ఆండ్రాయిడ్ ఫోన్ కోసం ఆత్మహత్య

  ఆండ్రాయిడ్ ఫోన్ తండ్రి కొని ఇవ్వలేదన్న బాధతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం‌లో జరిగింది. స్థానిక దుర్గానగరంలో నివసించే వంశీ అనంతపురంలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే వంశీ దానిని ఇటీవల పోగొట్టుకున్నాడు. తనకు మరో ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇవ్వాలని వంశీ గత కొన్నిరోజులుగా తండ్రిని అడుగుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేని తండ్రి కొంతకాలం తర్వాత కొంటానని చెప్పాడు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ ముందు పరువు పోతుందంటూ వంశీ చెబుతూ వుండేవాడు. రెండు రోజుల క్రితం కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కొడుకు కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు వెతకగా వంశీ శరీరం రైల్వే ట్రాక్ పక్కన ముక్కలైపోయి కనిపించింది.

గన్ పట్టుకుని ఫొటో దిగబోయాడు.. పాపం...

  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నగరంలో సుకుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి వున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నాలుగు చేతులా సంపాదించాడు. ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో రియల్ బూమ్ పుంజుకోవడంతో సుకుమార్ చాలా బిజీగా వున్నాడు. తాను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి కావడం వల్ల తనకు శత్రువులు పెరిగే అవకాశం వుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా సుకుమార్ ఒక లైసెన్స్డ్ గన్ కొన్నాడు. అంతవరకూ బాగానే వుంది. తన దగ్గరున్న గన్‌తో కలసి ఫొటో దిగాలన్న ఆలోచన అతనికి వచ్చింది. ఆ గన్ చేతిలో పట్టుకుని పోజులిస్తూ ఫొటోలు దిగుతూ వుండగా పొరపాటుగా గన్ పేలి బుల్లెట్ అతని బాడీలో దిగింది. బంధువులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్ళడంతో ప్రాణాపాయం తప్పింది.

ఏటీఎం కార్డుతో జేబుకు చిల్లు!

  ఆమధ్యకాలంలో అయితే ఏటీఎం కార్డుల్ని జనం చాలా విరివిగా ఉపయోగించేవారు. ఏ బ్యాంకు నుంచి ఏటీఎం కార్డు తీసుకున్నా ఏ ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి ఎలాంటి రుసుము లేకుండా డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం వుండేది. అప్పుడు జనం బ్యాంకు నుంచి వంద వంద చొప్పున విత్ డ్రా చేసుకుని పొదుపుగా ఖర్చు పెట్టుకునేవారు. ఈమధ్యకాలంలో ఆ పరిస్థితి మారింది. అకౌంట్ వున్న బ్యాంకులో తప్ప ఇతర బ్యాంక్ ఏటీఎం‌లలో నెలకు ఐదుసార్లకు మించి డబ్బు విత్ డ్రా చేస్తే అదనపు రుసుము పడుతుందని రిజర్వ్ బ్యాంకు రూల్ పెట్టింది. దాంతో ఏటీఎం కార్డులు వాడేవాళ్ళకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏటీఎం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎం‌లలో నెలకు రెండుసార్లకు మించి డబ్బు విత్ డ్రా చేస్తే సేవా రుసుము చెల్లించాల్సి వస్తుంది. త్వరలో ఈ నిబంధన అమలులోకి రానుంది. అయితే ఈ నిబంధన నుంచి పల్లెటూర్లకు మినహాయింపు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తోంది.

చంద్రబాబు, కేసీఆర్ షేక్‌హ్యాండ్!!

