పదే పదే దాహం వేస్తూ ఉంటుంది.  చాలామందికి తెలియదు కానీ ఇది మధుమేహానికి సూచన.  ఎప్పుడూ గొంతు పొడిబారడం,  దాహం వేయడం అనేవి  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల జరుగుతాయట.  రక్తంలో అదనపు చక్కెరను తొలగించడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాల్సి వస్తుంది.  ఈ కారణంగా శరీరం నుండి ద్రవం ఎక్కువగా చెమట,  మూత్రం రూపంలో బయటకు వెళ్లిపోతుంది.  దీని వల్ల పదే పదే దాహం వేస్తుంది.   రక్తహీనత.. శరీరంలో తగినంత రక్తం లేకపోతే దాన్ని రక్తహీనత అంటారు. ఎర్ర రక్తకణాలు శరీరంలో తగినంత  ఉత్పత్తి చేయబడవు.  శరీరంలో రక్తం తక్కువగా ఉంటే శరీరం డీహైడ్రేట్ కు గురికావడం,  పదే పదే దాహం వేయడం జరుగుతుంది.  పొడి గొంతు సమస్య కూడా పెరుగుతుంది. జీర్ణక్రియ.. వేయించిన ఆహారాలు,  నూనెలో డీప్ ప్రై చేసిన ఆహారాలు,  తీపి పదార్థాలు మొదలైనవి తిన్నప్పుడల్లా జీర్ణక్రియ పై ఎక్కువ ప్రభావం పడుతుంది. దీని వల్ల కడుపులో ఇబ్బంది ఏర్పడుతుంది.   ఇదే పదే పదే దాహం వేయడానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.  

Health benefits of Saffron Milk

చలికాలంలో కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిఫిట్స్ తెలుసా?

  వాతావరణాన్ని బట్టి ఆహారపు అలవాట్లు మారతాయి.  వేసవిలో చల్లగా ఏమైనా తాగాలని అనుకుంటాం. అదే చలికాలం వచ్చే సరికి ఆహారపు అలవాట్ల ఎంపిక నుండి ఆహారం ఉండే స్థితి వరకు అన్నీ మారతాయి.  ముఖ్యంగా చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే పానీయాలు,  ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాగే రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి కోవకు చెందినదే కుంకుమ పువ్వు పాలు.  చలికాలంలో చాలామంది కుంకుమ పువ్వు జోడించిన పాలు తాగాలని అనుకుంటారు.  కుంకుమ పువ్వు పాలు తాగితే కలిగే బెనిపిట్స్ ఏంటంటే.. కుంకుమ పువ్వు ఖరీదైన మసాలా దినుసు.  అయినా సరే కొన్ని సందర్భాలలో కుంకుమ పువ్వును తప్పక వాడతారు. కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సెరోటోనిన్ హార్మోన్ పాత్ర చాలా ముఖ్యం.  కుంకుమ పువ్వు సెరోటోనిన్ హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది.  అందుకే కుంకుమ పువ్వు పాలు తాగితే ఒత్తిడి తగ్గుతుంది.  గర్భవతులు కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగాలనే నిబంధన పెట్టినది కూడా వారిలో గర్భధారణ కారణంగా ఏర్పడే ఒత్తిడి నియంత్రణలో ఉండాలనే. కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగేటప్పుడు చాలా కొద్ది పరిమాణమే ఉపయోగిస్తారు.  కేవలం కొన్ని కుంకుమ పువ్వు రేకలను ఉపయోగిస్తారు.  కానీ ఇది చాలా శక్తివంతమైనది.  ఇది జీర్ణశక్తిని బలపరుస్తుంది.  అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. కుంకుమ పువ్వులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం కాంతివంతంగా, యవ్వనంగా మార్చడంలో సహాయపడతాయి. రోజూ కుంకుమపువ్వు పాలు తాగుతుంటే వయసు పెరిగినా అందం తగ్గదు. కుంకుమ పువ్వులో కాల్షియం ఉంటుంది. అలాగే పాలలో కూడా కాల్షియం ఉంటుంది.  ఇది ఎముకలను బలపరుస్తుంది.  బోలు ఎముకల వ్యాధి వంటి సమస్యలను నివారిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కుంకుమ పువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుంది.  కుంకుమ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. అలాగే కుంకుమ పువ్వులో కంటికి మేలు చేసే విటమిన్-ఎ కూడా ఉంటుంది. మహిళలు పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపులో కండరాల తిమ్మిరి వంటి సమస్యలతో  ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పిని, తిమ్మిరిని తగ్గించడంలో కూడా  కుంకుమ పువ్వు పాలు సహాయపడతాయి. కుంకుమ పువ్వు పాలు నిద్ర బాగా పట్టడంలో సహాయపడతాయి.  చలికాలంలో ప్రతిరోజూ కుంకుమ పువ్వు పాలు తాగడం వల్ల  పైన చెప్పుకున్న ప్రయోజనాలు అన్నీ చేకూరతాయి.                                              *రూపశ్రీ.  

health benifits of roasted channa

వేయించిన శనగలు తింటే ఇన్ని లాభాలు ఉంటాయని తెలుసా?

    శనగలు భారతీయులు ఆహారంలో బాగా ఉపయోగించే పప్పు ధాన్యం.  బస్సు ప్రయాణాలలో,  పార్కుల దగ్గర, సినిమా సెంటర్ల దగ్గర, స్కూళ్ల దగ్గర వేయించిన శనగలు తింటూ ఎంజాయ్ చేసేవారు బోలెడు మంది ఉంటారు. ఈ వేయించిన శనగలు పది, ఇరవై ఏళ్ల కిందట మంచి టైం పాస్ చిరుతిండి. ఇప్పుడు అవే శనగలు పోషకాహార జాబితాలో ఉంది. కాల్చిన శనగలను తినడం వల్ల ఆరోగ్యం చాలా బావుంటుందని అంటున్నారు.  ఇంతకీ ఈ కాల్చిన శనగలను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే.. పోషకాలు.. వేయించిన శనగలలో ప్రోటీన్,  ఫైబర్,  కాల్షియం,  మెగ్నీషియం,  ఫాస్పరస్,  ఐరన్,  కార్బోహైడ్రేట్లు, ఫోలేట్,  యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉంటాయి.  చలికాలంలో వేయించిన శనగలు తినడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. శనగలను సాధారణ కాలంలోనే కాకుండా చలికాలంలో కూడా నిక్షేపంగా తినవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే   వేయించిన శనగలను తీసుకవడం మంచిది.  శనగలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేయించిన శనగలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ వేయించిన శనగలు తింటూ ఉంటే రోగనిరోధ శక్తి కూడా బలపడుతుంది. శరీరానికి మంచి శక్తి లభించాలంటే వేయించిన శనగలు తినడం మంచి మార్గం.  సాధారణంగా పచ్చి శనగలను కూర చేసుకుంటారు. కానీ వాటిని రోజూ వండుకోలేం. అదే వేయించిన శనగలు అయితే రోజూ కొన్ని తినవచ్చు.  వేయించిన శనగలలో కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవన్నీ శరీరానికి అమితమైన శక్తిని ఇస్తాయి. వేయించిన శనగలు తింటే శక్తి లభించడం,  రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా మారడం మాత్రమే కాదు.. మధుమేహ రోగులకు చాలా మంచిది.   వేయించిన శనగలను స్నాక్స్ గా తీసుకుంటే  రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బరువు  తగ్గాలని అనుకునే వారు చిరుతిండిగా వేయించిన శనగలు తీసుకుంటే మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  పైగా ఇప్పట్లో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  వేయించిన శనగలలో కేలరీలు చాలా తక్కువ.  పైగా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.   చలికాలంలో జీర్ణసమస్యలు వస్తుంటాయి.  ఇలాంటి సమయంలో  ఆహారం జీర్ణం కాకపోవడం,  మలబద్దకం,  గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి.  వీటికి చెక్ పెట్టాలంటే వేయించిన శనగలు చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే వేయించిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.

