టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు.. చిత్తూరు జిల్లాలో భూవివాదం..
Publish Date:Sep 30, 2021
Advertisement
తెలుగు దేశం పార్టీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై కేసు నమోదైంది. భూ వివాదంలో ఆయనపై చిత్తూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారంటూ ఓ రైతు చిత్తూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును 2 నెలల క్రితం ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కోర్టు భూ ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలకో ఎంపీ గల్లా జయదేవ్, ఆయన తండ్రి గల్లా రామచంద్రనాయుడు, ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగువమాఘం గ్రామంలో దివంగత రాజగోపాల్ నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషనల్ సొసైటీ కోసం భవనాలు నిర్మించారు. ఆ భవనాలకు ఆనుకుని ఉన్న తన పొలాన్ని ఆక్రమించుకున్నారని... భారీగా ప్రహరీ గోడ నిర్మించారని రైతు గోపీకృష్ణ ఆరోపిస్తున్నారు. తన భూమి కోసం 2015 నుంచి వివిధ మార్గాల ద్వారా ప్రయత్నిస్తున్నప్పటికీ ఉపయోగం లేకపోవడంతో 2 నెలల క్రితం కోర్టును ఆశ్రయించానని తెలిపారు.కోర్టు ఆదేశాలతో ఎంపీ గల్లా జయదేవ్ తదితరులపై ఐపీసీ 109, 120బీ, 430, 447, 506, ఆర్/డబ్ల్యూ 156(3) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు, గల్లా పద్మావతి, గోగినేని రమాదేవి, సి.రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం.పార్థసారథి, భక్తవత్సల నాయుడు, ఎం.మోహన్ బాబు, గ్రామ సర్పంచ్, కార్యదర్శి, లాయర్ చంద్రశేఖర్ పై కేసులు నమోదు చేశామని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ తెలిపారు.
http://www.teluguone.com/news/content/police-file-case-on-guntur-tdp-mp-galla-jayadev-25-123779.html





