పార్టీ ఏర్పాటుపై పీకే యూటర్న్.. ఏపీలో వ్యూహకర్తను దూరం పెట్టిన జగన్
Publish Date:May 5, 2022
Advertisement
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ ఏర్పాటుపై యూటర్న్ తీసుకున్నారు. ప్రస్తుతానికి పాదయాత్రతోనే సరిపెట్టేయనున్నారు. స్వయంగా ఆయనే మర్మగర్భంగా చేసిన ట్వీట్ తో ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వెలువడ్డాయి. ఇన్ని రోజులూ వాటినై స్పందించని పీకే ఇప్పుడు పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇచ్చేశారు. పాట్నాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ ఏర్పాటు ఇప్పట్లో లేదని స్పష్టత ఇస్తూనే.. తన భవిష్యత్ కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. గాంధీ జయంతి రోజున చంపారన్ లోని గాంధీ ఆశ్రమ్ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రారంభించారు. దాదాపు 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రలో అందరి సమస్యలూ తెలుసుకుంటానని చెప్పారు. అసలు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ వేత్తగా మారాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ వరుసగా ఆయనకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ కు దగ్గరవ్వడంతో బీజేపీ కన్నెర్రకు గురి కావలసి వస్తుందన్న బెదురుతో జగన్ పీకేను దూరం పెట్టారు. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ తరఫున పీకే పని చేసే అవకాశాలు దాదాపు మృగ్యమని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. కాంగ్రెస్ లో చేరి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో చక్రం తిప్పాలన్న పీకే వ్యూహం కూడా బెడిసి కొట్టింది. పార్టీలోకి ఆహ్వానించినప్పటికీ సోనియా పీకే కండీషన్స్ ను ఒప్పుకోకపోవడం వల్లనే పీకే హస్తానికి దూరంగా ఉండిపోయారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంత వరకూ ఎన్నికల వ్యూహకర్తగా పీకే పయనం చూస్తే.. ఒక సారి పని చేసిన పార్టీకి ఆయన రెండో సారి పని చేసిన దాఖలాలు కనిపించవు. ఆయన పని చేయలేదనడం కంటే పార్టీలే ఆయనను దూరం పెట్టాయనడం కరెక్టుగా ఉంటుంది. గుజరాత్ లో బీజేపీని గెలిపించడానికి తన వ్యూహాలకు పదును పెట్టి సక్సెస్ అయిన పీకే.. ఆ జోరుతో ఎన్డీయేకు వ్యూహకర్తగా 2014లో పని చేశారు. ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ఆయితే ఆ తరువాత బీజేపీ పీకేను దూరం పెట్టింది. తరువాత పీకే జేడీయూలో చేరారు. బీహార్ లో జేడీయూ అధికారం చేపట్టిన తరువాత ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేలో చేరడంతో ఆ పార్టీ నుంచి పీకే బయటకు వచ్చేశారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో జగన్ పార్టీకి వ్యూహకర్తగా మరి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచించి సఫలం అయ్యారు. ఇప్పుడు కారణాలేమైతేనేం జగన్ కూడా పీకేను దూరం పెట్టినట్లు తెలుస్తున్నది. ఎన్నికల వ్యూహకర్తగానే కాకుండా పార్టీపై ఆధిపత్యం చెలాయించే పీకే ధోరణి కారణంగానే పార్టీలు ఆయనను దూరంపెడుతుంటాయని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి పీకే సొంత పార్టీ పెట్టక, వ్యూహాలు తీసుకోవడానికి పార్టీలూ ముందుకు రాక ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడేలా ఉందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/pk-uturn-on-own-party-jagan-keep-aside-this-stratagist-25-135461.html