Stress Relief oils

ఒత్తిడిని తగ్గించే ఈ నూనెల గురించి తెలుసా..?

  ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. ఇప్పటికాలం బిజీ జీవితాలలో ఒత్తిడి లేదు అంటే ఆశ్చర్యపోవాలి కానీ.. ఒత్తిడి ఉందంటే పెద్దగా వింతగా ఫీలవ్వాల్సింది ఏమీ లేదు. అయితే ఒత్తిడి సమస్య ఉంది కదా అని అందరూ అలాగే ఉండిపోరు.. ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర సమస్యకు దారితీస్తుందని వైద్యులు చెబుతూనే ఉన్నారు.  అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి  వైద్యులను కలవడం నుండి,  జీవనశైలి,  ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వరకు చాలా పాటిస్తారు.  ఈ కోవకు చెందినదే ఒత్తిడి తగ్గించే నూనెలు వాడటం.  కొన్ని రకాల నూనెలు ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.  అదేలా అంటే.. ఒత్తిడిని తగ్గించడంలో అరోమాథెరపీ చాలా బాగా పనిచేస్తుంది.  కొన్ని రకాల వాసనలు మనసుకు, మెదకుడు చాలా గొప్ప ఓదార్పును ఇస్తాయి.  ఇవి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం,  తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో పనిచేస్తాయి. అలాంటి నూనెలు ఏనో తెలుసుకుంటే.. లావెండర్ ఆయిల్.. లావెండ్ ఆయిల్ ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.  సోపులు,  పెర్ఫ్యూమ్, ఎయిర్ ఫ్రెషనర్లు, వివిధ రకాల క్రీములు మొదలైనవాటిలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో ఉంచవచ్చు లేదా చర్మానికి అప్లై చేయవచ్చు.  లేదంటే ఇంట్లోనే ఒక దీపం వెలిగించి దాని పైన ఒక చిన్న కప్ లో నీరు పోసి అందులో లావెండర్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇది గది మొత్తాన్ని కూడా చాలా సువాసనా భరితంగా మార్చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. శాండల్ ఆయిల్.. శాండల్ ఆయిల్ లేదా గంధపు నూనె చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు, నిద్రపోయేముందు ఈ నూనెను  వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.  ఇది మానసకి ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది. రోమరిన్ ఆయిల్.. రోమరిన్ ఆయిల్ అనేది ఒత్తిడిని తగ్గించడంలో మాత్రమే కాకుండా మానసిక అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  దీని సువాసన మానసికోల్లాసాన్ని ఇస్తుంది. పిప్పరమెంట్ ఆయిల్.. పిప్పరమెంట్ చాలా రకాల ఆహారాలు,  ప్రోడక్ట్ లలో చూస్తుంటాం. ఇందులో ఉండే మెంథాల్ ఫ్లేవర్ కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది.  పిప్పరమెంట్ ఆయిల్ వాసన తలనొప్పి, మానసిక అలసట,  మైగ్రేషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది మానసకి శక్తి స్థాయిలను పెంచుతుంది. జాస్మిన్ ఆయిల్.. జాస్మిన్ ఆయిల్ లేదా మల్లెపూల నూనె చాలా సువాసన కలిగి ఉంటుంది.  ఈ నూనె జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  ఏకాగ్రత పెంచడంలో సహాయపడుతుంది.  మానసిక ఒత్తిడిని చాలా సులువుగా తగ్గిస్తుంది. ఆరెంజ్ ఆయిల్.. ఆరెంజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్.. యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇందులో చాలా ఔషద గుణాలు ఉంటాయి.  ఈ నూనె జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఔషదాల తయారీలో ఉపయోగించబడుతుంది.   ఈ నూనెను వినియోగించి  ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.                                           *రూపశ్రీ.  

Liver Protection in Cold Weather

 శీతాకాలంలో కాలేయాన్నిఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు..!

  కాలేయం శరీరంలోని ముఖ్యమైన అవయవం. ఇది టాక్సిన్స్‌ను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. వాతావరణ పరిస్థితిని బట్టి కాలేయాన్ని శుద్ది చేసుకోవడం,  కాలేయ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం చేయాలి. వేసవి కాలంలో కాలేయాన్ని శుద్ది  చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి.  అయితే శీతాకాలంలో కాలేయాన్ని శుద్ది చేసుకోవడం గురించి చాలామందికి తెలియదు. శీతాకాలంలో కాలేయాన్ని శుద్ది చేసుకోవాలంటే ఈ కింది టిప్స్ పాటించాలి. పసుపు, అల్లం, నిమ్మకాయ.. శీతాకాలంలో పసుపు, అల్లం,  నిమ్మ వంటి సహజ పదార్థాలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. పసుపులో యాంటీఆక్సిడెంట్ గుణాలు అలాగే కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది.  ఇది కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. అల్లం జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది,  కాలేయానికి మేలు చేస్తుంది. అంతే కాకుండా, నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకోవచ్చు లేదా  ఎంపిక ప్రకారం వివిధ రూపాల్లో తినవచ్చు. వాటిని గోరువెచ్చని నీటితో కూడా తీసుకోవచ్చు. ఇది కాలేయానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిట్రస్ పండ్లు.. శీతాకాలంలో నారింజ, నిమ్మకాయలు,  ద్రాక్షపండ్లు వంటి తాజా సిట్రస్ పండ్లు కాలేయాన్ని శుద్ది  చేయడంలో సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాలేయం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. పండ్లను నేరుగా తినవచ్చు   లేదా జ్యూస్  తయారు చేసి త్రాగవచ్చు. పండ్లు తీసుకోవడం వల్ల  కాలేయంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. గోరువెచ్చని నీరు.. చలికాలంలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చల్లని వాతావరణంలో చాలాశాతం మంది తక్కువ నీరు తాగుతారు. అందువల్ల శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది.  అందుకే వేడి లేదా గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో..  శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.  ఉదయాన్నే ఒక గ్లాసు వేడి నీటిని త్రాగడం లేదా  రోజంతా గోరువెచ్చని నీటిని తాగడం చేయవచ్చు. వేడి నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది,  కాలేయాన్ని క్లీన్  చేయడంలో కూడా సహాయపడుతుంది. పండ్లు, కూరగాయలు.. బచ్చలికూర, ఆవాల ఆకు, ముల్లంగి ఆకులు,  క్యారెట్లు వంటి ఆకు కూరలు శీతాకాలంలో కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ కూరగాయలలో ఫైబర్, విటమిన్లు,  ఖనిజాలు ఉంటాయి, ఇవి శరీరానికి తాజాదనాన్ని అందిస్తాయి.  కాలేయం సక్రమంగా పనిచేస్తాయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా బీట్‌రూట్, గుమ్మడికాయ,  బ్రకోలీ వంటి కూరగాయలు కూడా కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఈ పండ్లు,  కూరగాయలలో ఉండే పోషకాలు కాలేయ పనితీరును మెరుగుపరస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ.. చలికాలపు సీజన్ లో ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ డిటాక్సిఫికేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ముఖ్యం. వ్యాయామం,  యోగా చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.  కాలేయం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.  చలికాలంలో  దినచర్యలో తేలికపాటి యోగా లేదా ఇతర శారీరక కార్యకలాపాలను చేర్చుకోవచ్చు. మంచి మార్గాలు.. చలికాలంలో కాలేయం శుద్ది చేసుకోవాలంటే.. ఆకు కూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి అనేక కూరగాయలుతో పాటు యాపిల్స్, ద్రాక్ష,  సిట్రస్ పండ్లను తినడం మంచి మార్గం.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవోకాడో,  నట్స్ ద్వారా  ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలు కాలేయంపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి కాబట్టి వీటిని తగ్గించాలి, వీలైతే మానేయాలి.  ఆహారంలో పసుపు,  అల్లం చేర్చాలి.  ఎందుకంటే అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి.  నీటిలో  డిటాక్స్ గుణాలు పెరగడానికి  నిమ్మకాయ ముక్కలను జోడించాలి.                                        *రూపశ్రీ.

