మహిళలు మహారాణి లాంటి జీవితం పొందాలన్నా.. పేదరికంలో మగ్గిపోవాలన్నా ఈ 5 విషయాలే డిసైడ్ చేస్తాయ్..! ప్రపంచంలో అందరు వ్యక్తుల జీవితం ఒకేలా ఉండదు. ఇందులో మహిళల జీవితం మినహాయింపేమీ కాదు. కానీ సరిగా గమనిస్తే.. బాగా ఆలోచిస్తే.. ప్రారంభం ఎలా ఉన్నా.. కాలంతో పాటు ఎదిగి సాధారణ మహిళలు కూడా మహారాణుల్లా గొప్ప స్థానానికి ఎదిగిన వారు ఉన్నారు. గొప్ప జీవితంతో తమ ప్రయాణం మొదలుపెట్టి పాతాళానికి పడిపోయి పేదరికంతో పోరాడుతున్న మహిళలు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? మహిళల జీవితాలను నిర్ణయించే విషయాలు ఏంటి? కేవలం 5 విషయాలు మహారాణుల్లా గొప్ప స్థానాలు ఇవ్వగలవు, పేదరికంలోనూ ముంచేయగలవు.. అవేంటి? తెలుసుకుంటే.. కష్టం, సోమరితనం.. కష్టపడి పనిచేసే స్త్రీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా అధిగమించే సామర్థ్యం ఉంటుంది. మహిళలలోని అంకితభావం, కృషి, పట్టుదల ఆమెకు గౌరవాన్ని, విజయాన్ని, శ్రేయస్సును తెస్తాయి. సోమరితనం స్త్రీని వెనక్కి నెట్టివేస్తుంది. పురోగతికి ప్రధాన అడ్డంకిగా మారుతుంది. సోమరితనం ఎదుగుదల, విశ్వాసం, ఏదైనా నేర్చుకోవడం లేదా సాధించడం అనే లక్ష్యాలకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. పొదుపు, దుబారా.. ఒక కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నా, మంచి స్థాయిలో ఉండాలన్నా అందులో స్త్రీల పాత్ర చాలా కీలకం. డబ్బు విలువను అర్థం చేసుకుని తెలివిగా పొదుపు చేసే స్త్రీలు తమ కుటుంబం ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోగలుగుతారు. కానీ ఆడవాళ్లకు దుబారా అలవాట్లు ఉంటే ఆమె జీవితమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్త్రీలు కుటుంబం పతనం కావడానికి, ఆర్థిక కష్టాలు అనుభవించడానికి కారణం అవుతారు. మోసం, నిజాయితీ.. నిజాయితీ అనేది ప్రతి సంబంధానికి బలమైన పునాది. నిజాయితీపరులైన స్త్రీ సమాజంలో గౌరవాన్ని పొందుతుంది. దీనికి విరుద్ధంగా అబద్ధాలు చెబుతూ ఉంటే వారి మోసం సంబంధాలను బలహీనపరచడమే కాకుండా జీవితంలో బాధ, ఒత్తిడి, అపనమ్మకాన్ని కూడా పెంచుతాయి. ఓర్పు, కోపం.. ఓర్పు, సంయమనం స్త్రీకి ఉన్న గొప్ప బలాలుగా భావిస్తారు. ప్రశాంతమైన మనస్సుతో ఏ పరిస్థితినైనా నిర్వహించగల స్త్రీ ఎలాంటి పరిస్థితిలోనైనా విజయం సాధిస్తుంది, బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది. దీనికి విరుద్ధంగా, తొందరగా కోపం తెచ్చుకునే స్త్రీలు సంబంధాలలో విభేదాలు, గొడవలు రావడానికి కారణం అవుతుంది. ఎక్కువ కోపం, తొందరగా కోపం వచ్చే స్త్రీల జీవితం ఒత్తిడి, సమస్యలతో నిండిపోతుంది. నేర్చుకోవడం, స్తబ్దత.. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇష్టపడుతూ, కాలానికి అనుగుణంగా మారుతూ ఉండే స్త్రీలు జీవితంలో అన్ని విధాలా అభివృద్ది చెందుతూ ఉంటారు. నేర్చుకునే అలవాటు మహిళలను ప్రతి రంగంలోనూ బలంగా, విజయవంతం అయ్యేలా చేస్తుంది. నేర్చుకోవడం పట్ల ఆసక్తి లేకుండా కేవలం తిని కూర్చుకొంటూ ఎంజాయ్ చేయాలనే మహిళలు వెనుకబడిపోతారు. *రూపశ్రీ.
దీపాలకాంతితో అమ్మాయిల అందం పోటీ పడాలంటే ఇలా చెయ్యాల్సిందే! దీపావళి భారతదేశ ప్రజలందరూ పెద్ద ఎత్తున సంతోషంగా జరుపుకునే పండుగ. అందుకే ఎక్కడ చూసినా ఈ పండుగ వైభవం కనిపిస్తుంది. ఇది హిందూ మతానికి చాలా ప్రత్యేకమైన పండుగ. ప్రతి ఏడాది దీన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు. దీపావళి సందర్బంగా ఇళ్లను అలంకరించుకోవడం, ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు వేయడం , ఇల్లంతా దీపాలు వెలిగించడం వంటివి చేస్తారు. కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా దీపావళి సందర్బంగా అమ్మాయిలు తమ అందంలో దీపాల కాంతితో పోటీ పడాలని ప్రయత్నిస్తారు. అయితే ఈ దీపాల పండుగలో డిఫరెంట్గా కనిపించాలన్నా గులాబీ లాంటి అందంతో మెరిసిపోవాలన్నా ఈ కింది టిప్స్ పాటించాలి.. దీపావళికి ఇంకా ఒకరోజే సమయం ఉంది. ఈ సందర్బంగా ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్, మాస్క్లను ఉపయోగించడం మంచిది. కావాలంటే చర్మానికి సరిపోయే ఫేషియల్ కూడా చేసుకోవచ్చు. దీని వల్ల చర్మానికి లోపల నుండి జీవం వస్తుంది, ముఖానికి రక్త ప్రసరణ పెరుగుతుంది, ఇది దీపావళి నాటికి ముఖం మెరిసేలా చేస్తుంది. చాలామంది అమ్మాయిలు తమ ముఖాన్ని సాధారణ ఫేస్ వాష్తో కడగడం ద్వారా శుభ్రం చేసుకుంటారు, అయితే కొన్నిసార్లు హడావిడిలో ముఖాన్ని శుభ్రం చేయడానికి తగినంత సమయం ఉండదు. ఏదైనా క్లెన్సింగ్ ఏజెంట్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం పచ్చి పాలలో కాటన్ను నానబెట్టి ముఖానికి మసాజ్ కూడా చేసుకోవచ్చు. మసాజ్ చేసిన తర్వాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం శుభ్రంగా, మేకప్కు చేసుకోవడానికి అనువుగా స్మూత్గా మారుతుంది. దీపావళి పండుగ రోజున మేకప్ చేసేటప్పుడు ఎక్కువగా పొరల మేకప్ వేసుకోకపోవడం మంచిది. బేస్, ఫౌండేషన్ వేరు వేరు లేయర్లను వేసుకోవడం వలన మేకప్ క్రాక్స్ వచ్చి తక్కువ సమయంలో పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల మేకప్ ను ఒకే సన్నని పొరగా వేసుకోవాలి. ఇది చాలా సేపు ఉంటుంది. ముఖం ఎక్కువసేపు