పీకే డైరెక్షన్.. పోసాని యాక్షన్! బూతులు వింటూ జగన్ రెడ్డి ఎంజాయ్?
Publish Date:Sep 30, 2021
Advertisement
జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న మటాల యుద్ధం హద్దులు దాటింది. వ్యక్తిగత దూషణలు శృతి మించాయి. పవన్ కల్యాణ్ పై బండ బూతులతో విరుచుకుపడుతున్నారు వైసీపీ మంత్రులు, నేతలు. ఇక ఈ వివాదంలో ఎంటరైన పోసాని కృష్ణ మురళీ... పీకేపై మాట్లాడిన పచ్చి బూతులు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. పవన్ తో పాటు కుటుంబ సభ్యులపైనా తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు పోసాని. కొన్ని రోజులుగా సాగుతున్న ఈ బూతు పురాణంపై జనాల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇంతగా దిగజారి బూతులు తిట్టడంపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయితే ఈ గొడవ వెనుక రాజకీయ కోణం ఉందనే చర్చ వస్తోంది. వైసీపీ నేతలు ప్లాన్ ప్రకారమే ఈ దాడి కొనసాగిస్తున్నారని, తమ రాజకీయ వ్యూహంలో భాగంగానే వైసీపీ నేతలు పవన్ ను రెచ్చగొడుతున్నారని అంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య సాగుతున్న వార్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ ఉందని ఆరోపించారు. సభ్య సమాజం తలదించుకునేలా పవన్ కళ్యాణ్ గారి తల్లి, భార్య, కుటుంబ సభ్యుల గురించి పోసాని కృష్ణ మురళీ చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు బహిరంగంగా వారించలేదని అచ్చెన్న ప్రశ్నంచారు. రాజకీయ విమర్శలకు రాజకీయంగా జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని నడిపే పార్టీ నేతలపై ఉంటుందని అన్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పకుండా దాటవేసి బూతులు, తిట్లతో మహిళా లోకాన్ని బజారుకీడ్చడాన్ని ఏమంటారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు అచ్చెన్నాయుడు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనందంలో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో? అన్నారు. బూతులు, జుబుత్సాకరమైన భాషను ప్రయోగించి సంస్కృతి సాంప్రదాయాలను మంటగల్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవస్థలను, ప్రజా ప్రయోజనాలను బలిపెట్టకూడదన్న అచ్చెన్న.. రాజకీయ విమర్శలకు బూతులు కాకుండా ప్రజా స్వామ్య స్పూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే సరైన సమయంలో ప్రజలు మీకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఆంధ్ర రాష్ట్రం అడ్డాగా మారిందన్నారు ఏపీ టీడీపీ చీఫ్. డ్రగ్ మాఫియాతో వైసీపీ నేతలు చేతులు కలిపి వేల కోట్ల రూపాయలు దోపిడి చేస్తూ యువతను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈ డ్రగ్స్ మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. హెరాయిన్ తో పాటు, గంజాయి, గుట్కా, తలనీలాలు, ఎర్రచందనం, బియ్యం, శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో దోపిడి పెరిగిపోయిందన్నారు అచ్చెన్నాయుడు. విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజీల్ ధరలు, ఇసుక రేట్లు, మద్యం రెట్లు, ఆస్తి పన్ను, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు కుల, మత, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
http://www.teluguone.com/news/content/pk-team-behind-ycp-leaders-attack-pawan-klayan-25-123773.html





