English | Telugu
మోనిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! రత్నసీతలో పెరుగుతున్న భయం!!
Updated : Sep 7, 2021
కార్తీక్ మీద మోజుతో మోనిత చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేసే సమయం ఆసన్నమైందా? ఆమెను పోలీసులు పెట్టుకుంటారా? లేదంటే పోలీసుల ముందుకు వెళ్లి లొంగిపోవాల్సిన పరిస్థితి మోనితకు వస్తుందా? ఇవాళ్టి 'కార్తీక దీపం' (సెప్టెంబర్ 7) ఎపిసోడ్ చూస్తే ఇటువంటి సందేహం కలుగక మానదు. మోనితకు మద్దతుగా నిలుస్తున్న రత్నసీత సైతం 'మేడమ్! లొంగిపోండి' అని అంటుందంటే... మోనిత పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తన మెడలో తాళి కట్టకపోతే కుటుంబ సభ్యులకు ప్రాణహాని తలపెడతానని కార్తీక్కి మోనిత వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగా కార్తీక్ తమ్ముడు ఆదిత్యకు యాక్సిడెంట్ చేయిస్తుంది. మరోవైపు కార్తీక్కి కడుపునొప్పి వచ్చేలా చేసి ఆస్పత్రికి రప్పించుకుని డాక్టర్ టీనా పేరుతో మారువేషంలో అతడిని చూసి వెళుతోంది. మాట్లాడుతోంది. కట్టుకున్న భార్యకు తన పరిస్థితి చెప్పుకోలేక కార్తీక్ తనలో తాను ఆందోళన పడుతున్నాడు. మరోవైపు ఏసీపీ రోహిణితో 'మూగమ్మాయిగా టీ తీసుకొచ్చినది మోనిత' అని దీప చెప్పడంతో ఆ కోణంలో ఏసీపీ దర్యాప్తు మొదలుపెడుతుంది. ఇదీ జరిగిన కథ. మరి, ఈ రోజు ఏం జరిగింది? అనే విషయంలోకి వెళితే...
కార్తీక్కి మోనిత టీ ఇచ్చిన రోజు సీసీ టీవీ ఫుటేజ్ కోసం ఏసీపీ రోహిణి వెతుకుతుంది. రత్నసీతతో "సీసీ టీవీ ఫుటేజ్ కనిపించడం లేదంటే దీప చెప్పినది నిజమేనా? మన స్టేషన్ లో ఎవరైనా మోనితకు హెల్ప్ చేస్తున్నారా?" అని అంటుంది. దాంతో రత్నసీతకు భయం మొదలైంది. మోనిత దగ్గరకు వెళ్లి రోహిణి మేడమ్కి డౌట్ వచ్చిందని, లొంగిపోమని చెబుతుంది. కానీ, మోనిత మాట వినదు. పైగా, 'కార్తీక్ తాళి కట్టిన తర్వాత లొంగిపోతా. నీకు నీ భర్త ఎంత ముఖ్యమో... నాకు కాబోయే భర్త అంతే ముఖ్యం' అని అంటుంది. మరోవైపు మోనితను పట్టుకోవాలని ఎటువంటి సాహసాలు చేయవద్దని దీపతో కార్తీక్ చెబుతాడు. రోహిణి బయటకు వెళుతూ... స్టేషన్ కి ఎవరు వచ్చి వెళుతున్నారో చూడమని పోలీసుకు చెబుతుంది.
'కార్తీక దీపం'లో తాజా పరిణామాలు చూస్తుంటే మోనిత చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టు ఉంది. అయితే, 'మోనిత మరణించలేదు. బతికి ఉంది' అనే నిజం పోలీసులకు ఆధారాలతో దొరకాలి. సీసీ టీవీ ఫుటేజ్ కోణం నుండి దర్యాప్తు చేసినా... ఆస్పత్రి దగ్గర నిఘా పెంచినా... మోనిత దొరకడం ఖాయం. మోనిత దీపకు దొరికినట్టు ప్రోమో విడుదల చేసి సీరియల్ మీద మరింత ఆసక్తి పెంచారు.