fruits that help cleanse kidney naturally

మూత్రపిండాలలో పేరుకున్న విషాలు తొలగాలంటే  ఇదిగో ఈ పండ్లు తినాలి..!

    మానవ జీవనశైలి రోజురోజుకూ దిగజారిపోతోంది.   జీవనశైలి మారిన కారణంగా  చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం కారణంగా, జీవనశైలి కారణంగా శరీరంలో మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలు కూడా కలుషితం అవుతుంటాయి.  ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు సరిగా లేకపోతే చాలా కష్టం. మూత్రపిండాలలో పేరుకున్న విషపదార్థాలు తొలగించుకోకపోతే   మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, మూత్రపిండాలలో రాళ్లు పేరుకోవడం,  మూత్ర పిండాలు ఫెయిల్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి.  అలా కాకుండా మూత్రపిండాలలో పేరుకున్న విష పదార్థాలు తొలగిపోవాలంటే.. ఈ కింద చెప్పుకున్న పండ్లు తప్పనిసరిగా తినాల్సిందే.. పుచ్చకాయ, బ్లాక్‌బెర్రీస్, నిమ్మకాయ, యాపిల్,  క్రాన్‌బెర్రీ వంటి పండ్లు కిడ్నీలను చాలా వేగంగా శుభ్రపరుస్తాయని వైద్యులు, ఆహార నిపుణులు  పేర్కొంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గుతుంది. పండ్లు కిడ్నీలను ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయంటే.. పుచ్చకాయ: ఈ పండులో 92% నీరు పుష్కలంగా ఉంటుంది. ఇది టాక్సిన్స్ ను బయటకు పంపడమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. నిమ్మకాయ: నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్,  విటమిన్ సి ఉంటాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేస్తాయి. యాపిల్: యాపిల్‌లో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్,  వాపు తగ్గించడానికి సహాయపడుతుంది. నేరేడు: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నేరేడు కిడ్నీలకు బాడీగార్డ్ లాగా పనిచేస్తంది. ఇందులో ఉండే తక్కువ పొటాషియం స్థాయి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కిడ్నీ కణాలను రక్షిస్తుంది. క్రాన్‌బెర్రీ: యూటీఐ నివారణకు క్రాన్‌బెర్రీ మంచి పండు. దీని వినియోగం అనేక విధాలుగా మూత్రపిండాల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. పైనాపిల్: పైనాపిల్ బ్రోమెలైన్ రిచ్ తక్కువ పొటాషియం పండు. బ్రోమెలైన్  అనేది ఒక ఎంజైమ్, ఇది వాపును తగ్గిస్తుంది. పండ్లు ఎప్పుడు తినాలి? ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, సమతుల్య ఆహారంలో భాగంగా  పండ్లను ప్రతిరోజూ అల్పాహారంగా తీసుకోవచ్చు. రోజూ ఒక మీడియం కప్పు పండ్లను తినడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది. జాగ్రత్త.. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పండ్లను తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని తీసుకునే ముందు  వైద్యుడిని తప్పకుండా సంప్రదించిన తరువాతే తినాలి.                                  *రూపశ్రీ.

Benefits Of Dry Fruits With Honey

తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే కలిగే లాభాలు ఇవే..!

  తేనె సహజమైన తియ్యని పదార్థం.  దీన్ని సంస్కృతంలో మధు అని పిలుస్తారు.  ఆయుర్వేదం తేనెను గొప్ప ఔషదంగా పేర్కొంది. తేనెను  ప్రతి రోజూ తీసుకుంటే చాలా రకాల వ్యాధులు నయం అవుతాయి.  తేనెలో సహజమైన చక్కెరలు ఉండటం మూలాన ఇది శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు. ఇక డ్రై ఫ్రూట్స్ గురించి అందరికీ తెలిసిందే.. డ్రై ఫ్రూట్స్ శరీరానికి శక్తిని, ఆరోగ్యకరమైన కొవ్వులను ఇస్తాయి.  డ్రై ఫ్రూట్స్ లో ప్రోటీన్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దీర్ఘకాల ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.  అలాంటి డ్రై ఫ్రూట్స్ ను తేనెలో నానబెట్టి తింటే శరీరానికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయట. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాు పుష్కలంగా ఉంటాయి.  తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టైతే అలాంటి వారు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తినాలి.  ఇది చెడు కొలెస్ట్రాల్ తొలగించడంలో సహాయపడుతుంది.  ప్రతి రోజూ కనీసం ఒక స్పూన్ తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినాలి. తేనె, డ్రై ఫ్రూట్స్ రెండూ శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి.  అలసిపోయినప్పుడు తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే అలసట నుండి ఉపశమనం పొందవచ్చు.  నీరసంగా అనిపించినా, అలసటగా ఉన్నా,  శరీరంలో శక్తి లేనట్టు అనిపించినా తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది, తేనెలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.  జీర్ణ శక్తి బలహీనంగా ఉన్నవారు తేనెలో నానబెట్టిన డ్రై ప్రూట్స్ తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది అమృతంతో సమానమైన ఔషధంగా పనిచేస్తుంది.                                                     *రూపశ్రీ.