ఆరోగ్యంగా కనిపిస్తుంది. ముఖానికి మేకప్ వేసేటప్పుడు చేసే అతి పెద్ద తప్పు ఏమిటంటే, పాత లేదా చౌక ఉత్పత్తులను ఉపయోగించడం. వీటితో ఎన్ని విధాలుగా మేకప్ అప్లై చేసినా అవి ఎక్కువ కాలం ఉండవు. చెమటతో కారిపోవడం, లేదా రంగు వెలసిపోవడం జరుగుతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మంచి కంపెనీ నుండి ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఇకపోతే మేకప్ వేసేటప్పుడు జరిగే రెండవ తప్పు.. సరైన క్రమంలో మేకప్ వేయకపోవడం. క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్, ప్రైమర్, ఫౌండేషన్, కన్సీలర్, ఫేస్ పౌడర్, బ్లషర్, ఐ మేకప్ అన్నీ వేటి ప్రాముఖ్యతను అవి కలిగి ఉంటాయి. వాటిలో దేని తరువాత దేన్ని అప్లై చేయడం మంచిదో తెలుసుండటం ముఖ్యం. ఏ ఒక్కటైనా అటుది ఇటు, ఇటుది అటు వేస్తే మేకప్ మొత్తం పాడైపోతుంది. కాబట్టి మేకప్ వల్ల అందంగా కనబడాలంటే ఈ తప్పులు చేయకూడదు. మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే వాటర్ ప్రూఫ్ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించాలి. ప్రస్తుతం మార్కెట్లో చాలా కంపెనీలు వాటర్ప్రూఫ్ మేకప్ను విడుదల చేస్తున్నాయి. ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి. ఇవి ముఖంలో గ్లోను ఎక్కువసేపు ఉంచడంలో కూడా సహాయపడతాయి. *నిశ్శబ్ద
దీపావళి స్పెషల్ - దీపాల అలంకరణ కాంతులు చిమ్మే దీపావళి వచ్చేస్తుంది. మట్టి ప్రమిదలను మీరే సొంతంగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఇది మీకోసమే అతి తక్కువ ఖర్చుతో దీపాలను ఎంతో అందంగా మీకు నచ్చిన విధంగా డిజైన చేయండి. దీపావళిని ఆనందంగా ఆహ్వానించండి. Click Here for Home Decor N Handicrafts
మొదటి సారి చీర కట్టేటప్పుడు ఇవి తప్పక గుర్తుంచుకోవాలి..! చీర మహిళల భారతీయ సంప్రదాయ వస్త్రధారణ. అయితే నేటి కాలంలో చీరను రోజు కట్టుకోవడం కుదరడం లేదు. చాలా వరకు వివిధ రకాల ఫ్యాషన్ దుస్తులలోనే రోజులు గడుపుతుంటారు. చీర అంటే చాలా అరుదుగా ఏదైనా ట్రెడిషనల్ కార్యక్రమంలో మాత్రమే కడుతుంటారు. అయితే చీర మొదటిసారిగా కట్టేవారు చాలా అయోమయానికి గురవుతుంటారు. చాలా వరకు ఇతరుల సహాయం తీసుకుంటూ ఉంటారు. అసలు చీర ఫర్పెక్ట్ గా కనిపించడానికి ఏం చేయాలి? ఏ టిప్స్ ఫాలో కావాలి? తెలుసుకుంటే.. సరైన పెట్టీకోట్, బ్లౌజ్.. చీర కట్టుకునేందుకు లోపల ధరించే లంగాను నేటికాలంలో పెట్టీకోట్ అంటున్నారు. ఈ పెట్టీ కోట్, చీరలోకి ధరించే బ్లౌజ్ సరిగ్గా సరిపోయేలా ఉండాలి. పెట్టీకోట్ ఎంత బాగా సెట్ అయితే చీర కట్టుకున్నాక అంత బాగా కనిపిస్తుంది. పెట్టీకోట్, బ్లౌజ్ చాలా బిగుతుగా లేదా చాలా లూజ్ గా ఉండకూడదు. చీరను గమనించాలి.. చాలామందికి చీర కట్టుకొనేటప్పుడు ఎదురయ్యే కన్ఫ్యూషన్.. చీర కింద అంచు ఏది? పైన అంచు ఏది అని.. అలాగే చాలా చీరలు ముందు, వెనుక కూడా అట్రాక్షన్ గా ఉంటాయి. ఇవి కూడా గమనించాలి. ఇవి గమనించకుండా హడావిడిగా చీర కట్టుకుంటే అది బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. హీల్స్ వద్దు.. ప్లాట్స్ ముద్దు.. చాలామందికి హీల్స్ ధరించడం అలవాటు. కానీ చీర కట్టుకున్న తరువాత హీల్స్ ధరించడం చాలా ఛాలెంజ్ గా ఉంటుంది. చీర పూర్తీగా అలవాటు కానప్పుడు చీర కట్టుకున్నప్పుడు హీల్స్ ధరించి ఏదైనా సమస్యను ఎదుర్కునే బదులు చీర ధరించినప్పుడు ప్లాట్స్ ధరించడం మంచిది. కుచ్చిళ్ల స్థానం.. చీరకు చాలా అందాన్ని తెచ్చిపెట్టేది కుచ్చిల్లు. ఈ కుచ్చిళ్లను చాలా జాగ్రత్తగా మడత పెట్టడమే కాదు.. కుచ్చిళ్ళను సరిగ్గా పెట్టికోట్ లో ఉంచడం కూడా ముఖ్యమే.. ఖచ్చితంగా నాభికి కొద్దిగా కుడివైపున కుచ్చిళ్లను టక్ చేసుకోవాలి. మడత పెట్టడం.. చీర కట్టుకున్నప్పుడు చీర కొంగు అయినా, కుచ్చిళ్లు అయినా సరిగ్గా ఒక్క లెవల్ లో మడత పెట్టాలి. ఇలా ఒక్క లెవల్ లో మడత పెట్టడం వల్ల చీర కట్టుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. సేఫ్టీ పిన్ ల వాడకం.. చీర కొంగును, చీర కుచ్చిళ్ళను పెట్టేటప్పుడు సేఫ్టీ పిన్ లను చాలా జాగ్రత్తగా వాడాలి. పిన్ లను పెట్టేటప్పుడు చీర ఫ్యాబ్రిక్ పోగులు ఒక్కొక్క సారి దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు పిన్స్ శరీరానికి గుచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే సేఫ్టీ పిన్స్ దగ్గర జాగ్రత్త. నడవడం.. డ్రస్సులు వేసుకున్నప్పుడు నడిచినంత వేగంగా, వయ్యారంగా.. మొదటి సారి చీర కట్టుకున్నప్పుడు నడవడం కుదరదు. అందుకే మొదటిసారి చీర కట్టుకున్నప్పుడు లేదా చీర అలవాటు తక్కువగా ఉన్నప్పుడు నెమ్మదిగా నడవాలి. కాన్పిడెంట్ కీలకం.. చాలామంది చీర కట్టుకున్నప్పుడు భయపడుతూ ఉంటారు. ఎక్కడ పడతామో.. నవ్వుల పాలవుతామో అని. అయితే కాన్పిడెంట్ గా ఉండటం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
