ఆ కోడిపుంజు నిలువెల్లా బంగారమే!
posted on Jan 18, 2026 10:07PM

వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి అన్నది సామెత. ఇప్పుడా సామెతకు చూస్తే భీమవరం కోడిపుంజునే చూడాలి అని చేర్చుకోవాలి. ఎందుకంటే భీమవరంలో ఓ కోడి పుంజుకు దాని యజమాని పులిగోరు సహా బంగారు నగలు చేయించారు. ఇప్పుడు అక్కడంతా బంగారు కోడి పుంజు వచ్చెనండీ అంటూ పాడుకుంటున్నారు.
ఔను ఆ కోడి పుంజు బంగారు ఆభరణాలు, పులి గోరుతో దర్జా ఒలకపోస్తోంది .భీమవరం దుర్గాపురంలో జరిగిన కోడిపందాలలో నిలువెల్లా బంగారం ధరించిన కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పుంజు యజమాని తన కోడిపుంజును 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించాడు.
ఆ కోడి పుంజుపై ఉన్న నగల విలువ 50 లక్షల రూపాయకు పైనే ఉంటుందని అంచనా. జీడిపప్పు బాదం, పిస్తా వంటి శక్తివంతమైన ఆహారంతో మేపి మరీ పందేలకు సిద్దమైన ఆ కోడి పుంజు కాలికి కోడికత్తి కట్టుకొని పందెంలో దిగి ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. కోడి పందేల కు మించి ఈ కోడి పుంజే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.