English | Telugu
గుడికి రాని దీప హత్యకు ప్లాన్ మార్చిన మోనిత!
Updated : Aug 20, 2021
భాగ్యం, ఆమె భర్త మురళీకృష్ణ గుడికి వెళుతూ దీపను రమ్మని చెబితే... దీప గుడికి వెళ్తే ఆమెను అక్కడే చంపాలని గన్ తీసుకుని మోనిత బయలుదేరిన సంగతి తెలిసిందే. దీప గుడికి రాకపోవడంతో మోనితకు నిరాశ తప్పలేదు. అయితే, దీపను చంపడానికి మోనిత కొత్త ప్లాన్ వేసింది. మోనిత వలలో దీప చిక్కుతుందా? లేదా? అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుస్తుంది. ఈ రోజు (ఆగస్టు 20, 1123) ఎపిసోడ్లో ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే...
భాగ్యం, మురళీకృష్ణ గుడికి వెళతారు. వాళ్లిద్దరూ పూజారితో మాట్లాడుతుండగా, అక్కడికి మోనిత చేరుకుంటుంది. దీప కనిపించడకపోవడంతో ఎక్కడ ఉందోనని అటూ ఇటూ చూస్తుంది. వాళ్ళ మాటలు వింటే ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని పూజారి, భాగ్యం, మురళీకృష్ణ దగ్గరకు వెళుతుంది. సరిగా అప్పుడే 'పూజారిగారు, దీపకు ఏదో పని ఉండి ఈరోజు రాలేదు' అని భాగ్యం చెప్పిన మాటలు మోనిత చెవిన పడతాయి. ఆయన మర్నాడు సాయంత్రం వస్తే... అఖండ జ్యోతి వెలిగించి పంపిస్తానని చెబుతారు. దీప చావు ముహూర్తం రేపటి వాయిదా పడిందని మోనిత మనసులో అనుకుంటుంది.
గుడి నుండి బయటకు వస్తున్న భాగ్యం, మురళీకృష్ణ ముందు 'సోది చెబుతానమ్మా సోది చెబుతా' అంటూ మోనిత తిరుగుతుంది. సోది చెప్పించుకోవడానికి మోనిత దగ్గరకు భాగ్యం వెళుతుంది. 'కడుపునా పుట్టకపోయిన పెద్దకూతురు కష్టం కోసం గుడికి వచ్చావే తల్లి. ఆ పెట్ట కష్టాల్లో ఉంది. పెట్టకు చెందిన పుంజు కొలువులో ఉన్నాడు' అని చెబుతుంది. పరిష్కారం చెబుతానంటూ 'రేపు ఆరున్నరకు బస్తీలో గుడికి పెట్టను ఒంటరిగా రమ్మను. ఓ మంత్రం చెబుతా. దాంతో పుంజు బయటకు వస్తుంది. నా మాట కాదని పెట్టతో పాటు ఎవరొచ్చినా మంత్రం పని చెయ్యదు' అని చెబుతుంది. తప్పకుండా పంపిస్తానని చెప్పిన భాగ్యం అక్కడ నుండి బయలుదేరుతుంది. వెళ్లేముందు మోనిత చేతిలో భాగ్యం, మురళీకృష్ణ దంపతులు ఓ వంద రూపాయలు పెడతారు.
దీప బస్తీలో గుడికి ఒంటరిగా వస్తే చంపేయాలని మోనిత ప్లాన్. భాగ్యం, మురళీకృష్ణ వెళ్లిన తర్వాత అప్పటివరకూ ముఖానికి అడ్డుగా పెట్టుకున్న చీర కొంగును తొలగించి... 'రా దీప. రా! రేపు నిన్ను చంపి, ఈ వందతో పూలదండ కొని నీ మెడలో వేస్తా' అని ఆవేశంతో మోనిత రగిలిపోతుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి.