పిల్లలలో అరుదైన వ్యాధి.. ఒక్క ఇంజెక్షన్ 17కోట్లు.. ఇంతకూ ఇదేంటంటే.. పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో కొన్నింటికి వైద్యం చేయించాలంటే లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది. కానీ పిల్లలలో వచ్చే ఒక అరుదైన వ్యాధికి వేసే ఇంజక్షన్ ధర ఏకంగా 17కోట్లని మీకు తెలుసా? ఈ మధ్యనే ఢిల్లీకి చెందిన ఒక పిల్లాడికి ఈ వ్యాధి రావడంతో ఈ వ్యాధి గురించి చర్చ నడుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ పిల్లాడి వైద్యం కోసం ఫండ్స్ సేకరించి మరీ వైద్యానికి సహకారం అందించారు. సగటు పౌరుడి ఊహకు కూడా అందని ఇంత మొత్తం డబ్బును ఖర్చు చేయించే ఈ వ్యాధి ఏంటి? దీనికి అంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? వీటి గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఢిల్లీకి చెందిన కనవ్ జాంగ్రా అనే 18నెలల పిల్లాడికి చాలా అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్ -1 అనే వ్యాధి వచ్చింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంలో కండరాలు చాలా బలహీనంగా మారిపోతాయి. శరీరంలో మెదడు, వెన్నెముక, నాడీ కణాలలో లోపాల కారణంగా ఇది వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడం లేదా చనిపోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దీనికి భారతదేశంలో చికిత్సలేదు. ఈ వ్యాధికి మందు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అది కూడా ఒక ఇంజెక్షన్ రూపంలో దీనికి మందు లభ్యమవుతుంది. కానీ ఈ ఇంజక్షన్ ఖరీదు ఏకంగా 17కోట్లు. ఈ ఇంజెక్షన్ పేరు బోల్జెన్స్మా. ఈ జబ్బు సాధారణంగా పెద్ద పిల్లలోనూ, చిన్నపిల్లలలో కూడా వస్తుంది. కానీ ఎక్కువ శాతం చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన 18నెలల పిల్లాడికి ఈ వ్యాధి సోకిందని తెలియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు. అయితే ఆయన అంత ప్రయత్నం చేసినా 10కోట్లా 50లక్షలు మాత్రమే పోగయ్యాయి. కానీ ఈ వ్యాధికి మందు తయారుచేసి అందించే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెద్ద మనసు చాటుకుంది. 17కోట్ల విలువైన మందును కేవలం 10.5కోట్లకే పిల్లాడికి ఇచ్చింది. ఈ వ్యాధి కారణంగా 18నెలల ఈ పిల్లాడు కూర్చోలేడు, నడవలేడు, ఏ పనీ చేయలేడు. పాపం తెలిసీ తెలియని వయసులో తనకేమయ్యిందో అర్థం కాక నరకయాతన అనుభవించాడు. ఆ దేవుడు ఈ పిల్లాడి యాతన చూసి చలించాడో ఏమో కానీ పిల్లాడికి వైద్యం అందేలా చేశాడు. ఇంజెక్షన్ వేసిన తరువాత ఈ పిల్లాడు సాధారణ పిల్లల్లా కూర్చోవడం, నడవడం చేస్తున్నాడు. అన్ని రోజులు పిల్లాడి గురించి తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞత తెలుపుకున్నారు. పిల్లలలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, చిన్నతనంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ఆ వయసులోనే పరిష్కరించడం వల్ల పిల్లలకు ప్రమాదం తప్పినట్టు అవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు. *నిశ్శబ్ద.
పిల్లల కోసం ఇలాంటి ఫోటోషూట్ సూపర్? ఫొటో షూట్...ఫొటో షూట్...పసి పిల్లల మీద కెమెరా ఫోకస్ పడకూడదని కొందరు అంటుంటారు. అలాంటిదేం లేదంటూ కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చంటి పిల్లల ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటారు. జీవితంలో కొన్ని మధురక్షణాలను కెమెరాల్లో బంధించి...ఆ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలోనూ, బిడ్డ పుట్టిన తర్వాత ఫొటోషూట్లు చేయడం కూడా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్గా మారింది. మీరు మీ పిల్లల చిన్ననాటి జ్ఞాపకార్థం ఫోటోను సేవ్ చేయాలనుకుంటున్నారా?.ఇంట్లో స్మార్ట్ఫోన్ని ఉపయోగించి సాధారణ ఫోటోషూట్ చేయండి. అవుట్డోర్ ఫోటోషూట్: మీరు రిసార్ట్ లేదా ఏదైనా పార్కుకు వెళ్లినప్పుడు మీరు ఫోటోను సులభంగా క్లిక్ చేయవచ్చు. స్టైలిష్ హెయిర్ స్టైల్, కలర్ ఫుల్ డ్రెస్, అందమైన బూట్లు ధరించండి. మీ బాబును కానీ పాపను కానీ సురక్షితమైన ప్రదేశంలో కూర్చోబెట్టి ఫొటోను క్లిక్ చేయండి. ఫాంటసీ ఫోటోషూట్: నెలల బిడ్డ అయితే, పిల్లల పక్కన సంగీత వస్తువులు లేదా ఇతర అలంకరణ వస్తువులను ఉంచవచ్చు. ఫాంటసీ ఫోటోను క్లిక్ చేయండి. ఇది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది.ఈ ఫొటో చాలా ఫన్నీగా ఉంటుంది. థీమ్ ఫోటోషూట్: ఇప్పటికే చెప్పినట్లుగా.. కూర్చోలేని పిల్లల ఫోటోషూట్ను కూడా క్లిక్ చేయవచ్చు. ఒక థీమ్ను సృష్టించండి. తదనుగుణంగా దుస్తులు ధరించండి. వివిధ ఫోటోలను క్లిక్ చేయండి. బొమ్మ ఫోటో షూట్: బహుశా ఈ ఫోటోలు పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ ఇష్టపడతారు. తనకిష్టమైన బొమ్మలతో ఆడుకుంటూ, నవ్వుతూ, అమాయకంగా కనిపిస్తూ ఫోటో క్లిక్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు? అందమైన బట్టలు ధరించండి. పిల్లవాడు ముందు ఇష్టపడే బొమ్మలు ఉంచండి. వారి ఆనందాన్ని క్లిక్ చేస్తూ ఉండండి. శ్రీ కృష్ణుడి ఫోటో షూట్: భారతీయులమైన మనకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఫోటోషూట్లలో శ్రీకృష్ణుడు ఒకటి. మగబిడ్డ అయినా, ఆడపిల్ల అయినా తల్లిదండ్రులు తమ బిడ్డలో శ్రీకృష్ణుడు, రాధల అందాలను చూడాలని కోరుకుంటారు. అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు పిల్లలందరూ శ్రీకృష్ణుడిగా వెలిగిపోతారు. ఆడపిల్ల ఫోటో షూట్: మీ ఆడబిడ్డ ఫోటోషూట్ను ఇలా సులభంగా తీసుకోండి. రంగురంగుల ఫ్రాక్ ధరించి పైనుండి క్లిక్ చేసిన ఈ ఫోటో నిజంగా అందంగా ఉంది. ఫీల్డ్లో ఫోటోషూట్: పల్లెటూరి అందం వర్ణించలేనిది. అక్కడి నిర్మలమైన వాతావరణం, పచ్చని చెట్ల అందాలు నిజంగానే అబ్బురపరుస్తాయి. ఫీల్డ్ దగ్గర మీ చిన్నారితో ఈ ఫోటోను క్లిక్ చేయండి.
