వైసీపీకి శాశ్వత అధ్యక్షుడెందుకు? విజయమ్మకు ఉద్వాసన ఎందుకు??
Publish Date:Jul 7, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో ఏదో జరుగుతోంది. ఆ పార్టీ అధినేతలో భయం గూడుకట్టుకుందా అన్న అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. లేకపోతే ఉరుములేని మెరుపులా పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకునేందుకు జగన్ ఎందుకు అంత తొందరపడుతున్నారు. తనపై తిరుగుబాటు చేసి ఎవరైనా పార్టీ అధ్యక్షపదవిని తన్నుకుపోతారని భావిస్తున్నారా? అన్న అనుమానాలను పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. లేకపోతే పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ పార్టీ ప్లీనరీ వేదికగా ఎందుకు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రతి రెండేళ్లకూ ఒక సారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలన్న పార్టీ బైలాస్ ను ఇప్పటికిప్పుడు ఎందుకు సవరణ చేసి మరీ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా నియమించేందుకు తొదర పడుతున్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ ప్లీనరీ వేదికగా సమాధానం దొరుకుతుందో లేదో ఇప్పటికైతే తెలియదు కానీ, హడావుడిగా పార్టీ బైలాస్ ను సవరించి మరీ జగన్ ను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించేందుకు పడుతున్న తొందర వెనుక ఉన్న కారణం భయమేనని విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ప్లీనరీ వేదికగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేత రాజీనామా చేయించేందుకు నిర్ణయించడం కూడా ఆమె వలన పార్టీలో చీలిక వస్తుందా అన్న భయమే కనబడుతోందని అంటున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి తానేటి వనితలు పార్టీ బైలాస్సవరణ విషయంలో ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. వైసీపీ ఆవిర్భవించినప్పటి నుంచీ పార్టీ అధ్యక్షుడిగా జగనే కొనసాగుతున్నారు. పార్టీ నియమావళి మేరకు ప్రతి రెండేళ్లకూ ఓ సారి పార్టీ ఆయననే అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ వస్తోంది. ఆ ఎన్నిక కూడా ఏకగ్రీవమే. పోటీ మాటే లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ప్రతి రెండేళ్ల కోసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమించాల్సిన అత్యవసర పరిస్థితి ఎందుకు వచ్చింది. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచీ కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మను ఆఘమేఘాల మీద తొలగించాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలకు పరిశీలకులు మాత్రం పార్టీలో మారుతున్న పరిస్థితి, పెరుగుతున్న అసంతృప్తే కారణమని అంటున్నారు. జగన్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలు, శ్రేణులు విజయమ్మను ఆశ్రయిస్తారన్న భయమే ఆమెను పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పించాలన్న జగన్ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో పార్టీలో తిరుగుబాటు భయమే జగన్ ను తనను పార్టీ శాశ్వత అధ్యక్షునిగా నియమించుకునే దిశగా నడిపిందని అంటున్నారు. ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన పరిస్థితుల నేపధ్యంలోనే జగన్ లో ఈ భయం మరింతగా పెరిగిందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర శివసేనలో తిరుగులేని నేతగా వెలుగొందుతున్న ఉద్ధవ్ థాక్రేపై ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసి తమదే అసలైన శివసేన అని క్లెయిమ్ చేసుకుంటున్న సంగతి విదితమే. తన ముందస్తు ప్రణాళికలు, పార్టీలో పెరుగుతున్నఅసమ్మతి నేపథ్యంలో జగన్ ముందు జాగ్రత్తగా శాశ్వత అధ్యక్ష పదవిని చేపట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/why-ycp--needs-perment-presidemy-and-why-party-wants-to-avoid-vijayamma-as-honorary-president-39-139287.html





