హా హా.. జగన్ భలే బుక్కయ్యాడుగా..

పాపం జగన్ మోహన్ రెడ్డి.. ఏం చేద్దామనుకున్నా పాపం కాలం కలిసిరావట్లేదు. కనీసం చంద్రబాబుపై విమర్శలు గుప్పించి ప్రజల్లో బుక్ చేద్దామన్నా కూడా టైం సహకరించట్లేదు. అటుపోయి ఇటుపోయి చివరకి జగనే బుక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడ మరోసారి బుక్కయ్యాడు. ప్రజా సంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక పాదయాత్రలో ఎలాగూ టార్గెట్ చంద్రబాబే కాబట్టి.. రోజూలాగే ఆయనపై విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశాడు. ప్రియతమ నేత, మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్ లను ప్రవేశపెడితే చంద్రబాబు దానిని పూర్తిగా నీరుగార్చారని.... ఎక్కడా కూడా ఎవరు ఎలాంటి ప్రమాదంలో 108 కి ఫోన్ చేసినా సరిగా స్పందించే దిక్కు లేదని చాలా ఆవేశంగా మాట్లాడుతుండగా...అటువైపుగా 108 వాహనం సైరన్ తో వెళుతుంది. అంతే ఒక్కసారిగా అది చూసిన జగన్ షాకై ప్రసంగం ఆపేశాడు. ఆ సభకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో క్షణాల్లో అక్కడికి చేరుకున్న అంబులెన్స్  వారిని తీసుకొని ఆస్పత్రికి బయల్దేరింది. ఇక రోడ్డుపై జగన్ సభ జరుగుతుండటంతో.. అంబులెన్స్ ను వేరే మార్గంలో దారి మళ్లించారు. ఇక ఈ చోద్యం అంతా  అక్కడ ఉన్న జనం చూస్తూనే ఉన్నారు. జగన్ కూడా జరిగిందంతా చూసి ఆఖరికి ఏం మాట్లాడాలో తెలియక.. మళ్లీ 108 మాట ఎత్తకుండా వెంటనే టాపిక్ మార్చేశాడు. మొత్తానికి జగన్ చంద్రబాబు ఇరికించాలను కుంటే.. దరిద్రం ఏంటో.. జగనే అందరి ముందు ఇరుక్కునే పరిస్థితులు వస్తాయి. తన గాలి తానే తీసుకుంటాడు..

అందుకే కేసీఆర్ ఎదురుతిరిగాడా..?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి జాతీయ రాజకీయాలపై మాట్లాడటం... కాంగ్రెస్ ప్రభుత్వం.. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడటం.... దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూపడం.. వంటి విషయాలపై మాట్లాడటం.. ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. దేశంలో థర్డ్ ఫ్రంట్ అవసరం ఉందని... దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని.. మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ సంచలన వ్యాఖ్యలే చేశారు. అయితే ఉన్నట్టుండి కేసీఆర్ ఇలా మాట్లాడటానికి కారణం ఏంటబ్బా అంటే ఇప్పుడు ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. ఇంతకీ కేసీఆర్ అలా మాట్లాడటానికి కారణం ఏంటనుకుంటున్నారా...? హర్ట్ అవ్వడమే అంట. కేసీఆర్ హర్ట్ అయినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.   ఇంతకీ కేసీఆర్ ఏ విషయంలో హర్ట్ అయ్యాడనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే.. మొన్నఆమధ్య కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు ముస్లిం రేజర్వేషన్ల బిల్లు గురించి ప్రధానితో మాట్లాడటానికి మోడీ అప్పాయింట్మెంట్ కోరారట. కానీ ప్రధాని కనీసం టైం కూడా ఇవ్వకపోవడం కేసీఆర్ అవమానంగా భావించారట. ఆ కోపంతోనే... ఈ మధ్య జరిగిన ఓ మీటింగ్ లో రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ... కేంద్రంపై, మోడీపై విమర్శలు గుప్పించారు. ఇక అదే ఫ్లోలో మోడీ గాడు అని కూడా నోరుజారారు. అంతే బీజేపీ నేతలు కేసీఆర్ పై  ఓ రేంజ్ లో మండిపడ్డారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇలా మాట్లాడటం సరికాదని.. అంతేకాదు కొంతమంది అయితే ఏకంగా జైలులో పెట్టాలి అన్న వ్యాఖ్యలు చేశారు. ఇదిగో ఇవే మాటలకు కేసీఆర్ ఈగో హర్ట్ అయిందట. దీనితోడు హైదరాబాద్ లో ఒక ప్రారంభానికి హాజరు కావాల్సిన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ కేటీఆర్ ను ఇరుకునపెట్టడం, ప్రారంభానికి రాను అని బెదిరించడం కూడా కేసీఆర్ ను ఈగోను హర్ట్ చేసిందట. అందుకే కేంద్రంపై యుద్దానికి దిగారు కేసీఆర్. ఏకంగా ప్రధాని పదవికే పోటు పెట్టడానికి రెడీ అయ్యారు. అందుకే థర్డ్ ఫ్రంట్ ను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు కేసీఆర్ కు ఇప్పటికే చాలామంది మద్దతు కూడా లభించింది. ఇంకా మద్దత్తు కూడగట్టే పనిలో ఉన్నారట. దీనిలో భాగంగానే లోక్‌సభలో టీడీపీ ఎంపీలకు టీఆర్‌ఎస్ ఎంపీలు మద్దతుగా నిలిచారు. విభజన హామీలను అమలు చేయాలని టీడీపీ ఎంపీలు గళమెత్తుతుంటే.. టీఆర్ఎస్ ఎంపీలు గొంతు కలిపారు. విభజన హామీలను అమలు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. మొత్తానికి కేసీఆర్ బాగానే హర్ట్ అయినట్టు ఉన్నారు. అందుకే ఏకంగా జాతీయ రాజకీయాలనే టార్గెట్ చేశారు. మరి కేసీఆర్ కేంద్రానికి ఎదురుతిరిగారు.. విజయం సాధిస్తారా..? లేదా..? అన్నది చూడాలి.

కేసీఆర్ దెబ్బకు భయపడిన మోడీ...!

