ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
Publish Date:May 27, 2026
Advertisement
12 ఏళ్ల తర్వాత తర్వాత ఇరు నేతల కలయిక.. తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పుల నడుమ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి విజయ్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని సేవాతీర్థ్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తమిళనాడు సీఎం విజయ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు నేతల మధ్య జరిగిన ఈ భేటీ ప్రస్తుత రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలవడం దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావడంతో ఈ భేటీపై అందరి దృష్టి పడింది. గతంలో విజయ్ సినీ రంగంలో ఉన్న సమయంలో ఇరు నేతల మధ్య భేటీ జరగ్గా, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో ఆయన మోదీని కలవడం విశేషం. మర్యాదపూర్వకంగా ప్రారంభమైన ఈ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై ప్రధానితో సీఎం విజయ్ చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైన కేంద్ర నిధుల విడుదల, పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలకు కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రిని కోరినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి కేవలం ప్రధానితోనే కాకుండా, హస్తినలో మరింత బిజీగా గడపనున్నారు. మోదీతో భేటీ అనంతరం పలువురు కేంద్ర క్యాబినెట్ మంత్రులను కూడా ఆయన కలవబోతున్నారు. రాష్ట్ర పురోభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖల మంత్రులతో విడివిడిగా సమావేశమై వినతిపత్రాలు సమర్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనే కాకుండా, జాతీయ స్థాయిలో విపక్ష నేతలతోనూ సీఎం విజయ్ చర్చలు జరపనుండటం గమనార్హం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకత్వంతో కూడా ఆయన సమావేశం కానున్నట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనితో విజయ్ ఢిల్లీ పర్యటన అటు పాలనాపరంగా, ఇటు రాజకీయంగా దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తమిళనాడులో సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి అధికార పీఠాన్ని దక్కించుకున్న విజయ్.. కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించేందుకే ఈ పర్యటన చేపట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎంతైనా అవసరమని, అందుకే ఆయన దౌత్యపరమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ భేటీపై తమిళనాడు ప్రజల్లో కూడా విస్తృతమైన ఆసక్తి నెలకొంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాలు, ప్రత్యేక ప్యాకేజీల సాధనలో నూతన సీఎం విజయ్ ఏ మేరకు విజయం సాధిస్తారోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ భేటీ ఫలితంగా తమిళనాడుకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయాలు వెలువడతాయో చూడాలి.
http://www.teluguone.com/news/content/pm-modi-vijay-meeting-36-221062.html





