Top Stories

ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు పూర్తి

  బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య మాగంటి అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి  అంతిమ సంస్కారాలు కన్నీటి వీడ్కోలు నడుమ జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు తుది నివాళులర్పించారు. అంతకుముందు జరిగిన అంతిమయాత్రలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు  పాడె మోశారు. పోలీసులు మాగంటి భౌతికకాయానికి గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలను పూర్తి చేశారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆయన నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు కొనసాగింది.  మాదాపూర్ నీరూస్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్ నగర్ మీదుగా అంతిమయాత్ర సాగింది. .బీఆర్ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తన అభిమాన నాయకుడిని చివరిసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఫిల్మ్‌నగర్‌ మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు అధికార లాంచనాలతో పూర్తి అయ్యాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఈ నెల 5న ఆయన ఏఐజీలో చేరారు. ఈ నెల 5న ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దాంతో వెంటనే కుటుంబీకులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.  
 ప్రభుత్వ  అధికార  లాంఛనాలతో మాగంటి అంత్యక్రియలు పూర్తి Publish Date: Jun 8, 2025 5:34PM

దివంగత నేత ఆనం వెంకట రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి

  నెల్లూరు రామలింగాపురం సర్కిల్‌లో దివంగత నేత ఆనం వెంకటరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు.  సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతు  సింహపురి ఉక్కుమనిషి, ఓటమి ఎరుగని రాజకీయ దురంధరుడని పేర్కొన్నారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు, ఆనం వంశ రాజసానికి ప్రతీక ఆనం వెంకటరెడ్డి ఆయన సేవలను కొనియాడారు.  నెల్లూరు రాజకీయాల్లో, అభివృద్ధిలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి,  కాకర్ల సురేష్, ఇంటూరు నాగేశ్వరరావు, పాశం సునీల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గోన్నారు.  
దివంగత నేత ఆనం వెంకట రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ వేమిరెడ్డి Publish Date: Jun 8, 2025 5:01PM

నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ వద్ద : సీఎం రేవంత్

  హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అజాత శత్రువు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ దగ్గర అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. గౌలిగూడ గల్లి నుంచి హరియాణా గవర్నర్‌ వరకు ఎదిగారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది.  పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారు. దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో వాజ్‌పేయీకి ఉన్న గౌరవం.. రాష్ట్రస్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన నిర్వహించే అలయ్‌ బలయ్‌ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన శైలి, విధానాల నుంచి నూతనంగా రాజకీయాల్లోకి వచ్చే వారు నేర్చుకోవాలి. జంటనగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్‌, దత్తాత్రేయ. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్‌ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారు. మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుంది’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు.  
నా స్కూల్ బీజేపీ..నా కాలేజీ టీడీపీ..నా ఉద్యోగం రాహుల్ వద్ద : సీఎం రేవంత్ Publish Date: Jun 8, 2025 4:29PM

