English | Telugu
బాలకృష్ణకు ఐపీఎస్ అధికారి క్షమాపణలు..!
Updated : Nov 17, 2025
బాలకృష్ణకు సీవీ ఆనంద్ క్షమాపణలు
బాలయ్య ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన ఐపీఎస్ రిప్లై
వివాదం ముదరడంతో సీవీ ఆనంద్ క్లారిటీ
నలుగురికి ఆదర్శంగా నిలిచే పదవిలో ఉన్నవారు ఏదైనా మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే వారు మాట్లాడే మాటలు.. త్వరగా జనాల్లోకి వెళ్తాయి, ఎంతో ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇక ఈ సోషల్ మీడియా యుగంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న కామెంట్ చేసినా అది వైరల్ అయిపోతుంది. ఇటీవల ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ కి అలాంటి పరిస్థితే ఎదురై, చివరికి సినీ స్టార్ నందమూరి బాలకృష్ణకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఈ ఏడాది సెప్టెంబర్ చివర్లో హైదరాబాద్ పోలీసులు మూవీ పైరసీ గ్యాంగ్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అయ్యి, ఆ వివరాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అప్పుడు సీవీ ఆనంద్ అధికారిక ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన టాప్ హీరోలు, నిర్మాతలు, దర్శకులను ఆహ్వానించి.. పైరసీకి సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు.. ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.
టాలీవుడ్ కి నాలుగు స్తంభాలుగా భావించే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలలో.. బాలకృష్ణ ఆ సమావేశంలో పాల్గొనలేదు. దీంతో సీవీ ఆనంద్ చేసిన ఆ పోస్ట్ కింద ఒక నెటిజెన్ వెటకారపు కామెంట్ చేశాడు. "మీరు బాలయ్యను ఎందుకు పిలవలేదు. ఆయన మళ్ళీ ఈ విషయం గురించి ఏపీ అసెంబ్లీలో మాట్లాడతారు" అని అన్నాడు. దీనికి సీవీ ఆనంద్ అకౌంట్ నుండి బిగ్గరగా నవ్వుతున్న ఒక ఎమోజీ రిప్లైగా వచ్చింది. ఇది బాలయ్య అభిమానులను హర్ట్ చేసింది.
Also Read: బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం.. సూపర్ స్టార్ తో కలిసి..!
బాలకృష్ణ లెజెండరీ నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సేవలో ఉన్నారు. అలాంటి వ్యక్తిని అవమానించేలా ఒక ఐపీఎస్ అధికారి కామెంట్ చేయడం కరెక్ట్ కాదని.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సీవీ ఆనంద్ తీరుని తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్ట్ లు దర్శనమిచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
"నా సోషల్ మీడియా అకౌంట్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక పర్సన్ ఉన్నాడు. బాలయ్య గారిపై పోస్ట్ కి ఆ ఎమోజీ రిప్లై ఇచ్చింది అతనే. అలా చేయడం సరైనది కాదు. ఈ విషయం ఇటీవలే నా దృష్టికి వచ్చి.. వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేశాను. అతను ఇలాంటి మరికొన్ని పోస్ట్ లు చేయడం, రిప్లైలు ఇవ్వడం గమనించి.. అతనిని సోషల్ మీడియా బాధ్యతల నుండి తొలగించడం జరిగింది. నాకు బాలకృష్ణ గారు ఎప్పటినుంచో తెలుసు. ఒకవేళ హర్ట్ అయ్యుంటే క్షమించండి అంటూ ఆయనకు మెసేజ్ చేశాను. బాలయ్య గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారి సినిమాలు చూస్తూ పెరిగాను. వారంటే నాకు గౌరవం ఉంది. వారందరితో మాకు మంచి అనుబంధం ఉంది." అని సీవీ ఆనంద్ పోస్ట్ చేశారు.
సీవీ ఆనంద్ చేసిన తాజా పోస్ట్ తో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.