English | Telugu

‘మహావతార్‌ నరసింహ’ను మించే స్థాయిలో ‘కురుక్షేత్ర’ వెబ్‌ సిరీస్‌!

యాక్షన్‌ సినిమాలు, లవ్‌ ఎంటర్‌టైనర్స్‌, డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీస్‌ విరివిగా వస్తున్న ప్రస్తుత సమయంలో పురాణ ఇతిహాసాలతో భారీ విజయాలు సాధిస్తున్నారు మేకర్స్‌. దానికి నాంది పలికిన సినిమా మహావతార్‌ నరసింహ. ఎవరూ ఊహించని విధంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్‌ సాధించింది. ఈ సినిమా ఎంతో మంది మేకర్స్‌కి ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది. రెగ్యులర్‌ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులు యానిమేషన్‌లో రూపొందిన ఈ తరహా సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి జనరేషన్‌ పిల్లలకు పురాణ ఇతిహాసాల గురించి అవగాహన కలిగించేందుకు తల్లిదండ్రులు కూడా వారికి ఈ సినిమాలు చూపిస్తున్నారు. దాంతో అలాంటి సినిమాలకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పురాణ గాధలను తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు.

తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత నాగవంశీ ‘వాయుపుత్ర’ అనే మూవీని ఎనౌన్స్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో యానిమేషన్‌లో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇది సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీల్లో కూడా ఈ ట్రెండ్‌ స్టార్ట్‌ అయింది. ఇప్పటివరకు రామాయణం, మహాభారతంలోని అనేక అంశాలను ఎన్నో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుంచారు. వాటిని కూడా ఇప్పటి జనరేషన్‌కి అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. మహాభారతంలో కురుక్షేత్ర ఘట్టం అనేది ఎంతో కీలకమైంది. ఈ ఘట్టం పట్ల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని కురుక్షేత్ర ఘట్టాన్ని ఒక సిరీస్‌ రూపంలో ప్రసారం చేయబోతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్‌ 10 నుంచి ‘కురుక్షేత్ర’ పేరుతో వెబ్‌ సిరీస్‌ స్టార్ట్‌ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని మేకర్స్‌ ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.