కాంగ్రెస్ పార్టీని కాదు..కొన్ని నిర్ణయాలనే ప్రశ్నిస్తున్నా : రాజగోపాల్ రెడ్డి
Publish Date:Jul 5, 2026
Advertisement
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని, వారికి ఏమి చేయాలనే దానిపై ఆలోచిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడం తమ బాధ్యత అని, పార్టీ బలోపేతం విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకూడదన్నదే తమ ఆలోచన అని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట అంశంపై తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వచ్చిందని, అది పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ వ్యతిరేకంగా కాదని వివరించారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అధికారంలోకి వచ్చేలా పనిచేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు. తాను పార్టీకి దూరంగా ఉన్నానన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నానని స్పష్టం చేశారు. పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలను మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని, కానీ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పారు. తెలంగాణలో ఏ నాయకుడికీ లభించని స్థాయిలో రాహుల్ గాంధీ తనకు సమయం కేటాయించారని, పార్టీలో తనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీతో పార్టీ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలతో పాటు కుటుంబ విషయాలపైనా విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు.
http://www.teluguone.com/news/content/-komatireddy-rajagopal-reddy-36-225117.html





