నేతల్ని నమ్ముకుంటే వాతలే!
Publish Date:Apr 12, 2025

Advertisement
కిరణ్ అరెస్టుపై తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, మరీ ముఖ్యంగా మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అందులో భాగంగా ఏపీలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు టీడీపీ శ్రేణుల్లోనే అసంతృప్తి రగిలిస్తున్నాయి. మాజీ సీఎం జగన్ సతీమణి భారతీరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ను పోలీసులు ఆగమేఘాలపై అరెస్టు చేశారు.
కిరణ్కు మంగళగిరి కోర్టు రిమాండ్ కూడా విధించింది. ఇప్పటికే టీడీపీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భారతిపై చేసిన వ్యాఖ్యలకు చేబ్రోలు కిరణ్ సారీ చెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ చర్య టీడీపీ హైకమాండ్ను ఇరకాటంలోకి నెడుతున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలపై, వారి కుటుంబ సభ్యులపై వైసీపీ నేతలు చేసిన తీవ్ర విమర్శలపై ఎలాంటి చర్యలూ తీసుకోని టీడీపీ ప్రభుత్వం.. ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తను 24 గంటలు కూడా కాకముందే అరెస్ట్ చేయడాన్ని పార్టీ కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. బూతులతో రెచ్చిపోయిన వైసీపీ కేడర్ పైనా ఇలాగే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేసున్నారు టీడీపీ కార్యకర్తలు.
చేబ్రోలు కిరణ్ ఐటీడీపీలో యాక్టివ్గా పని చేసేవారు. భారతిపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయనపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంతలోనే టీడీపీ హైకమాండ్ కిరణ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఇబ్రహీంపట్నంలో కిరణ్ను అరెస్టు చేశారు. కిరణ్ అరెస్టు టీడీపీ కార్య కర్తల్లో అసంతృప్తిని రేకెత్తించింది. అతని అరెస్టును కార్యకర్తలు పార్టీకి సేవ చేసిన వారికి శిక్షగా భావి స్తున్నారు. మనోళ్లను అరెస్టు చేస్తారు కానీ వైసీపీ వాళ్లను వదిలేస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ నాయకులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర నాయకులపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు వెల్లువెత్తాయి. అయితే, వీటిపై నాటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై కిరణ్ ను అరెస్టు చేయడాన్ని తమ్ముళ్లు తట్టుకోలేకపోతున్నారు.
సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తూ చేసే అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం ముందు అందరూ సమానమేనని చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. కూటమి ప్రభుత్వ విలువలను, నీతినిజాయితీకి ఇది నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, మెజార్టీ టీడీపీ కార్యకర్తల్లో దానిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆ అసంతృప్తి పార్టీ ఐక్య తకు సవాలుగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకుండా కిరణ్ను చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు నిలదీస్తున్నారు. ఐకాన్ పాలిటిక్స్ వంటి వివిధ వెబ్ సైట్లు పెడుతున్న ఒపీనియన్ పోల్స్లో కిరణ్ అరెస్టును 80 శాతం మందికి పైగా వ్యతిరేకి స్తున్నారు.
కార్యకర్తలను శాంతింపజేయడానికి, గతంలో టీడీపీ నేతలపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ సానుభూ తిపరు లపై ఫిర్యాదులను పరిశీలించాలని కొందరు సూచిస్తున్నారు. అదే జరిగితే రాజకీయ కక్షగా ముద్ర పడుతుందేమోననే భయం టీడీపీ హైకమాండ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. కార్యకర్తల ఆగ్రహాన్ని శాతింప చేయడం, చట్టం అందరికీ సమానమేనని నిరూపించడం ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారిందని చెప్పొచ్చు.
అదీకాక చేబ్రోలు కిరణ్ అరెస్టు తర్వాత ఆయన్ను పోలీసులు తరలించిన తీరు, ప్రెస్ మీట్లో మొహానికి నల్ల ముసుగు ధరించి ప్రవేశపెట్టడం వంటివి ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో మరింత ఆగ్రహానికి కారణమవుతున్నాయి. మొదట్లో భారతిపై చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వైసీపీతో పాటు టీడీపీలో సైతం ఆగ్రహం వ్యక్తమైంది. కానీ పోలీసులు అతన్ని అరెస్టు చేశాక కోర్టుకు తరలించడం, నల్ల ముసుగు వేయడం వంటి కారణాలతో ఇప్పుడు సొంత పార్టీలో ఆయనపై సానుభూతి పెరుగుతోందంటున్నారు. సస్పెన్షన్ ఓకే, కేసులు పెట్టడం ఓకే, అరెస్ట్ కూడా ఓకే, కానీ అలా ఏదో మర్డర్, మానభంగం చేసినవాడిలా ఫేస్ మాస్క్ వేసి నిలబెట్టడం కరెక్ట్ కాదని టీడీపీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తిస్తున్నారు. నాయకుల్ని నమ్ముకుంటే మిగిలేది వాతలే అని సెటైర్లు విసురుతున్నారు.
http://www.teluguone.com/news/content/tdp-cadre-angry-on-chebrolu-kiran-arrest-25-196086.html












