మోడీ పర్యటనతో.. ఏపీ ప్రగతి దారులకు తెరుచుకున్న తలుపులు.!
Publish Date:Aug 3, 2026
Advertisement
ప్రధాని మోడీ ఇటీవలి ఏపీ పర్యటన రాష్ట్ర ప్రగతి, పురోగతి, అభివృద్ధికి కొత్త ఊపు ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భోగాపురం వేదికగా 17 వేల 900 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. విశాఖ పట్నం సహా సమగ్ర ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చేలా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా మోడీ పర్యటన సాగింది. మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధనం, రవాణా, పారిశ్రామిక రంగాలకు చెందిన ఈ ప్రాజెక్టులకు మోడీ ప్రారంభం, శంకుస్థాపనలు చేయడం ద్వారా రాష్ట్రానికి విశేష ప్రయోజనం చేకూరే మార్గాలను సుగమం చేశారు. మొత్తంగా మోడీ పర్యటనలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. అలాగే సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ను ముందువరుసలో నిలిపేలా విశాఖలో అధునాతన సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ (ఓఏఎస్ఏటీ) యూనిట్కు ఈ పర్యటనలో భాగంగా మోడీ శంకుస్థాపనచేశారు. ఏఎస్ఐపి టెక్నాలజీస్, దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ సంస్థల భాగస్వామ్యంతో 460 కోట్ల రూపాయల తొలిదశ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. భవిష్యత్తులో ఈ పెట్టుబడి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు చేరనుంది. సౌత్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఏర్పాటవుతున్న తొలి యూనిట్ ఇదే. ఏడాదికి 9.6 కోట్ల చిప్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాకుండా హార్డ్వేర్ తయారీ కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా నేరుగాను, పరోక్షంగాను యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒక్క సెమీకండక్టర్ యూనిట్ ద్వారానే వేలాది మందికి అధిక నైపుణ్యంతో కూడిన కొలువులు లభిస్తాయి. అలాగే విమానాశ్రయ నిర్వహణ, లాజిస్టిక్స్, రిటైల్, సర్వీస్ రంగాలలో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రవాణా వ్యయం తగ్గడం వల్ల రైతులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లకు సులభంగా తరలించేందుకు మార్గం సుగమమవుతుంది. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం, గ్రీన్ ఎనర్జీ విద్యుత్ గ్రిడ్కు అనుసంధానం కావడం ద్వారా విదేశీ పెట్టుబడులు మరింతగా తరలివచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, సరికొత్త ఐటీ హబ్ల ఏర్పాటుకు ఈ ప్రాజెక్టులు పునాదిగా నిలుస్తాయి. PM Modi AP Visit, Bhogapuram International Airport, Visakhapatnam Semiconductor Plant, AP Development Projects
http://www.teluguone.com/news/content/pm-modi--ap-visit-36-227858.html