  తెలంగాణ సీఎం కేసీఆర్ గత రెండు రోజుల నుండి చేస్తున్న వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు సడెన్ గా ఏమైందో తెలియదు కానీ జాతీయ రాజకీయాలపై కన్నేశారు. రైతు సమస్యలపై మాట్లాడిన ఆయన... .దేశంలో రైతులు అల్లాడిపోతుంటే మోడీ ఎం చేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. అక్కడితో ఆగకుండా... దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని..దేశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలిస్తున్నాయి.... ఈరెండు పార్టీల వల్ల దేశానికి ఒరిగింది ఏం లేదు.. రెండు పార్టీలూ దొందు దొందే... అందుకే థర్డ్ ఫ్రంట్ అవసరం ఏంతైనా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశానికి త‌న సేవ‌లు అవ‌స‌రం ఉందంటే క‌చ్చితంగా సిద్ధంగా ఉన్నాన‌ని... మార్పున‌కు నాయ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌నీ అన్నారు.   ఇక కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు అందరూ షాకవ్వడమే కాదు... కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజముంది కదా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇక మోడీ నాలుగేళ్ల నియంతృత్వ పాలనతో విసిగిపోయి..మోడీకి వ్యతిరేకంగా ఉన్న కొంత మంది నేతలు ఇప్పటికే కేసీఆర్ కు ఫోన్ చేశారట. ఈ విషయం కూడా స్వయంగా కేసీఆరే చెప్పారు. మరి ఇవన్నీ చూసి మోడీకి భయమేసిందో ఏమో.. కేసీఆర్ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచాలని ఎప్పటికప్పుడు సమాచారం నాకు తెలియాలి అంటూ ఆజ్ఞలు జారీ చేశారట. మొత్తానికి ఇన్ని రోజులు ఎవరికీ భయపడని మోడీ.. కేసీఆర్ తెగింపు చూసి ఉలిక్కిపడినట్టున్నారు. మరి కేసీఅర్ దూకుడు ఈ రెండు రోజులోనే.. లేకపోతే ముందు ముందు కూడా ఇలానే దూకుడుగా వ్యవహరించి.. దేశ రాజకీయాల్లో మార్పుకు బీజం వేస్తారా..లేదా..? చూడాలి.

ప్రధానిని ఏం అనకూడదా..? రాజ్యాంగంలో రాసుందా..?

  తెలంగాణ రాజకీయాల్లో కొత్త కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో కేసీఆర్ ది అందె వేసిన చెయ్యి. తన మాటలతోనే అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసే మాటల మాంత్రికుడు ఆయన. ప్రతిపక్ష పార్టీనేతలపై తమ కామెడీ సెటైర్లతో చురకలు అంటిస్తూనే నవ్వులు పుట్టించేస్తాడు. అలానే ఇటీవల ప్రధాని మోడీపై కూడా సంచనల వ్యాఖ్యలు చేసి బుక్కయ్యారు. కావాలనే అన్నారా..? లేక ఫ్లోలో అన్నారా...? తెలీదు కానీ... మోడీ గాడు అన్న పెద్ద పదం మాత్రం వాడేశారు. ఇక ఇదే అదనుగా బీజేపీ కేసీఆర్ పై తీవ్రంగా విరుచుపడ్డారు. అధికార అహంకారంతోనే కేసీఆర్ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలా సంబోధించారని.. కేసీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు.. జైలు పంపిస్తాం అని ఆవేశంతో ఊగిపోయారు.   మరి మాములుగానే కేసీఆర్ తమ డైలాగ్స్ తో కోపం తెప్పిస్తాడు. అలాంటిది తనను ఇన్ని మాటలు అంటుంటే కేసీఆర్ ఊరుకుంటాడా.. బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చాడు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. మోడీ గారికే అని అన్నా.. మోడీ గాడు అని అనలేదు..నేను మోడీగాడు అన్నానని దుష్ర్పచారం చేస్తున్నారు.. నేను మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటా.. నేను ప్రధానిని అగౌరవంగా మాట్లాడాననడం సరికాదు అని స్పష్టం చేశారు. నేను అలా అన్నానని.. బీజేపీ వాళ్లు ఊహించుకుంటే అది వాళ్ల ఖర్మ... అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. జైలు వెళతారా అని మాట్లాడుతున్నారు... ప్రధానికి ఎదురు మాట్లాడితే జైల్లో పెడతారా..?ప్రధానిని విమర్శించవద్దని రాజ్యాంగంలో ఏమన్నా రాసుందా అని ప్రశ్నించారు. అక్కడితో ఆగకుండా కొందరిని టచ్ చేస్తే భస్మం అయిపోతారు అని కూడా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి కేసీఆర్ తాను అనలేదు అని అంటూనే.. అంటే తప్పేంటి అని కూడా అంటున్నారంటే..మరి కావాలనే అన్నారా..? ఫ్లోలో అన్నారా..? అది కేసీఆర్ కే తెలియాలి..

పీకే చీప్ ట్రిక్స్ బయటపెట్టిన లగడపాటి...

  లగడపాటి రాజగోపాల్ సర్వేల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగడపాటి సర్వే చేస్తే అది దాదాపు నిజమే అన్న పేరు పడిపోయింది. అంతలా పేరు తెచ్చుకున్నాడు. అయితే అన్ని సర్వేలు నిజం కావులెండీ.. ఒకటో రెండో బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా లగడపాటి మరో విషయాన్ని గుట్టురట్టు చేశారు. ఇంతకీ ఏంటా గుట్టు అనుకుంటున్నారా..? ఏంటంటే..తాను సర్వే చేసినట్టు.. సర్వేకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. ఇంతకీ ఆ సర్వేలో ఏముందో తెలుసా... వచ్చే ఎన్నికల్లో, వైసిపీకి 105 సీట్లు వస్తాయని...  తెలుగుదేశం పార్టీకి 55 సీట్లు, జనసేనకు 15 సీట్లు వస్తాయి అంటూ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది. ఇక ఈ సర్వేపై లగడపాటి స్పందిస్తూ.. తాను ఇప్పటి వరకు ఏ సర్వే చెయ్యలేదు అని చెప్పారు. ఎలక్షన్స్ ఆరు నెలలు ముందు నుంచి సర్వేలు మొదలు పెడతానని, మీకు చెప్పే ఆ పని చేస్తాను అని, రిజల్ట్స్ కూడా నేనే చెప్తానని, మీడియాకు చెప్పి, ప్రస్తుతం తన పేరు మీద జరుగుతున్న సర్వే ప్రచారం తప్పు అని చెప్పారు... అలాగే, నా పేరుతో వచ్చే ఏ సర్వే ప్రచారం నమ్మవద్దు అని, ఏదన్నా సర్వే ఉంటె నేనే స్వయంగా చెప్తానని లగడపాటి చెప్పారు.   ఇంతకీ ఈ ఫేక్ సర్వే సృష్టికర్త ఎవరనుకుంటున్నారా..? ఇంకెవరూ వైసీపీ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్. లగడపాటి సర్వే చేశారు అని ఈ ఫేక్ సర్వే తెరపైకి తెచ్చారు. అక్కడితో ఆగకుండా... దాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. ఇక ఒకసారి విషయం సోషల్ మీడియాకు ఎక్కిందంటే చాలు.. అది అందరికీ చేరినట్టే.. అలా ఈసర్వే లగడపాటి వరకు చేరింది. దీంతో లగడపాటి అసలు నిజం బయటపెట్టారు. మొత్తానికి పీకే గారి చీప్ ట్రిక్స్ మరోసారి బయటపడ్డాయి..

