ఎర్రకోట సందర్శనపై తాత్కాలిక నిషేధం.. ఎందుకో తెలుసా?
Publish Date:Jul 16, 2026
Advertisement
ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) సాధారణ పర్యాటకులు, సందర్శకులకు తాత్కాలికంగా అందుబాటులో లేకుండా పోయింది. భద్రతా కారణాల దృష్ట్యా నెల రోజుల పాటు ఈ కోటను పూర్తిగా మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత పురావస్తు శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2026 ఆగస్టు 15న జరగనున్న భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముందస్తు నిఘా, భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్వర్వులలో పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలిచే ఎర్రకోట ప్రాంగణం ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాన వేదికగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయడానికి అధికారులు చాలా ముందుగానే ముందే కసరత్తు ప్రారంభించారు. కోట లోపల, వెలుపల క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు, సాంకేతిక రక్షణ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా సిబ్బంది రిహార్సల్స్, నిఘా పరికరాల ఏర్పాటుకు ఆటంకం కలగకుండా ఉండటానికే నెల రోజుల పాటు ఎర్రకోట సందర్శనకు తాత్కాలిక నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది, అధికారిక అనుమతి పత్రాలు ఉన్న వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు. వేడుకల ఏర్పాట్లు సజావుగా సాగడానికి వీలుగా ఈ నిషేధం విధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 15న జరిగే ప్రతిష్ఠాత్మక జాతీయ మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని ఎర్రకోట బురుజులపై నుండి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి విచ్చేసే ప్రముఖ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, విదేశీ అతిథులు అత్యున్నత స్థాయి సైనిక, పౌర అధికారులు భారీ సంఖ్యలో హాజరవుతారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం కావడంతో, ఏటా ఇక్కడ రక్షణ చర్యలను అత్యున్నత స్థాయిలో చేపడతారు. ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఢిల్లీ వ్యాప్తంగా, ముఖ్యంగా పాత ఢిల్లీ పరిసర ప్రాంతాలలో కమాండోలు, స్థానిక పోలీసులు, కేంద్ర పారామిలిటరీ బలగాలతో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తారు. డ్రోన్ల నిషేధంతో పాటు, ఎయిర్ స్పేస్ నిఘాను కూడా ముమ్మరం చేస్తారు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగాలంటే సాధారణ ప్రజా బాహుళ్యం మరియు పర్యాటకుల కదలికలను నియంత్రించడం తప్పనిసరి అవుతుంది. అందువల్లనే, జాతీయ ప్రయోజనాలు మరియు భద్రత దృష్ట్యా ఈ తాత్కాలిక అసౌకర్యానికి పర్యాటకులు, స్థానిక ప్రజలు పూర్తిగా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. Red Fort Closed, Delhi Red Fort Tourism, Independence Day 2026 Security, Archaeological Survey of India, Red Fort Reopening Date Telugu.
http://www.teluguone.com/news/content/temporary-ban-on-visiting-the-red-fort-36-226156.html