Side effects of drinking tea

ఈ సమస్యలున్న వ్యక్తులు చాయ్ తాగడం డేంజర్ తెలుసా?

చాయ్..  భారతీయులకు ఎమోషన్. పట్టణాలలో టీ దుకాణాలలో టీ ఎప్పుడూ ఉడుకుతూనే ఉంటుంది.  దానికి తగ్గట్టు ప్రజలు కూడా టీని అమృతంలాగా జుర్రుకుని తాగుతుంటారు. కొందరికి టీ తాగకపోతే అసలు ఏ పని చేయాలని అనిపించదు. ఇక కష్టపడి పనిచేసేవారు బద్దకం, నిద్ర వదిలి శరీరం చురుగ్గా ఉండటం కోసం రోజులో చాలా సార్లు టీ తాగుతుంటారు. టీ అనేది రుచినే కాదు.. మితంగా తాగితే ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. టీ లో ఉన్న రకాలు.. ఫ్లేవర్ లు టీని మళ్లీ మళ్లీ తాగాలని అనిపించేలా చేస్తాయి. కానీ కొన్ని సమస్యలున్న వారు టీ తాగడం అస్సలు  మంచిది కాదట.  ఇంతకీ టీ ని ఎవరు తాగకూడదో తెలుసుకుంటే.. యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్న వ్యక్తులు టీ తీసుకోవడం మంచిది కాదట.  టీ లో ఉండే కెఫిన్ కంటెంట్ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను ఇంకా ఎక్కువ చేస్తుంది. కడుపులో ఏర్పడే యాసిడ్లు అధికం అయ్యి అవి ఛాతీ వరకు వచ్చి ఛాతీలోనూ, గుండెల్లోనూ మంట పెడుతుంటాయి.  ఈ సమస్యను యాసిడ్ రిఫ్లక్స్  అంటారు.  ఈ సమస్య ఉన్నవారు చాయ్ తాగితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. గర్భం దాల్చిన మహిళలు టీకి దూరంగా ఉండటమే మంచిదట.  టీలో కెఫీన్ ఉంటుంది.  దీన్ని గర్భవతులు తాగితే కెఫీన్ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కెఫీన్ పానీయాలు కడుపులో బిడ్డ మీద కూడా  ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే పుట్టే బిడ్డ జుట్టు రాగి రంగులో ఉంటుంది. అంతేనా.. గర్భవతులు చాయ్ ఎక్కువ తీసుకుంటే శరీరం ఐరన్ గ్రహించే శక్తిని కోల్పోయి రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ఇప్పటికే ఐరన్ లోపం ఉన్నవారు టీని తీసుకోకపోవడం మంచిది. టీ లో ఉండే కెఫీన్, టానిన్ లు శరీరంలో ఐరన్ శోషణకు అంతరాయం కలిగిస్తాయి. రక్తహీనత సమస్యను మరింత పెంచుతాయి. మధుమేహం ఉన్నవారు టీని తీసుకోవడం  మంచిది కాదు. సాధారణంగా టీలో తీపి ఉంటేనే దాని రుచి మెరుగ్గా ఉంటుంది.  టీలో చక్కెర, బెల్లం వంటివి జోడించినవి తీసుకుంటే మధుమేహం సమస్య పెరుగుతుంది.  బెల్లం తో చేసిన టీ అయినా రోజూ తాగుతూ ఉంటే ప్రమాదం. 12 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న పిల్లలు టీలోని కెఫీన్ కంటెంట్ వల్ల ఏకాగ్రత విషయంలో డిస్టర్బ్ అవుతారు. ఇది చదువులోనూ, నిద్రలోనూ ఆటంకం కలిగిస్తుంది. *రూపశ్రీ.  

Sankranti special

సంబరాల సంక్రాంతితో ఆరోగ్యం..!

సంక్రాంతి భారతీయులు జురుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ప్రముఖంగా రైతుల పండుగ.  క్రాంతి అంటే  స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. సంక్రాంతి అంటే.. కొత్త క్రాంతి.. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో వెలుగులీనుతాడు.  క్రమంగా తన వెలుగును పెంచుకుంటూ వెళతారు. సూర్యుడిలానే ప్రజలు కూడా కొత్త కాంతితో తమ జీవితాలలో ముందుకు సాగాలన్నదే సంక్రాంతి సందేశం.  సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది.  సూర్యుడి కాంతి ద్వారా భూమి వెలుగులో సంచరిస్తుంది.  ఉత్తరాయణం ప్రారంభం అయితే సూర్యుడి గమనం వేగం అవుతుంది. సూర్యుడి గమనం వల్లనే  ఈ ప్రపంచం ఇలా ఉంది. సూర్యుడి గమనం లేకపోతే ఈ ప్రపంచం అంధకారం అవుతుంది.  అందుకే సూర్యుడి విలువను, సూర్య కాంతి విలువను అర్థం చేసుకోవాలి. సంక్రాంతి అంటే 'పరివర్తనం' అని అర్థం. మకర సంక్రాంతి రోజున  'మహా-స్నాన-యోగం' జరుగుతుందట. నదులు,  సరస్సులలో ముఖ్యంగా పవిత్ర నదుల సంగమం వద్ద స్నానం చేయడం చాలా మంచిది. మకర సంక్రాంతి పంటల పండుగ కూడా. శీతాకాలం తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా నువ్వులతో చేసిన సాంప్రదాయ స్వీట్లు సంక్రాంతి ప్రత్యేకం.  పొంగలి కూడా సంక్రాంతి ప్రత్యేక వంటకం. దీని పేరు మీదనే ఈ పండుగకు పొంగల్ అనే పేరు కూడా వచ్చింది. సంక్రాంతి పండుగ పంటల పండుగ.  పంటలు పండాలంటే ఆ సూర్య రశ్మి చాలా అవసరం.  ఈ కారణంగానే రైతులతో పాటు దేశం యావత్తూ సూర్యుజిని సంక్రాంతి పండుగ సందర్భంగా ఆరాధిస్తుంది.  ఉత్తరాయం ప్రారంభానికి సూచనగా, సూర్యుడి గమనానికి ప్రాధాన్యత ఇస్తూ రథం ముగ్గులు వేస్తారు. సంక్రాంతి పండుగ రోజు సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలంటే.. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.  అది కూడా నీరు పారే ప్రాంతాలు, నదులలో అర్ఘ్యం సమర్పించడం మంచిది.   ఏ నదిలో స్నానం చేసి అర్ఘ్యం సమర్పిస్తారో.. ఆ నదీ దేవతకు ప్రార్థిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. సంక్రాంతి పండుగ రోజున సన్యాసులు, పేదలకు దానం చేయడం మంచిది. అలాగే ఈ పండుగ రోజు వండే వంటల్లో ఉల్లి వెల్లుల్లిపాయలను అస్సలు తినకూడదు.                               *రూపశ్రీ.  

