టీ-కాంగ్రెస్ జైత్రయాత్రకి తెరాస కౌంటర్ దీక్ష దివస్
Publish Date:Nov 28, 2013
Advertisement
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నట్లు దాదాపు నాలుగు నెలల క్రితమే ప్రకటించినా, తెలంగాణాలో దైర్యంగా తిరిగి ఆమాటని నమ్మకంగా చెప్పుకోలేని టీ-కాంగ్రెస్ నేతలు డిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాత గానీ జైత్ర యాత్రలు మొదలుపెట్టలేకపోయారు. అయితే లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తామన్నట్లు కాంగ్రెస్-మార్క్ వేషదారణలతో, సోనియమ్మ చక్క భజనలతో “తెలంగాణా ఇచ్చింది తెచ్చిందీ కూడా తామే”నంటూ తెలంగాణా లో హోరెత్తించేస్తున్నారు. జాతీయ పార్టీ అయిన తమ పార్టీ తప్ప వేరే చిన్నచితకా పార్టీలేవీ తెలంగాణా పునర్నిర్మాణానికి పనికిరావన్నట్లు కూడా వాళ్ళు తేల్చిపడేసారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరి సిద్ధాంతాలు, వాదనలు వారు వినిపిస్తున్నపటికీ, తెలంగాణా సాదించిన ఘనత మాత్రం తమదేనని గట్టిగా ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే అధికారం చెప్పట్టాలని, కేంద్రంలో చక్రం తిప్పాలని ఆశపడుతున్న తెరాస వారి స్పీడు చూసి ఉలిక్కి పడింది. దేశమదుర్లవంటి ఈ కాంగ్రెస్ నేతలను అలాగే వదిలేస్తే, వారు ఇదివరకు ఒకసారి ఆఖరి నిమిషంలో రంగ ప్రవేశం చేసి ‘తెలంగాణా సాధన సభ’ పెట్టి తమ చేతి నుండి తెలంగాణా అంశాన్నిఏవిధంగా ఎత్తుకుపోయారో మళ్ళీ ఇప్పడు తమ చేతికందే అధికారాన్ని కూడా అలాగే ఎగరేసుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించిన తెరాస నేతలు వారిని ఎదుర్కొనేందుకు రంగం సిద్దం చేసారు. పండగ చేసుకోవాలనే కోరిక ఉండాలే గానీ ఎప్పుడయినా ఏ కారణంతోనయినా పండగ చేసుకోవచ్చని నిరూపిస్తూ తెరాస నేతలు తమ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు నిరవధిక నిరాహార దీక్ష చేసి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ‘దీక్ష దివస్’ పేరుతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని జిల్లాలన్నిటిలో సభలు, సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించి, తెలంగాణా సాధించింది తమ పార్టీయేనని ప్రజలకు తెలియజేసేపనిలో పడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణా కోసం కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి ఏవిధంగా నిరాహార దీక్ష చేసి కేంద్రాన్ని ఒప్పించారో, రాష్ట్ర ఏర్పాటుకి తాము ఎంతగా శ్రమించింది, ఏవిధంగా పోరాడింది, రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకొంటున్న సీమాంధ్ర నేతల కుట్రలు, వాటిని తమ పార్టీ ఏవిధంగా ఎదుర్కొంటున్నదీ ప్రజలకి తెలియజేసి, అంతిమంగా తెలంగాణా సాధన తమవల్లనే జరిగిందని గుర్తుచేయాలని భావిస్తున్నారు. ఇక బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ ఖ్యాతి అంతా తమదేనని మరో పక్క ప్రచారం చేసుకొంటున్నారు. తెదేపా నేతలు తమ పార్టీ లేఖ ఇచ్చినందునే రాష్ట్రం ఏర్పాటుకి మార్గం సుగమం అయ్యిందని చెప్పుకొంటున్నారు. మొదటి నుండి తెలంగాణా ఏర్పాటుకి బేషరతుగా మద్దతు ఇస్తున్న సీపీఐ పార్టీ మాత్రం ఈ రేసులో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదు. అయితే తెలంగాణా ప్రజలు తాము చెపితే తప్ప తెలుసుకోలేనంత అమాయకులేమి కారనే సంగతి ఆ పార్టీలకు తెలుసు. కానీ ప్రయత్నలోపం ఉండకూడదనే ఆలోచనతో అందరూ ఎవరి దారిలో వారు దూసుకుపోతున్నారు.
http://www.teluguone.com/news/content/trs-37-27894.html