మీ పప్పులు నా దగ్గర ఉడకవు..

  మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఏపీకి బిస్కట్ ఇవ్వాలని చూస్తుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే...ఏపీకి ఇక ఇచ్చేది ఏం లేదు... ఈ విషయంపై చర్చించడం కూడా ఇక అనవసరం అని ఇప్పటికే వెంకయ్యనాయుడి దగ్గర అన్నట్టు వార్తలు వచ్చాయి. అలాంటిది ఇప్పుడు మళ్లీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చర్చల నిమిత్తం ఢిల్లీ నుండి పిలుపు వచ్చినట్టు సమాచారం. విభజన హామీలపై చర్చించేందుకు ఈనెల 5న ఢిల్లీ రావాలని కోరారట. అయితే ఒక్కసారి మోసపోతారు.. అలా అని పదే పదే మోసం చేయలేరు కదా.. అందులో అపర చాణుక్యుడు చంద్రబాబుని. అందుకే చంద్రబాబు తెలివిగా... నేను రాను.. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులను చర్చలకు పంపిస్తా అని చెప్పారట. అంతేకాదు... హోదా విషయంలో  పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని... పార్లమెంట్ లో తప్పనిసరిగా పట్టుబడతామని... ఎవరు ఎన్ని ఫోన్లు చేసినా తమకు రావాల్సిన హక్కులు వచ్చే వరకు పోరాటం ఆపమని తేల్చి చెప్పారట.   మరి ఏపీకి ఇచ్చేది ఏం లేదని చెప్పిన అమిత్ షా మళ్లీ ఎందుకు ఫోన్ చేసినట్టో.. దానికి కారణం లేకపోలేదు... కేంద్ర తీరుపై విసుగెత్తిపోయిన చంద్రబాబు బీజేపీపై జాతీయ స్థాయి పోరాటానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా.. దేశంలోని అన్నిజాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలు రాయాలని... అందులో విభజన చట్టం హామీలు, కేంద్రం నుండి వచ్చిన నిధులు, హోదా ప్యాకేజీ మతలబును గురించి పూర్తిగా వివరించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకే పొగరుతో ఎగిరిపడిన అమితిషా ఈ నిర్ణయాల గురించి తెలుసుకొని ఫోన్ చేశారు పాపం. తమకు ఇష్టమొచ్చినప్పుడు బుజ్జగించడం.. లేకపోతే పోతే పోండి అని అనేయడం.. బీజేపీకి బాగా అలవాటైపోయింది. అంతేకాదు.. పదే పదే చర్చల పేరుతో పిలిచి... విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం... ఎటూ తేల్చకపోవడం గత కొద్ది రోజులుగా అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకే చంద్రబాబు కూడా వారి వేసే బిస్కట్లకు పడకుండా..చాలా తెలివిగా వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి వారికే అన్ని తెలివితేటలు ఉంటే.. రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబుకు ఎన్ని తెలివితేటలు ఉండాలి...

తేల్చిచెప్పేశారు.. ఏపీకి ఇచ్చేది ఏం లేదు...!

  ఎట్టకేలకు బీజేపీ పెద్దలు ఏపీకి విషయంలో ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇన్ని రోజులు ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏం లేదు... ఏపీకి నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది.. కేంద్ర బడ్జెట్ విషయంలో కూడా బీజేపీ ఏపీకి మొండిచేయి చూపించింది అని ఇప్పటికే ఏపీ ప్రజలు తీవ్ర ఆందోళలు చేస్తున్నారు. ఈ కారణంగానే టీడీపీ-బీజేపీ పొత్తుకు కూడా బీటలు వారాయి. ఇక రేపో మాపో రెండు పార్టీలు విడిపోవడమే తరువాయి. అయితే ఆ టైం ఇప్పుడు దగ్గర పడినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నిరోజులు ఏపీ విభజన హామీల గురించి, నిధుల కేటాయింపు గురించి మరోసారి ఆలోచిస్తామని చెప్పుకొచ్చిన బీజేపీ పెద్దలు ఇప్పుడు ఏకంగా ఏపీకి ఇక ఇచ్చేది ఏం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు 'అమిత్‌షా'తో నిర్వహించిన సమావేశంలో ఆయన ఇదే విషయాన్ని తేల్చి చెప్పారట. ఏపీలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతీసుకుని అమిత్‌షాతోనూ..టిడిపి ఎంపిలతోనూ సమావేశం నిర్వహించారట. ఇక ఈ సమావేశంలో.. .ఇక తాము ఆంధ్రాకు ఇచ్చిన హామీలపై చర్చించే దేమీ లేదని.....దీనిని ఇంతటితో వదిలేయాలని 'అమిత్‌షా' 'వెంకయ్య'ను కోరినట్లు సమాచారం. దీంతో..ఇక టిడిపి,బిజెపిలు అటో...ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.   మరి ఈ నెల 5 వతేదీని పార్లమెంట్ సమావేశాలు మళ్లీ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ చివరి ప్రయత్నం చేసింది. కానీ బీజేపీ మాత్రం ఎట్టి పరిస్థితిలో తగ్గేలా కనిపించడంలేదు. దీంతో మళ్లీ పార్లమెంట్లోనే ఈ విషయం తేల్చుకోవాలని  నిర్ణయం తీసుకున్నారట. మొత్తం మీద ఇచ్చిన హామీలను అమలు చేయకుండా.. బీజేపీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ఇప్పటికే జనాలు అర్ధంచేసుకున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో దీనికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నారు.

