మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ.. జగన్ ఓడిపోతారన్న సుబ్బారావుపై మంత్రి అనుచరుల దాడి
Publish Date:Dec 20, 2021

Advertisement
ఇలాగైతే జగన్ ఓడిపోవడం ఖాయం.. ఆ ముగ్గురు నేతల వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు లాస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఒంగోలు వైసీపీ నేత సుబ్బరావు గుప్తాపై దాడి జరిగింది. సొంత పార్టీ నేతలే ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఓ లాడ్జ్లో ఉన్న సుబ్బారావు ఆచూకీ కనిపెట్టి మరీ దౌర్జన్యం చేశారు. సుబ్బారావుపై దాడి చేసిన వ్యక్తిని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు సుభానీగా గుర్తించారు. దాడి చేస్తున్న దృశ్యాల్ని వీడియో తీసి మరీ సుబ్బారావుకు వార్నింగ్ ఇచ్చింది సుభానీ గ్యాంగ్. బాలినేనికి క్షమాపణ చెప్పాలంటూ గుప్తాను మోకాళ్లపై కూర్చోపెట్టి క్షమాపణ చెప్పించారు. సుబ్బారావుపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి సంచలనమయ్యాయి.
ఓ మంత్రి, ఎమ్మెల్యేల మాటలతో పార్టీకి నష్టం జరుగుతుందని ఇటీవల మంత్రి బాలినేని బర్త్ డే వేడుకల్లో మాట్లాడారు సుబ్బారావు. ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీలో ప్రకంపనలు రేపాయి. ఇది జీర్ణించుకోలనే వైసీపీ నేతలు సుబ్బారావు కోసం గాలించారు. దీంతో ఆయన ప్రాణభయంతో అదృశ్యమయ్యారు. సుబ్బారావు కోసం వెతుకుతున్న దుండగులు ఆదివారం రాత్రి ఆయన ఇంటిపై దాడి చేశారు. మద్యం మత్తులో ఉన్న 15 మంది లంబాడీడొంకలోని సుబ్బారావు గుప్తా ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్దలేరు. దుండగులు ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్రవాహనాన్ని తగలబెట్టారు.
ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు సొంతపార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలో వస్తే కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
http://www.teluguone.com/news/content/ycp-leaders-attack-on-subbarao-in-ongole-25-128753.html












