వైసీపీ కూరలో కరివేపాకు వంశీ?.. పొమ్మనలేక పొగ?
Publish Date:May 23, 2022
Advertisement
కేబినెట్ కూర్పు అయిపోయిందీ.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కూడా జరిగిపోయింది. ఆ వెంటనే గన్నవరం నియోజకవర్గం గ్రూపుల గోలతో జగన్ ఆగమాగం అవుతున్నారు. దీంతో జగన్ కు గన్నవరం తలనొప్పిని వదిలించేందుకు వైసీపీలో సర్వ శాఖల మంత్రిగా ‘కీర్తి’ మూటగట్టుకున్న కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. గన్నవరంలో గ్రూపుల గోలకు ఆద్యులైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావులను తాడేపల్లి ఫ్యాలెస్కు పిలిపించేందుకు నిర్ణయించారు. ముందుగా ముందుగా దట్టా రామచంద్రరావు, ఆయన అల్లుడు శివభరత్ రెడ్డితో సజ్జల భేటీ అయ్యారు. ఈ భేటీలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వల్లభనేని వంశీ.. వైసీపీలో లీడర్ నుంచి కేడర్ వరకు ఎవరెవరనీ.. ఎలా ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసిందీ సాక్ష్యాధారాలతో సహా వివరించడమే కాకుండా, వైసీపీలో చేరిత తరువాత వల్లభనేని వంశీ అనుసరించిన వైఖరిని సజ్జల ముందు వివరించారనిపార్టీ వర్గాల సమాచారం. అంతే కాదు..దుట్టారామచంద్రరావు, ఆయన అల్లుడు సజ్జలతో భేటీ అయినంత సేపూ వంశీని కేబిన్ బయటే వెయిట్ చేయించారని, ఆ తరువాత వంశీకి పిలుపు వచ్చిందనీ, అయితే సజ్జలతో భేటీ నిముషాలలోనే ముగిసిపోయిందనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సజ్జల వంశీకి ఇచ్చిన సందేశమేమిటన్నది తేటతెల్లమైపోయిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. అసలు వంశీని సజ్జల తన కేబిన్ వద్ద వెయిటింగ్ లో పెట్టి.. లోపల ఆయన ప్రత్యర్థులతో సజ్జల మంతనాలు జరపడంతోనే వల్లభనేనికి ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటన్నదని అర్ధమైపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక ఈ భేటీ తరువాత వంశీ వర్గం కుతకుతలాడిపోతోందని అంటున్నారు. వల్లభనేని వంశీని అవమానించడమే కాకుండా, గన్నవరం నియోజకవర్గంలో ఆయనను ఒంటరి చేయడానికి వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నదనీ ఆరోపిస్తున్నది. ఇక వైసీపీలో వల్లభనేని వంశీ సీన్ ముగిసి నట్లేనని చెబుతున్నారు. ఇందుకు కారణాలను కూడా వారు వివరిస్తున్నారు. దుట్టా రామచంద్రరావు అల్లుడు శివభరత్ రెడ్డి సీఎం జగన్ సతీమణి భారతికి సమీప బంధువు కావడం వల్లనే గన్నవరంలో వల్లభనేని వంశికి పొగపెడుతున్నారన్న టాక్ కూడా గన్నవరం నియోజకవర్గంలో ఓ రేంజ్ లో ప్రచారంలో ఉంది. అసలు తొలి నుంచీ కూడా వల్లభనేని వంశీ వైసీపీ ఎంట్రీకి గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నేతలకు ఇష్టం లేకపోయినప్పటికీ, అప్పటి మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు వల్లభనేనికి మద్దతుగా నిలబడి పార్టీలోకి ఎంట్రీకి మార్గం సుగమం చేశారని కూడా చెబుతున్నారు. ఇక వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి ఆయనకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురౌతోందని, ఇది గమనించే ఆయనను పార్టీలో కొనసాగించడం వేస్ట్ అన్న అభిప్రాయానికి వైసీపీ నేతలు వచ్చేశారనీ, అందుకే వదిలించుకునేందుకు నిర్ణయించుకున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ ప్రయత్నాలు తుది దశకు వచ్చేశాయనడానికి సజ్జల ఆయనతో వ్యవహరించిన తీరే నిదర్శనమని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/vallabaneni-vamshi-khel-khatam-in-ycp-25-136303.html





