English | Telugu
యోగి కాళ్లపై పడ్డ రజినీ.. ట్రోలింగ్.. ఫ్యాన్స్ కౌంటర్
Updated : Aug 20, 2023
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంటే మరో వర్గం మాత్రం ఆయనపై విమర్శలు చేస్తున్నారు. ఉత్తరాది ప్రజల దగ్గర దక్షిణాది ప్రజల పరువు తీశారంటూ ట్రోలింగ్ చేయటం ప్రారంభించారు. అసలు వీళ్లు ఇలా ట్రోల్ చేయటానికి కారణమేంటా? అనే వివరాల్లోకి వెళితే.. జైలర్ రిలీజ్ తర్వాత హిమాలయాలకు వెళ్లిన తలైవర్ అక్కడ నుంచి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్లారు. నిజానికి ఆయన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి జైలర్ సినిమా చూస్తారనే వార్తలు వచ్చాయి. కానీ యోగికి కుదరకపోవటంతో ఉప ముఖ్యమంత్రితో కలిసి రజినీ కాంత్ సినిమాను చూశారు. తర్వాత యోగి ఆదిత్యనాథ్ ను ప్రత్యేకంగా కలిశారు. ఆ సమయంలో ఆయన కాళ్లపై పడి రజినీ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ వీడియో బయటకు వచ్చింది. దీంతో యాంటీ ఫ్యాన్స్, కొందరు నెటిజన్స్ వయసులో తన కంటే చిన్నవాడైన వ్యక్తి కాళ్లపై రజినీ ఎందుకు పడ్డారంటూ కామెంట్స్ చేయటం మొదలు పెట్టారు.
వ్యక్తి కాళ్లకు మరో వ్యక్తి దండం పెట్టకూడదంటూ రజినీకాంత్ గత చిత్రమైన కాలాలో ఉన్న డైలాగ్ ను నెటిజన్స్ షేర్ చేశారు. అసలు యోగి ఆదిత్య నాథ్ కాళ్లకు రజినీ కాంత్ ఎందుకు మొక్కారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే దీనిపై తలైవర్ ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తున్నారు. గతంలోనూ రజినీకాంత్ తన కంటే వయసులో చిన్నవాడైన స్వామిజీ కాళ్లపై పడినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నారెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా యోగి ముఖ్యమంత్రి అనే కారణంతోనో, బీజేపీ నాయకుడనో రజినీకాంత్ ఆయన కాళ్లపై పడలేదని, ఆయన ఓ మఠాన్ని నిర్వహిస్తున్న సన్యాసి అనే గౌరవంతో, హిందూ మతంపై గౌరవంతోనే కాళ్లకు నమస్కరించాలని అభిమానులు అంటున్నారు.
మరి తనపై వస్తున్న కామెంట్స్, ట్రోలింగ్స్ పై రజినీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే సినిమా విడుదలైన పది రోజుల్లోనే రూ.500 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి దూసుకెళ్తోంది.