  ఇప్పటి వరకు మనకి ఏడు ప్రపంచ వింతలు మాత్రమే తెలుసు... ఇప్పుడు ఎనిమిదో వింత జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరికొకరు షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. గత కొన్నేళ్ళుగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు, కేసీఆర్ ఉప్పు-నిప్పు మాదిరిగా వున్నారు. ఇటీవలి కాలంలో అయితే పరిస్థితి మరింత ముదిరింది. ఈ పరిస్థితి ఎంతగా ముదిరిందంటే, ఒకరు ఉన్న చోటికి మరొకరు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో వీరిద్దరూ ఒక ప్రదేశంలో కలిశారు. చిరునవ్వులు చిందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ ఎనిమిదో వింతకు బేగంపేట విమానాశ్రయం వేదిక అయింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా రెండు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తోపాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి బేగంపేట విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ వీరిద్దరూ ఒకరికొకరు ఎదురు పడటంతో ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ ఇద్దరు నాయకులూ ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఆ హోదాలో ఒకరినొకరు కలుసుకోవడం ఇదే ప్రథమం. షేక్‌హ్యాండ్ అయిన తర్వాత రాష్ట్రపతి విమానం వచ్చేలోపు నరసింహన్, చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య సరదా సంభాషణ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఇది కలయా.. నిజమా.. నో డౌట్ ఇది కల కాదు.. నిజం!!

సోనియా ఆత్మకథ ప్రియాంక రాస్తుందట!

  మాజీ మంత్రి నట్వర్ సింగ్ తన ఆత్మకథలో సోనియా గాంధీ కుటుంబం మీద బోలెడన్ని సంచలన విషయాలు వెల్లడించడంతో హర్టయిపోయిన సోనియాగాంధీ తాను కూడా ఆత్మకథ రాస్తానని.. అందులో అనేక నిజాలను బయటపెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సోనియా ఏదో ఆవేశంలో అనేసిందిగానీ, సోనియా ఆత్మకథ రాసేది సోనియా గాంధీ కాదట.. సోనియాగాంధీ చెబుతూ వుంటే ఆమె కుమార్తె ప్రియాంక రాస్తుందట. ఇది ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన విషయం. సోనియాగాంధీ ఆత్మకథ ఎవరో బయటివాళ్ళు కాకుండా ప్రియాంక రాస్తేనే మంచిది. ఎందుకంటే ఆత్మకథ చెప్పే ఆవేశంలో సోనియా గాంధీ కొన్ని నిజాలను బయటపెట్టేస్తే బయటవారైతే డేంజర్. అదే ప్రియాంక అయితే అమ్మ చెప్పే నిజాలకు పాలిష్ చేసి తమ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా కవర్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికి అనేక సందర్భాలలో ప్రియాంక తన తల్లిని, తమ్ముడిని కవర్ చేసుకుంటూ వచ్చింది కదా! ఇదిలా వుంటే, సోనియా గాంధీ తన ఆత్మకథ రాస్తానన్న వ్యాఖ్యలపై నట్వర్ సింగ్ స్పందించారు. సోనియా నిర్ణయం సంతోషకరమన్నారు. ఆ ఆత్మకథ కోసం తాను ఎదురు చూస్తుంటానన్నారు.

కొడుకు కాదు.. యముడు!

  తన కొడుకు తనకు పున్నామ నరకాన్ని తప్పిస్తాడని ఆ తండ్రి భావించాడు.. అయితే ఆ కొడుకు యముడిలా మారి తండ్రి ప్రాణాలు తీసేశాడు. చిత్తూరు జిల్లా మేళ్ళచెర్వులో నివసించే కేశవరెడ్డి, విశ్వనాథరెడ్డి అనే తండ్రీ కొడుకుల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. శనివారం నాడు ఈ విషయం మీద వీళ్ళిద్దరూ బాగా పోట్లాడుకున్నారు. విశ్వనాథ్‌రెడ్డికి ఆవేశం పెరిగిపోయి తన తండ్రి మీద దాడి చేయడంతో కేశవరెడ్డి తీవ్రంగా గాయపడి మరణించాడు. ఈ సంఘటనను చూసిన పక్కింట్లో వుండే కృష్ణయ్య విశ్వనాథరెడ్డిని నిలదీయడంతో పట్టలేని కోపంతో విశ్వనాథరెడ్డి కృష్ణయ్యని కూడా చంపేశాడు. దాంతో గ్రామస్థులు విశ్వనాథరెడ్డిని కట్టేసి కొట్టారు. దాంతో అతను చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. క్షణికావేశం రెండు ప్రాణాలను బలితీసుకుంది.