తల్లులూ తస్మాత్ జాగ్రత్త..మీ పిల్లలకు ఈ ఆహారం ఇవ్వకండి! మెదడుశరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. సరైన ఆహారం మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. అందుకే చిన్నతనంలో పిల్లల అధిక పోషకాలున్న ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహారపదార్థాల పిల్లల మెదడుపై ప్రభావం చూపుతాయి. వారి ఎదుగుదలను దెబ్బతీస్తాయి. పిల్లల జ్ఞాపకశక్తిని ఏయే ఆహారాలు దెబ్బతీస్తాయో తెలుసుకుందాం. చిప్స్, పిజ్జా, బర్గర్లు: ప్యాక్ చేసిన చిప్స్, పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ ఇలాంటివి ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. ఇవి మూడ్ స్వింగ్స్, ప్రవర్తనా మార్పులతో పాటు పిల్లల్లో తలనొప్పి, హైపర్ యాక్టివిటీకి సంబంధించిన సమస్యలను పెంచుతాయి. నిత్యం వీటిని ఆహారంలో చేర్చినట్లయితే శ్రద్ధ, అభిజ్ఞా సామర్థ్యాలు క్రమంగా తగ్గుతాయి. కెఫిన్: కెఫీన్ కాఫీలో మాత్రమే ఉండదు. బదులుగా ఇది చాక్లెట్, టీ, కాఫీలలో లభిస్తుంది. నిజానికి, ఇది చాలా ప్రమాదకరమైనది. పిల్లలు రోజుకు 45 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు. అధిక కెఫిన్ ఉన్న పానీయాలు తాగడం వల్ల వణుకు, భయము, నిద్రలేమి, హైపర్యాక్టివిటీ, తలనొప్పి లేదా కడుపు నొప్పులు వస్తాయి. ఇవన్నీ వారి మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఫుడ్స్: ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం మెదడు ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఎక్కువగా వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, హైడ్రోజనేటెడ్ నూనెలతో ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో కనిపిస్తాయి. ఇటువంటి ఆహారాలు శిశువు మెదడులో వాపును పెంచుతాయి. అదనంగా, ఇది రసాయన సెరోటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావం డిప్రెషన్, మెమరీ లాస్ కు దారితీస్తుంది. స్వీట్లు: పిల్లలు స్వీట్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ స్వీట్ పిల్లల మెదడు అభివృద్ధిని దెబ్బతీస్తాయి. స్వీట్లు, ఐస్ క్రీం, కేకులు వంటి బేబీ ఫుడ్స్లో స్వీటెయినర్ ఉంటుంది. ఇది హైపర్యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది. రంగురంగుల ఆహారపదార్థాలు: మార్కెట్లో లభించే రంగురంగుల స్వీట్లు, జిలేబీలు పిల్లలను ఆకర్షిస్తుంటాయి.వీటిలో కృత్రిమ రంగులు ఉంటాయి. పిల్లలలో శ్రద్ధ లోటు హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆందోళన, హైపర్యాక్టివిటీ, తలనొప్పికి దారితీస్తాయి. తల్లిదండ్రులు ఈ ఆహారపదార్ధాలకు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వీటికి బదులుగా గుడ్లు, రంగురంగుల కూరగాయలు, చేపలు, ఓట్ మీల్, పాలు, పెరుగు, జున్ను, బీన్స్, చేపలు ఇవన్నీ కూడా పిల్లలు తరచుగా అందిస్తుండాలి. ఈ ఆహార పదార్ధాలు పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
డ్రీమ్ ఫీడింగ్.. పిల్లలు రాత్రిళ్ళు నిద్రలేవడమనే సమస్యే ఉండదు.. ఈ సృష్టిలో తల్లికావడం చాలా గొప్ప విషయం. చెప్పలేనంత అనుభూతి తల్లుల సొంతం.కొత్త తల్లి మనస్సులో శిశువుకు సంబంధించి అనేక ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. బిడ్డకు స్నానం చేయించడం నుంచి తల్లి పాలివ్వడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి గందరగోళాల మధ్య కొత్త తల్లులకు మరొక సవాల్ రాత్రిపూట ఎదురవుతుంది. రాత్రిపూట శిశువుకుపాలు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది.నవజాత శిశువులు తరచుగా రాత్రి సమయంలో మేల్కొంటారు. ఈ సమయంలో బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం, బిడ్డ నిద్రలోకి జారుకోవడం, ఆ తరువాత మరికొద్దిసేపటికే బిడ్డ మేల్కోవడం జరుగుతుంటుంది. దీనివల్ల తల్లికి నిద్రకరువవుతుంది. కానీ 'డ్రీమ్ ఫీడ్' బిడ్డకు మంచి నిద్రను ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది మంచి ఎంపిక కూడా. అసలు డ్రీమ్ ఫీడింగ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? వీటికి సమాధానం తెలుసుకుంటే ఇవి చంటి బిడ్డలున్న తల్లులకు ఎంతగానో ఉపయోగపడతాయి. డ్రీం ఫీడింగ్ అంటే ఏమిటి? డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలో బిడ్డకు పాలివ్వడం. డ్రీం ఫీడ్ సాధారణంగా రాత్రి 10 లేదా 11 గంటలకు నిద్రపోయే ముందు చేయాలి. ఇది రాత్రంతా శిశువు కడుపు నిండుగా ఉంచుతుంది. బిడ్డ చాలా కాలం పాటు ప్రశాంతంగా నిద్రించగలడు. డ్రీమ్ ఫీడింగ్ ఎలా చేయాలి? డ్రీం ఫీడింగ్ కోసం ప్రతిరోజూ ఒకే సమయంలో శిశువును నిద్రపోనివ్వాలి. ఇలా అలవాటు చేస్తే ఈ ఫీడింగ్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. అదే సమయంలో రాత్రి 10 లేదా 11 గంటలకు తల్లి పిల్లవాడిని ఎత్తకుండా, నిద్రలేపకుండా మెల్లగా పక్కన పడుకుని బిడ్డ నోటి దగ్గర తల్లి రొమ్మును సున్నితంగా అందివ్వాలి. బిడ్డ స్వయంచాలకంగా పాలు తాగడం ప్రారంభిస్తాడు.ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా ఎత్తుకునేటప్పుడు లైట్ ఆన్ చేయవద్దు, తద్వారా అది బిడ్డ నిద్రకు భంగం కలిగించదు. అంతేకాదు అవసరమనే కారణంతో డైపర్ను కూడా మార్చవద్దు. అయితే తల్లులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రీమ్ ఫీడ్ లు ఎప్పుడూ మొదటిసారే విజయవంతం కావు. కాబట్టి కొంత సమయం తీసుకోవాలి. శిశువు అలవాటు పడే వరకు డ్రీమ్ ఫీడ్ని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా సార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో పూర్తిగా పాలు తాగుతారు, ఉదయం వరకు నిద్రపోతారు. కానీ కొందరు పిల్లలు డ్రీమ్ ఫీడ్ తర్వాత కూడా చాలా సార్లు రాత్రి మేల్కొంటారు. కొన్నిసార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో మేల్కొంటారు, తర్వాత చాలా సేపు మెలకువగా ఉంటారు. ఇది సక్సెస్ కావాలంటే సమయం పడుతుంది. తల్లులు నిరాశతో దీన్ని ఆపకుండా రోజూ ప్రయత్నిస్తుంటే ఇది సక్సెస్ అవుతారు. లాభాలేంటంటే.. డ్రీమ్ ఫీడ్ తో బిడ్డ ఎక్కువ సేపు నిద్రపోతాడు. ఇది పిల్లలకు అలవాటైతే పిల్లలు ఉదయం నేరుగా మేల్కొంటారు. ఇదొక మంచి అలవాటుగా మారుతుంది. డ్రీం ఫీడింగ్ తల్లి, బిడ్డ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి తల్లులు నిరాశ పడకుండా దీన్ని అలవాటు చేయడం మంచిది. *నిశ్శబ్ద.
పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు! పిల్లల ఎదుగుదలను చూసి సంతోషించని తల్లిదండ్రులు ఉండరు. అయితే ఈ క్రమంలో తెలియకుండానే వాళ్లకి కొన్ని విషయాలలో అతిగా స్వేచ్ఛను ఇస్తుంటారు. మరికొంతమంది .. పిల్లలకు అస్సలు స్వేచ్ఛ ఇవ్వకుండా ప్రతీ విషయంలో తల్లిదండ్రులు చెప్పినట్లే చేయాలని వాళ్ల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు మన మాట లెక్కచేయకపోవడం లేదా అతి క్రమశిక్షణ వలన యాక్టివ్గా లేకపోవడం వంటి దుష్ప్రభవాలు కలిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల వలన పిల్లలు కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల మాట లెక్కచేయడం మానేసి వారికి నచ్చినరీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూడా మనతో షేర్ చేసుకోవడం తగ్గించి వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకొని పెడదారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే పిల్లలను ఎలా పెంచాలో అనే విషయం గురించి తెలుసుకుందాం. 1. చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రేరణను మనం అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్రతీ విషయానికి వాళ్ల మీద చిరాకు పడడం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహదపడుతుంది. 2. పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. చిన్నతనం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయకూడదు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్సహించాలి. అందువలన వారు అందరితో కలివిడిగా ఉంటూ స్నేహపూరిత వాతావరణాన్ని అలవాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాలనే ఆశయంతో పాటు ఇతరులకు సహాయపడాలనే తపన కూడా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. 3. కొన్ని సందర్భాల్లో తెలియకుండానే పిల్లలపై కోపాన్ని చూపిస్తాం . ఉదాహరణకు వారు మన కళ్ల ముందే ఏదైనా గోడ ఎక్కడం లేదా ప్రమాదకర వస్తువులతో ఆడుకోవడం వంటివి చేసినప్పుడు పట్టరాని కోపం వస్తుంది. అయితే ఇలాంటి సందర్భాలలో మనం కొంచెం నిగ్రహంగా ఉంటూ వారిని దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. దాని వలన జరిగే అనర్ధాలను వారికి వివరించాలి. మనం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా తయారయ్యే ప్రమాదం ఉంది. వారి అలవాటును మనం వ్యతిరేకించడం వారు సహించలేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మచ్చిక చేసుకోవాలి. 4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి .. 5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.
బిడ్డలకు తల్లిపాలే అమృతమని ఇందుకే అన్నారు.. సరైన పోషకాహారం పిల్లల మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. నవజాత శిశువుకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ పోషకాలన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డకు తల్లిపాలు అమృతసమానమన్నారు పెద్దల నుండి వైద్యుల వరకు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి చిక్కటి పసుపు పాలు పిల్లల ఆరోగ్యానికి అమృతంలానే పనిచేస్తాయి. వీటిని ముర్రుపాలు అని అంటారు. ప్రసవించిన తరువాత గంటలోపు పిల్లలకు ముర్రుపాలు పడితే అవి పిల్లల శారీరక, మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కేవలం ముర్రుపాలు మాత్రమేకాదు. పిల్లలకు రోజువారీ తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టం. తగినంత పరిమాణంలో తల్లిపాలు ఉండేలా చూసుకోవడం ప్రసవించిన ప్రతి మహిళకూ అవసరమని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలివ్వడం గురించి పక్కన పెడితే బిడ్డను మోసి కనడంతో తమ అందం చెదిరిపోతుందనే అపోహలో చాలామంది మహిళలున్నారు. కానీ బిడ్డను మోసి కనడంలో ఉన్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రసవం తరువాత కూడా తల్లి పాలివ్వడంలో ఆలోచించే మహిళలు చాలామంది ఉంటున్నారు. అందుకే తల్లిపాలివ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, బిడ్డలకు తల్లిపాలు ఇచ్చేలా ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. పుట్టిన ఆరు నెలల వరకు నవజాత శిశువుకు రోజూ తల్లిపాలు అందేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో ఉండే సూక్ష్మపోషకాలు నవజాత శిశువుల మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు కూడా వెల్లడించాయి. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలు.. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడానికి కొన్ని పరిశోధనల్లో ప్రయత్నించారు. బాల్యంలో తల్లి పాలివ్వడం ద్వారా పొందిన సూక్ష్మపోషకాలు వృద్ధాప్యంతో మెదడు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పకుండా తల్లిపాలు తాగే పిల్లలు తల్లిపాలు లేని పిల్లల కంటే ఎక్కువ మేధో అభివృద్ధి, పనితీరును కలిగి ఉంటారు. బ్రెయిన్ డెవలప్మెంట్లో ప్రయోజనాలు.. పిల్లలకు తల్లిపాలివ్వడం ప్రారంభించిన మొదటి నెలలలో మైయో-ఇనోసిటాల్ అనే సూక్ష్మపోషకం తల్లిపాలలో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది, ఇది మెదడులోని న్యూరాన్ల మధ్య సినాప్సెస్ లేదా కనెక్షన్లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా, భవిష్యత్తులో నరాల సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడంలో మెరుగ్గా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే.. మొదటి నెలల్లో పిల్లల మెదడు ముఖ్యంగా ఆహార లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మపోషకాలు మెదడుపై ఎలా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనేది విషయం పట్ల న్యూరో సైంటిస్ట్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాలలో ఇంత గొప్ప పోషకాలు ఎలా ఉంటున్నాయనేదాని మీద కూడా వీరు ఏ నిర్ణయాన్నిస్పష్టంగా చెప్పలేకున్నారు. కానీ తల్లిపాలు బిడ్డ మెదడు అభివృద్ధిలో వివిధ దశలకు కూడా సహాయం చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనప్పటికీ 6నెలల లోపు పిల్లలకు తల్లిపాలకు మించిన గొప్పఆహారం దొరకదనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రసవించిన స్త్రీకి సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డల ఆరోగ్య భవిష్యత్తుకు వరం. *నిశ్శబ్ద.
చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!! చలికాలం అంటే అందరికీ వణుకు పుడుతుంది. ఈ కాలంలో జబ్బుల సమస్యలు కూడా ఎక్కువే. కేవలం చలి మనల్ని వణికిస్తుందనే మాట అటుంచితే చలి వల్ల చర్మం దెబ్బతింటుంది, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి, దానికి అనుబంధంగా వచ్చే సమస్యలు బోలెడు. పెద్దవాళ్లే ఈ సమస్యకు కుదేలైపోతారు. అలాంటిది ఎంతో సున్నితమైన చర్మం, మరెంతో తక్కువ ఇమ్యూనిటీ కలిగిన చిన్న పిల్లల మాటేమిటి?? వారికి స్వేట్టర్లు వేసి రక్షణ ఇవ్వడం నుండి తినడానికి ఇచ్చే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ సవాల్ విసిరేదిగా ఉంటాయి. అయితే చలికాలంలో చిన్నపిల్లల సంరక్షణ పెద్ద సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే అంటున్నారు పిల్లల వైద్యులు. పిల్లల కోసం పెద్దలకు కొన్ని చిట్కాలు.. పైన చెప్పుకున్నట్టు పెద్దల కంటే పిల్లల చర్మం సున్నితత్వం ఎక్కువ. కాబట్టి కాస్త చలిగాలి సోకినా చాలా తొందరగా ప్రభావం అవుతుంది. అంతేనా చర్మం పగుళ్లు వచ్చి మంట పుడుతుంది. వాటికి ఏమి చేయాలో తెలియని పసితనం పిల్లలది. చలికి దురద పెడితే బాగా గోకేస్తుంటారు. ఆ తరువాత అది కాస్తా మంట పుట్టి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అందుకే పిల్లలకు రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ రాయాలి. చర్మం ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోతారు కాబట్టి చర్మం కొలుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగని ఉదయం రాయకూడదని కాదు. రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ ప్రభావవంతంగా పని చేస్తుంది. పిల్లల కోసం ఎంచుకునే మాశ్చరైజర్ క్రీములు ఎప్పుడూ సహజత్వంతో నిండినవై ఉండాలి. ఎక్కువ ఘూఢత ఉన్నవి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినవి, కృత్రిమ రంగులతో నిండినవి అసలు ఎంచుకోకూడదు. ఇక పిల్లలకు తరచుగా ఎక్కువ ఎదురయ్యే సమస్య పెదవులు పగలడం, అలాగే పెదవుల మూలల్లో చీలడం. ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టమవుతుంది. ఏమైనా తినడానికి పెదవులు తెరచినప్పుడు మూలలు సాగి చీలిన ప్రాంతంలో రక్తస్రావం కావడం జరుగుతుంది. దీనికి చక్కని సొల్యూషన్ పెట్రోలియం జెల్లీ. వైట్ పెట్రోలియం జెల్లీలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇవ్వదు. కాబట్టి పెట్రోలియం జెల్లీని గంటకు ఒకమారు రాస్తూ ఉంటే ఒకరోజులోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక తరువాత ఈ సమస్య రాకూడదంటే డైలీ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. పిల్లలకు సాధారణంగానే చిరాకు తెప్పించే విషయం డైపర్. పెద్దలకు సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు బట్టలను పాడు చేయకుండా ఉంటారనే కారణంతో డైపర్లు వాడుతున్నారు ఈ కాలంలో. అయితే వాటిని అపుడపుడు చెక్ చేస్తుండాలి. లేకపోతే డైపర్ల వల్ల పిల్లలకు రాషెస్ వచ్చి చర్మం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చల్ల నీళ్లు, చల్లని ఆహారం, ఐస్ క్రీమ్స్, కేక్స్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదు. ఎక్కువ సమయం స్నానం చేయించడం, స్నానం సమయంలో శరీరాన్ని పదే పదే రుద్దడం చేయకూడదు. అలాగే చలి కాలం కదా అని స్నానానికి మరీ వేడినీళ్లు ఉపయోగించకూడదు. స్నానం తరువాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి, తరువాత మాశ్చరైజర్ రాయాలి. వేసే దుస్తులు వెచ్చదనాన్ని ఇచ్చేలా కాస్త వదులుగా ఉండాలి. చలి అనే నెపంతో బిగుతు దుస్తులు వేయకూడదు. ఉన్ని దుస్తులు వేయడం మంచిది. పిల్లలకు చర్మ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె లాంటి సహజ మార్గాలతో తగ్గకపోతే ఇతర సొంతవైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ◆నిశ్శబ్ద.
Homemade Fruit Pops for Kids ! The hotter months bring along a variety of fruits and thirst too. Cooling off should not be damaging the health. Instead of using store bought sugary drinks or icecreams, Fruit Pops can be made at home....we dont need bulky Ice Molds....even if we have simple Ice cube trays at home, just blend in some ripe fruit and pour into the molds, pop into the freezer and Wallah...they are ready!! I always have these ready in my freezer, just to keep my child happy. Why should she feel bad that she isn't getting treats, or why should i give her those store bought sugar filled cold calories?! Infact, my homemade icepops are interesting to pop into the mouth for adults too....make a cold fruit salad with a variety of ripe fruits, or just drop a few of these colorful ones into a glass of plain water for the guests on a summer afternoon, or keep the kids busy trying to finish their icepops.... Almost every grocery store is selling BPA free, Silicon icecube trays and Small Muffin trays and Icepop molds. Crayola's products are interesting and safe. Making these fruit pops can be a fun kitchen project for the kids, give them this job and they will love it, both Making and Slurping ! They will learn a new job and also gulp those fruits they usually avoid eating. Let the fun be safe and healthy with these homemade Fruit pops!! - Prathyusha Tallari
పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి! చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మొదట్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఆ తరువాత పిల్లలు ప్రశ్నల పుట్టలు అవుతారు. వారు ఇంట్లో ఉంటే ప్రతి విషయం గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది?? ఇది ఎలా ఉంది?? అదేంటి?? ఇది ఎందుకు ఇలా ఉంది?? వంటి ప్రశ్నలు పిల్లల నుండి వస్తూనే ఉంటాయి. చాలామంది ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నప్పుడు "పెద్ధయ్యే కొద్ది నీకు అర్థమవుతాయి లే" అని తోసిపుచ్చుతారు. కానీ వారు అడిగిన వెంటనే ఆ ప్రశ్నలను పరిష్కరిస్తే వారి మనసు, వారి ఆలోచన ఎంతో చురుగ్గా మారుతాయి. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ అనిచివేయకుడదు. పనులు అప్పగించాలి.. పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు బయటకు తీయడం, వండుతున్న పదార్థానికి కావలసిన దినుసులు అందించమనడం. ఈ పనులు చేసేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అనే భయం కూడా ఉండదు. కొత్తగా ఉండాలి.. పిల్లలకు చేసిన పని మళ్లీ చేయాలంటే విసుగు వస్తుంది, వారు తొందరగా ఆసక్తిగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ మెదడు పదునెక్కాలంటే వాళ్లకు అప్పగించే పనులు కొత్తగా ఉండాలి. పాత పని పిల్లలకు నచ్చితే వాళ్ళే దానివైపు వెళతారు. భాగమవ్వాలి… పిల్లలతో తల్లిదండ్రులు భాగమైనప్పుడు పిల్లలు మరింత చురుగ్గా, ఆసక్తిగా పనులు చేస్తారు. వీలైనవరకు పెద్దలు పిల్లతో కలసి పనులు చేయాలి. ప్రకృతికి దగ్గరగా.. పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి మెదడు అంతగా ఎదగదు. ప్రకృతికి దగ్గరగా ఉన్నపుడే వారి మెదడు ఉత్సాహంగా మారుతుంది. చెట్టు, చేమ, కొండలు, నీరు ఇవి మాత్రమే కాకుండా దేవాలయాలు, మ్యూజియం, పురాణ కథలు.. ఇలా ఎన్నో పిల్లల మెదళ్ళలో పాదరసంలా మారుతాయి. కాబట్టి పిల్లలు చురుగ్గా . వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకుని ఫాలో కావాలి. *నిశ్శబ్ద.
సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు. సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు. ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది. పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్ని, మూన్ని, సన్ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు. ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి. ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు. అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు. ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ! -రమ
పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు! బరువు పెరగలన్నా, తగ్గాలన్నా, ఆహారాన్ని నియంత్రించుకోవలన్నా, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ప్రతిదానికి ఓ డైట్ ప్లాన్, ఓ సమయ పాలన ఉంటుంది. కానీ ఎత్తు పెరగడమనే విషయంలోకి వస్తే.. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎత్తు పెరగడం అనేది చిన్నతనం నుండి ఓ దశలోకి వచ్చి ఆగిపోతుంది. ఓ దశాబ్ద కాలాన్ని సరిగ్గా గమనిస్తే పిల్లలు తగినంత ఎత్తు పెరగడం లేదనే వాస్తవం అర్థం అవుతుంది. పిల్లలు పెరగాల్సిన వయసులో వారు ఎత్తు పెరగడానికి తగిన వాతావరణం, తగిన ఆహారం లభించకపోవడమే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం అవుతుంది. పిల్లల ఎత్తును పెంచడానికి ఉత్తమ మార్గం తెలుసుకుంటే ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దాన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు... సాధారణంగా పిల్లలఎత్తు ప్రధానంగా జన్యువులతో నిర్ణయించబడుతుంది. అయితే, జీవనశైలి సరైన జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా వరకు సహాయం చేస్తుంది. ఆటలు ముఖ్యం.. పిల్లల్ని స్కూళ్ళు, ట్యూషన్లతో ఎప్పుడూ కట్టేసినట్టు ఉంచకండి. రోజులో కొంతసేపు కింది ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు, ఈత, బాస్కెట్బాల్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి. ఆహారంలో తగినంత ప్రోటీన్ చేర్చడం మరీ ముఖ్యం. సరైన స్థాయిలో కాల్షియం, విటమిన్ డి పిల్లలకు అందించడం మరెంతో ముఖ్యం. పొడవాటి ఎముకలలోని ఎపిఫైసెస్ (గ్రోత్ ప్లేట్లు) ఫ్యూజన్ కౌమారదశలో వస్తాయి. ఈ గ్రోత్ ప్లేట్లు ఫ్యూజ్ అయిన తర్వాత, నిలువు ఎముక పెరుగుదల ఆగిపోతుంది. అంటే తరువాత ఎత్తు పెరగదు. అబ్బాయిలకు సగటున 16-18 ఏళ్లు, బాలికలకు 14-15 ఏళ్లు సమయం ఎత్తు పెరుగుదలకు చివరి దశ. ఈ సమయంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి మందగించి ఎపిఫైసెస్ ఫ్యూజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి, ఇవి సరైన ఎత్తుకు చేరుకోవడంలో సహాయపడతాయి. వీటిలో పైన చెప్పుకున్నట్టు ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి. ఆటలు ఆడటం తప్పనిసరి. ముఖ్యంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్ వంటి ఎముకల పొడవును ప్రేరేపించే ఆటలు ఆడించాలి. పొడవు పెరగాల్సిన దశ దాటిపోయాక ఎన్ని ప్రయోగాలు చేసినా పొడవు ఒరేగడం కుదరదు. ఈ విషయన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా పిల్లలజీవనశైలిలో ఆహారంలో తెలియని మార్పులు చేసే ముందు ప్రతి తల్లి వైద్యులను సంప్రదించిన తరువాతే వాటిని పాటించాలి. ◆నిశ్శబ్ద.
పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్ వంటివి చేతిలో పెట్టి వారిని కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది. ◆నిశ్శబ్ద.
పిల్లలు అలగడం నేర్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా! మీ ఇంట్లో పిల్లలు ప్రతివిషయానికీ అలుగుతున్నారా? తిండి మానేసి మరీ తమ అలకను ప్రదర్శిస్తున్నారా? అలక పోగొట్టడానికి మీరు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించడం లేదా? అయితే ఇది చదవడానికి సరైన వ్యక్తి మీరే! 'అసలు 'అలుక' అనే మాట అతి పురాతనమైంది. పురాణకాలం నుంచి వినిపిస్తోంది. సత్యభామ అలిగినప్పుడు శ్రీకృష్ణుడు బుజ్జగించిన విధం పురాణ గాథల్లో చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రామాయణ, భారత, భాగవతాల్లో దేవతలు అలిగిన సందర్భాలు మనకు చాలా కనిపిస్తాయి. ఆ తర్వాత కాలంలో అలక ప్రదర్శించే వారికి ప్రత్యేక అలక పాన్పులు ఏర్పాటు చేయడం కూడా మనం విన్నాం. అంతేనా!.... పదవులు రాకపోతే రాజకీయ నాయకులు , అత్తగారు కోర్కెలు తీర్చలేదని అల్లుళ్ళు, అవసరాలు తీరకపోతే భార్య, భర్త మీద.. ఇలా అలకలు చాలానే ఉన్నాయి. అసలెవరైనా ఎందుకు అలుగుతారు? అని ఆలోచిస్తే వారి అలక తీరాలంటే వారు కోరే గొంతెమ్మ కోర్కెలు తీరడమే మార్గమా అన్న ఆలోచన కూడా రాకమానదు. తమకు ఇవ్వవలసిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పడానికే మాటలు లేకుండానే 'అలక'ను వ్యక్తీకరిస్తారు. వీరు అలిగారు అని ఎవరైనా గుర్తించేలా ఉంటుంది వారి ప్రవర్తన. ఈ ప్రవర్తన ద్వారా అవతలి వారు, అసంకల్పితంగానే అలిగిన వారికి అనుగుణంగా నడుచుకోవాలన్నది అలిగిన వారి ప్రధాన ఉద్దేశం. నిజం చెప్పాలంటే ఈ అలుకకు వయస్సు, స్థాయి, స్థానం, కులం, మతాలతో సంబంధమే లేదు. సమయాన్ని, సందర్భాన్ని, అనుకూలతను బట్టి ఎవరైనా అలగవచ్చు. మన జీవన విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎదుటి వారి దృష్టిని ఆకర్షించడానికి 'అలకనే ఎందుకు ఆయుధంగా ఉపయోగించుకుంటారన్నది బోధపడుతుంది. కైకేయి అలకే శ్రీరాముణ్ణి నిర్దాక్షిణ్యంగా అడవులకు పంపేలా దశరథుణ్ణి ప్రోత్సహించింది. దక్షయజ్ఞంలో పార్వతి తన తండ్రిపై అలిగి వెళ్ళిన తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే. తమ పిల్లలు, ఇంకా పసిపిల్లలుగా ఉన్నప్పుడే ఏదైనా విషయానికి అలిగితే ప్రతి తల్లీ నంబరపడి, మురిసిపోతుంది. "అబ్బో వేలెడంత లేదు ఇప్పుడే అలక చూశారా!.. చూశారా! ఎంత చక్కగా అలుగుతున్నాడో” అని ముద్దు చేస్తుంది. కోరింది ఇస్తుంది. అంతే అది చాలు తమకేం కావాలన్నా ఎలా సాధించాలో తెలుసుకోవడానికి కాస్త పెద్దవగానే అలిగి అన్నం మానేస్తారు. అంతే తల్లి మనసు గిలగిల్లాడుతుంది. ఓ పదిసార్లు అలక గురించి వాకబు చేస్తుంది. అన్నం మీద అలగొద్దు. నీకేం కావాలో అదిస్తానే... అని బుజ్జగిస్తుంది. పిల్లవానికి కావాల్సింది అందుతుంది. అప్పటి నుంచి అది జీవితంలో నిరూపించబడిన సత్యంలా గోచరించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలగొచ్చు అన్న సిద్ధాంతాన్ని పాటించడం మొదలెడతారు. ఈ అలక కూడా వారితో పాటు పెరిగి పెద్దదై కేవలం ఇంట్లో వాళ్లతోనే కాకుండా ఆఫీసులో, అత్తవారింట్లో, స్నేహితుల వద్ద, దగ్గరివాళ్ల వద్ద ఇలా తమ అలకను ప్రదర్శిస్తుంటారు. ఈ అలక వల్ల కొంత వరకూ తమ కోరికలు నెరవేరినా, కాస్త చులకన అయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రతీ విషయానికీ అలిగే వారి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి. ఆత్మ విశ్వాసం తక్కువ ఉంటుంది. ఇతరులపై ఆధారపడే మనస్తత్త్వం. తమ నైపుణ్యంతో కాకుండా, ఇతర మార్గాల ద్వారా ఎదుటి వారి దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేయడం. అనువుగాని చోట అధికులుగా గుర్తింపబడాలనే తపన. ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించగలిగే పరిజ్ఞానం లేకపోవడం. స్వయం శక్తి మీద అపనమ్మకం. జరుగుబాటు లేకపోతే అసంతృప్తితో జీవించడం. మార్పును ఆహ్వానించే హృదయం లేకపోవడం. తన మాట, ప్రవర్తనే సరైనదన్న మొండి నమ్మకం. ప్రతి విషయానికీ అలిగే వారు 'తుమ్మితే - ఊడిపోయే...! ముక్కు చందాన ఎదుటివాళ్ళను భయపెట్టే అలవాటు కూడా నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలు అలిగితే మురిసిపోకుండా వారి ప్రవర్తన తప్పుదారిలో వెళ్లకుండా తల్లిదండ్రులే జాగ్రత్త పడాలి. ◆నిశ్శబ్ద.