Ayurvedic Home Remedies for Cough and Cold

శీతాకాలంలో జలుబు, దగ్గు, సైనస్ కు చెక్ పెట్టే ఆయుర్వేద చిట్కాలు..!

  చలికాలం చాలా రకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకు వస్తుంది. చలిగాలులు, మంచు కారణంగా తొందరగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. ఇక ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారు చలికాలం వల్ల చెప్పలేనంత ఇబ్బంది పడతారు. కొందరికి చలి కారణంగా ఛాతీ పట్టేయడం,  ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. చలి గాలులు చెవిలోకి వెళ్లి తలనొప్పి కూడా వచ్చేలా చేస్తుంది.   ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, వీటి నుండి బయటపడాలన్నా,   ఆయుర్వేదం చెప్పిన కొన్ని చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. పసుపు పాలు.. పసుపును కొన్ని వందల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో వివిధ సమస్యల  నివారణకు ఉపయోగిస్తున్నారు.  పసుపులో శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  కొద్దిగా పసుపును పాలలో వేసి మరిగించాలి.  ఇందులో రుచి కోసం అల్లం, మిరియాలు కూడా వేసుకోవచ్చు.  ఈ పసుపు పాలను తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.  జలుబు కారణంగా ఏర్పడిన ముక్కుల రద్దీని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హనీ, జింజర్ టీ.. అల్లం, తేనె రెండూ ఆయుర్వేదంలో మంచి ఔషధాలు.  రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం, తేనె పని చేస్తాయి. అల్లాన్ని దంచి లేదా సన్నని ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించాలి.  మరిగిన తరువాత గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు గొంతుకు మంచి  ఉపశమనం ఇస్తాయి. అల్లం శ్వాస కోశ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పట్టడం చాలా మంచి టిప్.  జలుబు, దగ్గు, ముక్కులు మూసుకుపోవడం, తల నొప్పి, తల భారం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీటిని బాగా మరిగించాలి.  బాగా వేడెక్కిన నీటిలో కొన్ని చుక్కల నీలగిరి తైలం వేసుకుని నీటి ఆవిరి పట్టాలి. ఇది తల భారం తగ్గిస్తుంది,  ముక్కల రద్దీని తగ్గిస్తుంది. శ్వాస నాళాలను క్లియర్ చేస్తుంది. పుక్కిలించడం.. గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం కూడా మంచి మార్గం.  గోరు వెచ్చని నీటిలో కాసింత ఉప్పు వేయాలి.  ఈ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి. నీరు గొంతును క్లీన్ చేసేలా పుక్కిలించాలి.  ఇది నోట్లో, గొంతులో ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది. నాసల్ డ్రాప్స్.. ఆయుర్వేదంలో నాసల్ డ్రాప్స్ ఉన్నాయి.   దీన్ని అను తైలం అని పిలుస్తారు. ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకోవడం వల్ల ముక్కుల రద్దీ తగ్గుతుంది.  సాధారణంగా ఏ టిప్ వాడినా ముక్కులు తాత్కాలికంగా రిలీఫ్ అయ్యి తరువాత మళ్లీ రద్దీ అవుతాయి. కానీ ఈ తైలాన్ని కొన్ని చుక్కలు ముక్కులలో వేసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. హెర్బల్ టీ..   నల్ల మిరియాలు, అతి మధురం,  తులసి వంటి ఆయుర్వేద మూలికలతో చేసిన హెర్బల్ టీని తయారు చేసుకుని ఈ చలికాలంలో తీసుకుంటే భలే పనిచేస్తుంది.  ఇది దగ్గు, జలుబు,  రద్దీగా ఉన్న ముక్కులను తెరవడం, దగ్గు, కఫం సమస్యను తగ్గించడం చేస్తుంది.                                                   *రూపశ్రీ.

Over sleeping effects

హాయిగా నిద్రపోవడం మంచిదే.. కానీ అతిగా నిద్రపోతే ఈ జబ్బులు తప్పవట..!

నిద్ర దివ్యౌషధం అంటారు.  ఆరోగ్యకరమైన నిద్ర శరీరం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.  ప్రతి వ్యక్తికి రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర  కచ్చితంగా ఉండాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే హాయిగా నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ అతిగా నిద్రపోవడం ఆరోగ్యానికి చేటు చేస్తుందట. అతిగా నిద్రపోవడం వల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. ఊబకాయం.. అతిగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది.  ఎక్కువ సేపు నిద్రపోయే వారు శారీరక కష్టం ఏమీ చేయని వారై ఉంటారు.  ఎందుకంటే ఎక్కువ నిద్రపోయే అలవాటు ఉన్నవారు వృత్తి కార్యకలాపాలు నిర్వర్తించడం, చిన్న పనులు చేయడాన్నే పెద్దగా ఫీలైపోతారు.  శారీరక శ్రమ,   వ్యాయామం,  ఇతర విషయాలు, పనులను కూడా వాయిదా వేస్తుంటారు. దీనివల్ల దీర్షకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. జీవక్రియ.. ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో జీవక్రియ మందగిస్తుంది.  బరువు  పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది.  శరీరంలో కేలరీలను బర్న్ చేసే అవకాశం ఉండదు.  జీర్ణక్రియ సరిగా లేకపోవడం వల్ల ఇతర సమస్యలు కూడా పెరుగుతాయి. గుండె.. ఎక్కువ సేపు నిద్రపోవడం గుండెకు ప్రమాదం అని వైద్యులు అంటున్నారు.  ఎందుకంటే ఎక్కువ సేపు నిద్రపోవడం అనేది రక్తప్రసరణను నెమ్మదిస్తుంది.  ఈ కారణంగా గుండెకు రక్తప్రసరణ తగ్గి గుండె జబ్బులు,  హార్ట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపు.. రోజుకు 7 గంటల నిద్రపోవడం ఆరోగ్యకరం.  7 గంటల కంటే ఎక్కువ అయినా 9 గంటలు నిద్రపోవడం ఆరోగ్యమే.. కానీ 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలా 9 గంటలు నిద్రపోయే వారిలో 46శాతం ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధనలలో తేలింది. థైరాయిడ్.. అధిక నిద్ర కారణంగా థైరాయిడ్ సమస్యలు,  అతిగా తినడం అనే సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట.  వీటి కారణంగా అధిక బరువు,  ఊబకాయం,  డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.                                       *రూపశ్రీ.

Reason for sleep disorder

ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావడం లేదా? ఈ వ్యాధులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!