మొటిమల గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా.. ప్రపంచంలో అత్యంత సాధారణ చర్మ వ్యాధులలో ఒకటి మొటిమలు. ఇవి చాలా సాధారణమైనవే అయినా.. ఇప్పటికీ వీటి గురించి అపోహలు, తప్పుడు సమాచారం ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇది టీనేజర్ల నుండి 30 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దల వరకు అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. అయితే మొటిమల గురించి చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. వాటిని నిజం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా మొటిమల బాధితులు ఎక్కువ మహిళలే.. మొటిమల గురించి ఉన్న అపోహలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేసుకుంటే చాలా ఆందోళనలు తగ్గుతాయి. మొటిమలు టీనేజ్ లో మాత్రమే వస్తాయా? చాలా మంది మొటిమలు కౌమారదశలో మాత్రమే కనిపిస్తాయని అనుకుంటారు. కానీ ఈ కాలంలో పెద్దలకు కూడా మొటిమలు రావడం సర్వసాధారణం. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జీవనశైలి ఇవన్నీ మొటిమలకు కారణాలు అవుతాయి. యుక్తవయస్సులో క్లియర్ స్కిన్ ఉండటం వల్ల పెద్దయ్యాక మొటిమలు రావని హామీ ఏమీ లేదు. జిడ్డు చర్మం ఉన్నవారికే మొటిమలు వస్తాయా? జిడ్డుగల చర్మం ఉన్నవారిలో మొటిమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పొడి చర్మం ఉన్నవారిలో, జిడ్డుగల చర్మం ఉన్నవారిలో, పెద్దవారిలో మొటిమలు రావడం సహజం. చర్మ రకంతో సంబంధం లేకుండా చికాకు, మూసుకుపోయిన చర్మ రంధ్రాల కారణంగా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రకాల చర్మాలకు మొటిమల సమస్య ఉంటుంది. జంక్ ఫుడ్ తిన్నవారికే మొటిమలు వస్తాయా? చర్మ ఆరోగ్యంపై ఆహారం ప్రభావం చూపినప్పటికీ, మొటిమలు ప్రధానంగా జంక్ ఫుడ్ కారణంగానే వస్తాయి అనుకోవడం తప్పు. చక్కెర, పాల ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహారాలు మొటిమలను మరింత తీవ్రతరం చేస్తాయి. కానీ అవే ప్రధాన కారణం కాదు. చర్మ అవరోధం పనితీరు, హార్మోన్లు, జన్యుశాస్త్రం చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కొంతమందికి సమతుల్య ఆహారం మంటలను తగ్గించడంలో సహాయపడుతుంది. మేకప్ వల్ల మొటిమలు వస్తాయా? మొటిమలు తరచుగా మేకప్ కారణంగా వస్తాయని అనుకుంటారు. అయితే, మొటిమలు కామెడోజెనిక్ కాని ఉత్పత్తుల వల్ల సంభవించవు. మేకప్ సరిగ్గా తొలగించనప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోతాయి. చర్మం మీద మేకప్ ను చాలా శుభ్రంగా తొలగించుకోవడం చాలా ముఖ్యం. డబుల్ క్లెన్సింగ్ లేదా స్కిన్ ఫ్రెండ్లీ ఉత్పత్తులతో ఇది సాధ్యమవుతుంది. టీనేజ్ మొటిమలకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదా.. యుక్తవయస్సులో మొటిమలు సర్వసాధారణమైనప్పటికీ ఇది హానిచేయదు అనే గ్యారెంటీ లేదు.. మొటిమల వల్ల శాశ్వతంగా మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీ ట్మెంట్ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. *రూపశ్రీ
30 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం ఎందుకు కష్టం అవుతోంది..! ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కెరీర్ గురించి ఆలోచించడం, గోల్స్ అచీవ్ చేయడం వంటివి దృష్టిలో ఉంచుకోవడం లేదా ఇతర కారణాల వల్ల 30 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకునే వారు అధికం అయ్యారు. కాస్త తొందరగా పెళ్లి చేసుకున్నా గర్భధారణను మాత్రం 30 ఏళ్ల తర్వాత ప్లాన్ చేస్తున్నారు. కానీ సరిగ్గా గమనిస్తే నేటికాలంలో పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అధిక శాతం మంది 30 ఏళ్ల తర్వాత వయసు ఉన్నవారే.. మహిళ యొక్క సంతానోత్పత్తి ప్రయాణం పుట్టుక నుండే ప్రారంభమవుతుంది. ఒక అమ్మాయి తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆమె అండాశయాలలో అండాల సంఖ్య లక్షల్లో ఉంటుందని గైనకాలజిస్టులు చాలా ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు. అంతేకాదు.. ఈ సంఖ్య జననం సమయంలో దాదాపు 1–2 మిలియన్లకు పడిపోతుంది. యుక్తవయస్సు వచ్చే సమయానికి 50–60 వేల అండాలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీని అర్థం స్త్రీ వయస్సు పెరిగే కొద్దీ ఆమె సంతానోత్పత్తి క్రమంగా తగ్గుతుంది. 30 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య మరింత తగ్గడం వల్లే గర్భధారణలో ఇబ్బందులు తలెత్తుతాయి. స్త్రీకి PCOD లేదా PCOS వంటి హార్మోన్ల సమస్యలు, పీరియడ్స్ సమయంలో అధిక నొప్పి లేదా అసాధారణ రక్తస్రావం (చాలా తక్కువ లేదా ఎక్కువ), ఎండోమెట్రియోసిస్ వంటి వ్యాధి ఉంటే, అది మరింత సమస్యగా మారుతుంది. ఇక టెక్నాలజీ ఉపయోగించి గర్భధారణ అనేది నేటికాలంలో చాలా జరుగుతోంది. వాస్తవానికి, IVF ఒకసారి విఫలమైన తర్వాత మళ్ళీ దానికి డబ్బు కట్టి ప్రయత్నించాలా అనేది చాలా మంది సందేహం. ప్రతి స్త్రీ శరీరం, హార్మోన్ల ప్రతిస్పందన ఒకేలా ఉండదు. కొంతమంది మహిళల శరీరాలు ఎక్కువ అండాలు ఉత్పత్తి చేస్తాయి, దీనిని హైపర్ స్టిమ్యులేషన్ అంటారు, మరికొన్ని ఆశించిన సంఖ్యలో అండాలు మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. IVF టెక్నాలజీకి కూడా హామీ లేదా.. IVF ద్వారా గర్భధారణకు ప్రయత్నించినా అది ఇంజెక్షన్, ట్రీట్మెంట్ మోతాదును వేర్వేరు సైకిల్స్ లో మార్చాలి. IVFలో మూడు లేదా నాలుగు సైకిల్స్ లో ఎవరైనా గర్భవతి అవుతారని హామీ ఇవ్వడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ఒకవేళ ఇలాంటి హామీ ఎవరైనా ఇస్తున్నారంటే కేవలం ఒక స్కామ్ మాత్రమే అంటున్నారు. *రూపశ్రీ.