పిల్లలకు వాంతులు అవుతుంటే ఏమి చెయ్యాలి? చాలా మంది తల్లులు పిల్లలకు వాంతులు అవుతున్నాయని చెప్పడం వింటూ ఉంటాం. అయితే.. ఎక్కువసార్లు, వెంటవెంటనే వాంతులు అయితే బిడ్డ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టుగా గ్రహించాలి. బిడ్డకు వాంతులు అరికట్టే ప్రయత్నంలో సొంతవైద్యం చేయడం మరింత ప్రమాదకరం. బిడ్డ వాంతులు చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిడ్డ జీర్ణవ్యవస్థలో ఏదైనా సమస్య ఏర్పడి వాంతులు అవుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఈ విషయంలో ఆలస్యం చేయడం ప్రమాదకరం. కొందరు పిల్లలు అసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు వాంతి చేసుకుంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తరువాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారీ కావచ్చు. లేదా రోజులోనో, వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకొన్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5,6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బిడ్డ వాంతి చేసుకున్న వెంటనే ఏం చేయాలి ? బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందొళనపడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తుండాలి. సంవత్సరం లోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచినీటిని తాగించాలి. 'వెంటనే' పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వడం సరికాదు. 2,3 నిమిషాలు వేచి చూడాలి. బిడ్డ కడుపు ఖాళీ అయివుంటే, వెంటనే ఏడ్వడం ప్రారంభం అవుతుంది. ఆ సమయం పాలు ఇవ్వడానికి అనువైనది. బిడ్డ సాధారణ స్థాయిలో పాలుతాగుతూ ఉన్నప్పుడు, బిడ్డ శరీర ఉష్ణోగ్రత సరిగా ఉన్నప్పుడు వాంతి చేసుకున్నా ఫరవాలేదు. కానీ పాలుతాగడం మానేసి వాంతి చేసుకుని, శరీరం ఉష్ణోగ్రత తగ్గితే మాత్రం తక్షణం డాక్టర్ను సంప్రదించాల్సిందే. బిడ్డ జబ్బు పడ్డాడు అనడానికి ఇవన్నీ లక్షణాలుగా గుర్తించాలి. అయితే కొన్ని సార్లు బిడ్డ కడుపులో ఆమ్లాలు ఏర్పడతాయి. అవి తాగిన పాలతో కలవడం వల్ల కూడా బిడ్డ వాంతి చేసుకునే అవకాశం ఉంది. మరికొన్ని సార్లు తాగిన పాలు, తీసుకున్న ఆహారం సాఫీగా వెళ్ళడంలో కొన్ని అవరోధాలు ఏర్పడతాయి. అలాంటి సందర్భంలో తీసుకున్న మొత్తం ఆహారం, పాలు వాంతి అవుతాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకసారిజరిగితే ఫరవాలేదు. అది కూడా వాంతి వల్ల బిడ్డ ఏ విధమైన నీరసానికి లోను కానంత వరకు తల్లులు కంగారు పడనవసరం లేదు. గమనిక: వైద్యులు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే ఈ సమాచారం రాయడబడింది. పిల్లల విషయంలో వైద్యుల సలహాలు చాలా ముఖ్యం. ◆నిశ్శబ్ద.
మీ ఇంట్లోనే సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది అమ్మలకి పెద్ద ఛాలెంజ్. ఎండలు మండిపోతుంటే బయటకి వెళ్ళి ఆడతాం అంటారు. లేదా అస్తమానం టీవీ చూస్తామంటారు... అంటూ కంప్లయింట్ చేసే అమ్మకి మంచి ఆప్షన్స్ తెలిస్తే బావుంటుంది కదా. మా అపార్ట్మెంట్లో 10 ఫ్లాట్స్ వున్నాయి. సో, సమ్మర్ రాగానే అన్ని ఫ్లాట్స్లోని పిల్లల్ని ఓచోట చేర్చి, వాల్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? ఏమేమి నేర్పించాలి అన్నది ముందే నిర్ణయించేస్తారు. సో ఇక హాలిడేస్ మొదలవగానే మా అపార్ట్మెంట్లో హడావిడి మొదలవుతుంది. మా పై ఫ్లోర్లో అరుణ దగ్గర పిల్లల బుక్స్ మంచి కలెక్షన్ వుంది. సో, తను వాళ్ళ పిల్లల రూమ్లో రెండు రాక్లు పెట్టి దానినిండా ఆ పుస్తకాలు సర్దిపెడుతుంది. ఓ లైబ్రరీలా చేసి, పిల్లలు అక్కడకి వచ్చి రీడింగ్ టైమ్ని స్పెండ్ చేసేలా చూస్తారు అరుణ. అలాగే పిల్లలు కొన్ని బుక్స్ ఇళ్ళకి తీసుకెళ్ళవచ్చు. అలాగే అక్కడే స్టోరీ అవర్ అని పిల్లలు ఒక్కొక్కరు తాము చదివిన పుస్తకాల్లోని కథలని మిగతా పిల్లలకి చెప్పాలి. దాని వలన పిల్లలు తాము తెలుసుకున్న విషయాలని అంతే చక్కగా అందరితో చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే పిల్లలందరూ కలసి ఓచోట చేరి ఆ పుస్తకాలలోని విషయాలపై చర్చించుకుంటారు. అలాగే వాళ్ళని స్వంతగా కథలు రాసేలా ప్రోత్సహిస్తారు. ఇక పిల్లలకి కొత్తకొత్త ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలని పరిచయం చేయడం మా థర్డ్ ఫ్లోర్లో శారద డ్యూటీ. ఆమె ఈ నెలరోజుల్లో పిల్లలతో రకరకాల సంప్రదాయాలని ప్రతిబింబించేలా డ్రస్సు చేయించడం, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు ఇవన్నీ మా శారదగారు ఎంతో ఇష్టంగా చేస్తారు. ఎవరికి వారు వాళ్ళవాళ్ళ పిల్లల్ని ఒక్కరినే హ్యాండిల్ చేయడానికి ఎంత సమయం, సహనం కావాలో మరికొంతమంది పిల్లల్ని కూడా కలిపి వాళ్ళందరినీ చూడటానికి అంతే సమయం పడుతుంది. పైగా పిల్లలందరూ ఓచోట చేరితో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. మా ఫస్ట్ ఫ్లోర్లో వుండే అనిత పిల్లలందరికీ డ్రాయింగ్, కుట్లు, అల్లికలు నేర్పిస్తారు. వాళ్ళ అత్తగారు సాయంత్రం అవగానే పిల్లలందర్నీ ఓచోట చేర్చి వాళ్ళకి తెలుగు పద్యాలు, పాటలు, స్తోత్రాల వంటివి నేర్పిస్తారు. ఇక ఈ హాలిడేస్లో పిల్లలకి ప్రతిరోజూ ఓ పిక్నిక్కే. ఎందుకంటే ప్రతీరోజు మధ్యాహ్నం లంచ్ ఎవరో ఒకరింట్లో వుంటుంది. పిల్లలకి నచ్చిన ఐటమ్స్ చేసి అందరినీ కలిపి బఫే పెడితే కబుర్లు, ఆటపాటలతో హాయిగా బొజ్జనిండా తింటారు పిల్లలు. ఇక పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళడం గురించి చెప్పాలంటే సాయంత్రం అవగానే పిల్లల్ని వాళ్ళ ఫాదర్స్ ఆఫీసు నుంచి రాగానే దగ్గర్లోని పార్క్కి తీసుకువెళతారు. అలాగే ఆదవారాలలలో దగ్గర్లోని ప్లేసెస్కి పిక్నిక్- ఇలా ఈ నెలరోజులు ప్రతి పిల్లాడూ అపార్ట్మెంట్లోని మిగతా పిల్లలతోపాటు పెద్దవాళ్ళతో కూడా కలవటం, మాట్లాడటం చేస్తాడు. సో, సోషలైజేషన్ అలవాటయిపోతుంది వీళ్ళకి. అందరూ కలసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ముఖ్యంగా 24 గంటలూ పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్న భయం వుండదు. ఎందుకంటే ఒకోరోజు ఒకరు. అలాగే రోజు మొత్తంలో ఒకో సమయంలో ఒకోరు పిల్లల బాధ్యత తీసుకుంటారు కాబట్టి మిగతావాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది. పిల్లలకి ఈ హాలిడేస్ జాలీడేస్లా అనిపించాలన్నా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలన్నా, ఎన్నో లైఫ్ స్కిల్స్ని నేర్చుకోవాలన్నా ఇలా ఓ గ్రూప్గా చేరడం ఎంతో ముఖ్యం. సో, మీ ఇంట్లో పిల్లలకి మీరే ఓ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. ఆలోచించండి.. -రమ
తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వాల్సింది ఏంటి? "చిన్నపిల్లల ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళ చిన్న ప్రపంచం వారికి ఎంతో ఆనందమైనది, అద్భుతమైంది. తల్లితండ్రులు పిల్లల ప్రపంచంలో అడుగు పెట్టి వారి అనుభూతులను పంచుకొని వారిలో ఒకరిలా కలిసిపోవాలి. అలా పిల్లలను మెల్లమెల్లగా వారి చిన్న ప్రపంచం నుండి మన ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి" అంటారు విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్. ప్రతీ తల్లితండ్రి తమ పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆశించడం సహజం. కానీ పిల్లల శక్తి సామర్థ్యాలను అంచనా వేయకుండా ఆశల ఒరవడిలో కొట్టుకుపోయి వారిని ఒత్తిడికి గురిచేయడం సమంజసం కాదు. సాధారణంగా తల్లితండ్రుల్లో మూడు రకాల మనస్తత్వాలవారు ఉంటారు. మొదటి కోవకు చెందినవారు - మనం ఎలాగూ కష్టపడ్డాం కదా! పిల్లలైనా సుఖంగా ఉండాలని వారు అడిగినవన్నీ సమకూర్చే తల్లితండ్రులు. రెండవ కోవకు చెందినవారు తాము ఎంతో క్రమశిక్షణతో పెరిగామని భావించి, పిల్లల పట్ల క్రమశిక్షణ పేరుతో కఠినమైన ఆంక్షల్ని విధించే తల్లితండ్రులు. ఇలా ఒకరు 'అతివృష్టి'కి మరొకరు 'అనావృష్టికి' తార్కాణాలుగా నిలిచే రెండు రకాల మనస్తత్వాలు గల తల్లితండ్రులు. ఇక మూడవ కోవకు చెందిన తల్లితండ్రులు - తమ పిల్లలు వారిలాగే మూస పోసినట్లుగా ఉండాలని ఆశించే తల్లితండ్రులు. ఈ కోవకు చెందినవారు చాలా ప్రమాదకరమైనవారు, అత్యాశాపరులు అని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ తెలివైన విద్యార్థి గణితంలో ఎప్పుడూ 90 మార్కులకు పైనే సాధించేవాడు. కానీ హఠాత్తుగా ఆ విద్యార్థికి గణితంలో 0 మార్కులు వచ్చాయి. అందుకు కారణం విచారించగా ఆ విద్యార్థి తల్లి 'నీకు గణితంలో నూటికి నూరు మార్కులు రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను' అని బెదిరించిందని తెలిసింది. దానితో ఒత్తిడికి గురైన ఆ విద్యార్థి పరీక్షలు రాయలేకపోయాడు. ఆ విద్యార్థి తల్లి గణిత శాస్త్రంలో స్వర్ణపతకం సాధించిన మేధావి. తనలాగే తన కుమారుడు కూడా గణితంలో స్వర్ణపతకం సాధించాలనే ఆమె అత్యాశ ఆ విద్యార్థి మతిస్థిమితం కోల్పోయే స్థితికి దిగజార్చింది. తల్లితండ్రులు అతివృష్టి, అనావృష్టి, అత్యాశ - ఈ 'అ'త్రయం బారిన పడకుండా పరిపక్వతతో వ్యవహరించాలి. అందుకు ఈ సూచనలను పాటించండి. 1. పిల్లలను ఇతరులతో పోల్చకుండా ఉండడం. 2. పిల్లల తెలివితేటలను అంచనావేయడం. 3. పిల్లల అభిరుచులను అవగాహన చేసుకోవడం. 4. ఇంట్లో చదువుకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం. 5. పిల్లలతో సన్నిహితంగా స్నేహితునిలా మెలగడం. 6. పిల్లల్లో ఒత్తిడి పారద్రోలే ఓదార్పును ఇవ్వడం. 7. అసహనాన్ని చూపకుండా వారు చెప్పిన విషయాన్ని వినడం. 8. పిల్లలను అవమానించకుండా వారిని అభినందించడం. 9. పిల్లల్లో అభద్రతాభావం కలగకుండా శ్రద్ధ వహించడం. 10. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే సంఘటనలను వివరించడం. మూడు స్థాయిల్లో ఉన్న విద్యార్థులకు మనం అందించాల్సిన విషయాలు వేరుగా ఉంటాయి. విద్యార్థుల స్థాయిని బట్టి కొన్ని అవసరం, మరికొన్ని అనవసరం అవుతాయి.. తెలివైన విద్యార్థి కి మార్గదర్శకత్వం అందిస్తే చాలు.. సాధారణ విద్యార్థి కి మార్గదర్శకత్వంతో పాటు ఆప్యాయత కూడా అవసరం అవుతుంది. అతిసాధారణ విద్యార్థి: మార్గదర్శకత్వం, ఆప్యాయతతో పాటు నువ్వు సాధించగలవు అనే ఆత్మవిశ్వాసం అందించాలి. ఈ సూచనల్ని పాటించిననాడు 'I have found the hap- piness of parenthood greater than any other that I have experienced. - పిల్లల పెంపకంలో ఉన్న మాధుర్యం కన్నా మించినది మరొకటి లేదు' అన్న బెర్ట్రాండ్ రస్సెల్ అనుభవం నిజమవుతుంది. ఆ ఆనందానుభూతితో పిల్లల్ని ఆదరించి, వారి శక్తిసామర్థ్యాలను అర్థం చేసుకున్ననాడు వారిని ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చు. ◆నిశ్శబ్ద.