జేఎఫ్సీ రిపోర్డ్ వచ్చేసింది... కేంద్రం పొడిచింది ఏం లేదు..

  ఏపీకి నిధులు ఇచ్చామని ఒకపక్క కేంద్ర ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చింది ఏం లేదని మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది కాలంగా చెప్పుకొస్తున్న  సంగతి తెలిసిందే. అయితే ఎవరు.. నిజం చెబుతున్నారు..ఎవరు అబద్దం చెబుతున్నారో అన్నది సమాధానం లేని ప్రశ్న. అయితే రెండు ప్రభుత్వాల నిగ్గు తేల్చడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ పేరుతో కమిటీని ఏర్పాడు చేశాడు. ఈ కమిటీలో పెద్ద పెద్దతలకాయలనే పెట్టుకున్నాడు. ఇక అలా కమిటీ ఏర్పాటు చేశారో.. లేదో అప్పుడే నివేదికను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. గురువారం నాడు ఈ నివేదికను పవన్ కళ్యాణ్ కు అందజేయగా, ఇంతకీ ఈ రిపోర్ట్ లో ఏముంది? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.   దాదాపు రెండు వారాల పాటు ఈ కమిటీ అన్ని వివరాలు సేకరించి తేల్చింది ఏంటంటే.. ఇన్ని రోజులు ఏపీకి ఎవ్వరికీ ఇవ్వనన్ని నిధులు ఇచ్చామని ఓ తెగ చెప్పుకుంటున్న బీజేపీ.. ఏపీకి వెలగబెట్టింది ఏం లేదంట. విభజన చట్టంలోని హామీలు... ప్రత్యేక హోదా కాదని ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఇచ్చిన హామీలు.. ఏవీ సక్రమంగా అమలు కాలేదని కమిటీ పెద్దలు నిర్ధారించినట్టు సమాచారం. ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి ఉదారత చూపలేదని నిర్ధారించారు. అంతే కాదు ఇంకా పలు అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతేకాదు అవినీతి విషయంలో టిడిపి ప్రభుత్వంలో ఉన్న కొన్ని లోపాలను కూడా ఈ కమిటీ ఎత్తిచూపినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రస్తుతం ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టిడిపి – బిజెపిల వలన రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏం లేదన్నది మాత్రం అర్దమవుతుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ శనివారం నాడు అధికారికంగా వెల్లడించనున్నారు. మరి చూద్దాం ఈ రిపోర్డ్ బయటకు వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో...

పార్టీ నేతలను భయపెడుతున్న జగన్ మెసేజ్..

  జగన్ పంపిన ఎస్ఎంఎస్ లు చూసి ఇప్పుడు ఆపార్టీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఇంతకీ పార్టీ నేతలనే వణికించే ఎస్ఎంఎస్ లు జగన్ ఏం చేసుంటాడబ్బా.. అంతలా పార్టీ నేతలను భయపట్టే మెసేజ్ ఏమై ఉంటుందనేకదా డౌట్. కొంత మంది తెలియక తప్పుచేస్తారు.. మరికొంత మంది...తెలిసి తెలిసి తప్పు చేస్తారు... ఈ రెండో కోవకు చెందిన వ్యక్తే జగన్. తప్పులు చేయడం..వాటిని సమర్థించుకోవడం ఆయనకే చెల్లుతుంది. ఇప్పుడు తాజాగా చేసిన తప్పునే మరోసారి చేయడానికి సిద్దమయ్యారు. ఇంతకీ అదేంటంటారా..?   గతంలో పాదయాత్ర వంకతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. తానే కాదు... తనతో పాటు తన పార్టీ నేతలకు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశాడు. మరి జగన్ ఆదేశించిన తరువాత నేతలు దాన్ని పాటించకుండా ఉంటారా..? సమావేశాలు జరిగినన్నీ రోజులు పార్టీ నేతలు అసెంబ్లీ దరిదాపులకు కూడా రాలేదు. దీనివల్ల జగన్ కు ఏదైనా మంచిపేరు వచ్చిందా అంటే అదీ లేదు...పాదయాత్ర చేసుకోవడానికి ఇదో వంక పెట్టుకున్నారని కొంతమంది అంటే.. ప్రతిపక్షమై ఉండి అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాడకుండా... ఇలా సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏంటని మరికొంత మంది విమర్శలు గుప్పించారు. అలాంటిది తన తప్పును సరిచేసుకొని త్వరలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాల్సింది పోయి.. మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లొద్దని అన్నారట. దీంతో జగన్ మళ్ళీ అదే పాట పాడటంతో, ఎమ్మల్యేలు అవాక్కయ్యారట. అంతేకాదు జగన్ తీసుకున్న నిర్ణయంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారట. కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో సర్కారు నిర్ణయాలు, వివిధ శాఖలకు కేటాయింపులపై నిలదీసే అవకాశాన్ని చేతులారా దూరం చేసుకోవడం వ్యూహాత్మక తప్పిదమేనన్న అభిప్రాయపడుతున్నారట. మరికొంతమంది.. జగన్ పాదయాత్రలో ఉన్నాడు కాబట్టి... ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని మినహాయించి, మిగిలిన ఎమ్మెల్యేలు హాజరయితే బాగుంటుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారట. అయితే ఇవన్నీ పార్టీ నేతలు తమలో తాము చర్చించుకునే మాటలు మాత్రమే. తమ అభిప్రాయాలు జగన్ దగ్గర పస్తావించే ధైర్యం మాత్రం లేదు. ఇక జగన్ తన మోనార్క్ తెలివితేటలు మొత్తం ఉపయోగించి.. ఏదో చేద్దామని అనుకుంటాడు.. ఆఖరికి అది రివర్స్ అయిన తరువాత కానీ తెలియదు.. తాను తప్పుచేశానని.. మరి చుద్దాం... ఏం జరుగుతుందో..

