కట్టలు తెంచుకున్న తెలుగుదేశం శ్రేణుల ఆగ్రహం.. వైసీపీకే కాదు.. టీడీపీకీ హెచ్చరికే!
Publish Date:Feb 2, 2026
Advertisement
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఒకటి అన్నది నిస్సందేహంగా చెప్పవచ్చు. పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ విషయంలో తెలుగుదేశం పార్టీ వామపక్షాలు, బీజేపీ వంటి పార్టీలకు దీటుగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తారు. ఎన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఎన్ని దాడులకు గురైనా, ఆ పార్టీ నేతలు ఎన్నడూ కట్టుదాటి ప్రవర్తించిన దాఖలాలు కనిపించవు. తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. అన్ని సంక్షోభాలనూ కూడా శాంతియుత ఆందోళనలు, పోరాటాల ద్వారానే అధిగమించింది. ముఖ్యంగా 1984లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అత్యంత అప్రజాస్వామికంగా కూల్చివేసిన సమయంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నభూతో అన్నచందంగా చరిత్రలో నిలబడిపోతుంది. ఇక గత జగన్ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకూ తెలుగుదేశం రాజకీయ మనుగడ లేకుండా చేయాలన్నలక్ష్యంతో జరిగిన కుట్రలకు లెక్కే లేదు. స్కిల్ కేసు అంటూ అక్రమంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధించిన సందర్భంలో కూడా ఎక్కడా గీత దాటకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతంగానే తెలుగుదేశం శ్రేణులు ఉద్యమించాయి. అయితే శనివారం (జనవరి 31)న తెలుగుదేశం శ్రేణులు అంబటి రాంబాబు నివాసాన్ని ముట్టడించి విధ్వంసం సృష్టించారు. తెలుగుదేశం చరిత్రలో ఈ రీతిగా కార్యకర్తలు రెచ్చిపోవడం ఇదే మొదటి సారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. అయితే తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించడమే కారణం అంటున్నారు. అదే సమయంలో మరో మాజీ మంత్రి జోగు రమేష్ కూడా మంత్రి నారా లోకేష్ పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా తెలుగుదేశం శ్రేణులు ఫైర్ అయ్యాయి. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసాన్ని తెలుగుదేశం కార్యకర్తలు ముట్టడించారు. ఇలా ఒక రోజు వ్యవధిలోనే తెలుగుదేశం కార్యకర్తలు ఇద్దరు వైసీపీ నేతల ఇళ్ల ముట్టడి.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించురకుంది. గతంలో అంటే వైసీపీ హయాంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా ఈ స్థాయిలో తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తం కాలేదు. అయితే ఇప్పుడుఈ స్థాయిలో తెలుగుదేశం శ్రేణులు భగ్గుమనడం విశేషం. అధినేతను దూషించినా, అనుచితంగా వ్యవహరించినా ఇక ఊరుకునేది లేదన్న స్పష్టమైన సందేశాన్ని తెలుగుదేశం శ్రేణులు ఈ ఘటనల ద్వారా వైసీపీకి, ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వైసీపీయులపై చర్యల విషయంలో ఉదాశీనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికీ ఈ సంఘటనలు ఒక హెచ్చరికగా భావించవచ్చన్న చర్చ రాజకీయవర్గాలలో జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/tdp-cadre-anger-besiege-ambati-and-jogiramesh-houses-25-213369.html





