గిల్లితే గిల్లించుకోవాలి.. నూరు గొడ్లను తిన్న రాబందు..
Publish Date:Apr 25, 2021
Advertisement
గిల్లితే గిల్లించుకోవాలి.. అరవొద్దు.. ఇది పోకిరి సినిమాలో పాపులర్ డైలాగ్. మూవీలో మాఫియా లీడర్ ప్రకాశ్రాజ్ చెప్పే డైలాగ్ ఇది. ఈ డైలాగ్ సీఎం జగన్రెడ్డికి సరిగ్గా సూట్ అవుతుందంటూ సెటైర్లు వేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఏపీలో కరోనా ఉధృతంగా ఉన్న వేళ.. పది, ఇంటర్ పరీక్షలు పెట్టలనుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతూ ఈ డైలాగ్ను గుర్తు చేశారు. ఎగ్జామ్స్ పెడుతూ.. ముఖ్యమంత్రి జగన్రెడ్డి గిల్లితే ప్రజలు గిల్లించుకోవాలే కానీ, పరీక్షలు వద్దంటూ అరవొద్దు.. అనేది రఘురామకృష్ణంరాజు ఉద్దేశ్యం. పోకిరి డైలాగ్ను ప్రస్తుత ఏపీ పరిస్థితికి సింక్ చేస్తూ.. సీఎం జగన్ను ఎద్దేవా చేసిన తీరు.. జగన్నే గిల్లినట్టుందంటూ జనాలకు నవ్వులు తెప్పిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎన్నికలే వద్దంటూ రోడ్డు మీదకు వచ్చిన వారంతా ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు రాఘురామ. ‘‘పనికి మాలిన వారందరినీ పంపించావు కదా.. సుప్రీం కోర్టుకు కూడా వెళ్లారు కదా.. ఏమై పోయారు మీరంతా... ఇప్పుడు స్పందించండి. మాట్లాడండి... ప్రజలను చంపే హక్కు ప్రభుత్వానికి లేదు. దయచేసి.. పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలన్న మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఏపీలో కరోనా కల్లోలం, ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపైనా రఘురామ విమర్శలు గుప్పించారు. ‘‘కరోనా మరణాల సంఖ్య బయటపెట్టండి. శ్మశానాల్లో ఒకలా ఉంటే రిపోర్టుల్లో మరోలా ఉంది. మీరు సలహాలు వినరూ.. ఇచ్చే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరూ చెప్పనంత మాత్రాన.. ప్రజలు నోరు మూసుకుని కూర్చుంటారా? నూరు గొడ్లను తిన్న రాబందు.. గాలి వానకు చావలేదా.. తప్పుపై తప్పు చేసుకుంటూ దయచేసి వెళ్లొద్దు. ఇది నా చిరు సలహా. న్యాయమూర్తులను భయపెట్టడం మానేయండి. మీ కేసులను త్వరగా తేల్చుకోండి’’ అంటూ సీఎం జగన్రెడ్డిపై మండిపడ్డారు రఘురామకృష్ణంరాజు.
http://www.teluguone.com/news/content/rrr-cinematic-comments-on-cm-jagan-25-114263.html












