ప్రజాప్రతినిధులా వీళ్లు..అపర కీచకులు
Publish Date:May 5, 2016
Advertisement
ప్రజాప్రతినిధులు..కష్టాల్లో ఆదుకుంటారని..సమస్యల్లో చేయూతనిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. కాని ప్రజల మాన ప్రాణాలను కాపాడవలసిన ప్రజాప్రతినిధులు దారుణాలకు పాల్పుడుతన్నారు. అధికారం చేతిలో ఉందని ఇళ్లను..స్థలాలను కబ్జా చేసే శాసనసభ్యులను చూసుంటాం కాని శాసనసభ్యుల్లో కొందరు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే అత్యాచారానికి పాల్పడితే ఇక ఆడదాని మానానికి రక్షణ ఎక్కడుంటుంది. మొన్నామధ్య బీహార్లో ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. నవాడ నియోజకవర్గ ఎంఎల్ఏ వల్లభ్ యాదవ్ ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఆలస్యంగానైనా జరిగిన ఘోరాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎంఎల్ఏ గారు పరారయ్యారు. విషయం రచ్చకెక్కడంతో పార్టీ ఆధినాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పటికే పరువు గంగలో కలవడంతో యాదవ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇది జరిగి రెండు నెలలు కూడా గడవకముందే..గోవాలో మరో ఎమ్మెల్యేగారు కీచకుడి అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ తన షోరూంలో పనిచేసే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ మైనర్ బాలిక మార్చి నెలలో కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బాలిక ఆచూకి కనుక్కుని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ తనపై ఆత్యాచారానికి పాల్పడినట్టు బాలిక పోలీసులకు వివరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో..అందుకు ఆయన తాను విచారణకు హాజరవుతానని..ఎక్కడికి పారిపోనని చెప్పాడు. ఇదంతా తనపై జరిగిన కుట్ర అని ఆరోపించాడు. ఆ బాలిక తన షోరూంలో పనిచేసేదని, డబ్బుల విషయంలో తేడా రావడంతో ఆమెను తొలగించినట్టు చెప్పాడు. ఆ కక్షతోనే తనపై ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులకు వివరించాడు. కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా తమ సొంత ఖర్చుతో ప్రజలకు సేవ చేస్తూ చట్టసభల విలువను కాపాడుతుంటే...బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ..ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను మరచి కాలనాగై కూతుళ్ల వయసుండే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగుల్లాంటి వారు వీరిని ఏరిపారేయకపోతే మొత్తం వ్యవస్థ నాశనమైపోతుంది.
http://www.teluguone.com/news/content/rjd-mla-45-59743.html





