బీజేపీలో జనసేన విలీనం.. పవన్ కళ్యాణ్ కామెంట్స్!
Publish Date:Aug 5, 2019

Advertisement
జనసేన పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలయ్యాక ఆ పార్టీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీలో చేరబోతున్నారని, జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వార్తలపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించారు. జనసేన పార్టీని ఏ పార్టీలో విలీనం చేయబోమని, ఎంత కష్టమైనా సరే పార్టీని నడిపిస్తామని పవన్ స్పష్టం చేసారు.
నర్సాపురం లోక్సభ పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో ఆదివారం రాత్రి ఉండి శివారు కోట్లా కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. ‘పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ హామీ ఇస్తున్నాను. పార్టీని బలంగా నడిపిస్తాను. ఏ పార్టీలోనూ విలీనం చేయను. రాష్ట్ర ప్రజలకు, ఓటేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ భీమవరం నుంచి మాట ఇస్తున్నా. ఇక్కడ నుంచి ఓడిపోయినా.. ఓడించబడ్డ నేల నుంచి చెబుతున్నా.. జనసేన ఎప్పటి వరకూ ఉంటుందంటే మీలో నలుగురు నన్ను మోసే వరకు!’ అని పవన్ స్పష్టం చేశారు.
‘జగన్ ఏం మాట్లాడతారు. ఇది విమర్శ కాదు. ఈరోజుకూ చాలాచోట్ల పెన్షన్లు ఇవ్వలేదు. మూడు వేలు ఇస్తానని కేవలం రూ.250 పెంచారు. గత నెల 8న ఇచ్చారు. ఈ నెల ఇప్పటికీ కొన్నిచోట్ల అందలేదు. ఇసుక కొరత గురించి లేఖ రాశాను. దీనిపై వారు ఏదో పాలసీ తీసుకొస్తున్నామన్నారు. దాని గురించి ఎదురుచూద్దాం. ఇంకా కష్టాలు ఎదురైతే అప్పుడు ఆలోచిద్దాం. సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీయాలి. మన కార్యకర్తలను వైసీపీ ఇబ్బంది పెడుతుంటే ఊరుకోను. ముందు ఫిర్యాదులు చేయండి. అప్పటికీ మాట వినకపోతే నేను వస్తాను. చట్టపరంగా ఏం చేయాలో ఆలోచిద్దాం. ప్రస్తుతం బెదిరిస్తున్నారు. పరిస్థితులు ఇంకా దారుణంగా ఉండే రోజులు వస్తాయి. మీ మీద దెబ్బపడాలంటే ముందు నా ఒంటి మీద పడాలి. మీ ఒంటి మీద గాయం పడాలంటే నా తల తెగిపడాలి’ అని పవన్ వ్యాఖ్యానించారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-reaction-on-janasena-merge-in-bjp-39-88498.html












