ప్రపంచంలో రోల్ మోడల్గా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ : మంత్రి పొంగులేటి
Publish Date:Dec 6, 2025
Advertisement
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా నిర్వహించే గ్లోబల్ సమ్మిట్ ప్రపంచంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సమ్మిట్కు దేశవిదేశాల నుంచి అనేక రంగాల్లో విశేష గుర్తింపు పొందిన దిగ్గజాలను ఆహ్వానించడం జరిగిందన్నారు. గడచిన రెండు సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలతోపాటు 2037 విజన్, 2047 విజన్ ఈ రెండు సెక్టార్లకు సంబంధించిన ప్రభుత్వ లక్ష్యాలు, ఆలోచనలను ఈ సమ్మిట్లో వివరించబోతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రగతి దేశంలో ఉన్న రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా ముఖ్యమంత్రి సారధ్యంలో ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తోంది .తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పొంగులేటి అన్నారు
ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ రోజు సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, గడువులోగా పూర్తిస్ధాయి ఏర్పాట్లకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
2035 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా వృద్ది సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల లక్ష్యం సాధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. సమ్మిట్పై ఇండిగో విమానాల రద్దు ప్రభావం ఏమాత్రం చూపదని ముఖ్యమంత్రి దీనిపై ఎప్పటికప్పుడు వచ్చే అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరిశీస్తున్నారని చెప్పారు.
http://www.teluguone.com/news/content/telangana-global-summit-36-210616.html