రాజకీయ సంకల్పంతోనే పోలీస్ సంస్కరణలు సాధ్యం : ఏబి వెంకటేశ్వరరావు

  ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ,ఎన్నికల మానిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ధ పాలన సాధ్యం అవుతుందని విశ్రాంత ఐపిఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 8వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై జరిగిన చర్చా గోష్టికి ముఖ్యఅతిథిగా హాజరై ఏబి వెంకటేశ్వరరావు ప్రసంగించారు. నేడు జైళ్ళలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85 శాతం పైగా విచారణ ఖైదీలుగా పేద వర్గాలే ఉన్నారని తెలిపారు.  న్యాయస్థానాలను రెట్టింపు చేయడం ద్వారా  న్యాయాన్ని అందరికీ అందించగలమని తద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండానే, నేర నిరూపణతో నేరాలను తగ్గించవచ్చునన్నారు. పోలీసులలో నైపుణ్యాలను పెంచి ఆధునిక సాంకేతిక పరిణామాన్ని అందించడం, నేర పరిశోధనను, నేర విచారణ నుండి వేరుచేస్తేనే సత్వర న్యాయం సాధ్యమన్నారు. మనతోపాటు బ్రిటన్ నుండి విముక్తి పొందిన సింగపూర్ న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థల్లో అగ్ర భాగాన ఉందని, ఇది రాజకీయ సంకల్పం ద్వారానే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అన్ని రకాల దుర్మార్గాలపై న్యాయ విచారణ జరిపి, సంబంధిత బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  ఇటీవల తెనాలిలో ముగ్గురు యువకులను ప్రజల మద్య బహిరంగంగా చావ బాది ,ఆ వీడియోను ఉద్దేశ్య పూర్వకంగా ప్రజల ముందు ఉంచి, ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి ప్రయత్నించడం అమానుషమని పేర్కొని, సంబంధిత పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అదనపు వ్యయం లేకుండానే దృఢమైన రాజకీయ సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతమున్న సిబ్బంది, వనరులతోనే 75 శాతం మేర సంస్కరణలు తీసుకొని రావచ్చన్నారు. 2.5 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఒకవైపు ఉంటే, మరోవైపు పోలీస్ వ్యవస్థలో మార్పుల కోసం, పేదలకు సత్వర న్యాయం కల్పించడానికి అదనంగా కనీసం 1000 కోట్ల వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం శోచనీయమన్నారు.  సభకు అధ్యక్షత వహించిన జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి  ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ యంత్రాంగం అధికార పార్టీకి ప్రైవేట్ ఆర్మీగా మారిందన్నారు. అధికార పార్టీ నేతల కను సన్నలలో క్షేత్రస్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీని వలన చట్టబద్ధ పాలనకు భంగం వాటిల్లుతుందన్నారు. తెనాలి సంఘటనతో బాధ్యులైన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని, న్యాయ విచారణ చేపట్టాలని కోరారు. మాజీ శాసన మండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు ప్రసంగిస్తూ సామాన్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వారి సమస్యలను వివ రించడానికి భయపడే వాతావరణం నేడు ఉందని, ఫ్రెండ్లీ పోలీస్ రావాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త ప్రో. డి. ఏ. ఆర్. సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడితే కేవలం వందల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ లుగా విజయం సాధిస్తున్నారని, వీళ్లు కూడా అధికార పార్టీకి దాసోహం కావడం వలన ప్రజాస్వామ్యం ఎలా వికసిస్తుందని ప్రశ్నించారు.
రాజకీయ సంకల్పంతోనే పోలీస్ సంస్కరణలు సాధ్యం : ఏబి వెంకటేశ్వరరావు Publish Date: Jun 8, 2025 3:41PM

భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం..నలుగురు స్మగ్లర్లు అరెస్టు

  అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా ఎర్రచందనం దుంగలతో పాటు ఒక మోటారు సైకిల్ ను స్వాధీనం చేసుకుని, నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.  టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ  పీ. శ్రీనివాస్  ఆదేశాలతో అధికారులు, సిబ్బంది అన్నమయ్య జిల్లా బురకాయల కోట అటవీ ప్రాంతం చేరుకుని, వేపూరి కోట ఫారెస్ట్ బీటు పరిధిలో డంపింగ్ పాయింట్ల తనిఖీ చేపట్టారు. ఆదివారం తెల్లవారుజామున  వీరు అన్నగారి పల్లి సమీపంలోని వంకగట్టు వద్ద ఒక మోటారు సైకిల్ కనిపించింది.  దానిని సమీపించడంతో అప్పటికే అక్కడ గుమికూడి ఉన్న కొందరు పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని వెంబడించి నలుగురిని పట్టుకున్నారు. ఆప్రాంతంలో తనిఖీ చేయగా అక్కడ 48 ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని అన్నమయ్య జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారితో పాటు ఎర్రచందనం దుంగలు, మోటారు సైకిల్ ను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం..నలుగురు స్మగ్లర్లు అరెస్టు Publish Date: Jun 8, 2025 3:28PM

జెంటిల్‌మెన్‌ పదానికి దత్తాత్రేయ ప్రతిరూపం : చంద్రబాబు

  హైద‌రాబాద్‌లోని శిల్పకలావేదికలో బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రాసిన ప్రజల కథే బయోగ్రఫీ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అలయ్ బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,  దత్తాత్రేయ బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు , విశ్రాంత సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత పార్శ్వాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే బండారు దత్తాత్రేయ అని గుర్తొస్తారని ఆయన అన్నారు.  జెంటిల్‌మెన్‌కు ప్రతిరూపం  దత్తాత్రేయ అని  అన్నారు. దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారన్నారు. సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారని కొనియాడారు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఆయనది పేరుకు హిందుత్వం, మతం భారతీయం అని చంద్రబాబు పేర్కొన్నారు‘ అలయ్‌ బలయ్‌’ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు. అందరినీ కలిపేందుకు వేదిక రూపొందించారు. ఆయనకు శత్రువులు ఎవరూ ఉండరు. ఆయనకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు.  దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. లేఖలు రాయడంలో అంబాసిడర్‌గా నిలిచారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అనునిత్యం పనిచేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మాజీ ఎన్వీ రమణ, గవర్నర్ కమ్మంపాటి హరిబాబు, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.   
జెంటిల్‌మెన్‌ పదానికి దత్తాత్రేయ ప్రతిరూపం : చంద్రబాబు Publish Date: Jun 8, 2025 1:57PM

మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి లోకేష్ దంపతుల నివాళి

  బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్‌  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు. టీడీపీతోనే మాగంటి  రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారని.. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు. మాగంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.  
మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి లోకేష్ దంపతుల నివాళి Publish Date: Jun 8, 2025 1:25PM

రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

  తెలంగాణ మంత్రులుగా  గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో నూతన మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అనంతరం నూతన మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి  గవర్నర్ జిష్ణుదేవ్  అభినందనలు తెలిపారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 12 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఇవాళ ముగ్గురిని భర్తీ చేశారు.  మార్పు చేర్పులతో ఐదు బెర్తులు పూరించాలని తొలుత భావించినా, సామాజిక వర్గ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ముగ్గురి పేర్లకు ఆమోదం లభించినట్టు తెలిసింది. తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. కాగా, ఈసారి మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం సూచించినట్లు తెలిసింది. కొత్త మంత్రులతో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయకన్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది.
రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం Publish Date: Jun 8, 2025 1:09PM

మాగంటి భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు..కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం

    జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌  పార్థివ దేహానికి బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్  నివాళులు అర్పించారు. మాగంటి మృతదేహానికి చూసి కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు.  భౌతికకాయం వద్ద పుచ్చగుచ్చం ఉంచి నివాళి అర్పించారు. అనంతరం, మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మాగంటి కుమారుడిని అప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు.  ఈ క్రమంలో కేసీఆర్‌ భావోద్వేగానికి గురైన పెద్దాయన కన్నీరు పెట్టుకున్నారు. మాగంటి మృతదేహాన్ని చూసి ఆవేదన చెందారు.
మాగంటి భౌతికకాయానికి కేసీఆర్ నివాళులు..కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం Publish Date: Jun 8, 2025 12:52PM

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు పంపిణీ ప్రారంభం

  హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప మందు ప్రసాదం పంపిణీని కార్యక్రమం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా పేషంట్లు తరలివస్తున్నారు. మంత్రికి చేప ప్రసాదాన్ని బత్తిని కుటుంబ సభ్యులు స్వయంగా అందించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జూన్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ చేప ప్రసాదాన్ని ప్రజలకు అందించనున్నారు.  ఈ కార్యక్రమం కోసం టీజీఆర్టీసీ  ప్రత్యేక బస్సులను సికింద్రాబాద్, కాచిగూడ, జేబీఎస్, ఎంజీబీఎస్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రాంతాల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు నడుపుతోంది.ఆస్తమా, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది ఈ ప్రసాదం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. జూన్ 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ చేప ప్రసాదాన్ని ప్రజలకు అందించనున్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో  చేప మందు పంపిణీ ప్రారంభం Publish Date: Jun 8, 2025 12:14PM

మాగంటి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు... అధినేత కేసీఆర్ సంతాపాలు

  జూబ్లీహిల్స్ బీఆర్ఎస్  ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాగంటి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ  ప్రయాణం ప్రారంభించిన గోపీనాథ్ పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారని చంద్రబాబు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు..గోపీనాథ్ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని చంద్రబాబు తెలిపారు.  మరో వైపు సీఎం రేవంత్‌రెడ్డి జూబ్లిహిల్స్ నియోజకవర్గ శాసన సభ్యుడు…మాగంటి గోపీనాథ్ అకాల మరణంతీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ట్వీట్టర్ వేదికగా తెలిపారు.  ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, టి. హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటని కేసీఆర్ అన్నారు. గోపీనాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. సౌమ్యుడైన ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారన్నారు. మాగంటి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఆయన అకాల మరణం తీవ్రంగా కలచివేసిందని కేటీఆర్ అన్నారు. గోపీనాథ్‌ను కోల్పోవడం బీఆర్ఎస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. మరోవైపు కేటీఆర్, టి. హరీశ్ రావు ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించారు.కాగా, గోపీనాథ్ మృతి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు నల్లగొండ, ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరుగనున్నారు. గోపీనాథ్‌ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
 మాగంటి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు... అధినేత కేసీఆర్ సంతాపాలు Publish Date: Jun 8, 2025 11:31AM

తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు కొత్త మంత్రులు ..సీఎం రేవంత్ ప్రకటన

  తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు మంత్రులు చేరబోతున్న ఎమ్మెల్యేల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి అభినందనలు తెలిపారు. వీరితో పాటు శాసన సభలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్‌కి శుభాకాంక్షలు చెప్పారు. నేడు మధ్యాహ్నం 12.00 - 12.20 గంటల మధ్య వీరంతా  రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీలో ఎలాంటి విభేదాలకు తావివ్వకుండా బీసీల నుంచి వి.శ్రీహరి ముదిరాజ్, ఎస్సీల నుంచి వివేక్‌ (మాల), అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ (మాదిగ)లకు చోటు కల్పించారు. ఎస్టీ అయిన రామచంద్రునాయక్‌ను డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేశారు.  మ‌రోవైపు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కొత్త మంత్రులకు, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ఆయన అభినందనలు తెలియజేశారు. డిప్యూటీ స్పీకర్ కాబోతున్న రామచంద్ర నాయక్‌కు కూడా మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుందని, అందుకే కులగణన చేసి బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ నూతన నియామకాలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  
తెలంగాణ మంత్రి వర్గంలోకి ముగ్గురు కొత్త మంత్రులు ..సీఎం రేవంత్ ప్రకటన Publish Date: Jun 8, 2025 11:09AM

వైసీపీపై సానుభూతి లేదు.. ప్రొఫెసర్ నాగేశ్వర్

వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు!వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్  నీళ్లు చల్లేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వైసీపీకీ, జగన్ కు సానుభూతి పరుడన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఆయన తన వీడియోలు, విశ్లేషణల ద్వారా జగన్ కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. తాను తటస్థ విశ్లేషకుడిననీ  ఎటువైపూ మొగ్గు లేదని చాటుకోవడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నడూ ప్రయత్నించిన దాఖలాలు లేవు. అటువంటి కరుడుగట్టిన జగన్ మద్దతుదారు.. తాజాగా తన విశ్లేషణలో జగన్ పార్టీ గాలి తీసేశారు.  ఇప్పుడు వైసీపీ తమ నేతలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నదంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలుపెడుతున్నారు. ఈ అక్రమ అరెస్టులతో తమ పార్టీపై ప్రజా సానుభూతి వెల్లువెత్తుతందని గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో ఈ అరెస్టులను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదనీ, కాగడా పెట్టి వెతికినా ప్రజలలో వైసీపీ పట్ల కానీ  అరెస్టైన ఆ పార్టీ నేతల పట్ల కానీ సానుభూతి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆయన ఏమన్నారంటే జనం మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి చేయడాన్ని జనం కళ్లారా చూశారనీ, అటువంటి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చస్తే జనానికి సానుభూతి కలుగుతుందని వైసీపీ ఎలా భావిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు. అదే విధంగా వల్లభనేని వంశీ విషయంలోనూ ప్రజలలో సానుభూతి కనిపించడం లేదని అన్నారు. నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అటువంటి వంశీపై కేసులు పెడితే తప్పేమిటని జనం భావిస్తున్నారే తప్ప అయ్యే వంశీ అరెస్టైయ్యారా, కేసుల్లో ఇరుక్కున్నారా అని సానుభూతి చూపడం లేదన్నారు.  వైసీపీ ఇప్పుడు తన సొంత తప్పులకు మూల్యం చెల్లిస్తోందని, అధికారంలో ఉండగా చేసిన అరాచకాలకు ఫలితం అనుభవిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు.  వైసీపీకి చెందిన పలువురు నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టైన తరువాత కూడా ప్రజలలో ఇసుమంతైనా సానుభూతి కనిపించడం లేదు సరికదా.. తగిన శాస్తి జరిగిందన్న భావనే వ్యక్తమౌతోందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.  
వైసీపీపై సానుభూతి లేదు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ Publish Date: Jun 8, 2025 9:34AM

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం (జూన్8) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులలో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు తిరమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (జూన్ 7) శ్రీవారిని మొత్తం 88 వేల 257 మంది దర్శించుకున్నారు. వారిలో 45 వేల 068 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 68 లక్షల రూపాయలు వచ్చింది. 
తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు Publish Date: Jun 8, 2025 9:28AM

తెులగుదేశంతో మాగంటి రాజకీయ ప్రస్థానం ఆరంభం.. సంతాప సందేశంలో ఏపీ సీఎం చంద్రబాబు

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  తీవ్ర అస్వస్థతతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని,   ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, హైదరాబాద్ అర్బన్ అధ్యక్షుడిగా పని చేశారని,  2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిచారని చంద్రబాబు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.  గోపీనాథ్ కుటుంబ సభ్యులకు  చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెులగుదేశంతో మాగంటి రాజకీయ ప్రస్థానం ఆరంభం.. సంతాప సందేశంలో ఏపీ సీఎం చంద్రబాబు Publish Date: Jun 8, 2025 8:39AM