  నిద్ర మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. నిద్రను గొప్ప ఔషదంగా పరిగణిస్తారు.  మంచి నిద్ర ఉంటే  శరీర ఆరోగ్యం చాలా వరకు సాఫీగా ఉంటుంది. కానీ నేటి కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రవ్వగానే హాయిగా నిద్రపోవాలని అనుకుని, పడుకుని నిద్ర పట్టక మంచం మీద అటు ఇటు దొర్లుతూ కాలయాపన చేసేవారు.. నిద్రరాక గంటలు గంటలు శూన్యంలోకి చూస్తూ ఆలోచనలలో గడిపేవారు చాలా మంది ఉంటున్నారు. కొందరైతే నిద్ర  బాగా రావాలని పడుకునే ముందు కొన్ని రకాల పానీయాలు కూడా తాగుతుంటారు. అయితే ఇలా నిద్ర రాకపోవడం అనేది సాధారణంగా కొట్టే పడేయాల్సిన విషయం కాదట. ఇలా నిద్ర రాకపోవడం అనేది కొన్ని అనారోగ్య సమస్యలను సూచిస్తుందని అంటున్నారు.   నిద్రలేమి వివిధ కారణాల వల్ల సంభవించినా.. దీర్ఘకాలం ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే మాత్రం అది కొన్ని తీవ్రమైన వ్యాధుల వల్ల జరుగుతుంది. నిద్ర లేమి అనేది చాలా వరకు డిప్రెషన్ తో బాధపడేవారికి ఎదురయ్యే సమస్య.  డిప్రెషన్ కారణంగా నిద్ర పట్టడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. చాలామంది ఈ కాలంలో అతి ఆలోచనలు, ప్రతికూల ఆలోచనలు, మానసిక ఒత్తిడి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలు కూడా నిద్రను ప్రభావితం చేస్తాయి.   కొందరిలో స్లీప్ అప్నియా అనే సమస్య ఉంటుంది.  ఇది నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో అంతరాయం కలిగించే వ్యాధి.  దీని వల్ల శ్వాస సరిగా ఆడక మళ్లీ మళ్లీ నిద్ర మధ్యలో మేల్కొంటు ఉంటారు. హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే అది జీవక్రియను ప్రభావితం చేస్తుంది.  జీవక్రియ సరిగా లేకపోవడం వల్ల శరీర వ్యవస్థ డిస్టర్బ్ అవుతుంది. ఇది రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య కలుగజేస్తుంది. ఆర్థరైటిస్,  మైగ్రేన్ లేదా ఇతర వ్యాధులు ఉన్న వారు కూడా సరిగా నిద్ర పోలేరు. ఈ వ్యాధుల కారణంగా  నిద్రలో పదే పదే మెలకువ వస్తుంది.  ఈ సమస్యలు ఉన్నవారిలో నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి. అధికంగా ఆల్కహాల్,  కెఫీన్ పానీయాలు తీసుకునే వారు కూడా నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటారు. ఈ అలవాట్లు ఉన్నవారు రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు.                                           *రూపశ్రీ.

food for the brain strength

మెదడుకు అమృతం లాంటి ఆహారం ఇది..!

  ఆహారం శరీరానికి శక్తి వనరు.  ఆహారం సరిపడినంత తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆహారం నుండే శరీరానికి కావలసిన పోషకాలు,  విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ అన్నీ లభిస్తాయి. అయితే కొన్ని ఆహారాలకు ప్రత్యేకత ఉంటుంది.  కొన్ని గుండెకు మేలు చేస్తాయి.  కొన్ని కండరాలకు మేలు చేస్తాయి.  కొన్ని కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  ఇలా మేలు  చేసే ఆహారాలలో మెదడుకు మేలు చేసే ఆహారాలు ముఖ్యమైనవి.  మెదడు పనితీరు బాగుండటం ప్రతి ఒక్కరికి అవసరం.  ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మెదడు లేదా అని ఆంటుంటారు. అంటే.. మంచి ఆలోచనలకు,  జ్ఞాపకశక్తికి, శరీర కార్యకలాపాలకు మెదడు శక్తివంతంగా ఉండటం అవసరం. అలాంటి మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా, మెదడు పనితీరు బావుండాలన్నా మెదడుకు  శక్తిని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. మెదడుకు అమృతంతో సమానమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి.  అవేంటో తెలుసుకంటే.. వాల్ నట్,  బాదం.. వాల్ నట్, బాదం పప్పులు మెదడు ఆరోగ్యానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి.  వాల్ నట్ లలోనూ,  బాదం లోనూ అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మానసికంగా బలహీనంగా ఉన్నా,  జ్ఞాపకశక్తి బలహీనంగా ఉన్నా,  ఆలోచనా పనితీరు, మెదడు చురుగ్గా ఉండాలన్నా వాల్ నట్ లు, బాదం పప్పులు ప్రతిరోజూ తీసుకోవడం మంచిదట. వాల్ నట్ లు బాదం పప్పులలో విటమిన్-ఇ,  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.  ఇవి మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరంలో నరాల పనితీరు బాగుండాలంటే నాడీ వ్యవస్థ బాగుండాలి. నాడీ కణాలు ఆరోగ్యంగా ఉండాలి.  నాడీ కణాలకు పోషణ ఇవ్వడం ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి రక్షించడంలో వాల్ నట్స్, బాదం పప్పులు సహాయపడతాయి. వాల్ నట్స్,  బాదం పప్పులలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాలీ ఫెనాల్స్ ఉంటాయి. ఇవి వయసుతో పాటు ఆలోచనా సామర్థ్యం తగ్గిపోవడాన్ని నిరోధిస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వాల్ నట్స్ లో మెలటోనిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా  అవసరం.  నిద్రను మెరుగుపరచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెదడు కణాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు.. వాల్ నట్స్ లో ఉండే నైట్రిక్ ఆక్సైడ్, బాదం పప్పులో ఉండే పొటాషియం మెదడులో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.                                                  *రూపశ్రీ.

HMPV Virus in China

హెచ్ఎంపీవీ వైరస్.. మళ్లీ భయపెడుతున్న వైరస్ దాడులు.. ఇది ఎవరికి ఎక్కువ ప్రమాదం తెలుసా?

  హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ ఇన్‌ఫెక్షన్ చైనా నుండి మొదలైంది. ఇది కొత్తగా పుట్టినదేమీ కాదట.  ఇది ఆరు దశాబ్దాల నుండి ఉనికిలో ఉంది.  శాస్త్రవేత్తలకు గత 25 సంవత్సరాలుగా దీని గురించి తెలుసు. ఇది ఆర్‌ఎన్‌ఏ వైరస్.  అందుకే ఇది సజీవంగా ఉండటానికి సహజంగా పరివర్తన చెందుతూ ఉంటుంది. నివేదికల ప్రకారం హెచ్ఎంపీవీలో  కొత్త మ్యుటేషన్ కూడా సంభవించింది.  దీని కారణంగా చైనాలో  కేసులు వేగంగా పెరగడం ప్రారంభించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీడియా నివేదికలు,  వీడియోలు చైనాలోని ఆసుపత్రులు శ్మశానవాటికలకు భారీ సంఖ్యలో జనాలను తరలించడం చూపించాయి. ఈ వార్తలు చూస్తుంటే చైనా నుండి మరో అంటువ్యాధి కరోనా మాదిరిగా  ప్రపంచమంతటా వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు పుడుతున్నాయి.  ప్రజలు ఇంకా కరోనా నుండి సరిగ్గా కోలుకోలేదు.  కానీ అప్పుడే హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతోంది.  ఇది ప్రజలను కలవరపెడుతోంది.  అన్నింటిలో మొదటిది దేశంలో వైరస్ వ్యాప్తి కారణంగా  ఆసుపత్రులు,  శ్మశానవాటికలలో రద్దీని పెంచిందని చైనా నుండి వార్తలు వచ్చాయి. పిల్లలు ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని గుర్తించారు. చైనా తర్వాత ఇతర దేశాలలో కూడా హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతోంది. సోమవారం (డిసెంబర్ 6), ఈ అంటు వ్యాధి మొదటి కేసు భారత్ లో కూడా నమోదైంది ఈ వైరస్ గురించి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ కరోనా వైరస్‌తో సమానంగా ఉంటుందట.  దాని లక్షణాలు కరోనా కంటే కొంచెం ఎక్కువ లేదా కరోనా కంటే కొంచెం తక్కువ తీవ్రతతో ఉంటాయట.  కరోనా మాదిరిగానే హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ కూడా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ప్రజలు జలుబు,  శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారట.                                                 *రూపశ్రీ.

