సికిందరాబాద్.. విశాఖ వందేభారత్ రైలు.. ప్రయాణీకుల జోరు
Publish Date:Apr 11, 2026
Advertisement
తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న ప్రతిష్టాత్మక సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనూహ్య ఆదరణతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలు.. దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ప్రయాణికుల ఆదరణ పొందిన రైలుగా సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా.. విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు వందేభారత్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. రైల్వే శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైలు ఆక్యుపెన్సీ రేటు 100 శాతానికి పైగా నమోదవుతోంది. కొన్ని సందర్భాల్లో వెయిటింగ్ లిస్ట్ కూడా భారీగా ఉంటోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడుస్తున్న ఇతర రైళ్లతో పోలిస్తే, సికిందరాబాద్, విశాఖ మార్గంలో నడిచే వందే భారత్ లో ప్రయాణానికే ప్రయాణీకులు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణీకుల రద్దీ స్థిరంగా ఉంటోంది. ఇక పండుగలు, వారాంతపు సెలవు దినాల్లో సీట్ల కోసం నెలల ముందే బుకింగ్స్ పూర్తవుతున్నాయి. ఈ రైలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం ప్రయాణ సమయం తగ్గడమేనంటున్నారు రైల్వే అధికారులు. గతంలో విశాఖ చేరుకోవడానికి పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టేది, కానీ వందే భారత్ కేవలం 8 గంటల లోపు ప్రయాణీకులను గమ్యస్థానం చేరుస్తోంది. దీనితో పాటు నాణ్యమైన ఆహారం, మెరుగైన భద్రత, సుఖవంతమైన సీటింగ్ వ్యవస్థ ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. వ్యాపారవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ రైలు సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ప్రయాణికుల నుండి వస్తున్న భారీ డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, రైల్వే అధికారులు ఇప్పటికే ఈ మార్గంలో రెండో వందే భారత్ రైలును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఈ రెండు రైళ్లు కూడా దాదాపు పూర్తి సామర్థ్యంతో నడుస్తుండటం తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న రవాణా అవసరాలను ప్రతిబింబిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై రూట్లలో నడిచే వందే భారత్ రైళ్ల కంటే కూడా సికింద్రాబాద్-వైజాగ్ రూట్కే ప్రయాణికులు బ్రహ్మరథం పడుతున్నారు. భవిష్యత్తులో ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సమాయత్తమౌతోంది. ముఖ్యంగా బోగీల సంఖ్యను పెంచడం లేదా మరిన్ని స్టాపేజీలు, సమయపాలన వంటి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ మరిన్ని వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నది. రానున్న రోజుల్లో ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల హవా మరింత పెరగనుందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/secunderabad-36-217116.html