మోడీ హవా తగ్గిందటానికి ఇవే నిదర్శనాలు...

నాలుగేళ్ల క్రితం.. కేంద్రంలో బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో... ఆ తరువాత ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా దాదాపు ఆ పార్టీనే గెలుపు సొంత చేసుకుంది. అయితే ఇది అప్పటిమాట. మోడీ నాలుగేళ్ల పాలనలో పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ ఏ ఉపఎన్నికలు జరిగినా పరాజయాన్ని మూటగట్టుకుంటున్నారు. గుజరాత్ ఎన్నిక్లలో ఏదో చచ్చీ చెడీ గెలిచిన బీజేపీ పరిస్థితి ఏంటో అప్పుడే అందరికీ అర్ధమైపోయింది. ఆతరువాత రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు విజయకేతనం ఎగురవేశాయి. ఇప్పుడు ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన మూడు స్థానాల్లోనూ బిజెపి పరాజయం పాలైంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సుబుల్‌ సాహు మరణించడంతో ఒడిశా రాష్ట్రంలోని బీజ్‌పూర్‌ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో ఆయన భార్య బిజెడి అభ్యర్థిగా రంగంలోకి దిగి..ఘనవిజయం సాధించారు. ఇక  మధ్యప్రదేశ్‌లో జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార బిజెపి పరాజయం పాలయింది. దీంతో ఇప్పటికే బీజేపీ పార్టీ  పరిస్థితి గురించి ఆందోళన పడుతుంటే...ఈ ఉపఎన్నికల్లో ఓడిపోవడం చూసి కలవరపడుతున్నారట. అంతేకాదు.. నవంబర్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరాజయం పాలవడంపై నేతలు టెన్షన్ పడుతున్నారట. ఏది ఏమైనా ఉత్తరాదిన అన్ని ఎన్నికల్లో దాదాపు విజయం సాధించిన మోడీ...దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఉపఎన్నికల్లో మాత్రం పరాజయమే మూటగట్టుకుంటున్నారు. ఈ ఉపఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఈ నాలుగేళ్ల పాలనలో మోడీపై ప్రజలకు ఉన్న నమ్మకం.. ప్రజల్లో మోడీ ప్రభ తగ్గుతుందని పూర్తిగా అర్ధమైపోతుంది.

తెలంగాణ టీడీపీ నాయకులకు మైండుందా?

  తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. చాలామంది నాయకులు, కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టి టీఆర్ఎ‌స్‌లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలంగాణ టీడీపీలో వున్న వారిలో చాలామంది టీఆర్ఎస్‌లోకి వెళ్ళడానికి అవకాశం లేనివారు మాత్రమే అనే అభిప్రాయాలు వున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందిన వారు కూడా కష్టకాలంలో పార్టీకి అండగా వుండకుండా టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. వచ్చే ఎన్నికల నాటికి మరికొందరు కూడా వెళ్ళరని గ్యారంటీ ఏమీ లేదు. మోత్కుపల్లి నర్సింహులు లాంటి సీనియర్ నాయకులు పార్టీలోనే వుంటూ పార్టీకి నష్టం కలిగే కామెంట్లు చేస్తూ వుంటారు... అలాంటి వారిని భరించక తప్పని పరిస్థితిలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ వుంది. అయితే పార్టీ అధినేత మాత్రం ఎంతమంది పార్టీని విడిచి పెట్టినా ఏమాత్రం జంకకుండా ఆశావాదంతో వ్యవహరిస్తున్నారు. మళ్ళీ ఏనాటికైనా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందన్న నమ్మకంతో వున్నారాయన. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో ఈ నమ్మకమే వ్యక్తమైంది. అయితే ఈ సందర్భంగా కొంతమంది తెలంగాణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన ఓవర్ యాక్షన్ మాత్రం అసలు వీళ్ళకు మైండుందా.. లేదా అనే సందేహం కలిగేలా చేసింది.   చంద్రబాబు నాయుడితో భేటీ అయిన సందర్భంగా కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయడానికి తాము ఎంతమాత్రం ఒప్పుకోమని, అలా విలీనం చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి కన్నీరు పెట్టుకున్నారు. ఇలాంటి తలా తోకా లేని స్టేట్‌మెంట్లు ఇచ్చి కన్నీరు పెట్టుకోవడం అనేది ఓవర్ యాక్షన్ కిందే వస్తుంది మరి! అసలు ఇలా కన్నీళ్ళు పెట్టుకుని లబోదిబోమన్నది ఎప్పటి నుంచో టీడీపీలో వున్నవాళ్ళేనా... లేక ఈమధ్యకాలంలో పార్టీలో చేరినవాళ్ళా అనే సందేహాలు కలుగుతున్నాయి. చంద్రబాబు నాయకత్వం గురించి తెలిసినవాళ్ళెవరూ ఇలా లబోదిబోమనరు. చంద్రబాబు లాంటి నాయకుడు తన పార్టీ తెలంగాణ శాఖను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారని ఎవరైనా గట్టిగా నమ్మితే వాళ్ళకి మానసికంగా ఏదో సమస్య వున్నట్టే భావించాల్సి వుంటుంది. తనకు గవర్నర్ గిరీ అందడం ఆలస్యం అవుతోందన్న ఆవేదనలో మోత్కుపల్లి నర్సింహులు లాంటి పెద్దమనిషి ఏదో నోరు జారి వుంటారు. అంతమాత్రాన తెలంగాణ టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారని ఎవరైనా ఎందుకు అనుకోవాలి? అవసరమైతే సింహం ఆకలితో మాడి చస్తుందిగానీ, గడ్డి తినదు.. తెలుగుదేశం పార్టీ కూడా అంతే! ఇంత చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఆ పార్టీలో కొనసాగడం వేస్ట్!

మోడీ డైరెక్షన్ లో గౌతమి కమల్ కు చెక్....