పొన్నాలా.. చేసింది చాలు ఇక దయచెయ్!

  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మీద మాటల దాడిని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆపేట్టు లేరు. కోమటిరెడ్డి ఇప్పటికే ఎన్నోసార్లు పొన్నాల మీద మాటల దాడి చేశారు. పొన్నాల కిక్కురుమనకుండా వుంటున్నప్పటికీ కోమటిరెడ్డి ఆయన మీద మాటల దాడిని ఆపడం లేదు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాలకు కాంగ్రెస్ పార్టీని సమీక్షించే, పార్టీని నడిపించే అర్హత లేదని కోమటిరెడ్డి అంటున్నారు. ఎన్నికలలో ఓడిపోయిన వ్యక్తి పార్టీని ఎలా పడిపిస్తారని కోమటిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. పొన్నాల చేస్తున్న పీసీసీ సమీక్షా సమావేశాలతో ఒరిగేదేమీ లేదని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో పొన్నాల ఊడబొడిచేది కూడా ఏమీ లేదని ఆయన అంటున్నారు. అందువల్ల పొన్నాల అర్జెంటుగా తన పదవికి రాజీనామా చేసి కొత్తారికి అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తమ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్ళనున్ననని ఆయన తెలిపారు.

18 వందల కిలోల బంగారం.. శ్రీవారి ఖాతాలో....

  యావత్ దేశంలోనే భారీ బంగారం డిపాజిట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్‌లో జరిగింది. ఆ బంగారం అంతా ఇంతా కాదు.. ఏకంగా 1800 కిలోల బంగారం. ఇంత బంగారం డిపాజిట్ అయింది వేరెవరి ఖాతాలోనో కాదు.. సాక్షాత్తూ లక్ష్మీపతి అయిన ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి ఖాతాలో. సిరిగలవానికి చెల్లున్ అని ఓ భక్త మహాశయుడు ఊరకే అన్నాడా..! శ్రీవారికి భక్తులు కానుకలుగా ఇచ్చిన బంగారాన్ని సేకరించి మొత్తం 18 వందల కిలోల బంగారాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేశారు. ఈ బంగారం డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీని బ్యాంక్ బంగారం రూపంలోనే చెల్లిస్తుంది. ఆ బంగారాన్ని కూడా తిరిగి బ్యాంకులోనే జమ చేస్తారు. ఈ బంగారం డిపాజిట్‌కి సంబంధించిన పత్రాలను టీటీడీ ఇ.ఓ. గోపాల్ స్టే్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్యకు అందించారు.

చైనా ఫ్యాక్టరీలో పేలుడు: 65 మంది మృతి

  చైనాలోని పరిశ్రమల్లో ప్రమాదాలు జరగడం మామూలైపోయింది. చైనాలోని పరిశ్రమలు విపరీతంగా విస్తరించడం వల్ల ప్రతిరోజూ ఏదో ఒక మూల పరిశ్రమలో ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. తూర్పు చైనాలోని ఒక లోహాల పరిశ్రమలో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో 65 మంది మరణించారు. 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. షాంగాయ్ నగర సమీపంలోని కున్‌షాన్ నగరంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఒక అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ కోసం కారు విడిభాగాలను తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది. ఈ ఫ్యాక్టరీలో మొత్తం 450 మంది మరణించారు. ప్రమాదం జరిగిన తీరు మొత్తం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు తెలుస్తోంది.

సీఎంలతో కేంద్ర మంత్రి వెంకయ్య భేటీ!

