కేసీఆర్ సారూ ఢిల్లీ ఎందుకు పోలేదు ?
Publish Date:Apr 30, 2022
Advertisement
దేశ రాజదాని ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు జరుగుతోంది.ఈ కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. అదే విధంగా ఢిల్లీ, ఆంధ్ర ప్రదేశ్ సహా చాలా వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్ళలేదు. సమావేశంలో పాల్గొనలేదు. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, న్యాయశాఖ అధికారులు సదస్సులో పాల్గొన్నారు.
ఈ నేపధ్యంలో, ఇదిగో అంటే ఢిల్లీ అదిగో అంటే ఢిల్లీ వెళ్లి వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్ళలేదు, అనే విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య అయిన దానికి కానీ దానికి కేంద్ర ప్రభుత్వంపై కత్తులు దూస్తున్న విషయం తెలిసిందే. హుజురాబాద్ ఓటమి మొదలు ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టి రాష్ట్రంలో బీజేపీని దెబ్బ కొట్టేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చారు. ఈ ఐదారు నెలలో ముఖ్యమంత్రి, తెరాస మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీ పై ఒకటి రెండు పర్యాయాలు దండయాత్ర చేశారు. గత ఏడెనిమిది ఏళ్ళలో ఎప్పుడూ లేని విధంగా వరి ధాన్యం కొనుగోలును వివాదం చేసి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ధర్నాలు ఆందోళనలు చేశారు. అయినా, ఢిల్లీ ( కేంద్రం) దిగిరాలేదు. దీంతో చివరకు చేసేది లేక, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరించేందుకు అంగీకరించింది. సరే అది వేరే విషయం వేరే చర్చ.
అదొకటి ఆలా ఉంటే, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి, ఆ దిశగానూ ముఖ్యమంత్రి కొంత ప్రయత్నం చేశారు. ముంబై వెళ్లి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాకరేతో చర్చలు జరిపారు. అలాగే, చెన్నై వెళ్లి తమిళనాడు ముఖ్యమత్రి స్టాలిన్’ను ఝార్ఖండ్ వెళ్లి ఆ రాష్ట ముఖ్యమంత్రి సోరెన్’ ను కలిసి చర్చలు జరిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’ ని కలిసేందుకు ఢిల్లీ అయితే వెళ్ళారు కానీ. ఎన్ని రోజులు వెయిట్ చేసిన కేజ్రీవాల్’ అప్పాయింట్మెంట్ ఇవ్వలేదో ఏమో, కానీ, ఆయన్ని కలవ కుండానే హైదరాబాద్ వాపస్ వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు అనే విషయం పక్కన పెడితే, ఫ్రంట్ ప్రయత్నం కూడా దిగ్విజయంగా అటకెక్కింది. ఆ విఃయాన్ని స్వయంగా ఆయనే, మొన్నటి తెరాస ప్లీనరీలో బయట పెట్టారు. ఫ్రంట్లు, టెంట్లు కాదు, దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రత్యన్మాయ విధానాలను రూపొందిస్తామని, కొత్త పల్లవి అందుకున్నారు.
మరోవంక ముచ్చటగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ఎన్నికల వ్యూహ ప్రశాంత్ కిశోర్’ ను నమ్ముకుని కోట్ల రూపాయల డీల్ కుడుర్చుకున్నా, ఆ పీకే ఎప్పుడు చక్రం తిప్పుతాడో అనే భయం వెంటాడుతోంది. ఓ వంక తెరాసతో డీల్ కుదుర్చుకుని ఢిల్లీలో కాంగ్రెస్’ తో చేతులు కలిపేందుకు చర్చలు జరిపారు. మంచికో చెడుకో ఆ చర్చలు విఫల మయ్యాయి. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమయిన పీకే ఎందుకనో ప్రస్తుతానికి అయితే వెనకడుగు వేశారు.అయితే,ఎప్పుడైనా పీకే చేయిచ్చే ప్రమాదం ఉందనే సంకేతాలు ఉండడం వల్లనో ఏమో, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తమ పంథా మార్చుకుంటున్నారు అని అంటున్నారు.
ఇలా హుజురాబాద్ ఉప ఎన్నికలో మొదలైన వరస ఓటముల నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, డెల్లి వెళ్లి మళ్ళీ నవ్వుల పాలు అవడం ఎందుకని, న్యాయ సదస్సుకు డుమ్మా కొట్టారని విస్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి, ఇక ఇప్పట్లో ముఖ్యమంత్రి ఢిల్లీ వైపు కన్నెత్తి అయినా చూడరని, జాతీయ రాజకీయ అజెండాకు చాప చుట్టేసినట్లేనని అంటున్నారు. అయితే, రాష్ట్రలో బీజేపీ టార్గెట్ చేసేందుకు, కేంద్రంపై విమర్శలు మాత్రం కొనసాగుతాయని అంటున్నారు. అయితే, ఉద్యమ కాలం నుంచీ కూడా కేసీఆర్ బ్లో కోల్డ్ బ్లో హాట్’ థియరీనే ఫాలో అవుతున్నారని, సమయానుకూలంగా వ్యూహాలు మార్చుకుంటారని పార్టీ నేఅత ఒకరు గుర్తుచేశారు.అయితే, న్యాయసదస్సు విషయంలోనూ కేసీఆర్, రాజకీయ కోణంలో చూడడం, ప్రధాని మోడీకి, ఇతర నాయకులాకు ముఖం చాటు చేసేందుకు, కీలకమైన సమావేశానికి డుమ్మా కొట్టడం ఏమిటనే ప్రశ్నలు సహజంగానే వినవస్తున్నాయి. అదలా ఉంటే సదస్సు ప్రారంభంలోనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ‘మన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నప్పుడు మనకున్న లక్ష్మణ రేఖను కూడా గుర్తుంచుకోవాలని’ చేసిన వ్యాఖ్య కేసీఆర్’ నో మరోకరినో ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాకపోయినా, ఆయనకు అతికినట్లు సరిపోతుందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/why-kcr-skipped-cms-and-hccjs-conference-25-135260.html