జబ్బులు ఎందుకొస్తాయంటే...

అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.  కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు.  ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు. ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే..  వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత  అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది. గుండెవ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రావడానికి ధూమపానం వాడకాలు ముఖ్యమని చెప్పాలి. సిగరేట్, చుట్ట, బీడీ లాంటివి త్రాగటంవల్ల ఆ పొగను కొంత బైటికి వదలటం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పొగాకు పొగత్రాగే వారికెంత హానికరమో, బైటగాలిలో వదలిన పొగను వారికి తెలియకుండా పీల్చే వారికి కూడా అంతే హానికరంగా పరిణమిస్తుంది. పొగాకు నమలటం, జరదా కిళ్ళీలు వేయటం వల్ల కూడా హృద్రోగాలు, కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని దాని కారణంగా కాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటివి సంభవిస్తుంటాయి. పొగాకు నమిలేవారికి నోరు, పళ్ళు, గొంతు, స్వరపేటికలకు సంబంధించిన తీవ్రవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువ. మన శరీరానికి జబ్బు తెచ్చిపెట్టే కొన్ని అలవాట్లు గమనిస్తే… ప్రతిరోజు స్నానం చెయ్యకుండా ఉండటం మొదటి అలవాటు. శరీర శుభ్రత లేకపోతే జబ్బులు రావడానికి మొదటి మార్గం మనమే ఇచ్చినట్టు. క్రమబద్దము లేని భోజనము చేయడం. రోజుకొక వేళలో భోజనం చేయడం వల్ల శరీరం ఏ సమయానికి శక్తిని తయారు చేసుకోవాలో నిర్ణయించుకోలేదు.   అధికంగా ఉపవాసములు చేయడం పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి ఉపవాసం అనేది కూడా ఆరోగ్య ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందే అయినా దాన్ని అతిగా పాటిస్తే శరీరానికి నష్టం చేకూరుతుంది.  బయట తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అలాగే శీతల పానీయాలు, చల్లని పదార్థాలు తినడం కూడా నష్టమే.   ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఫుడ్ చెడిపోకుండా వాయువులు నింపుతారు కాబట్టి వాటిని తిన్నా అనారోగ్యం వెంట వస్తున్నట్టే.. చాలామంది శారీరక సమస్యల విషయంలో సంకోచం చెందుతారు. కానీ అతిగా శృంగారంలో పాల్గొనడం ఎంత చేటు చేస్తుందో.. అసలు శృంగారం జోలికి పోకుండా సన్యాసిలా బ్రతకడం ఈకాలంలో అంతే చేటు చేస్తుంది.   ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే జబ్బులు వస్తాయి.  సౌకర్యవంతమైన దుస్తులు కాకుండా ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉన్నవి ధరించడం. శరీరంలో అవయవాల ఒత్తిడికి కారణమై తద్వారా వాటి క్రమబద్ధత తప్పేలా చేస్తుంది. ఆకుకూరలు–పౌష్టికాహారములు వాడకుండా ఉండటం కూడా అనారోగ్యానికి మూలకారణమే. మన శరీరానికి అనారోగ్యం దాపురించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి చూడండి.                                     ◆నిశ్శబ్ద.  

మీకు తెలుసా? ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ ను స్లో గా పెంచేస్తాయ్..!

  యూరిక్ యాసిడ్ రక్తంలో కనిపించే ఒక వ్యర్థ పదార్థం.  శరీరంలో ప్యూరిన్స్ అనే రసాయనాలు ప్రాసెస్ అయినప్పుడు లేదా అవి విచ్చిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది.  సాధారణంగా శరీరంలో ఏర్పడిన యూరిక్ యాసిడ్ రక్తంలో కరికి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. కానీ యూరిక్ యాసిడ్ ఎక్కువైతే అది శరీరంలో పేరుకుపోతుంది.  ఇలా పేరుకుపోవడం వల్ల శరీరంలో ఎముకలు దెబ్బతింటాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల గౌట్ సమస్య కూడా వస్తుంది. అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి చాపకింద నీరులా శరీరంలో పెరిగిపోతుంది. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. గొడ్డు మాంసం.. గొడ్డు మాంసం చాలా మంది తింటుంటారు.  అలాగే గొర్రె మాంసం అధికంగా తింటారు. ఇక పంది మాంసం విదేశాలలో ఎక్కువగా తింటారు.  ఈ మాంసాలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిల ఉత్పత్తి దారుణంగా పెరుగుతుంది.  యూరిక్ యాసిడ్ సమస్య ఇప్పటికే ఉన్నవారు పైన చెప్పుకున్న మాంసాలకు దూరంగా ఉండటం మంచిది. సముద్ర ఆహారాలు.. సముద్ర ఆహారాలలో ప్రోటీన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయని చెబుతారు. అయితే సముద్ర చేపలు, జీవులు అయిన మాకేరెల్,  ఆంకోవీస్ వంటి సముద్ర చేపలు తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. షుగర్ డ్రింక్స్.. అధికంగా ప్రక్టోజ్ కలిగిన కార్న్ సిరప్ తో తయారు చేసే శీతల పానీయాలు, ఇతర పానీయాలు తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది.  ఈ చక్కెర పానీయాలు కేవలం యూరిక్ యాసిడ్ స్థాయినే కాకుండా మధుమేహం పెరగడానికి,  ఊబకాయానికి కూడా కారణం అవుతాయి. ఆల్కహాల్.. ఆల్కహాల్ తాగే అలవాటు రోజురోజుకూ ఎక్కువ అవుతూందని చెప్పవచ్చు.  ఆల్కహాల్ తాగడం అనేది ఫ్యాషన్ లో భాగం అయిపోయింది. బీర్ తో సహా ఇతర ఆల్కహాల్ పానీయాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను చాలా పెంచుతాయి. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే అలవాటు చాలా ఎక్కువ ఉంటే యూరిక్ యాసిడ్ స్థాయి వల్ల జరిగే ప్రమాదం ఎక్కువ  ఉంటుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ప్రాసెస్ చేసిన ఆహారాలలో శుద్ది చేసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.  అలాగే శుధ్ది చేసిన చక్కెరల వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ ఆహారాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచడంలో పనిచేస్తాయి. పుట్టగొడుగులు.. పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలామంచివి.  వీటిని తీసుకోవడం వల్ల ప్రోటీన్, విటమిన్-డి లభిస్తాయి. అయితే పుట్టగొడుగులలో మితంగా ప్యూరిన్ లు ఉంటాయి. పుట్టగొడుగులను ఎక్కువగా తీసుకుంటే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగుతాయి. కాలీఫ్లవర్.. కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన సీజనల్ కూరగాయ.  ఇందులో ప్యూరిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కాలీఫ్లవర్ ను తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు మరింత పెరుగుతాయి.  అంతేకాదు.. ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్యతో ఇబ్బంది పడేవారు కాలీఫ్లవర్ కు దూరంగా ఉండాలి.                                         *రూపశ్రీ.  