ఆశల్ని అలాగే మిగలనివ్వకండి... మనసుకు నచ్చిన పని చేసినప్పుడు లభించే తృప్తి అంతా ఇంతా కాదు. ఆ తృప్తి, ఆ ఆనందం ముందు ఏవీ సరిరావు. కానీ ఎక్కువసార్లు మన మనసుకి నచ్చిన పని చేయటానికి మనకు అవకాశం దొరకదు. మనుషులో, పరిస్థితులో, కాలమో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకటి రెండుసార్లు పట్టుదలగా ప్రయత్నిస్తాం. కుదరటం లేదంటూ ముడోసారికి ఆ ప్రయత్నం విరమించుకుంటాం. అందులోనూ ఆడవారి విషయంలో ఆ ఆటంకాలకి కొదవే వుండదు, పెళ్ళి, పిల్లల నుంచి మరెన్నో బాధ్యతలు కాళ్ళకి బంధం వేసి ముందుకు అడుగు వేయనివ్వవు. దాంతో ఏదో చేయాలన్న తపన కాస్తా మరుగున పడిపోతుంది. అసంతృప్తి తోడుగా మనతో ముందుకు అడుగేస్తుంది. అలా కాదు నేను నా మనసుకు నచ్చిన పని చేసి తీరాలంటూ వయసుతో సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళిన ఒకామె గురించి ఈ మధ్య చదివాను. ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ కొన్ని సంవత్సరాల పాటు తమని తాము మర్చిపోతారు ఆడవారు. బాధ్యతలు అన్నీ తీరి కాస్త సమయం దొరికింది అన్నప్పుడు క్షణాలు గంటల్లా మారిపోతాయి. కాలం కదలదు. ఏమీ చేయటానికి ఉండదు. ఇక నిరుత్సాహం, నిర్లిప్తత మేమున్నామంటూ హాయ్ చెబుతాయి. అలా తన బాధ్యతలన్నీ తీరిపోయక... హమ్మయ్య కావల్సినంత సమయం దొరికిందంటూ సంతోషించింది. అంతేనా... ఎప్పట్నుంచో తన మనసులో వున్న కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేసింది ఆమె. బాగా చదువుకోవాలన్నది ఆమె కోరికట. కానీ చదువు మధ్యలోనే పెళ్ళయిపోవటం ఆ తర్వాత బాధ్యతల మధ్య చదువు ముందుకు సాగలేదు. 60 సంవత్సరాల దగ్గరగా వచ్చేసింది వయసు. పిల్లలందరూ దూరంగా వున్నారు. కావలసినంత సమయం. అంతే చక్కగా కాలేజీలో చేరిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులోకి ఈమె అడుగు పెడుతుంటే లెక్చరరు అనుకుని స్టూడెంట్స్ అంతా విష్ చేశారుట మొదటి రోజు. ఆ తర్వాత ఈమె కూడా చదువుకోవటానికి వచ్చిందని తెలుసుకుని నవ్వుకున్నారట. కాలేజీ జీవితంమంటే సరదా, సంతోషాల కలయిక. వయసు, ఉత్సాహం ఉరకలు వేస్తుంటాయి. అలా ఉరకలు వేసే కాలేజీ స్టూడెంట్స్ కి క్లాసులో ఈ పెద్దావిడని చూస్తే మొదట్లో చిరాకుగా అనిపించేదిట. ఆవిడ అందరితో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళతో పాటు క్యాంటిన్కి, సినిమాకి వెంట వస్తుంటే విసుగ్గా ఉండేదిట. కానీ బయటికి ఏమీ అనలేక ఆమెని తప్పించుకు తిరిగేవారు స్టూడెంట్స్. ఇలా కొంత కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో తెలియకుండానే ఆమెతో మంచి అనుబంధం ఏర్పడిపోయింది. ఒక్కరోజు ఆమె రాకపోయినా తోచేదికాదు స్టూడెంట్స్కి. కేవలం ఆటపాటలు, సరదా, సంతోషాలలోనే కాదు చదువులోనూ టీనేజర్స్తో నేను పోటీపడగలనంటూ ముందుండేవారుట ఆమె. దాంతో కాలేజీలో ఆమె అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింరు. సంవత్సరం ఆఖరి పరీక్షలలో మంచి మార్కులతో పాసయిన ఆమెని చూచి అందరూ ఆనందపడతారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోతాయి. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడచిపోతాయి ఆమెకి. కావల్సినన్ని జ్ఞాపకాలు స్వంతమయ్యాయి. ఫేర్వెల్ రోజున ఆడిపాడి ఆఖరుగా తమ తమ మనసులో మాటలు చెబుతారు ఒకొక్కరు. ఆమె వంతు వస్తుంది. అప్పుడు తనసలు కాలేజీలో ఎందుకు చేరిందో, చదువంటే తనకెంత ఇష్టమో, ఇన్ని సంవత్సరాల జీవితం తనకెన్ని ఆటుపోట్లని ఇచ్చిందో అన్ని వివరిస్తుంది. ఆఖరుగా ఈ మూడేళ్ళు నా ఇన్నేళ్ళ జీవితంలో ప్రతేకమైనవి అని చెబుతూ అందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతుంది. అందరూ భారమైన మనసులతో విడిపోతారు. రిజల్ట్స్ వస్తాయి ఆమె యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్ ప్రైజ్గా ఆమె ఇంటికి వెళతారు. స్టూడెంట్స్, లెక్చరర్లు ఒకసారిగా ఆమె ఇంటికి వస్తారు. లోపలికి వెళ్ళి పూలమాలతో అభినందించాలనుకున్న వాళ్ళకి మంచంపై రిజల్టుపేపరుని గుండెలపై పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె కనిపిస్తుంది. కదిపి చూస్తే చలనం ఉండదు. అందరూ నిర్ఘాంతపోతారు. ఆమె కేన్సర్ ఆఖరి రోజులని తెలిసీ తన చిరకాల కోరిక తీర్చుకునేందుకు కాలేజీకి వచ్చింది. చదువుకుంది. ఆ తృప్తితో ప్రాణాలు విడిచింది. ఈ నిజం తెలుసుకున్న అక్కడి వారంతా బాధతో ఆమెకి వీడ్కోలు చెబుతారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. తీరని ఆశ మనిషిని, మనసుని బాధిస్తుంది. ఆలోచించండి. - రమ ఇరగవరపు
పట్టుచీరలు ఐరన్ చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పక పాటించండి! భారతీయ సాంప్రదాయానికి మెరుగులు దిద్దేవి పట్టుచీరలు. పట్టుచీరలలో అమ్మాయిలు ముస్తాబైతే వారిని చూడటానికి రెండు కళ్లు సరిపోవు. నిజానికి భారతీయత అంతా పట్టుచీరలలోనే తిష్ట వేసుకుందేమో అనిపిస్తుంది. ఇకపోతే ప్రతి మహిళ దగ్గరా పట్టుచీరలు ఉండటం కామన్. పండుగ, శుభకార్యాల సమయాలలో సందర్బానుసారంగా పట్టుచీరలు కట్టి పండుగకు మరింత అందం తెస్తారు. అయితే పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం లుక్ రెట్టింపు అవుతుంది. దుస్తులు కూడా సురక్షితంగా ఉంటాయి. ఇంతకీ పట్టుచీరలను ఐరన్ చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. ముందు జాగ్రత్త.. పట్టుచీరలను జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే దానికి చెయ్యాల్సిన మొదటి పని కొనుగోలు చేసేటప్పుడే ఆ చీరలను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం తెలుసుకోవడం. ఒకవేళ పెద్ద షాప్స్ లో కొంటూ ఉంటే ఆ పట్టు రకం, దాని ఖరీదు మొదలైనవాటితో పాటూ సదరు చీరను ఐరన్ చెయ్యచ్చా లేదా అనే విషయం కూడా అందులో పొందుపరిచి ఉంటారు. అవి చూసుకోవాలి. కవరింగ్.. పట్టుచీరలను ఎప్పుడూ నేరుగా ఐరన్ చెయ్యకూడదు. పట్టుచీర మీద ఐరన్ బాక్స్ నేరుగా పెట్టకూడదు. దానిబదులు మొదట చీరను జాగ్రత్తగా ఒక పెద్ద టేబుల్ మీద ఉంచి, చీర మీద కాటన్ క్లాత్ లేదా కాటన్ టవల్ వంటివి ఉంచాలి.పైన క్లాత్ ఐరన్ చేస్తుంటే కింద చీర ఐరన్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేస్తే చీర దారప్పోగులు, రంగు దెబ్బతినవు. సెట్ చేయాలి.. ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసేటప్పుడు ప్రతి ఫ్యాబ్రిక్ కు తగినట్టు టెంపరేచర్ సెట్ చేసే సౌకర్యం ఉంటుంది. దాన్ని అనుసరించి పట్టుచీరల కోసం సిల్క్ సెట్టింగ్ చేయాలి. ఇలా చేస్తే పట్టుబట్టలకు తగినంత మాత్రమే ఉష్ణోగ్రత ప్రసారం అవుతుంది. మొదలు ఇక్కడే.. పట్టుచీరలను మొదట అంచు నుండి ఐరన్ మొదలుపెట్టాలి. తరువాత చీరల మధ్యలో ఐరన్ చెయ్యాలి. ఇలా చేస్తే ముడతలు ఉండవు. కానీ చీరలు పాడవకుండా ఉండాలన్నా, ఏమాత్రం నష్టం జరగకూడదు అన్నా ఐరన్ బాక్స్ ను చీరమీద ఒకేచోట ఎక్కువ సేపు ఉంచకూడదు. ఫైనల్ స్టెప్ మిస్టేక్.. చీరలు ఐరన్ చేశాక జాగ్రత్తగా మడతేసి బీరువాలో పెట్టడం మగువలకు అలవాటు. అలా కాకుండా ఐరన్ చేసిన చీరలను హ్యాంగర్ కు పెట్టి దాన్ని వార్డ్ రోబ్ లో వేలాడదీయాలి. కవర్లలో పెట్టడం ఇరుకైన డ్రాయర్లలో పెట్టడం చెయ్యకూడదు. *నిశ్శబ్ద.