  కమల్ హాసన్ ను ఇరుకున పెట్టడానికి మోడీ గౌతమి అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా...? అసలు సంగతేంటంటే... తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతంర తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభం ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇదే అదనుగా బీజేపీ అక్కడ కూడా పాగా వేయాలని పలు ప్రయత్నాలే చేసింది. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. ఇక ఏదో ఒక రకంగా అక్కడ తన బలం పెంచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కమల్ హాసన్ రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. మొదట్లో బీజేపీకి కాస్త అనుకూలంగా మాట్లాడిన కమల్..ఆతరువాత మాత్రం బీజేపీని టార్గెట్ చేస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ మీద.. మోడీ ప్రభుత్వ తీరు పై ఎన్నో విమర్శలు గుప్పించారు. దీనికి తోడు ఇప్పుడు కొత్త పార్టీ కూడా పెట్టాడు. అంతేకాదు బీజేపీకి సపోర్ట్ ఇవ్వకపోతేనే రజనీతో కలిసి పని చేస్తానని తేల్చిచెప్పాడు కూడా. దీంతో కమల్ తీరుపై బీజేపీ అధినాయకత్వం తీవ్ర అసంతృప్తిలో ఉంది. ఈ సమయంలోనే కమల్‌ను రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు, వ్యక్తిగతంగా కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు చేయడానికి బరిలో దిగినట్టు తెలుస్తోంది. అందుకు గౌతమినీ రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి.   కమల్‌ హాసన్‌, గౌతమిలు కొంతకాలం సహజీవనం సాగించిన సంగతి తెల్సిందే కదా. అయితే కొన్ని కారణాల వల్ల ఈమద్యనే వారిద్దరూ విడిపోయారు. దీంతో వీరిద్దరూ దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు గౌతమి గత కొంత కాలంగా బీజేపీకి సన్నిహితంగా ఉంటూ వస్తుంది. ఇక బీజేపీ కూడా గౌతమితో కమల్ ను దెబ్బకొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే.. గౌతమి కూడా మోడీ డైరెక్షన్ తో  కమల్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీనిలో భాగంగానే... కమల్‌ హాసన్‌ చేసిన పలు చిత్రాలకు తాను కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా మరియు ఇంకా పలు పనులు చేశాను అని, వాటికి సంబంధించిన పారితోషికాలు తనకు ఇవ్వలేదని, కమల్‌ తనకు బాకీ పడ్డాడు అంటూ తాజాగా గౌతమి సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి బీజేపీ ప్లాన్ ను కమల్ ఏ విధంగా తిప్పికొడతారో చూద్దాం..

శ్రీదేవి సరే.. సిరియా అవసరం లేదా..?

వెండితెర నిండు జాబిలి.. అతిలోక సుందరి.. అభిమానుల కలలరాణి శ్రీదేవి మరణం భారతదేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ షాక్ నుంచి తేరుకొని ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు... తమ ఆరాధ్య నటీమణిని చివరిచూపు చూసుకునేందుకు అభిమానులు ఆమె నివాసం ముందు బారులు తీరారు. ఇలోగా శ్రీదేవిది సహజ మరణం కాదంటూ దుబాయ్ పోలీసులు అనుమానం వ్యక్తం చేయడంతో.. ఆమె పార్థివ దేహం భారత్‌కు రావడం ఆలస్యమైంది. ఆమె ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేకపోతున్న వేళ.. శ్రీదేవి మరణానికి గల కారణం చుట్టూ అనుమానాలు కలగడం అభిమానులను మరింత కలవరపాటుకు గురిచేసింది.   క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఈ ట్రాజడీతో మీడియాకు మంచి ఫీడ్ దొరికినట్లైంది. శనివారం అర్థరాత్రి నుంచి నేటి వరకు దుబాయ్ పోలీసులు, బాత్‌టబ్, బోనీకపూర్‌పైనే ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ మీడియా ఫోకస్ పెట్టింది. ఆఖరికి యూట్యూబ్, సోషల్ మీడియాలోనూ శ్రీదేవి సంగతులే. దీంతో దేశంలో.. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియలేదు. అలా మీడియా హైప్ మిస్సయిన వాటిలో సిరియా సంక్షోభం ఒకటి. ఎవరి చేతుల్లో చనిపోతన్నామో.. ఎందుకు చనిపోతున్నామో.. తెలియక అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా... సుమారు రెండు కోట్ల ఇరవై లక్షల మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరాయి దేశాలకు వలస వెళ్లిపోతున్నారు.   అభం, శుభం తెలియని పసిపిల్లలు 500 మంది దారుణంగా చంపబడ్డారు. ఈ శతాబ్ధం ఎన్నడూ చూడని నరమేధం మనదేశంలో ఎంతమందికి తెలుసు.. శ్రీదేవి గొప్ప వ్యక్తే కావొచ్చు.. భారతదేశం గర్వించదగ్గ నటీమణి అయ్యుండవచ్చు.. కానీ ఈమె గురించి ప్రసారం చేసే గంటలో ఒక పది నిమిషాలు వారి ఆర్తనాదాలకు చోటివ్వలేరా..? ఒక ప్రముఖ కార్టూనిస్టు వేసిన ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్ని.. మీడియా చేస్తోన్న అతిని వివరిస్తుంది.

ఇక రాజ్యసభకూ బీజేపీయే "రూలర్"..?

నరేంద్రమోడీ ఛరిష్మాతో గత సార్వత్రిక ఎన్నికల్లో.. మేజిక్ ఫిగర్‌ను క్రాస్ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ.. ఎన్డీఏ మిత్రపక్షాల బలం దీనికి అదనం.. దీంతో లోక్‌సభలో కమలానికి ఎదురులేకుండా పోయింది. జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణ అంత సులభంగా ఆమోదం పొందింది అంటే అందుకు బీజేపీ బలమే కారణం. లోక్‌సభలో బిల్లులు ఆమోదించుకుంటున్నా.. రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి తలనొప్పులు తప్పడం లేదు. అక్కడ ప్రతిపక్షాలకు తిరుగులేని బలం ఉండటంతో బీజేపీ ఆటలు సాగడం లేదు. 58 సభ్యుల బలంతో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టినప్పటికీ.. ప్రతిపక్షాలదే హవా.. అయితే ఇక మీదట పెద్దల సభలోనూ కమలం ఆధిపత్యాన్ని చలాయించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   వచ్చే నెల 23న 16 రాష్ట్రాల్లోని 58 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించనున్నారు. ఇక ఎన్డీఏ మిత్రపక్షాలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో పొత్తుల కారణంగా మరికొన్ని స్థానాలు దక్కే అవకాశం ఉంది. కేంద్రానికి అప్రకటిత మిత్రపక్షాలుగా వ్యవహరిస్తోన్న అన్నాడీఎంకే, టీఆర్ఎస్, బీజేడీ, వైసీపీల మద్దతును కలుపుకుంటే బీజేపీకి మెజారిటీ దక్కే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే రాజ్యసభలో ప్రతిపక్షాలకు తలొగ్గాల్సిన అవసరం ఇక బీజేపీకి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి.  

