దీప్కే దాడి వెనుక ఆర్ఎస్ఎస్?
Publish Date:Jun 17, 2026
Advertisement
నీట్- పేపర్ లీక్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, జైపూర్లో తనపై జరిగిన దాడి వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. నీట్ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆర్ఎస్ఎస్ ఈ దాడికి పాల్పడిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దేశంలో విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్న దీప్కే..ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం (జూన్ 16) మీడియాతో మాట్లాడిన ఆయన తాము గాంధీ, అంబేద్కర్ల ఆశయాల బాటలో నడిచే సత్యాగ్రహులమని అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. సోమవారం (జూన్ 15) జైపూర్ ర్యాలీలో, కార్యకర్తల భుజాలపై ఉన్న దీప్కేపై కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ నెల 21న నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఈ వివాదంపై పోరాడేందుకు అమెరికా నుంచి తిరిగి వచ్చిన దీప్కే.. ఢిల్లీలోని జంతర్ మంతర్తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. కాగా, దీప్కే చేసిన ఆరోపణలపై ఆరెస్సెస్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
http://www.teluguone.com/news/content/rss-behind-the-attack-on-deepke-36-223181.html





