ట్రంప్ చైనా పర్యటన.. విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్
Publish Date:May 13, 2026
Advertisement
అమెరికా రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా పగ్గాలను డొనాల్డ్ ట్రంప్ మరోసారి చేపట్టిన తరువాత దౌత్యపరమైన సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజింగ్ విమానాశ్రయంలో ట్రంప్ కు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో ట్రంప్ వెంట ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అలాగే పలు టెక్నాలజీ సంస్థల ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ట్రంప్ కు స్వాగతం పలికేందుకు చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్ స్వయంగా విమానాశ్రయానికి రావడమే చైనా అగ్రరాజ్యాధినేత పర్యటనకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నది అవగతమౌతోంది. గతంలో అంటే 2017లో ట్రంప్ చైనా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు తక్కువ స్థాయి నేతలు విమానాశ్రయానికి వచ్చారు. ఇప్పుడీ మార్పు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక పోతే దాదాపు దశాబ్ద కాలం తరువాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రపంచంలో అమెరికా తరువాత రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాతో వాణిజ్య బంధాన్ని పటిష్ఠం చేసుకుని కొన్ని ఒప్పందాల దిశగా ట్రంప్ ప్రయత్నంలో భాగంగానే ఈ పర్యటనను చూడాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/trumps-visit-to-china-36-219702.html