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు

బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు.   కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ   తుదిశ్వాస విడిచారు.  ఈ నెల 5వ తేదీన గోపీనాథ్‌ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో  కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను  ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆయనకు కార్డియాక్ అరెస్ట్‌ అయినట్టు గుర్తించి సీపీఆర్ నిర్వహించారు. అనంతరం ఆయన గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించి నాడి, రక్తపోటు సాధారణ స్థాయికి చేరడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.   గోపీనాథ్ కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే మూడు నెలల క్రితం కూడా ఆయన ఏఐజీ ఆస్పత్రిలో   డయాలసిస్ జరిగింది.     మాగంటి గోపీనాథ్‌ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి   తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా   మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే 1982లో ఆరంభమైంది. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడి పని చసిన ఆయన  2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  2018లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి రెండోసారి విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలను అందుకున్నారు.  2022లో ఆయన బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా  బాధ్యతలు నిర్వర్తించారు. 
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు Publish Date: Jun 8, 2025 8:30AM

జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి ఫోన్‌లో వేధింపులు

  జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొందరు గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి వేధింపులకు గురిచేశారు. ఈ మేరకు ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజూ అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. నాతో పాటు, నా తండ్రి  కే.కేశవరావు అంతు చూస్తా అంటూ బెదిరించడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో బూతులు తిడుతున్నారని మేయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బోరబండ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు ఎండీ సర్దార్‌ సంబంధించిన వ్యక్తులమని అగంతకులు చెబుతున్నారని మేయర్ ఆరోపించారు  
జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మికి ఫోన్‌లో వేధింపులు Publish Date: Jun 7, 2025 9:31PM

జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం : సీఎం చంద్రబాబు

  జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం అమలు చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున జమ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ నెలలోనే అమలు చేస్తామని సీఎం క్లారీటీ ఇచ్చారు.  పంద్రాస్ట్ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు వివరించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామని.. వీటి ద్వారా 4.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2027కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. అలాగే రాజధాని అమరావతి నిర్మాణం కూడా వేగంగా జరువుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని.. ఈ క్రమంలోనే విశాఖ స్టేల్ ప్లాంట్‌కు రూ.11,400 కోట్ల ప్యాకేజీ, అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పుతోందని చంద్రబాబు పార్టీ శ్రేణులకు తెలిపారు.  
 జూన్ 14వ తేదీలోపే తల్లికి వందనం : సీఎం చంద్రబాబు Publish Date: Jun 7, 2025 8:38PM

స్థానికం కోసమే నా? మంత్రివర్గ విస్త‘రణం’!

చివరాఖరికి  కాంగ్రెస్ అధిష్టానం  తెలంగాణ మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.  ఇంచు మించుగా ఏడాదికి పైగా సాగుతున్న మంత్రివర్గ విస్తరణ మెగా సీరియల్ కు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెర దించింది. ఆదివారం (జూన్ 8) మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందా లేక ‘పీస్ మీల్’ లెక్కన ఉంటుదా అనే విషయంలో  మాత్రం స్పష్టత లేకపోయినా విశ్వసనీయ సమాచారం మేరకు, ఈసారికి పీస్ మీలే అంటున్నారు. ఈసారికి ఫిఫ్టీ పెర్సెంట్ ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పటి వరకు 12 మంది కేబినెట్‌‌లో మంత్రులుగా ఉన్నారు. మరో ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయిత అరుకు ఆరు ఒకేసారి భర్తీ చేస్తే  ఎదురయ్యే ఉపద్రవాన్ని ఎదుర్కోవడం కష్టమనే.. ముందు చూపుతో కాంగ్రెస్ అధిష్టానం  ప్రస్తుతానికి ముగ్గురితో సరి పెట్టాలని చూస్తోందని అంటున్నారు.  అయితే.. ఈ సంఖ్య ఇంకొకటి పెరిగినా పెరగ వచ్చని అంటున్నారు. ఇంత వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి మాత్రమే చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు..  ఈ విస్తరణలో  రెడ్డి సామజిక వర్గానికి బెర్త్ దక్కే ఛాన్స్ లేదనీ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ప్రస్తుత విస్తరణలో  బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏ కోటాలో ఎవరిని అదృష్టం వరిస్తుందనే విషయంలోనూ ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అయితే.. మంత్రివర్గంలో స్థానం కోసం నేరుగా ఢిల్లీ తో డీల్ చేస్తున్న విజయశాంతి, ముఖ్యమంత్రి మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ముచ్చట పడుతున్న అద్దంకి దయాకర్ కు ప్రస్తుత విస్తరణలోనే స్థానం దక్కవచ్చని అంటున్నారు.     అయితే నిజానికి మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు  సామాజిక వర్గాలు, సీనియారిటీ వంటి అంశాలతో సంబంధం లేకుండా  ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా, ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిజనికి  గాంధీ భవన్  లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి ప్రతి ఇద్దరు ఎమ్మెలేలలో ఒకరు వంతున మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరి కార్డ్ వారు ప్లే  చేస్తున్నారు. ముఖ్యంగా..  ఎస్సీ,  రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి వత్తిడి ఎక్కువగా  ఉందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగా రెడ్డి, బహిరంగంగానే బరిలో దిగిన విషయం తెలిసిందే.   అలాగే,ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రి వర్గంలో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా వచ్చిన తర్వాత  ఆశావాహులంతా   ఆమె కలిసి మంత్రి పదవి కోసం వినతులు చేశారు. కొత్తగా ఎన్నికైన నేతలు, సీనియర్ నేతలు తమకు అవకాశం కల్పించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ సామాజికవర్గానికి కేబినెట్‌లో ప్రాధాన్యత లేదు. ముదిరాజ్‌‌లకు కచ్చితంగా అవకాశం ఇస్తానని గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి  రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా మైనార్టీలకు కూడా కేబినెట్‌లో చోటు లభించ లేదు. ఈ క్రమంలో రేపటి కేబినెట్ విస్తరణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు చోటు లభించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే  చివరకు..  అనే నేను..అనే వరకు ఏమి జరుగుతుంది. ఎన్ని ఖాళీలు భర్తీ అవుతాయి.. ఎవరిని, మంత్రి పదవి వరిస్తుంది అనేది చెప్పడం  క్షేమం కాదు అంటున్నారు. అయితే..  ప్రస్తుత విస్తరణ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే అనే మాట కాంగ్రెస్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు, ఉద్వాసనలతో పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు.
స్థానికం కోసమే నా? మంత్రివర్గ విస్త‘రణం’! Publish Date: Jun 7, 2025 8:15PM