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు శనివారం నాడు భేటీ అయ్యారు. ‘రాష్ట్రాల వద్దకే కేంద్రం’ పథకంలో భాగంగా ఆయన ముఖ్యమంత్రులను కలిశారు. కేసీఆర్‌తో జరిగిన భేటీలో కేసీఆర్‌తోపాటు మంత్రి హరీష్‌రావు, రాజ్యసభ సభ్యుడు కేశవరావు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ సందర్భంగా తెలంగణలోని ప్రాజెక్టులు, నిధుల మీద కేంద్రమంత్రి వెంకయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి నివేదిక కోరినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌తో భేటీ అనంతరం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన అంశాలివి....   1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. అందులో భాగమే ఈ భేటీ.   2. రాజకీయ అనిశ్చితి వల్ల ఇంతకాలం సంయుక్తం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పుడు విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలూ వేగంగా అభివృద్ధి చెందాలి.   3. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అమలవుతున్న కేంద్ర పథకాల ప్రగతిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇప్పటికే నోట్ అందించాం.   4. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రెండు రాష్ట్రాలు కలసి పనిచేయాలి.

కేసీఆర్ తాజా వరాల జల్లు!!

  నిజంగా తెలంగాణకు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి తెలంగాణ ప్రజల్ని వరాల జల్లుతో తడిపేస్తున్నారు. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ చేసిన వరాల తాలూకు ఆనందంలో తెలంగాణ ప్రజలు వుండగానే, తాజాగా శుక్రవారం నాడు ఆయన మరికొన్ని వరాలు ప్రకటించారు. ఈసారి ప్రత్యేకంగా ఉద్యోగులు ఈ వరాల జల్లులో తడిశారు. ఆ వరాల వివరాలు...   1. తహసీల్దార్, ఎంపీడీవోలు, ఇతర అధికారులకు వాహన సౌకర్యం   2. ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు వడ్డీలేని రుణం మంజూరు. నెలవారీ అలవెన్సు.   3. తహసీల్దార్లు సొంత జిల్లాల్లో ఉద్యోగం చేయరాదన్న నిబంధన రద్దు.

కానిస్టేబుల్ ఈశ్వరయ్యకి నాయిని నివాళి

  హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో నకిలీనోట్లు చెలామణీ చేసే ముఠా జరిపిన కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర హోమంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కానిస్టేబుల్ ఈశ్వరయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఆయన తెలిపారు. కాల్పుల్లో మరణించిన కానిస్టేబుల్ శంకరయ్య భౌతిక కాయాన్ని హోంమంత్రి సందర్శించి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐ వెంకటరెడ్డిని కూడా నాయిని పరామర్శించారు.

19న తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే

  ఆగస్టు 19వ తేదీన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని తలపెట్టింది. దాదాపు నాలుగు లక్షలమంది వలంటీర్లు 19వ తేదీన ఈ సర్వే నిర్వహిస్తారు. తెలంగాణలోని ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేరు దగ్గర్నుంచి ఆస్తిపాస్తుల వరకు మొత్తం వివరాలను నమోదు చేస్తారు. 19వ తేదీన ఒక్కరోజునే సర్వే మొత్తం పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆరోజున ప్రజలు ఇళ్ళలోనే వుండాలని, ఈ సర్వేలో నమోదు చేయించుకున్న వివరాల ప్రకారమే సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎవరో ప్రభుత్వం తెలుసుకోబోతోంది. 19న తమ కుటుంబానికి చెందిన అన్ని వివరాలను నమోదు చేసుకోకుంటే.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకునే అవకాశం ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రజలంతా ఈ సర్వేను అత్యంత ప్రాధాన్యమైన విషయంగా పరిగణించాలని కోరారు. ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా సర్వే విధుల్లో పాల్గొంటామని ఉద్యోగులు ప్రకటించడంపై ఆయన హర్షం ప్రకటించారు. ఆరోజు ఉద్యోగులందరికీ ఆన్ డ్యూటీ హాలిడే అని, సర్వేకి వచ్చిన ఉద్యోగులకు ప్రజలే భోజన సదుపాయం ఏర్పాటు చేయాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.