ఏపీ రాజధాని విజయవాడేనా?... సచిన్ ఆరా...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అయ్యే అవకాశం వుందని భావిస్తున్న విజయవాడ నగరం సమీపంలో వున్న మంగళగిరిలో సచిన్ టెండూల్కర్ భారీగా భూములు కొన్నట్లుగా గతంలో పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లను సచిన్ సన్నిహితులు కొట్టిపారేశారు. రియల్ ఎస్టేట్ బూమ్‌ కోసమే రియల్టర్ ఇలాంటి పుకార్లను వ్యాపింపచేశారని అన్నారు. అయితే తాజాగా విజయవాడలో శుక్రవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ నిర్మించిన పీవీపీ మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన సచిన్ ప్రారంభోత్సవం తర్వాత విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అవడం ఖాయమైనట్టే కదా అని పొట్లూరి వరప్రసాద్‌ దగ్గర ఆరా తీసినట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సానికి వచ్చిన సచిన్ ఆ పనేదో చేసుకుని వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు అడిగాడు? ఒకవేళ సచిన్ నిజంగానే మంగళగిరిలో భూములు కొన్నాడేమో.. తన భూముల విలువ పెరుగుతుందో లేదో తెలుసుకోవడానికే సచిన్ ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఆరా తీశాడేమో అనే అంచనాలను ఊహాజీవులు వేస్తున్నారు.

నకిలీ కరెన్సీ ముఠా దొరికింది

  హైదరాబాద్‌ నగర శివార్లలో పోలీసులకు, దొంగనోట్ల ముఠాకు మధ్య కాల్పులు జరిగిన సంఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, దొంగనోట్ల ముఠాకు చెందిన ఒక సభ్యుడు చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నకిలీ నోట్ల ముఠాలోని ముగ్గురు వ్యక్తులు తమ వాహనంలో పారిపోయారు. వీరిని పట్టుకోవడానికి నాలుగు పోలీసు టీమ్‌లు రంగంలోకి దిగి ముఠాలోని ఇద్దరు సభ్యులను పట్టుకుంది. పోలీసు కాల్పుల్లో చనిపోయిన వ్యక్తి మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ దగ్గర ఒక దొంగనోట్ల ముఠా వుందని తెలుసుకున్న పోలీసులు అక్కడ దొంగనోట్ల ముఠా జరిపిన కాల్పుల్లో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మరణించాడు. వెంకట్‌రెడ్డి అనే ఎస్‌ఐకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

చెస్ క్వీన్ కోనేరు హంపి లైఫ్ ‘కింగ్’ ఇతనే!!

  ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేజం కోనేరు హంపి వివాహం ఈనెల 13వ తేదీన విజయవాడలో జరగబోతున్న విషయం విదితమే. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి మాత్రమే కాకుండా మంచి అందగత్తె కూడా అయిన కోనేరు హంపి వివాహం చేసుకునే వరుడు ఎలా వుంటాడో చూడాలన్న ఆసక్తి అందరిలోనూ వుంది. ఇదిగో.. ఇతనే చెస్ క్వీన్ కోనేరు హంపి లైఫ్‌లో ‘కింగ్’. ఈ యువకుడి పేరు దాసరి అన్వేష్. ఎఫ్ట్రానిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ కుమారుడు. అందం, అణకువ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వున్న కోనేరు హంపి వివాహం తగిన వరుడితో జరిపించడానికి ఆమె తండ్రి కోనేరు అశోక్ ఎంతోకాలంగా జరుపుతున్న అన్వేషణ దాసరి అన్వేష్ కనిపించడంతో ముగిసింది. కోనేరు హంపి - దాసరి అన్వేష్ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం మే నెలలో జరిగింది. ఈ జంటను చూసినవారందరూ చూడముచ్చటగా వుందని ఆశీర్వదించారు.

