పాక్ నోరుమూసుకుంటే మంచిదంటూ తాలిబన్ సర్కార్ వార్నింగ్.!
Publish Date:Aug 18, 2026
Advertisement
అంతర్జాతీయ వేదికలపై తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇతర దేశాలపై ఆరోపణలు చేయడం పాకిస్థాన్ కు రివాజుగా మారింది. పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్ఘన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ ఇటీవల ఆప్ఘనిస్థాన్ పై చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలోని తాలిబన్ సర్కార్.. దీటుగా బదులిచ్చింది. పాకిస్థాన్ లో రగులుతున్న ప్రజాగ్రహాన్ని పట్టించుకోకుండా, పొరుగుదేశాలపై విమర్శలు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి ఆఫ్ఘనిస్థాన్పై విమర్శలు గుప్పించారు. ఆఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో తాలిబన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన.. ఆఫ్ఘన్ భూభాగాన్ని అడ్డాగా చేసుకుని ఉగ్రవాదులు పాకిస్థాన్పై సరిహద్దు దాటి దాడులకు తెగబడుతున్నారని, దీనివల్ల తమ దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆరోపించారు. దీనిపై తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పాకిస్థాన్ ఆరోపణలను ఖండించడమే కాకుండా.. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్థాన్ భూభాగం నుంచి సరిహద్దు దాటి ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే వాదనలో వాస్తవం లేదన్న ఆయన పాకిస్థాన్ తన సొంత దేశంలో ఎదుర్కొంటున్న తీవ్ర భద్రతా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని, ప్రపంచ దృష్టిని మరల్చడానికే ఆఫ్ఘన్పై నిందలు వేస్తోందని విమర్శించారు. ప్రపంచానికి ముప్పుగా మారిన ఐసిస్ ఉగ్రవాదులకు, ఆఫ్ఘన్ వ్యతిరేక తీవ్రవాద గ్రూపులకు స్వయంగా పాకిస్థానే ఆశ్రయం కల్పిస్తోందని జబిహుల్లా ముజాహిద్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా, ఆప్ఘన్ లో అశాంతి సృష్టిస్తున్న ఉగ్ర సాయుధ గ్రూపులకు పాకిస్థాన్ ప్రభుత్వం, మిలిటరీ మద్దతు ఇస్తున్నాయని విమర్శించారు. Taliban, Pakistan, Afghanistan Pakistan conflict, UN Pakistan allegations, ISIS in Pakistan, Taliban warning to Pakistan
http://www.teluguone.com/news/content/taliban-36-229164.html