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి అస్వస్థత

  కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల క్రితమే ఆమె ఆసుపత్రిలో చేరగా ఇవాళ వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి పై ఇంకా ప్రకటన చేయలేదు. అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  గతంలోనూ స్వల్ప అస్వస్థతకు గురై న్యూఢిల్లీలోని సర్ గాంగారమ్ ఆసుపత్రిలో సోనియా గాంధీ చికిత్స తీసుకున్నారు. కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జీ అయ్యారు. తాజాగా మరోసారి ఆమె ఆసుపత్రిలో చేరడం కాంగ్రెస్ శ్రేణులను ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.  
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీకి అస్వస్థత Publish Date: Jun 7, 2025 7:51PM

ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

  ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభినందిస్తున్నాని ఆయన అన్నారు. తెలంగాణలో సింగరేణి బొగ్గు, ధర్మల్ పవర్‌తో పాటు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ తీసుకోవాలని ఆలోచిస్తున్నామని అందుకోసమే, తెలంగాణ ప్రభుత్వం 2015 న్యూ ఎనర్జీ పాలసీ తెచ్చిందని  భట్టి తెలిపారు. తెలంగాణలో 2029-30 నాటికల్లా కనీసం 20 వేల మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని భట్టి తెలిపారు. దేశ వ్యాప్తంగా పవర్ కన్జంక్షన్,పొల్యూషన్ విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు.  పాణ్యం మండలం పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి కరెంట్ ఉత్పత్తికి సిద్దంగా ఉందని, రానున్న రోజుల్లో పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టు నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆయన తెలిపారు. తెలంగాణలో కూడా ఇలాంటి పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు.. పిన్నాపురం గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించానని భట్టి తెలిపారు. పవర్ స్టోరేజ్ కోసం గ్రీన్ కో ప్రాజెక్టు వాడే టెక్నాలజీ అద్బుతంగా ఉందని, 4 వేల మెగా వాట్స్ సోలార్ పవర్, ఒక వెయ్యి మెగా వాట్స్ విండ్ పవర్, 1680 మెగా వాట్స్ జల విద్యుత్ ఉత్పత్తి చేసి పీక్ అవర్‌లో ఇతర రాష్ట్రాలకు సప్లై చేసేందుకు గ్రీన్ కో ప్రాజెక్టు సంసిద్దంగా ఉందని భట్టి అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులు దేశంలో ఇంకా రావాలని, వీటివల్ల దేశ జీడీపీ పెరుగుతుందని భట్టి స్పష్టం చేశారు.  
ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి Publish Date: Jun 7, 2025 6:27PM

ఆ వివాదంలో నన్ను లాగద్దు.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు

  కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.  ఈ వివాదంలో తనను లాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల ఇచ్చిన సమాధానాలు వాస్తవదూరంగా ఉన్నాయన్నారు.  ఈటల సబ్ కమిటీ అంశాన్ని ప్రస్తావించారని ఈ సబ్ కమిటీ కాళేశ్వరం నిర్మాణం కోసం వేసింది కాదన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి అనుమతులు ఇచ్చాక 15 రోజులకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెండిగ్ ప్రాజెక్టులు ఎస్టిమేషన్ రేట్లకే కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేస్తారా? పనులు చేస్తే ఏం చేయాలి? చేయకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలని అనే అంశంపై సబ్ కమిటీ వేశారని చెప్పారు. సబ్ కమిటీ  నిర్ణయాలన్నీ తానే కమిషన్ ముందుకు సుమోటోగా తీసుకెళ్తానని పేర్కొన్నారు.  
ఆ వివాదంలో నన్ను లాగద్దు.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు Publish Date: Jun 7, 2025 5:38PM

మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం : లోకేష్

  వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియాలో అవమానించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. మహిళల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట అని మంత్రి లోకేష్ దుయ్యబట్టారు.  ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుందని లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి లోకేష్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని అని లోకేష్ తెలిపారు. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని  ముఖ్యమంత్రి చంద్రబాబు  పదేపదే హెచ్చరిస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని లోకేష్ హెచ్చరించారు.  మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్   బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్‌ పనిపడుతుందని లోకేష్ తెలిపారు.
మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం :  లోకేష్ Publish Date: Jun 7, 2025 4:59PM

కొమ్మినేని, కృష్ణంరాజుపై డీజీపీకి రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.  ఒక న్యూస్ చానెల్ లో శుక్రవారం సాయంత్రం ప్రసారమైన ఒక కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ప్రజారాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొంటూ, మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనీ రఘురామకృష్ణం రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  అమరావతిని దేవతల రాజధానిగా ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడాన్ని అపహాస్యం చేస్తూ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అవమానకరం అని పేర్కొన్నారు. ఇటువంటి అసహ్యకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను ప్రోత్సహించేలా ఆ కార్యక్రమానికి హోస్ట్ గా ఉన్న యాంకర్, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వ్యవహరించారనీ రఘురామకృష్ణం రాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.  శాసనసభ సభ్యునిగా, డిప్యూటీ స్పీకర్ గా ఈ ఇరువురిపై తక్షణం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాననీ రఘురామకృష్ణం రాజు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  వీరిరువురిపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా డీజీపీని కోరారు. రాజధాని గౌరవం, మహిళల ఆత్మాభిమానం విషయంలో రాజీపడే ప్రశక్తే లేదన్న బలమైన సందేశాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందనీ, అందుకే వీరిరువురిపై చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు ఆ లేఖలో డీజీపీని కోరారు. 
కొమ్మినేని, కృష్ణంరాజుపై డీజీపీకి రఘురామకృష్ణం రాజు ఫిర్యాదు Publish Date: Jun 7, 2025 4:53PM

హైదరాబాద్‌లో వర్షం..ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం

  హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో  నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బోరబండ, యూసుఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఫిలింనగర్‌లో వర్షం కురిసింది. హైదరాబాద్‌తో పాటు నల్గొండ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కాగా, ఇవాళ రాత్రి వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.  
హైదరాబాద్‌లో వర్షం..ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం Publish Date: Jun 7, 2025 4:26PM

విషమంగానే మాగంటి ఆరోగ్యం...పరామర్శించిన కేటీఆర్‌

  తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌  పరామర్శించారు. శనివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్న కేటీఆర్‌. హుటాహుటిన ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి పొందుతున్న ఎమ్మెల్యే మాగంటిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. కాగా, గత గురువారం సాయంత్రం మాగంటి గోపీనాథ్‌ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్‌లోనే చికిత్స అందిస్తున్నారు.  కార్డియాక్‌ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. మాగంటి గోపీనాథ్ గతంలో కూడా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడి చికిత్స తీసుకున్నారు. గత ఐదు నెలలుగా ఆయన పలు అవయవాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా అనారోగ్యం ఆయన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.  
 విషమంగానే  మాగంటి ఆరోగ్యం...పరామర్శించిన కేటీఆర్‌ Publish Date: Jun 7, 2025 4:04PM

మీరసలు జర్నలిస్టులేనా? కొమ్మినేని, కృష్ణం రాజులపై బాలకోటయ్య ఫైర్.. రాష్ట్రబహిష్కరణకు డిమాండ్

