గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్పై కొరడా ఝళిపిస్తున్న సివిల్ శాఖ
Publish Date:Apr 13, 2026
Advertisement
రాష్ట్రంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లపై కొనసాగుతున్న బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సివిల్ సప్లైస్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించిన అధికారులు అక్రమంగా నిల్వ చేసి, గుప్తంగా విక్రయానికి సిద్ధం చేసిన వేలాది సిలిండర్లను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఇంటింటికీ చేరాల్సిన గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు కొంతమంది దందాగాళ్ల చేతుల్లో బ్లాక్ మార్కెట్ సరుకుగా మారుతున్నాయన్న సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. పలు జిల్లాల్లో ఒకేసారి దాడులు చేపట్టగా అక్రమ వ్యాపారం విస్తృత స్థాయిలో నడుస్తున్నట్లు బయటపడింది. ఇప్పటివరకు 5,079 గృహ వినియోగ సిలిండర్లు, అదనంగా 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. సబ్సిడీ గ్యాస్ను అక్రమంగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాలు ప్రజల భద్రతకే ముప్పుగా మారుతున్నాయని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 2,089 కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. “గ్యాస్ సిలిండర్ ప్రజల అవసరానికి సంబంధించినది… దందాకు కాదు” అని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా సిలిండర్ల నిల్వ, రవాణా లేదా విక్రయాలు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో ఈ బ్లాక్ మార్కెట్ దందాను పూర్తిగా అరికట్టాలని సివిల్ సప్లైస్ శాఖ సంకల్పం వ్యక్తం చేసింది.
http://www.teluguone.com/news/content/telangana-civil-supplies-department-operation-36-217275.html