మహిళలు ధరించే బ్రా ల గురించి షాకింగ్ నిజాలు..! మనకు ఆహారం, నివాసంతో పాటు, బట్టలు కూడా చాలా ముఖ్యమైనవి. పొడవాటి చీర అయినా లేదా చిన్న బ్రా అయినా.. వాటి ఎంపిక విషయంలో మహిళలు బాగా ఆలోచిస్తారు. ఎలాంటి దుస్తులు ధరించినా మహిళలు బ్రా వేసుకోవడం తప్పనిసరి. అయితే మహిళలు బ్రా లు తప్పనిసరిగా ధరించినా వాటి గురించి మాట్లాడటానికి వెనుకాడతారు. ఈ కారణంగా బ్రా గురించి చాలామందికి చాలా విషయాలు ప్రశ్నలుగానే ఉన్నాయి. చాలామందికి తెలియని బ్రా గురించి నిజాలు తెలుసుకుంటే.. బ్రా ఎలా ఉనికిలోకి వచ్చింది? గతంలో కార్సెట్ దుస్తులు మాత్రమే ఉండేవి. ఇది క్రమంగా మారిపోయి 20వ శతాబ్దంలో బ్రాను ప్రవేశపెట్టారు. హెర్మియోన్ కాడోల్ అనే వ్యక్తి కార్సెట్ తయారు చేస్తున్నాడు. దానిని తయారు చేస్తున్నప్పుడు అది బిగుతుగా మారింది. అతను కార్సెట్ను 2 ముక్కలుగా చేశాడు. తరువాత కార్సెట్ బ్రా రూపాన్ని తీసుకుంది. చాలా మంది చరిత్రకారులు బ్రాను 1910లో మేరీ ఫెల్ప్స్ జాకబ్ 19 సంవత్సరాల వయసులో కనుగొన్నారని నమ్ముతారు. అసలు పదం.. బ్రా పూర్తి రూపం బ్రజియర్. ఇది ఫ్రెంచ్ పదం. దీని అర్థం మహిళల వక్షోజాలను కప్పి ఉంచడానికి, మద్దతు ఇవ్వడానికి రూపొందించిన లోదుస్తులు. కానీ 1930 నాటికి, ప్రజలు బ్రజియర్ను బ్రా అని పిలవడం ప్రారంభించారు. బ్రజియర్ అనే పదం 1911లో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడింది. బ్రా లకు ఎక్స్పైరీ డేట్.. బ్రాను వారానికి 3 నుండి 4 సార్లు ధరిస్తే.. అది 8 నెలల వరకు ఉంటుంది. బ్రాను 12 నెలల వరకు కూడా ఉపయోగించవచ్చు. ప్రతిరోజూ ధరించకపోతే బ్రాను ఇంకా ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. ఇది బ్రా నాణ్యత, దానిని ఎలా నిర్వహిస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. సరైన బ్రా లు ధరిస్తున్నారా? నివేదికల ప్రకారం 80% మంది మహిళలు తప్పు సైజు బ్రా ధరిస్తున్నారట. బ్రా సైజును కొలవడానికి అనేక స్కేళ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ సంకోచం, సిగ్గు వంటి అనేక కారణాల వల్ల, మహిళలు సైజును కొలవకుండా బ్రాలను కొనుగోలు చేస్తారు. మహిళలు కూడా తాము తప్పు సైజు బ్రా ధరిస్తున్నారనే విషయం గురించి ఎప్పుడూ ఆలోచించి ఉండకపోవచ్చట. అత్యంత ఖరీదైన బ్రా ధర.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రెస్ గురించి వినే ఉంటారు . ఈ విషయంలో బ్రా కూడా తన రికార్డ్ తనకు క్రియేట్ చేసుకుంది. 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్రాగా పరిగణించబడుతుంది. దీనిని విక్టోరియా సీక్రెట్ రూపొందించింది. 2000లో దీనిని సూపర్ స్టైలిష్ గిసెల్ బుండ్చెన్ ధరించింది . ఈ బ్రా ధర రూ. 125 కోట్లుగా చెబుతారు. 1,300 క్యారెట్ల వజ్రాలు థాయ్ కెంపులు దానిపై పొందుపరచబడ్డాయి. అందుకే 'రెడ్ హాట్ ఫాంటసీ బ్రా' మెరిసేలా కనిపిస్తుంది. *రూపశ్రీ.
రాణి అహిల్యాబాయి హోల్కర్ గురించి తెలుసా... రాణి అహిల్యాబాయి హోల్కర్ (1725–1795) భారతదేశ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ఆదర్శప్రాయమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. మధ్యభారతదేశంలోని ఇండోర్ సంస్థానంలో జన్మించిన ఆమె, చిన్నతనంలోనే భర్తను కోల్పోయి, తన కుటుంబాన్ని సమర్థంగా నడిపించారు. తర్వాత, ఆమెను సంస్థానాధీశులు రాణిగా నియమించారు. పరిపాలనలో ప్రతిభ.. రాణి అహిల్యాబాయి హోల్కర్ రాజ్యాన్ని సమర్థంగా, ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా ఉంచి పరిపాలించారు. ప్రతి రోజు నర్మదా నదిలో స్నానం చేసి, మట్టితో శివలింగాన్ని తయారు చేసి, ఆ లింగం సాక్షిగా న్యాయనిర్ణయం చేసేవారు. అవినీతికి తావులేని పాలన, పన్నుల విధానంలో పారదర్శకత, ప్రజల సమస్యలను స్వయంగా పరిష్కరించడం వంటి లక్షణాలతో ఆమె పాలన ప్రసిద్ధి చెందింది. సాంస్కృతిక పునర్నిర్మాణం.. రాణి అహిల్యాబాయి హోల్కర్ తన స్వంత నిధులతో దేశవ్యాప్తంగా సుమారు 150 దేవాలయాలను పునర్నిర్మించారు. కాశీ విశ్వేశ్వర ఆలయం, కేదారనాథ్, గయ, ప్రయాగ, శ్రీశైలం, రామేశ్వరం, పూరి జగన్నాథ్ ఆలయాలు వంటి ప్రఖ్యాత దేవాలయాలను పునర్నిర్మించారు. ఈ విధంగా, ఆమె భారతీయ సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక సవరణలు.. అహిల్యాబాయి హోల్కర్ సమాజంలో అనేక సవరణలు తీసుకువచ్చారు. బాల్య వివాహాలను నిషేధించారు, వరకట్న పద్ధతిని రద్దు చేశారు, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. అదేవిధంగా, భిల్లులు, గోండులు వంటి ఆదివాసీలను సంస్కరించి, వారికి స్థిర నివాసాలు కల్పించారు. దౌత్య నైపుణ్యం.. రాణి అహిల్యాబాయి హోల్కర్ 15 దేశాలకు రాయబారులను పంపించి, సమర్థమైన విదేశాంగ విధానాన్ని నిర్వహించారు. ఆమె రాజ్యంలో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజల పట్ల సమానత్వంతో వ్యవహరించారు. అందువల్ల, ఆమె పాలనలో సామాజిక సామరస్యత నెలకొంది. నారీ శక్తికి ప్రతీక.. రాణి అహిల్యాబాయి హోల్కర్ తన జీవితాన్ని నిరాడంబరంగా గడిపారు. ఆమెకు "పుణ్యశ్లోక" అనే బిరుదు కూడా వచ్చింది, అంటే "పుణ్యమూర్తి" అని. ఆమె జీవితం నారీ శక్తికి ప్రతీకగా నిలిచింది. ఆమెను ఆదర్శంగా తీసుకుని అనేక మహిళలు తమ జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఈ విధంగా రాణి అహిల్యాబాయి హోల్కర్ భారతదేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహిళా పాలకురాలిగా నిలిచారు. ఆమె పరిపాలన, సాంస్కృతిక పునర్నిర్మాణం, సామాజిక సవరణలు, దౌత్య నైపుణ్యాలతో ఆమె దేశానికి అమూల్యమైన సేవలు అందించారు. ఈమె ప్రతి మహిళకు ఆదర్శం. *రూపశ్రీ.
ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి రజియా సుల్తానా! స్త్రీ.... అంటే ఓ చైతన్యం. అతివ.. ..అంటే ఓ అపూర్వం. పడతి.... అంటే ఓ ప్రగతి. అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఎలాగయితే ఆపలేమో. కట్టుబాట్ల అడ్డుగోడలు, కష్టాల కన్నీళ్ళు, స్త్రీమూర్తిని ఆపలేవు. సాధించాలన్న తపన ...లక్ష్యం చేరాలన్న ఆశయం ..ఆమెను ఆకాశమంత చేస్తాయి. ఆమె వేసే ఒక్కో అడుగు.. వేల మార్పులకు శ్రీకారం. మహిళామణులు అందరికీ 'మహిళా దినోత్సవ' శుభాకాంక్షలు. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలో మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించు కొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. సమాన అవకాశాలు, స్వేఛ్చ అందించగలిగితే మహిళలు పురుషులకు మిన్నగా అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. అకాశంలో సగమైన మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం ప్రతీ ఒక్కరు పని చేయడమే నిజమైన నాగరికతగా భావించాలి గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది. భారత రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42). ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2017 చివర్లో వెలువడిన ఓ నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్ 108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు. ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. భారత్లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే. ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది. భారతదేశంలో తొలిగా అహ్మదాబాద్ లో "అనసూయా సారాభాయ్ -టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్" అనే పేరుతో కార్మికసంఘం ప్రారంభించింది. భారత కార్మికోద్యమంలో కార్మిక స్త్రీలను సంఘటితం చేసిన మహిళా నేతలలో సుశీలా గోపాలన్, విమలారణదివే, కెప్టెన్ లక్ష్మిసెహగల్, అహల్యారంగ్నేకర్, పార్వతీకృష్ణన్ ప్రముఖులు.. కొన్ని సహస్రాబ్దులు గా భారత దేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలోమహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించి దేశ కీర్తి ప్రతిష్ఠలు ఇనుమడింపచేసారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపు తున్నాయి. తరువాత (సుమారుగా 500 బి.సి.) నుండి మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది మధ్యయుగ సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది. కొంత మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానాఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి. గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ ను ఎదుర్కొంది. అక్బర్ ను 1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్ను రక్షించింది. జహంగీర్ భార్య నూర్జహాన్ సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది. మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు. శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలి గానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా గణుతి కెక్కింది. దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు. భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది. మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్. యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు భారత స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు. బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు. కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది. అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. మరికొందరు ముఖ్యులు ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్మొదలైనవారు. సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్గా, మొత్తం మహిళలతో కూడిన ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా. నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ. ఈదేశంలో మనం కొందరు మహిళలు గురించి తెలుసుకోవాలి.. జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది. 1883 లో చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు. కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు. 1905 లో సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ. 1916 జూన్ 2న సంఘసంస్కర్త దొండో కేశవ్ కార్వేగారిచేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది. 1917 లో అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది. 1919 లో ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ. 1925 లో సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు. 1944 లో భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ. 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు. 1951లోడెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్. 1953లో విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా అధ్యక్షురాలు (మొదటి భారతీయ) 1959లో అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు) 1963లో సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏ రాష్ట్రములోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు. 1966 లో కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ. 1966లో కమలాదేవి చటోపాధ్యాయ వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు. 1966లో ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి. 1970లో కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ. 1972లో కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి. 1979లో మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు. 1984 మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు. 1989 లో జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు. 1997లో కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ. వీరందరి స్ఫూర్తితో మన సోదరీమణులు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...💐💐💐
మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోను మహిళల విషయం లో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూబిస్తుంది , ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురి అవుతూనే వుంటారు , అందులోను , ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులు గా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట. సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కాని తాజాగా చేసిన ఒక అధ్యయనం లో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్తాయి ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా , ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన జీతం , పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరు కష్టమయినదిగా గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది అని తేలింది. పైగా ఉమ్మిడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుండటం గుర్తించారుట. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని , దానివలన ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయని వీరు గట్టిగా చెబుతున్నారు. చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నా కూడా , ఇప్పటికి ఆ ప్రశంస దొరకటం కష్టం గా వుంది అంటే ...ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయం లో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే 1. మొదటిగా, మిమ్మల్ని మీరు ప్రేమించు కొండి 2. మీతో మీరు కొంత సమయం గడపండి 3. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ...ఎన్నో మానసిక సమస్యలు కి చెక్ చెప్పినట్టేనట.
బట్టల మీద మరకలు ఇలా ఈజీగా తొలగించవచ్చు..! మరక మంచిదే అనే యాడ్ చూసే ఉంటారు. అయితే నచ్చిన దుస్తుల మీద మరకలు పడటం వల్ల చాలా బాధపడతాం. ముఖ్యంగా ఫేవరెట్ డ్రెస్ అని అందరికీ ఉంటుంది. పొరపాటున ఈ ఫేవరెట్ డ్రెస్ మీద కానీ, ఖరీదైన దుస్తుల మీద కానీ మరకలు పడితే మనసు విలవిలలాడుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఈ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు. నిమ్మరసం.. నిమ్మరసం సహజమైన బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తంది. దుస్తుల మీద మరకలు ఏర్పడినప్పుడు దాని మీద నిమ్మరసం పిండాలి. ఆ తరువాత కొద్దిసేపు దాన్ని అలాగే వదిలేయాలి. ఆ తరువాత కడగాలి. మరకలు మాయం అవుతాయి. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా కూడా శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. కేవలం దుస్తులే కాదు.. వివిధ వస్తుల మీద మొండి మరకలను కూడా బేకింగ్ సోడా సహాయంతో మాయం చేయవచ్చు. ఇకపోతే దుస్తుల మీద ఏర్పడిన మరకల మీద బేకింగ్ సోడా పేస్ట్ అప్లై చేయాలి. ఆ గుడ్డను కాసేపు పక్కన పెట్టాలి. ఆరిపోయాక దాన్ని వాష్ చేయాలి. బేకింగ్ సోడా మరకల తాలూకు మురికి, జిడ్డు, రంగు మొదలైనవి లాగేస్తుంది. వెనిగర్.. నిమ్మకాయకు ప్రత్యామ్నాయంగా చాలామంది చాలా సందర్భాలలో వెనిగర్ ను ఉపయోగిస్తారు. అయితే బట్టల మీద మరకలను కూడా వెనిగర్ ద్వారా తొలగించుకోవచ్చు. మరకల మీద వెనిగర్ రాసి కాసేపు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత వాష్ చేయాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్.. రంగు దుస్తులపై హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగించే ముందు ఏదైనా ప్రాంతంలో ప్యాచ్ టెస్ట్ చేయాలి. బట్టలకు ఎలాంటి నష్టం కలగకుంటే మరకల మీద ప్రయోగించాలి. ఇది మరకలు తొలగించడంలో చాలా ప్రబావవంతంగా ఉంటుంది. డిష్ వాష్ సోప్.. డిష్ వాష్ సోప్ మరకల తాలూకు ఆయిల్, గ్రీజు మరకలను తొలగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. మరక మీద కొద్దిగా డిష్ వా,్ సోప్ రాసి రుద్దాలి. తర్వాత దాన్ని వాష్ చేయాలి. ఉప్పు.. మరకలు ఇంకా అప్పుడే అయినవి అయితే వాటని తొలగించడానికి ఉప్పు భలే మంచి ఎంపిక. మరకలపైన ఉప్పును వేయాలి. ఉప్పు మరకల తాలూకు గ్రీజు, జిడ్డు, రంగును లాగేస్తుంది. బోరాక్స్.. బోరాక్స్ అనేక రకాల మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. బోరాక్స్ ను పేస్ట్ చేసి మరకల మీద రాసి కాసేపు అలాగే వదిలేయాలి. ఆ తరువాత వాష్ చేయాలి. మరకలు మాయమవుతాయి. బంగాళదుంప.. బంగాళదుంప రసం తుప్పు మరకలను తొలగించడంలో సహాయపడుతుంది. బట్టల మీద తుప్పు మరకలు ఉన్నప్పుడు బంగాళదుంప ను కట్ చేసి బంగాళదుంప ముక్కలతో మరకల మీద బాగా రుద్దాలి. ఇలా చేస్తే మరకలు పోతాయి. *రూపశ్రీ.
