English | Telugu
మనో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యుంటే కీరవాణికి అవకాశాలు ఉండేవి కావా?
Updated : Sep 7, 2021
మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన మనో సింగర్ మాత్రమే అయ్యాడా? ఒకవేళ మనో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటే కీరవాణికి ఇన్ని అవకాశాలు వచ్చి ఉండేవి కావా? ఏమో... ఏం జరిగి ఉండేదో? మనోలో మ్యూజిక్ డైరెక్టర్ కి ముందరికాళ్ల బంధం వేశారో సీనియర్ సంగీత దర్శకులు. అయన వార్నింగ్ వల్ల మనో స్వరాలు రాయడం మీద దృష్టి పెట్టలేదని 'ఆలీతో సరదాగా' లేటెస్ట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
మనో, జమీలా దంపతులు 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన సంగతులను మనో గుర్తు చేసుకున్నారు. "నేను ఓ స్వరం రాశా. 'కృష్ణమూర్తి! వీడు చాలా బాగా రాస్తున్నాడే' అని విశ్వనాథంగారు అన్నారు. ఫోన్ వస్తే మాట్లాడానికి వెళ్లారు. అప్పుడు విజయా కృష్ణమూర్తిగారు పిలిచారు. 'ఇంకోసారి స్వరం రాశావనుకో... మద్రాస్లో ఉండవ్!' అన్నారు" అని మనో చెప్పారు. ఏడాదిన్నర పాటు తనకు రావాల్సిన కన్వీనియన్స్ వేరొకరు తీసుకున్నారని వెల్లడించారు. తబలా ప్రసాద్ గారు చెప్పేవరకూ ఆ విషయం తనకు తెలియలేదన్నారు.
చక్రవర్తిగారి దగ్గర ఎం.ఎం. కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్ తనకు జూనియర్లు అని మనో చెప్పారు. ఆలీ హీరోగా నటించిన 'సోంబేరి' సంగీత దర్శకుడిగా తన తొలి చిత్రమని ఆయన వెల్లడించారు. ఆ సినిమా ఆడియో వేడుకలో 'ఒకవేళ నాగూర్ బాబుగారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి ఉంటే ఇంతమంది నిర్మాతలు నాకు సినిమాలు ఇచ్చేవారు కాదేమో' అని కీరవాణి అన్నారని మనో గుర్తు చేసుకున్నారు. 'అరేయ్! నిన్ను సింగర్ చేస్తే నాకు దూరం అవుతావేమోనని చాలా కాలం నీకు పాటలు ఇవ్వలేదురా. నన్ను క్షమించరా' అని ఒకరోజు చక్రవర్తిగారు తనతో చెప్పినట్టు మనో వెల్లడించారు.
మనో, జమీలా పెళ్లి చూపుల రోజు ఏం జరిగిందనేది 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చింది. "మాది తెనాలి. మనోగారు తెనాలి వచ్చారు. చూడటంతోనే 'నేను నీకు నచ్చానా?' అని నన్ను అడిగారు. నేను నచ్చానో లేదో ఫస్ట్ మీరు చెప్పండి. తర్వాత మీ సంగతి చెబుతాన్నాను. కరెక్ట్ అనుకున్నారు" అని జమీలా చెప్పారు. భర్త పాడిన పాటల్లో 'ప్రియా ప్రియతమా రాగాలు' పాట తనకు బాగా ఇష్టమన్నారు. అన్ని పాటలు ఇష్టమేనన్నారు.