political-news-img

పశ్చిమాసియా యుద్ధ సెగ...10 వేల విమాన సర్వీసులు రద్దు

పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలల కారణంగా గగనతలం అభద్రతగా మారడంతో భారత్ నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లే వేలాది విమాన సర్వీసులు నిలిచిపోయాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా సర్వీసులు రద్దయినట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ అధికారికంగా ప్రకటించింది. యుద్ధ మేఘాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని దేశీయ విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను భారీగా మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా మీదుగా ప్రయాణించే విమానాలు ఇప్పుడు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, ఇంధన ఖర్చులు కూడా భారంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా వంటి సంస్థలు తమ ఇంధన సర్‌ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. మరోవైపు సుదూర ప్రాంతాలకు విమానాలను నడిపే పైలట్ల విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పైలట్లకు ఉండే 'ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్' (FDTL) నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. యుద్ధం కారణంగా విమాన మార్గాల్లో మార్పులు రావడం, ప్రయాణ సమయం అనూహ్యంగా పెరగడంతో పైలట్ల పనివేళల్లో ఈ మినహాయింపులు ఇవ్వక తప్పలేదని అధికారులు వివరిస్తున్నారు. యుద్ధం కారణంగా కేవలం విమానాల రద్దే కాకుండా, విమానయాన సంస్థల ఆర్థిక స్థితిగతులపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. గగనతల మార్గాల మూసివేత వల్ల విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో నిర్వహణ వ్యయం రెట్టింపు అవుతోంది. ఇది చివరకు సామాన్య ప్రయాణికులపై టికెట్ ధరల రూపంలో భారం మోపే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక విదేశీ సర్వీసులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. ప్రస్తుత పరిస్థితులపై విమానయాన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం మరికొంత కాలం కొనసాగితే అంతర్జాతీయ ప్రయాణాలు మరింత క్లిష్టంగా మారుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకునే ముందు విమాన సంస్థల తాజా అప్‌డేట్లను గమనించాలని సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే తప్ప విమాన సర్వీసులు యథాస్థితికి వచ్చే అవకాశం లేదు. అప్పటివరకు విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ, భారతీయుల భద్రతకు పెద్దపీట వేస్తోంది.

Publish Date: Apr 7, 2026 8:37PM

political-news-img

రుతుక్రమం అంటరానితనం ఎలా అవుతుంది...శబరిమల కేసులో కీలక వ్యాఖ్యలు

కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసును విచారిస్తున్న తొమ్మిది మంది సభ్యుల విస్తృత ధర్మాసనంలో ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బి.వి. నాగరత్న అస్పృశ్యత అంశంపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రుతుక్రమం ఆధారంగా మహిళలను దేవాలయాల్లోకి అనుమతించకపోవడాన్ని రాజ్యాంగంలోని 'అంటరానితనం' (ఆర్టికల్ 17) పరిధిలోకి తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. ఒక మహిళగా ఆలోచిస్తే, కేవలం నెలలో మూడు రోజుల పాటు అస్పృశ్యతను పాటించి, నాలుగో రోజు నుంచి అది వర్తించదని చెప్పడం ఏంటని ఆమె నిలదీశారు. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గత తీర్పులను ప్రస్తావించారు. 2018 నాటి శబరిమల తీర్పులో, 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయ ప్రవేశానికి నిరాకరించడం అంటరానితనం కిందకే వస్తుందని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడినట్లు గుర్తు చేశారు. అయితే, ఈ వాదనతో జస్టిస్ నాగరత్న ఏకీభవించలేదు. శబరిమల కేసులో ఆర్టికల్ 17ని అన్వయించడం అంటే మహిళలను అంటరానివారిగా పరిగణించడమే అవుతుందని, దీనిపై తనకు తీవ్ర అభ్యంతరం ఉందని ఆమె స్పష్టం చేశారు. కేవలం శారీరక ధర్మాల ఆధారంగా ఒక వర్గాన్ని దూరం పెట్టడాన్ని సామాజిక అంటరానితనంతో పోల్చడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. దీనిపై సొలిసిటర్ జనరల్ వివరణ ఇస్తూ.. తాను కేవలం వయసు ఆధారిత నిబంధనల గురించి మాట్లాడుతున్నానని, అది ఒక నిర్దిష్ట వయసు కలిగిన మహిళల సమూహానికి సంబంధించిన అంశమే తప్ప కేవలం మూడు రోజుల రుతుక్రమ సమస్య కాదని స్పష్టం చేశారు. ఆలయ సంప్రదాయాలు మరియు రాజ్యాంగ హక్కుల మధ్య ఉన్న వైరుధ్యంపై సుదీర్ఘ చర్చ జరిగింది. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశంపై గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ, దానిపై దాఖలైన రివ్యూ పిటిషన్లను ప్రస్తుతం పెద్ద ధర్మాసనం పరిశీలిస్తోంది. భక్తుల మనోభావాలు, మతపరమైన ఆచారాలు మరియు మహిళా సమానత్వం వంటి అంశాల మధ్య సమతుల్యత సాధించడం కోర్టుకు సవాలుగా మారింది. ఈ కేసులో జస్టిస్ నాగరత్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అస్పృశ్యత అనే పదాన్ని ఏ సందర్భాల్లో వాడాలి అనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఈ కీలక కేసులో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Publish Date: Apr 7, 2026 7:47PM

political-news-img

ఆన్‌లైన్ ఆర్డర్…షాక్ ఇచ్చిన బిర్యానీ...హోటల్ సీజ్

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బిర్యానీ తెరిచి చూసే సరికి దుర్వాసన రావడంతో వినియోగదారు షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వెంకటరమణ కాలనీలో నివసిస్తున్న కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం ఉదయం ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. కొద్దిసేపటికే “లక్కీ బిర్యానీ షవర్మ” నుంచి ప్యాకెట్ చేరింది. ఆకలితో వెంటనే బిర్యానీ పొట్లం తెరిచి చూడగానే తీవ్ర దుర్వాసన రావడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. పరిశీలించగా బిర్యానీ పూర్తిగా కుళ్లిపోయిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హోటల్‌పై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఫ్రిడ్జ్‌లో సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మూడు రోజుల క్రితం తయారు చేసిన బిర్యానీని నిల్వ ఉంచి, ఆర్డర్ వచ్చినప్పుడు మళ్లీ వేడి చేసి కస్టమర్లకు పంపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా హోటల్‌లో పరిశుభ్రత పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉందని అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్‌లో ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. వెంటనే హోటల్ యజమాని ఇర్ఫాన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి హోటల్‌ను సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో నగరంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై వినియోగదారుల్లో భయం నెలకొంది. ఆహారం ఆర్డర్ చేసే ముందు రెస్టారెంట్ రేటింగ్స్, రివ్యూలను తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.

Publish Date: Apr 7, 2026 7:33PM

political-news-img

హైదరాబాద్‌లో బాంబు బెదరింపుల కలకలం ఆల్ ఇండియా రేడియో, జేఎన్‌టీయూలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

హైదరాబాద్‌లో బాంబు బెదరింపులు కలకలం రేపాయి. . నగరంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో ఒకటైన ఆల్ ఇండియా రేడియో కార్యాలయంతో పాటు, కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు. అదే సమయంలో కూకట్‌పల్లిలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కి కూడా బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకే రోజు రెండు ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలాంటి బెదిరింపులు రావడంతో నగర పోలీసులు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్నారు. రేంపు ప్రాంతాలలో బాంబ్ స్క్వాడ్డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే రెండు చోట్లా కూడా ఎలాంటి బాబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నకిలీ బెదరింపులకు పాల్పడింది ఎవరు అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ బెదిరింపుల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Publish Date: Apr 7, 2026 7:04PM

political-news-img

నగరంలో కల్తీ మాఫియా... ఇప్పుడు నీటిలో కూడా కల్తీ!

హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాలు, పండ్లు, మసాలాలు, అల్లం-వెల్లుల్లి, టీ పౌడర్, మాంసం వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం, చికెన్‌ను ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్న ఘటనలు బయటపడడంతో ప్రజలు బయట భోజనం చేయడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు తాజాగా త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. బోర్‌వెల్ నుంచి వచ్చే నీటిని ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండా నేరుగా ప్యాకెట్లలో నింపి “మినరల్ వాటర్” పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు లభిస్తున్న ఈ ప్యాకెట్ నీటిని ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా దాడులు చేపట్టాయి. దాడుల సమయంలో ప్లాంట్లలోని పరిస్థితులు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణం, లీకేజీలతో ఉన్న యంత్రాలు, పాకురు పట్టిన ట్యాంకులు, ఎలాంటి శుద్ధి లేకుండా నీటిని ప్యాకింగ్ చేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్లాంట్లను అధికారులు సీజ్ చేసి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి వస్తువులో కల్తీ వెలుగులోకి వస్తున్న తరుణంలో, ఇప్పుడు త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చింది. తక్కువ ధరకు లభించే ప్యాకెట్ నీటిని వినియోగించే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. నగరంలో కల్తీ దందాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.

Publish Date: Apr 7, 2026 6:34PM

political-news-img

39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు పచ్చజెండా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంగళవారం (ఏప్రిల్ 7) జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ. 39,436.84 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షా 11 వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 16వ ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పి. నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరచడం ద్వారా నిరుద్యోగితను తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ, విద్యుత్, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఈ పెట్టుబడులు ప్రధానంగా రానున్నాయి. రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది. పెట్టుబడుల వివరాలను, ఉద్యోగాల గణాంకాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో ఉంచాలని సీఎం ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రాయలసీమ ప్రాంతాన్ని దేశానికే తలమానికంగా నిలిచే సోలార్ హబ్ మార్చాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీమలో సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని, తద్వారా రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్ ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని సూచించారు. ఇందుకోసం పటిష్టమైన గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ఏపీని మేటిగా నిలబెట్టేందుకు శ్రీసిటీ, అనంతపురం వంటి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటు ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్ వంటి ఇంధనాలను తయారు చేసే కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పరిశ్రమల స్థాపనలో భద్రతా ప్రమాణాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా ఫార్మా మరియు గ్రీన్ ఎనర్జీ విభాగాల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కచ్చితంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత 22 నెలల్లో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రావడం ఏపీ అభివృద్ధికి నిదర్శనమన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుల గ్రౌండింగ్ పనులు ప్రారంభించి, నిర్ణీత గడువులోగా పరిశ్రమలు అందుబాటులోకి వచ్చేలా చేయాలని సీఎం ఆదేశించారు.

Publish Date: Apr 7, 2026 6:22PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img