English | Telugu

జపాన్‌లో ఉన్న ప్రభాస్‌కి రాజమౌళి లేఖ.. సోషల్‌ మీడియాలో వైరల్‌!

బాహుబలి1, బాహుబలి2 చిత్రాలను కలిపి 'బాహుబలి ది ఎపిక్‌' పేరుతో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకి కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రభాస్‌కు జపాన్‌లో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 12న అక్కడ విడుదల చేయబోతున్నారు.


ఈ సందర్భంగా బాహుబలి ది ఎపిక్‌ స్పెషల్‌ స్క్రీనింగ్‌ కోసం జపాన్‌ వెళ్ళారు ప్రభాస్‌. అక్కడి అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ముగ్ధుడైపోయారు. ఎంతో ఆనందంగా అభిమానులతో ముచ్చటించారు. 'మీ ప్రేమకు ధన్యవాదాలు. బాహుబలి తర్వాత రాజమౌళి, శోభు మీ గురించి, మీరు నాపై చూపిస్తున్న అభిమానం గురించి చెప్పారు. పదేళ్లుగా ఇక్కడి అభిమానుల గురించి వింటూనే ఉన్నాను. మిమ్మల్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫైనల్‌గా ఈరోజు మీ అందర్నీ చూడగలిగాను. చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను' అన్నారు.


ఈ సందర్భంలోనే రాజమౌళి తనకు రాసిన లేఖను అభిమానులకు చదివి వినిపించారు ప్రభాస్‌. ఆ లేఖలోని సారాంశం ఇది.. 'నేను జపాన్‌ నాలుగు సార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారీ ఇక్కడి ప్రేక్షకులు, అభిమానులు నన్ను ఒకే మాట అడిగేవారు. 'ప్రభాస్‌ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు' అని. అందుకే నా బాహుబలి ఇప్పుడు తన రెండో ఇంటికి వచ్చాడు. ఈ పర్యటనను బాగా ఎంజారు చేస్తున్నావని అనుకుంటున్నాను' అంటూ ఎంతో ప్రేమగా రాజమౌళి రాసిన లేఖను చదవగానే థియేటర్‌ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ లేఖపై ప్రభాస్‌ స్పందిస్తూ.. 'రాబోయే రోజుల్లో మనిద్దరం కలసి జపాన్‌కు వద్దాం' అని పోస్ట్‌ పెట్టారు. ప్రభాస్‌కి రాజమౌళి రాసిన లేఖ, దానికి ప్రభాస్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.