షిర్డీ-విశాఖ రైల్లో భారీ దోపిడీ

  ఇటీవలి కాలంలో రైళ్ళను దోచుకునే బందిపోటు దొంగలు ఎక్కువైపోయారు. ప్రతి వారమూ దేశంలో ఏదో ఒక మూల రైళ్ళ మీద దోపిడి దొంగలు దాడి చేసి దోచుకుంటూనే వున్నారు. అలాంటి దోపిడీ సాయినగర్ షిర్డీ - విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. షిర్డీ నుంచి వస్తున్న ట్రైయిన్‌ మహారాష్ట్రలోని పర్చూరు దగ్గరకు రాగానే దొంగలు చైన్ లాగి ట్రెయిన్ ఆపేశారు. ఎస్-1, ఎస్-2, ఎస్-3, ఎస్-5 బోగీల్లో వున్న ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించి దోచుకున్నారు. రైలు పూర్ణ స్టేషన్ దగ్గరకి వచ్చిన తర్వాత ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైలులో భద్రతా సిబ్బంది లేకపోవడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ మెట్రో... 250 కిలోమీటర్లు.. సూపర్

  హైదరాబాద్‌ మెట్రో రైలును 250 కిలోమీటర్ల మేరకు విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి వుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించడం హైదరాబాద్‌ ప్రజల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. హైదరాబాద్ ప్రజలతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఫీలవుతున్నారు. ప్రస్తుతం మెట్రో రైలు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే బాగా విస్తరించి వుంది. హెచ్ఎండీఏ పరిధికి కూడా విస్తరిస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్ మహానగరానికి రావడం మరింత సులభం అవుతుందని అనుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైలుకి కోఠీ దగ్గర భూగర్భ మార్గం వేయాలి, అసెంబ్లీ దగ్గర మార్గం మార్చాలి, భూగర్భంలోంచి వెళ్ళాలి అనే డిమాండ్లు పెట్టకుండా వుంటే సాధ్యమైనంత త్వరగా మెట్రో రైలు తెలంగాణ బిడ్డలకి అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.

కేసీఆర్ పాలన కంటే ఆంధ్రుల పాలనే బాగుందట!!

  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో పథకాన్ని ప్రకటిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నప్పటికీ కొంతమంది తెలంగాణ ప్రజలు, నాయకులు మాత్రం ఆయనను సరిగా అర్థం చేసుకోవడం లేదని అనిపిస్తోంది. కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రకటించారన్న ఆనందం కూడా వారిలో కనిపించడం లేదు. అదేంటోగానీ కేసీఆర్ సొంత జిల్లాలో కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బంగారు తెలంగాణను సాధించడం కోసం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన దగ్గర్నుంచి కేసీఆర్ చేసిన కృషి ఏమిటో, సాధించిన అభివృద్ధి ఏమిటో అందరికీ స్పష్టంగానే కనిపిస్తోంది. తాను ప్రకటించిన పథకాల ద్వారా తెలంగాణ ప్రజలలో ఉత్సాహాన్ని ఎంతో పెంచారాయ. అయితే కొంతమందిలో మాత్రం ఆ ఉత్సాహం కనిపించడం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలన కంటే ఆంధ్రుల పాలనే ఎంతో బాగుందని అంటున్నారు. అది కూడా ఎవరో కాదు.. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ డీసీసీబీ ఉపాధ్యక్షుడు మామిళ్ళ ఆంజనేయులు. ఆంధ్రుల పాలన ఉన్న సమయంలో ఏదైనా పని చేసేముందు లాభ నష్టాలను బేరీజు వేసుకుని చేసేవారని, కానీ కేసీఆర్‌లో మాత్రం అలాంటివేవీ కనిపించడం లేదని ఆయన అంటున్నారు. కేసీఆర్ మెదక్ జిల్లాకి చెందిన వ్యక్తి అయినప్పటికీ, మెదక్ జిల్లా నుంచి ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మెదక్ జిల్లాకే నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. పోచారం ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు ఎత్తు పెంచాలని కేసీఆర్ భావిస్తున్నారని, అదే జరిగితే మెదక్‌ జిల్లాకి ఎంతో నష్టం జరుగుతుందని ఆయన ఆరోపిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాలో ఆడుకుంటున్నారని ఆయన విమర్శించారు.

మన్మోహన్‌ని ఏకిపారేసిన నట్వర్ సింగ్

  మాజీ మంత్రి నట్వర్ సింగ్ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’ పేరిట రాసిన తన ఆత్మకథలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని ఏకిపారేశారు. మన్మోహన్ మీద నట్వర్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా వున్నాయి.   1. పదేళ్ళపాటు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్‌ దేశానికి చేసిందేమీ లేదు.   2. మన్మోహన్ సింగ్ ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా మరచిపోరు. అయితే తన మనసులో వున్న విషయాలు ముఖంలో కనిపించకుండా చాలా జాగ్రత్త పడతారు.   3. మన్మోహన్ సింగ్ హయాంలో భారత విదేశాంగ విధానం కూడా దెబ్బతిన్నది. మన్మోహన్ హయాంలో జపాన్‌తో మన దేశ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.   4. మన్మోహన్ హయాంలో అమెరికా విషయంలో ఇండియా మెతక వైఖరిని అవలంబించింది.

పీవీ అంటే సోనియాకి మంట!

  భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అంటే సోనియాగాంధీకి ఎంతమాత్రం పడేది కాదని కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్’లో పేర్కొన్నారు. ‘‘పీవీ నరసింహారావును సోనియాగాంధీయే ప్రధానమంత్రిని చేశారు. కానీ ఆయనంటే ఆమెకి అసలు గిట్టేది కాదు. పాపం పీవీయేమో ఆమె నన్ను ఎందుకు ఇలా శత్రువులాగా చూస్తోందని వాపోతూ వుండేవారు. నాక్కూడా మొదట్లో పీవీ అంటే పడేది కాదు. అందుకే నేను కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చేశాను. అయితే ఆ తర్వాత మా ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. పీవీతో సంబంధాలు మెరుగయ్యాక 1994లో ఒకసారి ఆయన ఇంటికి నన్ను రమ్మన్నారు. నేను వెళ్ళాను. అప్పుడు పీవీ చాలా ఆందోళనగా వున్నారు. ‘సోనియా నన్ను ఒక శత్రువులా చూస్తున్నారు. కారణం ఆమె సలహాదారులు కొంతమంది ఆమెకు నాగురించి లేనిపోనివి కల్పించి చెబుతున్నారు. అలాంటి వారిని నేను పట్టించుకోను. అయితే సోనియా నా పట్ల అనుసరిస్తున్న వైఖరితో నా ఆరోగ్యం దెబ్బతింటోంది. నేను ప్రధాని పదవిలో వుండటం సోనియాకి ఇష్టం లేకపోతే ఆమె ఆ విషయమేదో స్వయంగా చెబితే నేను హాయిగా నా పదవిని వదిలేస్తా కదా’’ అని పీవీ చెప్పారు అని నట్వర్ సింగ్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

పేట్రేగిపోయిన దొంగనోట్ల ముఠా: ఇద్దరి మృతి

  హైదరాబాద్‌ నగర శివార్లలో పోలీసులకు, దొంగనోట్ల ముఠాకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ మరణించగా, దొంగనోట్ల ముఠాకు చెందిన ఒక సభ్యులు చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ దగ్గర ఒక దొంగనోట్ల ముఠా వుందని తెలుసుకున్న పోలీసులు అక్కడకి వెళ్ళారు. అక్కడ ఓ వాహనంలో వున్న నలుగురు సభ్యుల ముఠా పోలీసులను చూడగానే కత్తులతో, తుపాకులతో దాడి చేసింది. ముఠా జరిపిన కాల్పుల్లో ఈశ్వరయ్య అనే కానిస్టేబుల్ మరణించాడు. అలాగే వెంకట్‌రెడ్డి అనే ఎస్‌ఐకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో ముఠాలోని గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. ముఠాలోని మిగతా ముగ్గురు తమ వాహనంలో పరారయ్యారు.

సంసార చదరంగం ఆడనున్న కోనేరు హంపి

  ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేజం కోనేరు హంపి సంసార చదరంగం ఆడబోతోంది. అదేనండీ... కోనేరు హంపి వివాహం జరగబోతోంది. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో ఈనెల 13వ తేదీన కోనేరు హంపి వివాహం ఎఫ్ట్రానిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ కుమారుడు అన్వేష్‌తో జరుగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోనేరు హంపి తండ్రి కోనేరు అశోక్ సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కోనేరు హంపి వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందించారు. హంపి వివాహానికి చంద్రబాబు తప్పకుండా రావాలని మరీ మరీ కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం కోనేరు అశోక్ రెండు లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు కావాల్సిందే...

  తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి చెందినన్యాయవాదులు విధులను బహిష్కరించి 'ఛలో హైకోర్టు' కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలోని చెందిన న్యాయవాదులు విధులను బహిష్కరించి ప్రత్యేక హైకోర్టు కావాలంటూ, మా రాష్ట్రం, మా కోర్టు అంటూ నినాదాలతో కోర్టు ఆవరణ దద్దరిల్లిల్లేలా చేశారు. పోలీసులు న్యాయవాదులను అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు న్యాయవాదులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తిరుమలరావు, మాణిక్‌ప్రభులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రెండు నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయకపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

పుణె కొండ చరియ ప్రమాదం.. మృతులు 70

  మహారాష్ట్రలోని పుణే జిల్లాలో మాలిన్ గ్రామంపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారానికి 70కి చేరింది. ఇప్పటి వరకూ 23 మందిని జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) బలగాలు రక్షించగలిగాయి. శిథిలాల కింద ఇంకా 130 మంది చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఆలయం ప్రాంగణంలో 25 మంది వరకూ స్కూలు విద్యార్థులు నిద్రిస్తున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయిగానీ, కొండచరియల కింద చిక్కుకుపోయి గానీ ఉండొచ్చని భావిస్తున్నారు. విద్యార్థుల కోసం నదీ తీరం వెంబడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వాతావరణం అనుకూలించడంతో సహాయక చర్యలను ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ముమ్మరం చేశారు.

వాయిదా పడిన ఆర్టీసీ సమ్మె

  తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. ఆర్టీసీ సొంతానికి వాడుకున్న 253 కోట్ల సీసీఎస్ నిధులను వెంటనే చెల్లించాలని కొంత కాలంగా కార్మికులు ఆందోళనలకు దిగారు. అయినా యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఇయు) ప్రకటించింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను సంప్రదించి సమ్మె విరమింపజేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిపించింది. ఈ నెల 20 నాటికి సీసీఎస్ నిధులను చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది.

మోడీ, జయలలిత మీద కార్టూను.. నిరసన జ్వాల.. శ్రీలంక సారీ...

  శ్రీలంక సైనిక వెబ్‌సైట్లో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచే విధంగా ఒక కార్టూన్, వ్యాసం పోస్టు చేశారు. జయలలిత నరేంద్రమోడీకి రాసే లేఖలన్నిటినీ ప్రేమ లేఖలుగా అభివర్ణిస్తూ ఈ వ్యాసం, కార్టూన్ వున్నాయి. శ్రీలంక ప్రభు త్వ భద్రతా శాఖ వెబ్‌సైట్ నిర్వహిస్తోంది. భద్రతా శాఖ కార్యదర్శిగా శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్సే సోదరుడు కోత్తప్పయే ఉన్నారు. ఈయన పర్యవేక్షణ కింద పని చేసే ఈ వెబ్‌సైట్లో ముఖ్యమంత్రి జయలలిత వైఖరికి వ్యతిరేకంగా ఒక వ్యాసం, కార్టూన్ పోస్ట్ చేశారు. దీనితో తమిళనాడులోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహింయారు. నుంగంబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో లయోలా కళాశాల సమీపంలో ఆందోళనకు దిగారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చివరికి శ్రీలంక ప్రభుత్వం జయలలితకి, నరేంద్రమోడీకి సారీ చెప్పింది..

హైదరాబాద్ మెట్రో... నో ప్రాబ్లం.. విస్తరణ... కేటీఆర్ హామీ..