అసలైన బనారసీ పట్టును ఇలా గుర్తించండి..! పట్టు చీరలు భారతీయ కళకు కాణాచి. ఇక పట్టు చీరలు కట్టుకున్నమగువలను చూస్తే సాక్షాత్తూ ఆ దేవతే దిగి వచ్చిందేమో అనిపిస్తుంది. మగువల వల్ల చీరకు అందమా.. చీర వల్ల మగువల అందం రెట్టింపైందా అనేది తెల్చలేని సందిగ్ధం కూడా ఏర్పడుతుంది. భారతదేశంలో చాలా రకాల పట్టుచీరలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి పలు రకాల పట్టులు పేరొందాయి. వాటిలో బనారసి సిల్క్ చీర కూడా ఒకటి. బనారసి సిల్క్ చీరకు దానిదైన ప్రత్యేకత ఉంది. అయితే స్వచ్చమైన బనారసి పట్టు అంత ఈజీగా దొరకవు. చాలా చోట్ల బనారసి పేరుతో మోసాలు జరుగుతుంటాయి. నిజమైన బనారసి పట్టు చీరల ఫాబ్రిక్, డిజైన్, రంగు అన్నీ చాలా విభిన్నంగా ఉంటాయి. నిజమైన బనారసి పట్టును ఎలా గుర్తించవచ్చో తెలుసుకుంటే ఈ రకమైన పట్టు చీర కొనేటప్పుడు మోసపోకుండా ఉంటారు. మెరుపు.. బనారసి సిల్క్ చీరలను కొనేటప్పుడు దాని మెరుపు మీద దృష్టి పెట్టాలి్. కొనుగోలు దారులు నకిలీ చీరలు చూపించి ప్రజలను సులువుగా మోసం చేస్తారు. అందుకే బనారసి చీరలు కొనేటప్పుడు చీరల మెరుపు మీద దృష్టి పెట్టాలి. బనారసి సిల్క్ చీరలు చాలా మృదువుగా ఉంటాయి. అంచు.. బనారసి సిల్క్ చీరల అంచు దారం వదులుగా ఉంటుంది. ఈ చీరను చేతితో నేస్తారు. దీని వల్ల అంచు దారం వదులుగా ఉంటుంది. అదే సమయంలో నకిలీ చీరలు అయితే యంత్రం సహాయంతో నేస్తారు. ఈ మెషీన్ తో నేసే చీరల అంచు దారాలు వదులుగా ఉండవు. ఈ అంచును చూసి అసలు చీర, నకిలీ చీర మద్య తేజా కనుక్కోవచ్చు. ధర.. బనారసి సిల్క్ చీరలను ధరతో పోల్చి కూడా కనుక్కోవచ్చు. ఈ చీరలు ఖరీదైనవి. దాదాపు 10 నుండి 12వేల రూపాయల ధర ఉంటాయి. ఇంతకంటే తక్కువ ధరకు ఈ చీరలను ఏ దుకాణంలో అయినా అమ్ముతుంటే అవి నకిలీ చీరలని తెలుసుకోవచ్చు. అలాంటి చీరలు కొనకూడదు. దారం.. అసలైన బనారసి పట్టు చీరను కనుక్కోవడానికి మరొక చిట్కా ఉంది. అసలైన బనారసి పట్టు దారం కాల్చిన వెంటనే కాలిపోతుంది. చేతికి మసి అంటుతుంది. అదే నకిలీ బనారసి పట్టు అయితే ప్లాస్టిక్ దారాలతో తయారవుతుంది. దీని దారం కాల్చినప్పుడు చేతికి అతుక్కుంటుంది. నమ్మకం.. బనారసి సిల్క్ చీరలను కొనుగోలు చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ కొనకూడదు. నమ్మకమైన దుకాణాదారుల దగ్గర.. చాలా వరకు నేత పని చేసే వారి దగ్గర నేరుగా కొనడం మంచిది. *రూపశ్రీ.
సేఫ్టీ పిన్ వల్ల చీర లేదా దుపట్టా చిరిగిపోతోందా...ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే..! సేఫ్టీ పిన్.. ప్రతి అమ్మాయికి చాలా అవసరమైన వస్తువు. చీరలు, డ్రస్ కు వేసుకునే చున్నీలను జారిపోకుండా ఉండటం కోసం సేఫ్టీ పిన్ లను వాడతారు. మధ్యతరగతి, దిగువ తరగతి మహిళల మంగళసూత్రానికి, గాజులకు ఈ సేఫ్టీ పిన్స్ తప్పనిసరిగా ఉండటం చూడవచ్చు. అయితే సేఫ్టీ పిన్ లను చీరలు కట్టుకున్నప్పుడు, దుప్పట్టా వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ను వాడి ఆ తరువాత మనసు చిన్నబుచ్చుకునే వారు చాలామంది ఉంటారు. కారణం.. ఈ సేఫ్టీ పిన్ లు పెట్టుకున్నప్పుడు డ్రస్ లేదా చీర క్లాత్ కాస్త చిరిగిపోవడం. సేఫ్టీ పిన్ వినియోగం వల్ల మంచి మంచి దుస్తులు రంధ్రాలు పడుతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని ఈజీ ట్రిక్స్ పాటించాలి. ఈ సమయంలోనే ఎక్కువ.. చాలా సార్లు హడావిడిగా చీర కట్టుకున్నప్పుడు, డ్రెస్ వేసుకున్నప్పుడు సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు సరిగా పెట్టకుండా ఆవేశంతో పిన్ ను గుచ్చేస్తుంటారు. దీని వల్ల అవి చీరలోనూ, చున్నీలలోనూ ఇరుక్కుపోయి అవి సులభంగా బయటకు రాలేక.. దుస్తులకు నష్టం చేకూరుస్తాయి. దీని వల్ల చాలా వరకు కొత్త చీరలు, డ్రస్సులు బలి అయిపోతుంటాయి. బటన్స్.. చీర లేదా దుపట్టాను పిన్ చేయడానికి ముందు సేఫ్టీ పిన్ కు రంగురంగుల బటన్ లను అటాచ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చీర చిరిగిపోదు. బట్ట సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. సేఫ్టీ పిన్ ను తిరిగి తీసేయడం కూడా సులువుగా ఉంటుంది. స్టిక్కర్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు స్టిక్కర్ కూడా ఉపయోగించవచ్చు. స్టిక్కర్ ఉపయోగించి సేఫ్టీ పిన్ పెట్టడం వల్ల దాన్ని తిరిగి తీయడం సులువు అవుతుంది. అలాగే క్లాత్ చిరిగిపోకుండా కాపాడుకోవచ్చు. పాలిథిన్.. చీరకు కానీ, దుపట్టాకు కానీ సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు దానికి పాలిథిన్ కవర్ లేదా కాగితాన్ని అతికించవచ్చు. దీని వల్ల క్లాత్ చిరిగిపోకుండా ఉంటుంది. సేఫ్టీ పిన్ పెట్టుకోవడం, తిరిగి తీయడం కూడా సులువే. బీడ్స్.. సేఫ్టీ పిన్ పెట్టుకొనేటప్పుడు చీరకు కానీ, దుపట్టా కు కానీ నష్టం జరగకూడదు అంటే సేఫ్టీ పిన్ కు బీడ్స్ ఎక్కించాలి. ఇవి కూడా చాలా అట్రాక్షన్ గా ఉండే ముత్యాలు, రంగు రంగుల పూసలను సేఫ్టీ పిన్ కు ఎక్కించి వాడటం వల్ల చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుంది. టేప్.. సేఫ్టీ పిన్ ల మధ్య టేప్ ఉపయోగించడం వల్ల సేఫ్టీ పిన్ వల్ల చీరలకు, దుపట్టాలకు నష్టం జరగదు. టేప్ వల్ల క్లాత్ లో సేఫ్టీ పిన్ లు ఇరుక్కోకుండా ఉంటాయి. *రూపశ్రీ.