శ్రీదేవికి లెటర్ రాసిన కూతురు జాహ్నవి..

  అతిలోక సుందరి శ్రీదేవి మరణవార్త విన్న దేశం మొత్తం ఒక్కసారిగా శోక సంద్రంలో మునిగిపోయింది. అసలు శ్రీదేవి చనిపోయిందంటే..ఇప్పటికీ నమ్మలేని వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. మరి మనకే అలా ఉంటే... శ్రీదేవి కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో  చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తన ఇద్దరు కూతుళ్లు..వాళ్ళిద్దర్నీ ఓదార్చడం ఎవ్వరి వలన కావడం లేదు. తన పిల్లల కోసం దాదాపు 15 ఏళ్లు సిని పరిశ్రమకు సైతం దూరమైందంటే..పిల్లలను శ్రీదేవి ఎలా కంటికి రెప్పలా పెంచుకున్నారో అర్గం చేసుకోవచ్చు. తన కూతుళ్ల భవిష్యత్తు కోసం... తన ఇద్దరు కూతుర్లను సెటిల్ చేయడానికి ఆమె చాలా కష్టపడుతోంది. ఇక శ్రీదేవి కూతుళ్లు కూడా.. జాహ్నవి, ఖుషిలు కూడా తన తల్లి శ్రీదేవిని విడిచిపెట్టింది లేదు. ఎక్కడికి వెళ్లినా.. ఎక్కడ ఉన్నా.. తనతోనే ఉండేవాళ్లు. అంతేకాదు పలు సందర్భాల్లో శ్రీదేవి కూడా తన కూతుళ్ల గురించి చెబుతూ మురుసుకునేది. తన చిన్న కుమార్తె ఖుషి తండ్రి బోనీ కపూర్ నాన్న కూచి అని.. జాహ్నవి మాత్రం.. నా పార్టీ అని... ఖుషి కంటే జాహ్నవికే తన అవసరం ఎక్కువగా ఉంటుందని శ్రీదేవి గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జాహ్నవి శ్రీదేవికి రాసిన ఓ లెటర్ పలువురి హృదయాల్ని కలచివేస్తుంది. ఫెమినా ఎడిటర్ తాన్యా చైతన్య జాహ్నవి రాసిన లెటర్ ను తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.  "నువ్వు సాధించిన విజయాలు, పని పట్ల నీ నిబద్ధత, నీ స్ఫూర్తిదాయక జీవితం గురించి వింటూ మేం పెరిగాం. నేను నీ కూతురిగా పుట్టడం నాకెంతో గర్వకారణం. నీ కూతురు జాహ్నవి అంటూ ఆమె ఈ లెటర్ లో రాసుకొచ్చారు". ఇప్పుడు ఈ లెటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా ఇంత కష్టపడి తన పెద్ద కూతురి మొదటి సినిమా అయినా చూడకుండా కన్నుమూయడం దురదృష్టకరం..

కేసీఆర్ విషయంలో నేను చేసింది తప్పే...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడు కేసీఆర్ అలా పిలిపించుకుంటున్నారు అంటే దానికి కారణం నేనే అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేంటీ అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే..నిజానికి కేసీఆర్ ప్రత్యేక పార్టీ పెట్టడానికి... ఆ తరువాత ప్రత్యేక రాష్ట్ర పోరడటానికి గల కారణాలు అందరికీ తెలిసిందే. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వని కారణంగానే వేరే పార్టీ పెట్టారని కాస్త రాజకీయానుభవం ఉన్న ఎవరిని అడిగినా చెబుతారు. ఇప్పుడు అదే విషయాన్ని చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చేసి 40 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 1999లో కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవటం నేను చేసిన తప్పిదమే.. కేసీఆర్ కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పడటం నుండి ఇప్పుడు రాష్ట్రం విడిపోయే వరకూ జరిగి ఉండేది కాదని తన మనసులోని మాటను బయటపెట్టారు. అంతేకాదు... కేసీఆర్ ను కాదని విజయ రామారావుకి మంత్రి పదవి ఇచ్చానని.. నిజానికి విజయరామారావు అంత సమర్ధుడు కాదని చెప్పుకొచ్చారు. ఇక కేసీఆర్ తనకు పదవి ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందడం... దానికిగాను ఇస్తానని చెప్పడం...అందుకు ఆయన అంగీకరించకపోవడం... బయటకి వచ్చి టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని పెట్టడం జరిగిపోయాయని వివరించారు. ఆ తరువాత తెలంగాణకి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రత్యేకం తెలంగాణ ఉద్యమం చేసి ఆఖరికి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా సంపాదించారనుకోండి. ఏది ఏమైనా ఆనాడు తాను చేసిన తప్పును ఇప్పుడు దాదాపు 20 ఏళ్లకు చంద్రబాబు ఒప్పుకోవడం గమనార్హం. ఆనాడే కేసీఆర్ కు మంత్రి పదవి ఇచ్చుంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో...

మోడీతో సమరానికి కేసీఆర్ పచ్చజెండా..?

