తమిళనాడు గవర్నర్ తీరుపై సినీ ప్రముఖుల ఆగ్రహం
Publish Date:May 7, 2026
Advertisement
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్పై ఉందని ఆయన వ్యాఖ్యానించారు.2017-18లో గోవా, మణిపూర్, మేఘాలయ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పుడు, గవర్నర్లు అసెంబ్లీలో ‘ఫ్లోర్ టెస్ట్’ ద్వారా మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించిన విషయాన్ని విశాల్ గుర్తు చేశారు. ఇప్పుడు తమిళనాడులో మాత్రం భిన్నంగా వ్యవహరించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్య విలువలు, ప్రజల తీర్పుకు గౌరవం ఎక్కడ ఉందంటూ ఆయన ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. ఇక తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా తీవ్రంగా స్పందించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ప్రజా తీర్పును అగౌరవపరచడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానమని కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఆయన సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఈ రాజకీయ పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ కూడా స్పందిస్తూ గవర్నర్ తీరును విమర్శించారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా తన బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగ ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. మెజార్టీ అంశం సభలోనే తేల్చాలే తప్ప, ముందుగానే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, మ్యాజిక్ ఫిగర్ 118కి అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో పాటు, మద్దతు లేఖలు సమర్పించలేదని పేర్కొంటూ గవర్నర్ తక్షణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని స్పష్టం చేసినట్లు సమాచారం.
http://www.teluguone.com/news/content/vijay-tamilnadu-36-219156.html