అమరావతి  దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్నారంటూ'  జర్నలిస్ట్ మ్యాగజైన్ ఎడిటర్ వివిఆర్ కృష్ణంరాజు అమరావతి ప్రాంత మహిళలను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఏపీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండించింది.  అలాగే అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య యాంకర్ కొమ్మినేని, అనలిస్ట్ కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.   ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఐజేయు కౌన్సిల్ సభ్యులు ఎస్ కే బాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు జీ.రఘురాం, నాగ మల్లేశ్వర రావులు ఒక సంయుక్తలో ఖండించారు.  ఒక పత్రికకు ఎడిటర్ గా ఉన్న కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పాత్రికేయ సమాజానికి తలవొంపులు తెచ్చేలా ఉన్నాయని విమర్శించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లోని మహిళలపై  విషం కక్కిన కృష్ణం రాజు   తక్షణమే అమరావతి ప్రాంత మహిళలకు, రాష్ట్ర ప్రజలకు బే షరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య అయితే యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణం రాజులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.  పిచ్చి కుక్కల్ని, ఊర పందుల్ని, కాటేసే పాముల్ని వన్య ప్రాణుల సంరక్షణ పేరిట అలా వదిలేస్తే  ప్రమాదకరమని, పిచ్చి కుక్కల్ని తాళ్ళతో కట్టెయాలని, ఊరపందుల్ని ఊళ్ళ నుంచి తరిమేయాలని, బుసలు కొట్టే పాములను  కోరలు పీకి బుట్టల్లో బంధించాలని పేర్కొన్నారు.  ఈ మేరకు ఆయన శనివారం (జూన్ 8) విడుదల చేసిన ప్రకటనలో యాంకర్ గా  కొమ్మినేని శ్రీనివాసరావు, విశ్లేషకుడు కృష్ణంరాజు ప్రజా రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా పేర్కొనడం క్షమించరాని నేరమన్నారు. ఆ వ్యాఖ్యలపై  ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  రాజధానిపై ఇప్పటివరకు వైకాపా నాయకులు చేసిన అశుద్దపు ప్రచారాలకు ఇది పరాకాష్ట అన్న బాలకోటయ్య.. పురాణాల్లో దేవతల రాజధాని అమరావతి అని, ఆంధ్రప్రదేశ్ లో రైతుల భాగస్వామ్యం కలిగిన ప్రజా రాజధాని కూడా అలాంటిదేనన్నారు.  అటువంటి ప్రజారాజధానిపై  ఇష్టారీతిగా దూషణలు చేయటం పాత్రికేయ వృత్తికే కళంకం అని పేర్కొన్నారు.  రాజధాని పొడ గిట్టని  ఇలాంటి వారిని  రాష్ట్ర బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ప్రభుత్వం స్పందించి 24 గుంటల్లోగా కొమ్మినేని, కృష్ణం రాజులపై చర్యలు తీసుకోవాలని బాలకోటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలను కించపరుస్తూ, రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ కొమ్మినేని, కృష్ణంరాజుల వ్యాఖ్యలపై తాను  స్వయంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కు లిఖిత పూర్వక ఫిర్యాదు చేయనున్నట్లు  తెలిపారు.  
మీరసలు జర్నలిస్టులేనా? కొమ్మినేని, కృష్ణం రాజులపై బాలకోటయ్య ఫైర్.. రాష్ట్రబహిష్కరణకు డిమాండ్ Publish Date: Jun 7, 2025 3:31PM

గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం

  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. హాస్పిటల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. అత్యవసర విభాగం వద్ద పార్కింగ్ చేసిన అంబులెన్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనం నుంచి బయటకు పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించడంతో రోగులు, పేషెంట్ బంధువులు భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలను గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు.  అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.  ప్రమాదంలో అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది.ఏఐజీ ఆస్పత్రికి నిత్యం రోగులు వస్తుంటారు. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్  చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్‌కు చెందిన రాజకీయ నేతలు ఆస్పత్రికి వచ్చి వెళ్తున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి మాగంటి కుటుంబసభ్యులను పరామర్శించారు.
గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం Publish Date: Jun 7, 2025 3:30PM

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

  తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది. కొత్తగా మంత్రి వర్గంలో ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది. . ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు  సమాచారం అందజేసినట్లుగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మంత్రి‌వర్గ విస్తరణపై రాజ్‌భవన్  నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.   అయితే, భర్తీ చేయబోయే మూడు మంత్రి పదవుల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, మరొకటి బీసీ సామాజికవర్గానికి దక్కనుంది.ఇప్పటికే మంత్రి పదవి రేసులో పలువురు ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకట స్వామి‌, దేవరకొండ ఎమ్మెల్యే బాలు‌ నాయక్‌, ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఉన్నారు.  
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు Publish Date: Jun 7, 2025 3:08PM

టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు

  తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు.  టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత పార్టీ అనుమతితోనే వారిని తీసుకోవాలని సూచించారు. టీడీపీలో వివిధ హొదాల్లో ఉన్న నాయకులంతా ఈ సూచన పాటించాలని పల్లా తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఇతరులను చేర్చుకునే ముందు తప్పనిసరిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలపాలన్నారు. పార్టీలోకి వస్తామనే వారిపై పూర్తిగా విచారణ చేశాకే ఆహ్వానించాలని చెప్పారు. 
టీడీపీలో చేరికలపై పల్లా శ్రీనివాసరావు కీలక ఆదేశాలు Publish Date: Jun 7, 2025 2:56PM