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మోడీతో సాన్నిహిత్యం కోసం దేశంలోని పార్టీల అధినేతలు.. ముఖ్యమంత్రులు నమో భజన చేశారు. రాష్ట్రాభివృద్ధి కానివ్వండి.. కేంద్రంలో మంత్రి పదవులు కానివ్వండి. మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆయన అడక్కుండానే సాయానికి సిద్ధమై ప్రధాని దృష్టిలో పడాలని తపించిన వారు ఎందరో. అలా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అతి త్వరలో ఎన్నికల నగారా మోగబోతోంది. కబుర్లతో కాలక్షేపం చేస్తే జనం నుంచి ఓట్లు రావు కదా..? అందుకే కేంద్రంపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరు.   సీఎంగా అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రధాని మోడీని ఆయన కానీ.. టీఆర్ఎస్ నేతలు కానీ పల్లెత్తు మాట అన్న దాఖలాలు లేవు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలకు కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే బీజేపీతో అప్రకటిత మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చారు. అలాంటిది కేసీఆర్ స్వరంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తొలిసారిగా కేంద్రప్రభుత్వంపైనా.. ప్రధాని మోడీపైనా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో జరిగిన రైతు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కేంద్రంపై సున్నిత విమర్శలు చేశారు.   జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలంటూ తీర్మానించారు. ఇదే విషయమై తాను కేంద్రాన్ని చాలాసార్లు కోరాననీ.. కానీ ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. మన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి కారణం బీజేపీ, కాంగ్రెస్‌లేనన్నారు. ఈ విషయం గురించి ప్రధాని నరేంద్రమోడీకి.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి.. బీజేపీకి చెందిన ఓ కీలకనేతకు చెప్పానని కానీ వారికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల్లో రైతుల అంశంపై బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. కేసీఆర్ తీరు చూస్తుంటే.. ప్రధాని మోడీతో సమరానికి సై అన్న సంకేతాలు ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఢీకొడుతున్న వేళ.. మరో తెలుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి ప్రధానిపై విమర్శలు చేయడం పట్ల బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు.

నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది...

  అందాల తార శ్రీదేవి మరణంపై అనుమానాలు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారాయి. తమ బంధువుల పెళ్లికి గాను దుబాయి  వెళ్లిన శ్రీదేవి  అక్కడే హార్ట్ అటాక్ రావడంతో అక్కడే మరణించింది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం కార్డియాక్ అరెస్ట్ కాదని తేలడంతో అసలు అనుమానాలు మొదలయ్యాయి అందరికి. దీంతో అసలు శ్రీదేవి చనిపోవడానికి కారణం ఏంటని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక టీవి ఛానల్స్ అయితే మినిట్ టు మినిట్ అప్ డేట్ ఇస్తూ.. ఇంకా టెన్షన్ పుట్టిస్తున్నారు. దీంతో యావత్ భారత్ దేశం మొత్తం ఆమె మరణం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి....? అక్కడ విచారణ ఎప్పుడు ముగుస్తుంది...? ఆమె డెడ్ బాడీ ఎప్పుడు ఇండియా వస్తుంది..? అని ఎదురుచూస్తున్నారు. మరోపక్క ఆమె అభిమానులు మాత్రం తమ అభిమాన నటి మృతిపై వస్తున్న వార్తలను చూసి బాధపడుతున్నారు.   మరి శ్రీదేవిని దేవతగా భావించే రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటి..? ఇప్పటికే ఆమె మృతిపై స్పందించిన వర్మ... దేవుడిని తిట్టిపోశాడు. ఇప్పుడు ఈ వార్తలపై కూడా స్పందిస్తూ.... శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు ఆమె అందం, శరీరం, హావభావాలు, పెదాలు, నడుము గురించి మాట్లాడుకునే వారని... కానీ, ఇప్పుడు ఏవోవే మాట్లాడుకుంటున్నారని... ఆమె రక్తంలో మద్యం ఉందని, ఊపరితిత్తుల్లో నీళ్లు ఉన్నాయని, పొట్టలో ఇంకేవో ఉన్నాయని అంటున్నారని  ‘‘ఎవరి జీవితమన్నా ఇంత భయంకరంగా, ఇంత విషాదంగా ముగుస్తుందా? ఆమె మరణవార్తను ఇలా ఇన్ని రకాలుగా వినాల్సి రావడం బాధాకరం. ఇదంతా చూస్తుంటే నన్ను నేను చంపుకోవాలనిపిస్తోంది’’ అని వర్మ ట్వీట్ చేశాడు. నిజంగా వర్మ అన్నట్టు అప్పుడు ఆమె అందాన్ని, అభినయాన్ని గురించి మాట్లాడుకున్న వాళ్లు... ఇప్పుడు అదే శ్రీదేవి మృతి గురించి ఇలా మాట్లాడుకోవడం ఎంతైనా బాధాకారం...

జగన్ కు పీకే గుడ్ బై... మోడీ ఫోర్స్

  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ కు గుడ్ బై చెబుతున్నారా..?అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ ను వీడి ప్రధాని మోడీ టీంలో జాయిన్ అవుతారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు సంగతేంటంటే... ప్రశాంత్ కిషోర్ గత కొద్దికాలంగా జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా ప్రధాని మోడీ, ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. గడచిన నెల రోజుల్లోనే 2 సార్లు వీళ్లద్దరూ భేటీ అయ్యారు. అయితే 2019 ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి...ఈ నేపథ్యంలో ఆయన మోడీ టీంలోకి వెళుతున్నారు. అంతేకాదు... మీరు మా టీంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని  మోడీ ప్రశాంత్ కిషోర్ ను కోరారట. ఇక సాక్ష్యాత్తు ప్రధానిమంత్రే అడగడంతో.. ఆరు నెలలుగా ఇద్దరి మధ్య జరుగుతున్న మంతనాలతో త్వరలోనే జగన్ ను వదిలేసి.. మోడీ టీంలోకి జాయిన్ కానున్నారు..   అయితే మోడీతో కలిసి ప్రశాంత్ కిషోర్ పనిచేయడం ఇదేం మొదటిసారికాదు. 2012 నుంచి పీకేతో మోడీకి పరిచయం. 2012లో బీజేపీ గుజరాత్ కోసం పని చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల కోసం గుజరాత్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు మోడీ. గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ తర్వాత యూపీ, బీహార్ కు పని చేశారు. అయితే బీహార్ లో బీజేపీ ఓడిపోయింది. దాంతో తర్వాత మోడీ టీం నుంచి తప్పుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా వచ్చారు.. మళ్లీ ఇప్పుడు పీకే ను తమ టీంలోకి తీసుకోవాలని మోడీ ఒత్తిడి చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆరు నెలలుగా పీకేతో చర్చలు జరుపుతున్నారని... ఇప్పుడు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని...మార్చి మొదటి వారంలోనే పీకే.. జగన్ కు గుడ్ బై చెప్పనున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు జగన్ కూడా ఈ విషయంలో కలవరపడుతున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో... నిజంగానే పీకే జగన్ ను వదిలివెళతాడా..? అన్నది చూడాలి...