ఇన్ఫ్లుఎంజా వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి? ప్రస్తుత కాలంలో ఇన్ఫ్లుఎంజా-ఎ వైరస్ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఒడిశా, ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లోనో, రాష్ట్రాల్లో వైరల్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. ఇన్ఫ్లుఎంజా రూపాంతరం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది, సోకిన వారిలో కొందరు ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం. ఆరోగ్య నిపుణులు కూడా దీనిని తీవ్రమైన వ్యాధిగా.. ప్రాణాంతకమైన సమస్యగా పరిగణిస్తున్నారు. పెరుగుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలి నివేదికలలో, ఆరోగ్య నిపుణులు H3N2 ప్రభావం గరిష్టంగా పిల్లలలో కనిపిస్తోందని చెప్పారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా తీవ్రమైన వ్యాధితో ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. విచారించాల్సిన విషయమేమిటంటే.. H3N2తో పాటు, అనేక రాష్ట్రాలలో H1N1 కేసుల పెరుగుదల కొనసాగడం. దేశంలో పెరుగుతున్న వైరల్ ఇన్ఫెక్షన్ను నివారించడానికి ఆరోగ్య నిపుణులు పిల్లల కోసం ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు. ఇదెప్పుడు తగ్గుతుంది? హెచ్3ఎన్2తో సహా సీజనల్ ఇన్ఫ్లుఎంజా ద్వారా వచ్చే వ్యాధులు మార్చి నెలాఖరు నుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో పేర్కొంది. అయితే అప్పటి వరకు దీనిని నివారించేందుకు ప్రజలంతా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం, దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కూడా నమోదవుతున్నాయి, వీటిలో చాలా లక్షణాలు H3N2 మాదిరిగానే ఉండటం కాస్త గందరగోళ పరిచే విషయం. H3N2 ప్రభావం పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పిల్లలలో అధిక జ్వరంతో పాటు ముక్కు కారటం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు కనిపిస్తాయి. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కూడా తీవ్రమైన లక్షణాలు కనిపించే ప్రమాదం ఎక్కువగా ఉంది. కొన్ని సందర్భాల్లో ICUలో ఉంచాల్సి రావచ్చు. యాంటీ బయటిక్స్ వాడొచ్చా? సాధారణ మందులు వాడటం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా చాలా ఇన్ఫ్లుఎంజా కేసులు నయమవుతాయి, అయితే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ మందులు తీసుకోవడం మంచిది. H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్కు వ్యతిరేకంగా యాంటీబయాటిక్స్ పని చేయనప్పటికీ, చాలా మంది తమంతట తాముగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్య వచ్చిన పిల్లలకు సొంతంగా యాంటీబయాటిక్స్ ఇవ్వవద్దని వైద్యులు తల్లిదండ్రులకు సలహా ఇస్తున్నారు. మీకు ఈ వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించి, వారు సూచించిన మందులను మాత్రమే వాడాలి. వైద్యులు H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ ను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచించారు, వీటిని అనుసరించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోటిని కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలి.. క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. కరోనా సమయంలో ఎలాగైతే ఫేస్ మాస్క్ ధరించారో.. అలాగే ఇప్పుడూ జాగ్రత్తగా ఫేస్ మాస్క్ మైంటైన్ చెయ్యాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం ఉత్తమం. చేతులతో ముక్కును నోటిని పడే పడే తాకడం మానుకోవాలి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి, ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి. జ్వరం, ఒళ్ళు నొప్పులు బాధిస్తుంటే.. పారాసెటమాల్ తీసుకోవచ్చు. ఇవి తప్ప సొంతంగా ఎలాంటి మందులూ వాడకపోవడం ఉత్తమం. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ◆నిశ్శబ్ద.
పిల్లలు పుస్తకాలు చదవట్లేదా... అయితే ఇలా చేయండి! ఏ ఇద్దరు వ్యక్తుల చేతివేలి ముద్రలు ఒకేలా ఎలా ఉండవో.. ఏ ఇద్దరు వ్యక్తుల రుచి మొగ్గలు ఓకేవిధంగా ఎలా ఉండవో.. అలాగే ఏ ఇద్దరు పిల్లల ఆలోచనలు ఒకేలా ఉండవు. పిల్లలు జీవితంలో గొప్పవాళ్లుగా మారడానికి పెద్దవాళ్ళు ఎన్నో మార్గాలు ఫాలో అవుతారు. అయితే ఒకరికి పని చేసేది మరొకరికి పని చేయకపోవచ్చు. ఇలాంటప్పుడు ఓపికపట్టాలి. ముందు మీ పిల్లలకు ఏది ఉత్తమంగా పని చేస్తుందో కనుగొనే వరకు విభిన్న విధానాలను ప్రయత్నిస్తూ ఉండాలి. పుస్తకాలు చదవడం చాలా ఆరోగ్యకరమైన అలవాటు. ఇది పిల్లల్లో విభిన్న కోణాలను బయటకు తెస్తుంది, ఆత్మను సుసంపన్నం చేస్తుంది జ్ఞానాన్ని నింపుతుంది. చిన్నప్పటి నుంచే పిల్లల్లో పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి అందుకోసం కొన్ని చిట్కాలు ఇవిగో.. వయస్సుకి తగిన పుస్తకాలతో ప్రారంభించండి: మీ పిల్లల వయస్సు మరియు పఠన స్థాయికి తగిన పుస్తకాలను ఎంచుకోండి. మీరు చిన్న పిల్లల కోసం బొమ్మల పుస్తకాలతో ప్రారంభించవచ్చు వారు పెద్దయ్యాక చాప్టర్స్ ఉన్న పుస్తకాలకు వెళ్లవచ్చు. వారి దృష్టిని ఆకర్షించే ప్రకాశవంతమైన, రంగురంగుల దృష్టాంతాలతో పుస్తకాలను ఎంచుకోండి. పఠనాన్ని రొటీన్గా చేసుకోండి: నిద్రవేళకు ముందు లేదా రాత్రి భోజనం తర్వాత పుస్తక పఠనం కోసం ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. ఇది వారి దినచర్యలో పఠనాన్ని ఒక క్రమమైన భాగంగా చేయడానికి వారిలో పఠనాభిమానాన్ని కలిగించడంలో సహాయపడుతుంది. ఆసక్తి కలిగించే విషయాలపై పుస్తకాలను ఎంచుకోండి: పిల్లలు ఆసక్తిని కలిగించే అంశంగా ఉన్నప్పుడు చదవడానికి ఇష్టపడతారు. మీ పిల్లలు డైనోసార్లను ఇష్టపడితే, వాటి గురించిన పుస్తకాలను కనుగొనండి. వారు క్రీడలను ఇష్టపడితే, వారికి ఇష్టమైన క్రీడ లేదా అథ్లెట్ గురించి పుస్తకాలను వెతికి తెచ్చివ్వండి. ఇలాగే వారికి ఏది ఇష్టమైతే ఆ మార్గంలోనే పుస్తకపఠనం అలవాటు చెయ్యాలి. కలిసి చదవండి: నన్ను చదవమని చెబుతూ నువ్వు మొబైల్ చూసుకుంటావా?? టీవీ చూస్తావా?? ఇలా పిల్లలు ముక్కుసూటిగా ప్రశ్నలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పలేక వారిని పెద్దరికం అనే ట్యాగ్ తో మందలిస్తారు పెద్దలు. కాబట్టి కుటుంబంలో ఎవరో ఒకరు పిల్లలతో కలిసి చదవడానికి సమయాన్ని వెచ్చించండి. కథను బిగ్గరగా చదవడం, కథ గురించి చర్చించడం వంటివి చేయండి. ఇది వారి పఠన నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడటమే కాకుండా మీకు మరియు మీ పిల్లల మధ్య బంధాన్ని ఏర్పరుస్తుంది. బహుమతులు ఇవ్వండి: పిల్లలు చదువుతున్నప్పుడు వారిని ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహం తెచ్చుకుంటారు. వారు చదివే పుస్తకంలో ఒక చాప్టర్ పూర్తి చేసినప్పుడు, దానిగురించి మీతో సమర్థవంతంగా చర్చించినప్పుడు, పుస్తకాన్ని విజవంతంగా పూర్తి చేసినప్పుడు వారికి బహుమతులు ఇవ్వడం. వారికి ఇష్టమైన ప్రదేశాలకు వారిని తీసుకెళ్లడం. మరొక అద్భుతమైన పుస్తకాన్ని వారికి ఇవ్వడం చేస్తే.. వారు ఎంతో సంతోషిస్తారు. ◆నిశ్శబ్ద.