ఆర్టీసీ ఉద్యోగుల పీఎఫ్ ఫండ్స్ కూడా హాంఫట్
Publish Date:Dec 20, 2021

Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్ను ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న భవిష్య నిధి (పీఎఫ్) ఫై పడింది. ఒకసారి ప్రభుత్వం కన్నుపడింది అంటే ఇంకేముంది, అంతే సంగతులు. అందుకు నడుస్తున్న చరిత్రే సాక్ష్యం. అందుకే కావచ్చు, ఆర్టీసీ పీఫ్ ఖాతాలోని రూ.1600 కోట్లను, ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని ప్రభుత్వం కోరినా ఆర్టీసీ యాజమాన్యం నడుకు అందుకు అంగీకరించ లేదని సమాచారం.
నిజానికి, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల నిదులను సర్కార్ ఖాతాలో వేసుకునే కత్తిరింపు కార్యక్రమం ఒక్క ఎపీఎస్ ఆర్టీసీకి పరిమితం అయిన కార్యక్రమం కాదు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థల డిపాజిట్లు ఏ బ్యాంకులో ఉన్నా, తక్షణం స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయాలని ఎప్పుడోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు ఎపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల ఖాతా మీద సర్కార్ నజర్ పడినట్లు తెలుస్తోంది. అయితే, పీఎఫ్ నిధులను దారి మళ్లించడం కుదరదని, కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని నిర్దేశిత పథకాలు, సంస్థల్లో మాత్రమే వీటిని పెట్టుబడులు పెట్టాలని, వాటిలోనే డిపాజిట్ చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నట్లు సమాచారం. వీటికి లాక్ పీరియడ్ ఉంటుందని, మధ్యలో తీసేందుకు వీలుండదని యాజమాన్యం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కానీ, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఎఫ్ఆర్బీఎం నిబంధనలనే మార్చేసిన, జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఎపీఎస్ ఆర్టీసీ పీఫ్ ఖాతా నిబంధనలను పక్కకు నేట్టేయడం పెద్ద పనా? అని ప్రభుత్వ అధికారులే ప్రశ్నిస్తున్నారు. పాటించే వారికి నిబంధనలు కానీ, పక్కన పెట్టే వారిని నిబంధనలు ఏమిచేస్తాయని, అంటున్నారు.
ఉద్యోగుల పీఎఫ్ను సొంతంగా నిర్వహించుకునేందుకు వీలుగా ట్రస్టు ఏర్పాటుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) గతంలో మినహాయింపు ఇచ్చింది. ఉద్యోగుల మూల వేతనం, కరవు భత్యం (బేసిక్, డీఏ) నుంచి 12 శాతం ప్రతి నెలా రికవరీ చేస్తారు. అంతే మొత్తాన్ని యాజమాన్యం (ప్రస్తుతం ప్రభుత్వం) వాటాగా ఇస్తుంది. యాజమాన్య వాటా నుంచి కొంత మొత్తాన్ని ఈపీఎఫ్-95 పింఛను పథకం కోసం ఈపీఎఫ్వోకు ఇస్తారు. మిగిలినదంతా ఆర్టీసీ పీఎఫ్ ట్రస్టులోనే ఉంటుంది. ఇలా ట్రస్టులో ప్రస్తుతం పద్దుల ప్రకారం దాదాపు రూ.2 వేల కోట్లు ఉండాలి. గతంలో ఆర్టీసీ యాజమాన్యం జీతాల సర్దుబాటు సమయంలో పీఎఫ్ వాటాను ట్రస్టుకు సకాలంలో జమ చేయలేదు. వీటిని ఆర్టీసీ వాడుకుంది. ఈ మొత్తం రూ.850 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో కొంత కాలం కిందట ఆర్టీసీ రూ.450 కోట్లు ట్రస్టుకు జమ చేయగా, ఇంకా రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన పీఎఫ్ ట్రస్టులో ప్రస్తుతం రూ.1,600 కోట్లు ఉన్నాయి. ఈ రూ.1,600కోట్లపైనే, ప్రభుత్వం కన్ను పడింది. ఆ మొత్తాని ఎదో ఓకే విధంగా స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్లో డిపాజిట్ చేయగలిగితే, ఇక ఆ తర్వాత కథ తర్వాత అన్నట్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.
అయితే, ఇలా ముందు వెనకా చూసుకోకుండా, పభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల నిధులను దారి మళ్లించడం వలన, భవిష్యత్ లో చాలా చాలా చిక్కు సమస్యలు ఎదుర్కోనవలసి వస్తుందని, అధికార వర్గాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. అయినా నిండా మునిగిన వరికి చలేమిటి?
http://www.teluguone.com/news/content/jagan-govt-planing-to-use-rtc-employees-pf-funds-25-128755.html