నిద్రకు ముందు దాల్చిన చెక్క, అల్లం కలిపి టీ తయారు చేసుకుని తాగితే..!

  ఆరోగ్యకరమైన అలవాట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  దీని కోసం చాలామంది ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు చాలా రకాల ఆరోగ్య చిట్కాలు పాటిస్తారు. వీటిలో ఉదయాన్నే వేడి నీరు తాగడం తో మొదలుపెట్టి రాత్రి పడుకునే ముందు ఏదో ఒక పానీయంతో ముగిస్తారు. రాత్రి సమయంలో చాలామంది పసుపు పాలు తాగడం,  త్రిఫల జ్యూస్,  ఉసిరి జ్యూస్ వంటివి తీసుకుంటారు. ఇవన్నీ జీర్ణశక్తికి,  రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడతాయి.  అలాంటి వాటిలో దాల్చిన చెక్క, అల్లం తో తయారు చేసిన టీ కూడా ఒకటి.  ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు అల్లం, దాల్చిన చెక్క కలిపి  తయారు చేసిన టీ తాగితే ఏమవుతుందంటే.. దాల్చిన చెక్క, అల్లం రెండూ చాలా ఆహ్లాదకరమైన గుణాలు కలిగి ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా శరీరానికి విశ్రాంతి ఇస్తాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తాయి.  నిద్రకు ఒక 30 నిమిషాల ముందు ఈ టీని తాగడం వల్ల  రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు. అల్లం జీర్ణశక్తికి పేరుగాంచింది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇక దాల్చిన చెక్క కూడా అలాగే సహాయపడుతుంది. ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు భారం తగ్గడానికి, ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రకు ముందు తాగితే  ఇది ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు రాత్రి సమయంలో అల్లం, దాల్చిన చెక్క టీ తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అల్లంలోనూ, దాల్చిన చెక్కలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఇన్ప్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుకోవచ్చు.  ముఖ్యంగా దాల్చిన చెక్క మధుమేహం ఉన్నవారికి గొప్ప వరం కంటే తక్కువ కాదు.  దీన్ని రోజూ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు నియంత్రణలోనే ఉంటాయి. అంతేకాదు ఈ టీని రాత్రి సమయంలో తాగడం వల్ల రాత్రి పూట నిద్ర మధ్యలో ఆకలి వేయడం,  రాత్రి సమయంలో బయటి ఆహారాలు,  ఫాస్ట్ ఫుడ్ లాంటివి తినాలనే కోరిక తగ్గుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యతో బాధపడుతూ ఉంటే దాల్చిన చెక్క,  అల్లం కలిపి తయారు చేసిన టీ చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా  శీతాకాలంలో ఈ టీని తాగడం వల్ల చాలా మంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారికి చాలా రిలాక్స్ గా ఉంటుంది. ఇప్పటి కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చాలా చిట్కాలు పాటిస్తూ ఉంటారు.  అల్లం, దాల్చిన చెక్క రెండూ జీర్ణక్రియను వేగవంతం చేసేవే. ఈ రెండూ కలిపి తయారు చేసిన టీ తాగితే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొన్ని రోజులలోనే మార్పు తెలుస్తుంది.                                        *రూపశ్రీ.

చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినాలని చెప్పేది ఇందుకే..!

ఆహారం శరీరానికి చాలా మేలు చేస్తుంది.  సరైన ఆహారం తీసుకుంటే ఎలాంటి జబ్బులు అయినా తగ్గుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అందుకే సీజన్ కు తగ్గట్టు ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతుంటారు.  చలికాలంలో సాసువ ఆకు లేదా ఆవాల ఆకు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటారు. ఆవాలు చెట్టు నుండి లభించినప్పుడు దాని మీద పొట్టు కూడా తీయకుండా పసుపు రంగులో ఉంటే వాటిని సాసువలు అంటారు.  ఇక ఆవాల గురించి భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు.  ఈ ఆవాలు పండే మొక్కల ఆకులను ఆహారంలో తీసుకుంటారు.  ఇప్పట్లో చాలా మంది ఈ ఆకుల వినియోగం తగ్గించారు కానీ పెద్దల కాలం నాడు ఈ ఆకులను వంటల్లో వినియోగించేవారు.  ఆవాల చెట్టు ఆకులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. పోషకాలు.. ఆవాల మొక్క ఆకులలో  విటమిన్-ఎ,  విటమిన్-సి, విటమిన్-కె, ఐరన్,  కాల్షియం,  మెగ్నీషియం, ఫైబర్, సోడియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ప్రయోజనాలు.. ఆవాల మొక్క ఆకులను ఆహారంలో తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి.  చలికాలంలో సహజంగానే జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.  జీర్ణక్రియ మెరుగ్గా ఉండటానికి ఆహారంలో ఆవాల మొక్క ఆకులు తీసుకోవాలి. ఈ ఆకులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మోషన్ సాఫీగా జరగడంలో సహాయపడుతుంది. ఆవాల మొక్క ఆకులలో అమైనో ఆమ్లాలు,  ఫైబర్ సహా అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.  చలికాలంలో ఈ ఆకులు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  శరీరలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. ప్రోటీన్లు, విటమిన్లు సమృద్దిగా ఉండటం వల్ల ఆవాల మొక్క ఆకులు తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు రాలే సమస్య తగ్గడం నుండి జుట్టు ఆరోగ్యంగా పెరగడం వరకు అన్ని రకాలుగా జుట్టుకు మేలు చేస్తుంది. ఆవాల మొక్క ఆకులలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఆహారంలో తీసుకుంటే ఉంటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది. ఈ  కారణంగా ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారికి ఆవాల మొక్క ఆకులు చాలా మేలు చేస్తాయి. ఆవాల మొక్క ఆకులు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.  శరీరంలో రక్తహీనత తొలగిపోతుంది. ఇది వేడి చేసే గుణం కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఆకులు  ఆహారంలో తీసుకుంటే శరీరం వెచ్చగా ఉంటుంది.                                   *రూపశ్రీ.