చలికాలంలో చర్మం పగుళ్లా.. ఇదొక్కటి వాడితే మెరిసిపోతారు! చలికాలం పాటలలోనూ, సినిమాలలోనూ మాత్రమే బాగుంటుంది. కొన్ని సార్లు వేడి వేడి ఆహారం, పకోడిలో, కాల్చిన మొక్కజొన్న పొత్తుల కోసమో చలికాలాన్ని తల్చుకుంటాము. కానీ నిజానికి చలికాలం వచ్చిందంటే పెద్ద పెట్టున చర్మానికి ఎసరు పెడుతుంది. చర్మం పగిలిపోతుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రగా మారిపోయి రక్తం కూడా కారుతుంది. ఇంట్లోనుండి అడుగు బయట పెట్టాలన్నా, స్లీవ్ దుస్తులు వేసుకోవాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వీటన్నింటికి కేవలం ఒకే ఒక్కటి చెక్ పెడుతుంది. అదే తేనె. తేనెను ఆయుర్వేదం అమృతంతో పోలుస్తుంది.తేనెలో ఎన్నోపోషకాలు, మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని సార్లు తేనెను సౌందర్య సాధానంగా కూడా ఉపయోగిస్తారు. అసలు చలికాలంలో తేనెను ఎందుకు వాడాలి? ఎలా వాడితే చర్మం మెరుస్తుంది? చాలామంది తేనెను ఉదయాన్నే వేడినీళ్లలో వేసుకుని తాగుతుంటారు. కానీ చలికాలంలో తేనెను ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తేనె చర్మం మీద లోతుగా పేరుకున్న మలినాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం మీద ముడుతలు తగ్గిచడంలో, వాడిన చర్మానికి జీవం ఇవ్వడంలో తేనె ది బెస్ట్. చలికాలంలో ముఖ చర్మం పగలడం వల్ల, చలి కారణంగా చర్మం మీద దురద, మచ్చలు వస్తాయి. కానీ పెరుగులో తేనెను కలిపి రాసుకోవాలి. లేదంటే శనగపిండిలో తేనె కలిపి ముఖానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ముఖ చర్మం మీద మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు పడి వదులుగా మారిన చర్మం తిరిగి బిగుతుగా మారాలంటే తేనె బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. నిమ్మరసం లేదా యాపిల్ సైడర్ వెనిగర్ లో తేనె వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకుంటే ఈ ముడతలు పోయి ముఖం యవ్వనంగా మారుతుంది. *నిశ్శబ్ద.
గర్భధారణ సమయంలో భగవద్గీత చదవితే ఏం జరుగుతుందంటే..! భగవద్గీత.. మనిషి జీవితంలో కర్మను తప్పక అచరించమని, దాని తాలూకు ఫలితాన్ని తప్పించుకోలేరని చెప్పే గ్రంథం. సత్కర్మల గురించి వివరించేది ఇదే.. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భయానికి, వ్యాకులతకు, పిరికితనానికి లోనైన అర్జునుడికి, శ్రీకృష్ణ భగవానుడు చేసిన బోధనే భగవద్గీత అంటున్నారు. భగవద్గీత అనగా.. భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలు. భగవద్గీతలో 18 అధ్యాయములు ఉన్నాయి. ఈ 18 అధ్యాయములలో 18 యోగములు ఉన్నాయి. భగవద్గీతను వయసైపోయిన వారు చదవే పుస్తకం అనుకుంటారు చాలా మంది. కానీ మంచి నడవడిక కోసం చిన్న పిల్లల నుండి అందరూ చదవవచ్చు. ఉగ్గుపాలతో భగవద్గీత సారాన్ని నేర్పిస్తే పిల్లల జీవితం ఆనందమయంగా ఉంటుంది. అంతేకాదు.. గర్భిణి మహిళలు కూడా భగవద్గీత ను చదవవచ్చు. దీని వల్ల జరిగేదేంటో తెలుసుకుంటే.. స్త్రీలు గర్బధారణ సమయంలో తల్లి, బిడ్డల శారీరక మానసిక ఆరోగ్యం కోసం చాలా పనులు చేస్తుంటారు. తీసుకునే ఆహారం దగ్గర నుండి చేసే పనుల వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో మహిళలు బాధపడకూడదని, ఎమోషన్ కు గురవ్వకూడదని అంటారు. అందుకే.. వాళ్లు ఎప్పుడూ సంతోషంగా ఉండటం కోసం, వారి మనస్సు దృఢంగా ఉండటం కోసం సంగీతం వినడం, మానసికంగా ఆరోగ్యంగా ఉండే కార్యకలాపాలు చేయడం చేస్తుంటారు. వాటి జాబితాలో భగవద్గీత పఠనం కూడా ఒకటి. భగవద్గీత పఠనం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక పుస్తకమే కాదు.. గొప్ప ఫిలాసఫి కూడా ఇందులో దాగుంది. ఇది మనిషి జీవితంలో లోతైన విషయాలు చాలా సూక్ష్మంగా వివరిస్తుంది. మనిషిలో ఉండే బాధ, దుఃఖం, విచారం వంటి వాటిని సున్నితంగా మాయం చేస్తుంది. మనసు శాంతితో, స్థిరంగా ఉండటంలో సహాయపడుతుంది. గర్భవతులు ఈ పుస్తకాన్ని చదివితే అది కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. గీత శ్లోకాలు చదవడం వల్ల తల్లి మానసిక ఆరోగ్యం పై మంచి ప్రభావం ఉంటుంది. ఇది శారీరక స్థితిని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతాడు. ఉట్టి అల్లరి పిల్లవాడు పుట్టాడు.. లాంటి మాటలు ఎదురుకాకుండా ఎంతో గొప్ప ఆలోచనలు, అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉన్నవారిగా పిల్లలు ఎదుగుతారు. భగవద్గీతలో ధర్మం, కర్మ, యోగ, జ్ఞానం వంటి విషయాలు ఎంతో స్పష్టంగా బోధించారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన ఈ విషయాలు తెలుసుకుంటే.. అర్థం చేసుకుంటే జీవితం చాలా మారిపోతుంది. ఇవి గర్భవతులు తెలుసుకోవడం వల్ల గర్భం మోసే దశ చాలా హాయిగా గడిచిపోతుంది. కడుపులో బిడ్డ కూడా ఎలాంటి వికారాలకు లోను కాకుండా, పాజిటివ్ ఆలోచనలతో పుడతారని చెబుతారు. గర్భధారణ సమయంలో మహిళలలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. ప్రతిరోజూ భగవద్గీత పఠించడం వల్ల మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా ఉండగలుగుతారు. గీత శ్లోకాలు మానసిక ప్రశాంతతను, స్వీయ అంగీకార భావనను పెంపొందిస్తాయి. ఇవి జీవితంలో ఎదురయ్యే కష్టాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించేలా చేస్తుంది. ఇది గర్భవతులకు చాలా అవసరం. గర్భంలో ఉన్న బిడ్డకు 7 వ నెల నుండి వినికిడి శక్తి వస్తుంది. ఆ సమయంలో భగవద్గీతను గట్టిగా చదవడం లేదా ఆ శ్లోకాల గురించి బిడ్డతో చర్చిస్తున్నట్టు, బిడ్డకు చెబుతున్నట్టు చేయడం వల్ల గర్బంలో పిల్లల మానసిక భావోద్వేగాలు చాలా నియంత్రణలో ఉంటాయి. *రూపశ్రీ.
సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు. 1. అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. 2. కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. 3. కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. 4. వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. 5. దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.





















