ఉక్రెయిన్ బుల్లెట్ తో ఇరాన్ దాడులకు కళ్లెం.. గల్ఫ్ దేశాల కొత్త వ్యూహాలు
Publish Date:Mar 13, 2026
Advertisement
మిడిల్ఈస్ట్ లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమతమ భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా కొత్త కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నాయి. అమలు చేస్తున్నాయి. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ అభివృద్ధి చేసిన బుల్లెట్ డ్రోన్లు లేదా ఇంటర్సెప్టర్ డ్రోన్లపై దృష్టి సారించాయి. ఇటీవలి కాలంలో డ్రోన్ యుద్ధం ప్రపంచ భద్రతా వ్యవస్థల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో యుక్రెయిన్ తక్కువ ఖర్చుతో అదే సమయంలో అత్యంత వేగంగా స్పందించే డ్రోన్ వ్యవస్థలను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగించింది. శత్రు డ్రోన్లను గాల్లోనే గుర్తించి అడ్డుకునే ఈ ఇంటర్సెప్టర్ డ్రోన్లు యుద్ధభూమిలో సమర్థవంతంగా పని చేశాయి కూడా. ఇప్పుడు గల్ఫ్ దేశాలు తమ రక్షణ వ్యవస్థల్లో వీటిని ఉపయోగించేందుకు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్ దాడులను ముందుగానే గుర్తించి, గాల్లోనే వాటిని నిర్వీర్యం చేసే టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. ఈ బుల్లెట్ డ్రోన్లు శత్రు డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని వేగంగా దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్కు అనుబంధంగా ఉన్న కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా డ్రోన్లతో ముందుకు వచ్చే అవకాశాలున్నాయని గల్ఫ్ దేశాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆధునిక డ్రోన్ నిరోధక వ్యవస్థలవైపు దృష్టి సారించాయి. డ్రోన్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సంప్రదాయ రక్షణ వ్యవస్థలతో పాటు ఇలాంటి ఇంటర్సెప్టర్ డ్రోన్లు భవిష్యత్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాల భద్రతలో ఈ సాంకేతికత కీలకంగా మారే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/ukraine-bullets-deter-irans-attacks-36-215417.html





