చంద్రబాబుకు, జగన్ కు ఇదే తేడా..! దావోస్ లో నాడు బాబు.. నేడు జగన్ !
Publish Date:May 23, 2022
Advertisement
ఏ వ్యక్తికైనా గౌరవం ఆయన పదవిని, హోదాని బట్టి రాదు. వ్యక్తిత్వాన్నిబట్టి, వ్యవహార శైలిని బట్టి, విషయ పరిజ్ణానాన్ని బట్టి వస్తుంది. అటువంటి వ్యక్తుల వల్ల వారి పదవులకు, హోదాలకు కూడా గౌవరం వస్తుంది. అలా కాకుండా ఎలాగోలా పదవులు అధికారం దక్కించుకున్న వారికి వాటి వల్ల ఎటువంటి గౌరవం, మర్యాదా దక్కదు సరికదా... వారు ఉన్న పదవులు, హోదాలకు ఉన్న ప్రతిష్ట, పరపతి కూడా మసకబారుతాయి. అందుకు ఏపీలో నెల రోజుల ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఉదంతమే నిదర్శనం. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి జగన దావోస్ లో ఓంటరిగా, ఏకాకిలా కూర్చున్న తీరు చూస్తే కూడా అదే భావన కలగక మానదు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్లినప్పుడు ఆయనతో భేటీకి, ఆయనతో చర్చలకు ప్రముఖులు పోటీ పడ్డారు. బిల్ గేట్స్, విశాల్ శిక్కా, జూరిక్ సీఈవో, సిక్కో సీఈవో వంటి వారు పోటీలు పడ్డారు. అలాగే పెప్సీ, టెస్లా, టాటా, మహీంద్రా గ్రూపు సంస్థల ఎగ్జిక్యూటీవ్ లు క్యూ కట్టారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల అవకాశాలపై, అలాగే రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపే కంపెనీలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలపై చంద్రబాబు ప్రసంగాలకు కరతాళ ధ్వనులతో హర్షామోదాలు తెలిపే వారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చే వారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో జీరోతో ఆరంభమైన ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాల అమలుతో అనతి కాలంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత చంద్రబాబు తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఏపీ పరిస్థితి పూర్తి రివర్స్ లో ఉంది. మూడేళ్ల నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి ఏపీ మిగులు రెవెన్యూ ఉన్న సంపన్న రాష్ట్రాలతో సమానంగా సంపద సృష్టిలో పోటీ పడుతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రతిష్ఠత్మక పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి. కానీ మూడేళ్లలో ఏపీ పరిస్థితి తారుమారైపోయింది. పెట్టుబడుల కోసం క్యూ కట్టిన కంపెనీలు ఒక్కటొక్కటిగా వెనక్కు వెళ్లిపోయాయి. ప్రగతి మందగించింది. అప్పల కుప్పలా రాష్ట్రం మారిపోయింది. ఆ చేసిన అప్పులు కూడా రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించేలా ఉత్పాదకత కోసం కాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చి పెడతాయన్న ఆశతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసమే కావడంతో రాష్ట్రంలో అభివృద్ధి జాడ కనిపించడం లేదు.పోనీ ఆ పథకాలు అయినా సక్రమంగా అమలవుతున్నాయా అంటే అదీ లేదు. బాబు హయాంలో వెలుగుల రాష్ట్రంగాప్రశంసలు అందుకున్న ఆంధ్రప్రదేశ్... ఇప్పుడు అంధప్రదేశ్ అని అపకీర్తి మూటగట్టుకుంది. సాగునీటి ప్రాజెక్టులలో పురోగతి లేదు. పరిశ్రమల రాక అటుంచి.. ఉన్న పరిశ్రమలే మూత పడే పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు వస్తాయనే ఆశ వదిలేసుకునే పరిస్థితి నెలకొని ఉంది. ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు మృగ్యమైపోయాయి. రాష్ట్రంలో ఏ వర్గం తీసుకున్నా అశాంతి, అభద్రతతో ఆందోళన చెందుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ వైఫల్యాలు అన్ని రంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంతో సీఎం జగన్ దావోస్ లో జరుగుతన్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అక్కడ ఆయన ఏకాకిలా కూర్చున్న పరిస్థితి కనిపించింది. ఏపీ గ్యాలరీకి సందర్శకులే కరవయ్యారు. పారిశ్రామిక వేత్తలు జగన్ దరిదాపులకే రాని పరిస్థితి కనిపించింది. నాడు చంద్రబాబుకు దావోస్ లో పారిశ్రామిక వేత్తలు బ్రహ్మరథం పడితే నేడు జగన్ ఏకాకిలా ఎవరొస్తారా అని ఎదురు చూసే పరిస్థితి. ముఖ్యమంత్రి హోదాలో వెళ్లిన జగన్ కు దావోస్ లో పలకరించే నాథుడే కరవయ్యాడు. అదే 2016లో చంద్రబాబు దావోస్ వెళ్లిన సమయంలో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చంద్రబాబు ప్రసంగాలను వినేందుకు అత్యంత ఆసక్తి చూపేవారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సూట్లూ బూట్లూ వేసుకుని దావోస్ లో డాబు ప్రదర్శించలేదు. ఏపీలో ఆయన ఎలా తిరిగే వారో అంతే సింపుల్ గా అదే ఆహార్యంతో దావోస్ లో పర్యటించారు. అయినా ఆయన చుట్టూ ఎప్పుడూ పారిశ్రామిక వేత్తల సందడే. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సూటులో డాబు ప్రదర్శిస్తూ కూర్చున్నా ఎవరూ పట్టించుకోని పరిస్థితి. పారిశ్రామికంగా ఏపీ దుస్థితికి దావోస్ లో జగన్ పర్యటనకు లభించిన స్పందనే నిలువుటద్దం అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/difference-25-136309.html