  హైదరాబాద్‌లో మెట్రో రైలు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. మెట్రో రైలు వ్యవస్థపై వస్తున్న వార్తలన్నీ అపోహలని ఆయన తెలిపారు. మెట్రో రైలు పీజీ కోర్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెట్రో మార్గాన్ని 250 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందనిచెప్పారు. అసెంబ్లీ వద్ద భూగర్భ మెట్రో నిర్మాణంపై మెట్రో ఎండీ ఎంవీఎస్ రెడ్డి, మిగతా ఏజన్సీలు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించాలని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు అవాంతరాలు ఉంటే సీఎం కేసీఆర్‌తో, మెట్రో ఎండీతో మాట్లాడతామని అన్నారు. ప్రభుత్వ పరంగా మెట్రో రైలుకు కట్టుబడి ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

సారీ నట్వర్‌సింగ్ తాతయ్యా: ప్రియాంక

  కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించింది. ఈ పుస్తకం పుణ్యమా అని సోనియా, రాహుల్, ప్రియాంకకి సంబంధించిన అనేక విషయాలు బయటపడ్డాయి. పాపం నట్వర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి పళ్ళూడిపోయే వయసు వచ్చే వరకూ సేవ చేశారు. అయినా ఆయన్ని ఓ కుంభకోణానికి బాధ్యుణ్ణి చేసి బలిపశువుని చేశారు. పాపం నట్వర్ సింగ్ పరిస్థితి ఓడ మల్లయ్య... బోడి మల్లయ్యలా తయారైంది. అయితే ఈమధ్యకాలంలో నట్వర్ సింగ్ తన ఆత్మకథ రాస్తున్నారని, అందులో వివాదాస్పద అంశాలు వుంటాయని అనుమానం వచ్చిన సోనియా ఫ్యామిలీ నట్వర్ సింగ్‌ని కాకా పట్టడానికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తల్లిని, తమ్ముడిని భుజాన వేసుకుని తిరిగే ప్రియాంక నట్వర్ సింగ్‌కి గతంలో జరిగిపోయినవన్నీ మర్చిపో తాతయ్యా.. అవన్నీ బయటపెట్టకు తాతయ్యా ప్లీజ్ అని సొంత మనవరాలిలాగా గోముతనం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నో ఢక్కాముక్కీలు తిన్న నట్వర్ సింగ్ ప్రియాంక అభిమానానికి మురిసిపోకుండా తన ఆత్మకథలో అనేక వివాదాస్పద అంశాలు చేర్చి కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని కడిగిపారేసే పనిలో వున్నారు.

ఏపీలో బదిలీలపై నిషేధం ఎత్తివేత

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బదిలీలపై ఉన్న నిషేధాన్ని నెల రోజులపాటు ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలరోజుల్లో మండల స్థాయి పదవులలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని స్థాయుల్లో ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా వున్నాయి.   1. ఐదేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ని కరువు లేని రాష్ట్రంగా మార్చాలని నిర్ణయం.   2. ఐటీ కంపెనీలు నెలకొల్పే ఎస్సీ, ఎస్టీ మహిళలకు రాయితీ. ఒక్కో ఉద్యోగికి 60 వేల రూపాయల చొప్పున రాయితీ. ఐటీ కంపెనీల విద్యుత్ ఛార్జీల్లో 25 శాతం రాయితీ.   3. భూగర్భ జలాలు పెంచడానికి నీరు-చెట్టు కార్యక్రమం.   4. ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో అన్న ఎన్టీఆర్ క్యాంటిన్లు. తక్కువ ధరకే ఆహారాన్ని అందించే ఎన్టీఆర్ క్యాంటిన్లు.   5. మాఫియాకి అడ్డుకట్ట వేయడానికే మహిళలకు 25 శాతం ఇసుక రీచ్‌లు.   6. పాఠశాలల్లో హాజరు శాతం పెంచడానికి బయో మెట్రిక్ విధానం అమలు.   7. విశాఖ, వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి)లో మెట్రో రైలు ఏర్పాటు.

ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌తో అవసరమే లేదు: చంద్రబాబు

  తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మిర్జా ఎంపిక కావడం, అది పెద్ద ఇష్యూ కావడం గురించి తెలిసిందే. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనే అంశం ఇష్యూ అయింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరనే పాయింట్ వెలుగులోకి వచ్చింది. కొంతమంది అత్యుత్సాహంతో మహేష్‌బాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ అనే విషయాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ అంశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ స్టాప్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అవసరమే లేదని స్పష్టం చేశారు. బ్రాండ్ అంబాసిడర్లు లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వస్తుందన్న ఆత్మవిశ్వాసాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు.